సువర్ణదుర్గ్: అరేబియా సముద్రంలోని ఈ శివాజీ కోటపై బ్రిటిషర్లు ఎందుకు కన్నేశారు?

ఫొటో సోర్స్, NIKHIL SAWANT/ RUPESH BUNDHE
- రచయిత, ఓంకార్ కంబేల్కర్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
ఛత్రపతి శివాజీ స్వరాజ్య సాధనలో భాగంగా శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించారు. భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చిన విదేశీయులు సముద్రంపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే వ్యూహంతో ఉండేవారు.
ఈ వ్యూహాన్ని అర్థం చేసుకున్న శివాజీ దానికి విరుగుడుగా 1657లో మరాఠా సైన్యాన్ని ఏర్పాటు చేశారు.
దీంతోనే ఆయన పోర్చుగీసు, ఇంగ్లీషు, డచ్, ఆదిల్షా, మొఘల్, సిద్ధి తదితర శక్తులను ఎదుర్కొన్నారు. సైన్య నిర్మాణంలో భాగంగా యుద్ధనౌకలు, కోటల పై శివాజీ ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే దుర్గాడి, సింధ్దుర్గ్, కందేరి, కోలాబా కోటలను ఈ కాలంలోనే నిర్మించారు. అలాగే విజయ్దుర్గ్, సువర్ణదుర్గ్, జైగడ్, గోపల్గఢ్లకు మరమ్మతు చేయించి ఉపయోగంలోకి తెచ్చారు.
పశ్చిమతీర ప్రాంతంలో కోటల వరుసలు కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. రత్నగిరి జిల్లాలో అనేక కోటలు ఉన్నాయి.
ఉత్తరాన హిమత్గడ్ నుంచి దక్షిణాన యశ్వంత్గఢ్ వరకు ఇవి కనిస్తాయి.
వీటిల్లో సువర్ణదుర్గ రత్నగిరి జిల్లా దపోలికి సమీపంలోని హర్నేకు దగ్గరగా సముద్రంలో ఉంది. సువర్ణదుర్గ ఓ ప్రత్యేకమైన కోట. దీనిని ఫతేగడ్, గోవాగడ్, కనకదుర్గ్ కోటలు రక్షణగా ఉండేవి.
ఈ మూడుకోటల వలన సువర్ణదుర్గ శత్రుదుర్భేధ్యంగా మారింది. నలువైపులా సముద్ర రక్షణ, సమీపంలోనే మూడుకోటలు ఉండటంతో సువర్ణదుర్గం ప్రాముఖ్యం పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
సువర్ణదుర్గ ఎక్కడుంది?
సువర్ణదుర్గ రత్నగిరి జిల్లాలోని అరేబియా సముద్రంలో ఉంది. ఈ కోటకు చేరుకోవాలంటే డపోలి నుంచి హర్నే బందర్కు రావాల్సి ఉంటుంది.
హర్నే తీరంలో కనకదుర్గ్, గోవాగడ్, ఫత్తేగడ్ కోటలు ఉంటాయి. ఇక్కడి నుంచి సముద్రం నీటి మధ్యలో ఉన్న సువర్ణదుర్గ కనిపిస్తుంటుంది.
సువర్ణదుర్గ తరువాత భూభాగంపై కనిపించేది గోవాఫోర్ట్. ఇప్పటికీ గోవా కోటగోడలు ,ప్రాకారాలు బురుజుల అవశేషాలు కనిపిస్తుంటాయి. దీనికి దక్షిణాన ఫతేగడ్ కోట ఉండేది.
కానీ ప్రస్తుతం ఇక్కడ జనావాసాలు పెరిగిపోయాయి. దక్షిణాన ఫత్తేగడ్ నుంచి సముద్రంలోకి వెళ్ళే భూభాగం చివరన కనకదుర్గ్ ఉంటుంది. కనకదుర్గ్ పై దీపస్తంభాన్ని నిర్మించారు.
సువర్ణదుర్గలోని అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. కానీ కొన్ని ప్రత్యేకతలు ఇంకా అలాగే ఉన్నాయి. కోట ప్రధాన ద్వారం వద్ద మారుతిని చెక్కారు. తలుపు కింది భాగంలో తాబేలును చెక్కారు.
ఈ ద్వారం మెట్లు ఎక్కగానే గదులు, దేవతలు కనిపిస్తాయి. లోపలి అలంకరణలు అన్నింటిపైనా పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయాయి. అయినా కోటప్రాకారాలు, బురుజులు చూడదగినవిగా ఉన్నాయి.
సువర్ణదుర్గపైన చోర్దర్వాజ, నీటి కొలను, ట్యాంకును ఇప్పటికీ చూడవచ్చు. చరిత్రకారుడు భగవాన్ చీలే రాసిన వేదజలదుర్గ పుస్తకంలో ఈ సువర్ణదుర్గ గురించి రాశారు.
ఈ కోటను 1660లో నిర్మించారు. ఆదిల్షా నుంచి శివరాయ్ దీనిని జయించారు. 1671లో ఈ దుర్గాన్ని మరమ్మతులు చేయించడానికి 10 వేల హోనాలు ఏర్పాటు చేసినట్టు శివాజీ మహారాజా రాసిన లేఖ ద్వారా తెలుస్తోంది.
దీన్నిబట్టి ఆయన సువర్ణదుర్గకు ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో అర్థమవుతుంది.

సువర్ణదుర్గ్, కన్హోజీ అంగ్రే
సువర్ణదుర్గకు, కన్హోజీ అగ్రేకు ఓ విడదీయరాని బంధం ఉంది. కన్హోజీ అంగ్రే సువర్ణదుర్గ ప్రాంతంలో జన్మించారు. ఆయన నాయకత్వ లక్షణాలు ఇక్కడే తొలిసారిగా బయటపడ్డాయి.
కన్హోలీ అంగ్రే హర్నైలో జోషి అనే కుటుంబంలో చదువుకున్నాడు. తన చదువు పూర్తయ్యాక సువర్ణదుర్గ సుబేదారు అచలోజీ మొహితేకు పనిచేయడం మొదలుపెట్టారు.
1694 నుంచి రాజారామ్ మహారాజ్ మాటవినకుండా ఒంటెత్తు పోకడలు పోతుండేవారు.
1698లో అచలోజీ సిద్ధిలతో కుమ్మక్కయ్యారని కన్హోజీ అనుమించారు.
దీనితరువాత కన్హోజీ అచలోజీని చంపి, సువర్ణదుర్గను స్వాధీనం చేసుకుని, జరిగిన విషయాన్నంత రాజారామ్ మహారాజ్కు తెలియజేశారు.
కన్హోజీ చెప్పిన విషయాలలోని నిజాలను తెలుసుకున్న తరువాత రాజారామ్ మహారాజ్ కన్హోజీని నౌకాదళాదపతిని చేశారు.
పిన్నవయసులోనే కన్హోజీ సువర్ణదుర్గ పై కాలుమోపారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వీరి పరాక్రమం వలన మరాఠా సైన్యం మరింత శక్తిమంతంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
సువర్ణదుర్గ యుద్ధం
1729లో కన్హోజీ చనిపోయారు. ఆయనకు శకోజీ, శంభాజీ, మనాజీ, తులాజీ, యశాజీ, దోంద్జీ కుమారులు ఉన్నారు.
కన్హోజీ తరువాత శకోజీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. శకోజీ తరువాత శంభాజీ అంగ్రే, తులాజీ, మనాజీ మధ్య అంతర్యుద్ధం తలెత్తింది.
1742లో శంభాజీ అంగ్రే చనిపోయాక తులాసీ, మనాజీ మధ్య అంతర్గతపోరు కొనసాగింది.
తులాజీ విజయదుర్గ్, సువర్ణదుర్గ్, జైగఢ్, అంజనవేల్, పురానగడ్, పాల్ఘాడ్, రసల్గడ్, రత్నగిరి, ప్రచిత్గడ్, భైరవ్గడ్, గోవాల్కోట్, కనకదుర్గ్, గోవాగడ్, ఫత్తేగడ్, యశ్వంత్గడ్ కోటలను బలోపేతం చేశారు.
ఈయన తన సొంత సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తులాజీ తన అధికారాన్ని, శక్తిని పెంచుకుంటూ పోవడాన్ని కొంకణ్ ప్రాంత నేతలు సహించలేకపోయారు.
పీష్వా, తులాజీ మధ్య వైరం కూడా పెరగసాగింది. కొంకణ్ తీరంలో బ్రిటీషు, డచ్, పోర్చుగీసు, ఫ్రెంచ్ నౌకలను తులాజీ దోచుకుని బ్రిటీషువారి ఆగ్రహానికి గురయ్యారు.
దీంతొ మరాఠా సైన్యం, బ్రిటీషర్లు కలగలసి తులాజీపై దాడిచేయాలని భావించారు. ఈ బాధ్యతను బ్రిటీషర్లు నౌకాధికారి జేమ్స్ విలియమ్స్కు అప్పగించింది.

జేమ్స్ విలియమ్స్
జేమ్స్ ఓ బ్రిటీషు నౌకాదళాధికారి. 1747లో ఆయన ఈస్టీండియా కంపెనీలో చేరారు.
నాలుగేళ్ళ తరువాత ఆయన ముంబాయి సముద్రతీరంలో కంపెనీ నౌకాదళంలో పనిచేయడం మొదలుపెట్టారు.
వీరి నౌక పేరు గార్డియన్. ఈ నౌకను డెప్ట్ఫోర్డ్లో నిర్మించారు.
దీనిని ముంబాయిలో ఉపయోగించేవారు.
ఈస్టిండియా కంపెనీ నౌకలపై జరిగే దాడులను తిప్పికొట్టడం, మహారాష్ట్ర పశ్చిమతీరంలో గస్తీకాయడం వీరికి అప్పగించిన పనులు.
1755 మార్చి 22న సువర్ణదుర్గ యుద్ధనౌకలతో, తెరచాప పడవలతోనూ, తుపాకులతో పదివేల మరాఠా సైన్యంతో దండెత్తాడు.
1755 ఏప్రిల్ 2న సువర్ణదుర్గకు చేరుకుని దాడి మొదలుపెట్టారు.
వీరి యుద్ధనౌకల నుంచి వందలాది తూటాలు కోటపైకి వదిలారు. రెండోరోజున కూడా దాడులు కొనసాగాయి. చివవరికి ఆరోజు రాత్రి కోటలో ఉన్నమందుగుండు సామాగ్రికి మంటలు అంటుకున్నాయి.
ఆ సమయంలో కోటలో 120మంది ఉన్నారు. దీని తరువాత వారంతా లొంగిపోయారు. సువర్ణదుర్గ తరువాత కనకదుర్గ్, ఫతేగడ్, గోవాగడ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కోటలను కోల్పోయాకా తులాజీ విజయదుర్గకు చేరకున్నారు. ఈ యుద్ధం గురించి సచిన్ పెండ్సే యాన్నీ పుస్తకం ‘మరాఠా ఆర్మర్, ఏక్ ఆంఖే పర్వ’ లో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్లోనూ సువర్ణదుర్గ
మహారాష్ట్రలోని సువర్ణదుర్గ తరహాలోనే ఇంగ్లండ్లోనూ ఓ సువర్ణదుర్గం ఉంది.
ఈ సువర్ణదుర్గం నిర్మాణానికి విలియమ్ జేమ్స్ కూడా బాధ్యుడనే చెప్పాలి.
ఇండియాలో 8ఏళ్ళు పనిచేసిన తరువాత జేమ్స్ బాగా డబ్బు సంపాదించారు.
ఆయన ఇంగ్లండ్ చేరిన తరువాత స్థిరాస్థి వ్యాపారంలోకి దిగారు.
ఓ స్థిరాస్థి కంపెనీకి ఆయన 1768లో డైరక్టర్ కూడా అయ్యారు.
ఆపైన ఇంగ్లండ్ పార్లమెంట్ సభ్యుడు అయ్యారు.
1774 నుంచి 1783వరకు ఆయన ఎంపీగా పనిచేశారు. 1783లో విలిమయ్ జేమ్స్ మరణించారు.
ఆయన మరణానంతరం ఆయన భార్య అన్నే కోటతరహాలో ఉండే భవానాన్ని నిర్మించారు. దీనికి ఆమె పేరు సువర్ణదుర్గ అని పేరు పెట్టారు.
ఈ భవనం ఇప్పటికీ ఉంది. ఇందులో ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. ఇందులో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు.
లండన్కు అగ్నేయంగా ఉన్న షూటర్స్ హిల్స్లో ఈ కోటలాంటి భవనం ఉంది.
ఇవికూడా చదవండి:
- దిల్లీ: కాలుష్యంతో విషపూరితమైన గాలిని కృత్రిమ వర్షంతో శుభ్రం చేయవచ్చా?
- సుబ్రతా రాయ్: ఖరీదైన జీవనశైలి.. 127 ట్రక్కుల్లో పత్రాలను సెబీకి పంపిన వ్యాపారవేత్త
- సోవియట్ యుద్ధ విమానం మిగ్-21ను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ ఎలా దొంగిలించింది?
- సరస్వతి నది నిజంగానే ఉందా... ఏమిటి దీని మిస్టరీ?
- ఆస్పత్రి దగ్గర 'బండకింద హమాస్ సొరంగం'.. మరో ఆసుపత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం














