పద్మ‌దుర్గ్: ఛత్రపతి శివాజీ నీళ్ల మధ్యలో ఈ కోటను ఎందుకు కట్టారో తెలుసా?

శివాజీ

ఫొటో సోర్స్, PADMANABH KHOPKAR & YOGESH BORANA/Getty Images

    • రచయిత, నామ్‌దేవ్ కాట్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శివాజీ స్వప్నమైన స్వరాజ్య కోసం ఆయన కట్టించిన కోటల గురించి చర్చ వచ్చినప్పుడు, చాలామందికి ఎత్తయిన సహ్యాద్రి కొండలు, లోయలలో కట్టిన దుర్గాలు గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతంలో భూమిపైనే కాదు, సముద్రంపై కూడా ఆయన ప్రత్యేకంగా దుర్గాలను నిర్మించారు.

ఛత్రపతి శివాజీ ఐదు కోటలను నిర్మించారు. ఈ సంఖ్య చాలా తక్కువే అనిపించొచ్చు. కానీ, ఏ ఒక్క పాలకుడు ఒంటరిగా ఇన్ని కోటలను నిర్మించలేదు.

మొఘలుల నుంచి డచ్ వారు వరకు, పోర్చుగీస్ నుంచి బ్రిటీష్ వారు వరకు అన్ని వైపులా శత్రువుల భయం ఉన్నప్పటికీ, శివాజీ సముద్రంపై తన నియంత్రణను విస్తరిస్తూనే వెళ్లారు.

ఖాందేరి, కులాబా, సువర్ణ దుర్గ్, సింధుదుర్గ్, పద్మదుర్గ్ కోటలను చూస్తే ఆయన ఆధిపత్యం విస్తరించిన తీరు కనిపిస్తుంది.

ఛత్రపతి శివాజీ ఘనతను, విశిష్టతను ఇప్పటికీ ఈ ఐదు కోటలు ప్రతిబింబిస్తూ ఉంటాయి.

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పాటు తుఫానులు, సముద్రపు గాలుల ప్రభావంతో ఈ కోటలు కొంత దెబ్బతిన్నది నిజమే అయినప్పటికీ, శివాజీ స్వరాజ్య ఆశయాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా ఈ కట్టడాలు కనిపిస్తాయి.

ఈ కథనంలో పద్మ‌దుర్గ్ కోట గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం....

పద్మ దుర్గ్ కోట

ఫొటో సోర్స్, PADMANABH KHOPKAR & YOGESH BORANA

ఫొటో క్యాప్షన్, పద్మ దుర్గ్ కోట

కన్సా ద్వీపంలో ‘పద్మ దుర్గ్’ కోటను నిర్మించారు. రాజ్‌పురి తీర ముఖద్వారంలో జంజీరాకు వాయువ్యంగా 3 కి.మీల దూరంలో ఈ కోటను నిర్మించారు.

ప్రస్తుత మ్యాప్ ప్రకారం ఈ కోట రాయ్‌గఢ్ జిల్లాలో మురుఢ్ తాలుకాలో ఉంది.

నిజాంషాహి కాలంలో, సిద్ధీ వంశస్తులు సముద్ర తీర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తీర ప్రాంతంలో కొన్ని కోటలను నిర్మించారు.

జంజీరాను గెలవాలని చాలాసార్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రయత్నించారు. కానీ, సొంతం చేసుకోలేకపోయారు.

అరబిక్ పదం ‘జజీరా’ నుంచి జంజీరా అనే పేరును పెట్టారు. జజీరా అంటే ద్వీపం అని అర్థం.

సిద్ధీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్తుండటంతో మరాఠాలు తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వారిని నిరోధించడం తప్పనిసరైంది.

అందుకే శివాజీ సిద్ధీ కురాపతీలపై ఒక కన్నేసి, వారిని నిరోధించేందుకు ‘పద్మ దుర్గ్’ కోటను నిర్మించారు. పద్మ దుర్గ్ కోటకి కనుచూపు మేరలో సామ్రాజ్‌గఢ్‌ని కూడా నిర్మించారు.

ఛత్రపతి శివాజీ ఏర్పాటు చేసిన సామ్రాజ్‌గఢ్‌ నుంచి సిద్దీలు భూభాగం నుంచి సాగించే రాకపోకలను గమనిస్తూ ఉండే వారు. సముద్ర రాకపోకలను పద్మ దుర్గ్ నుంచి నియంత్రించే వారు.

పద్మ దుర్గ్ చరిత్ర గురించి ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరూ రాయనప్పటికీ, శివ రాయ కోటల చరిత్రలో దీని గురించి ప్రస్తావించారు.

పద్మ దుర్గ్ కోట

ఫొటో సోర్స్, PADMANABH KHOPKAR & YOGESH BORANA

పద్మ దుర్గ్ కోటలో కలువ రేకుల టవర్లు

పద్మ దుర్గ్ కోటలో రెండు భాగాలుంటాయి. ఒకటి ప్రధాన కోట, రెండు పడ్కోట్.

కలువ రేకుల ఆకారంలో టవర్లను కట్టడం వల్ల, ఈ కోటకు ‘పద్మ దుర్గ్’ అనే పేరు పెట్టి ఉంటారని దుర్గ్ వైభవ్ ఆఫ్ రాయగఢ్ డిస్ట్రిక్ పేరుతో రాసిన తన పుస్తకంలో స్కాలర్ డాక్టర్ సచిన్ జోషి చెప్పారు.

ప్రధాన కోట పడ్కోట్ కంటే కాస్త పెద్దదిగా ఉంటోంది. ప్రధాన కోటలోకి ప్రవేశించిన తర్వాత ఇరు వైపుల గేట్లకు గార్డులు ఉంటారు.

ప్రధాన కోటనే పద్మ దుర్గ్‌కి కంచుకోటగా చెబుతుంటారు. ఎందుకంటే, ఈ కోట ప్రాంగణంలో ఉన్న ప్రధాన నిర్మాణాలన్ని కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

కోటలోకి ప్రవేశించిన తర్వాత, మూడు గన్‌లతో స్వాగతం కనిపిస్తుంది.

తలుపు గుండా లోపలికి వెళ్లిన తర్వాత, కుడివైపున ప్రాంతంలో పలు నిర్మాణాలకు చెందిన ఆనవాళ్లు కనిపిస్తాయి.

ప్రధాన ద్వారానికి ఎదుట ఒక ద్వారం ఉంటుది. అది పడ్కోట్‌కి వెళ్లేందుకు మార్గం.

ఈ నిర్మాణంలో కింద, పైన నిర్మాణ పరంగా చాలా భిన్నత్వం కనిపిస్తోంది.

పక్కనే ఉన్న నాలుగు రూమ్‌ల భవంతిలో కూడా ఇలా ఉండటాన్నే మీరు గమనించవచ్చు.

కానీ, ఆ తర్వాత చాలా కాలానికి ఈ కోట సిద్ధీల చేతుల్లోకి వెళ్లింది. ఇదే సమయంలో, పునాదులు దెబ్బతినకుండా ప్రధాన కట్టడంపైనే కొత్త నిర్మాణాలు కూడా చేపట్టారు.

పద్మ దుర్గ్ కోట

ఫొటో సోర్స్, PADMANABH KHOPKAR & YOGESH BORANA

పద్మ దుర్గ్‌లో ఒక మసీదు కూడా ఉంది. మసీదుకు చెందిన నాలుగు గోడలు, ఒక తలుపు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. మిగిలినది దెబ్బతింది.

మసీదుకు వెనుకాల 8 చిన్న గదులు సముద్రానికి ఆనుకుని ఉంటాయి.

ఈ కోట బ్రిటీష్ వారి చేతుల్లోకి వచ్చినప్పుడు, గదుల మాదిరి జైళ్లను నిర్మించి ఉండొచ్చని డాక్టర్ సచిన్ జోషి అన్నారు.

ఈ కోటలోని మిగిలిన ఫీచర్లను చూస్తే.. దీని టవర్లు అచ్చం కలువ రేకుల మాదిరి ఉంటాయి. మీరు దగ్గరకి వెళ్లేంత వరకు కూడా ప్రవేశం కనిపించదు. ఈ కోటలో మరో ప్రత్యేక ఏంటంటే.. నిర్మాణ సామాగ్రిలో సున్నం వాడారు.

కింద, పక్క గేట్లలో సిమెంట్ మెటీరియల్‌ను ఉపయోగించారు. ఈ గేట్లు బలంగా ఉంచేందుకు వీటికి పైన రెండు లేయర్లలో రాళ్లను ఉంచారు. ఇవి దాదాపు 1670 కాలం నాటివి.

సముద్ర గాలులు, అలలు కారణంతో ఈ నల్ల రాతి కోటలోని రాళ్లు కొట్టుకుపోయినప్పటికీ, సున్నం మాత్రం ఉపరితలంపై కనిపిస్తూనే ఉంటుంది.

ఈ కోటలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు మూడు తొట్టెలు ఉన్నాయి.

పద్మ దుర్గ్‌లోని చాలా అంశాలు, నిర్మాణాలు కూడా శివాజీ కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంటాయి.

కోట ప్రాకారాల నుంచి మురుఢ్ తీరాన్ని, జంజీరా కోటను, సామ్రాజ్‌గఢ్ కోటను చూడొచ్చు.

ఛత్రపతి శివాజి తన చివరి నాళ్లలో నిర్మించిన కోటలలో పద్మ దుర్గ్ కోట ఒకటి.

పద్మ దుర్గ్ చరిత్ర

చారిత్రక డాక్యుమెంట్ల ప్రకారం, ఖాందేరి, పద్మ దుర్గ్ కోటలను ఛత్రపతి శివాజీ మహారాజ్ 1678 ఆగస్ట్ నెలలో నిర్మించడం ప్రారంభించారు.

రాయ్‌గఢ్ జిల్లా గెజిటీర్‌లో నమోదు చేసిన రికార్డుల ప్రకారం పద్మ దుర్గ్‌ను 1693లో నిర్మించినట్లు ఉంది.

రాయ్‌గఢ్ జిల్లా గెజిటీర్ రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే.. శివాజీ చనిపోయిన తర్వాతనే ఈ కోటను నిర్మించినట్లు తెలుస్తోంది.

అయితే, ఇతర అన్ని రీసెర్చ్‌ల బట్టి చూస్తే, 1675, 1678 మధ్య కాలంలోనే పద్మ దుర్గ్ కోట నిర్మాణాన్ని ప్రారంభించిన ఆధారాలు ఉన్నాయి.

రాయ్‌గఢ్ జిల్లా గెజిటీర్ రికార్డులో పేర్కొన్న ఏడాది ఈ కోట నిర్మాణం పూర్తయిన కాలమని చాలా మంది పరిశోధకులు నమ్ముతున్నారు.

ఛత్రపతి శివాజీ కాలంలోనే ఈ కోట నిర్మాణాన్ని చేపట్టారని, ఆ తర్వాత ఛత్రపతి శంభాజీ కాలంలో దీన్ని పూర్తి చేసినట్లు చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు.

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, ఛత్రపతి శివాజీ పద్మ దుర్గ్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెబుతారు.

పద్మ దుర్గ్ నిర్మాణాన్ని ఛత్రపతి శివాజీ తన ఆధిపత్యానికి సవాలుగా తీసుకున్నారు.

దీంతో సిద్దీలు కూడా ఎన్నో రకాలుగా పద్మ దుర్గ్ నిర్మాణంలో ఆటంకాలను సృష్టించారు.

డాక్టర్ సచిన్ జోషి/ బుక్‌మార్క్ పబ్లికేషన్

ఫొటో సోర్స్, DR. SACHIN JOSHI/BOOKMARK PUBLICATION

ఫొటో క్యాప్షన్, డాక్టర్ సచిన్ జోషి/ బుక్‌మార్క్ పబ్లికేషన్

పద్మ దుర్గ్ నిర్మాణాన్ని చేపట్టే కన్సా ద్వీపంలోని ప్రజలను సంరక్షించాలని దర్యసారంగ్ ఇబ్రహీం ఖాన్, దౌలద్ ఖాన్‌లను ఛత్రపతి శివాజీ ఆదేశించారు కూడా. వీరు శివాజీ బృందంలో ప్రముఖ ముస్లింలు.

మరాఠా సామ్రాజ్యం పద్మ దుర్గ్ కోటకు పనిచేసిన కొందరి పేర్లను చరిత్రకారుల రికార్డులలో ఉన్నాయి. వారిలో ఒకరు రామాజీ నాయక్. ఈయన 1684 నుంచి 1685 మధ్య కాలంలో పద్మ దుర్గ్‌కు కానిస్టేబుల్‌గా వ్యవహరించారు.

1702 కాలంలో శుభాంజి మోహితే ఈ పద్మ దుర్గ్ ఫోర్ట్ లార్డ్‌గా పనిచేశారు.

పద్మ దుర్గ్ కోటకు సంబంధించి 1704 ఏప్రిల్ 28 తేదీకి చెందిన ఒక లేఖ ఉంది.

ఈ లేఖను నీల్‌కంఠ్ పింగ్లే, పరశురాం త్రియంబక్ రాశారు.

నీల్‌కంఠ్ పింగ్లే మరాఠా సామ్రాజ్యంలో తొలి పీష్వా మోరోపాంత్ పింగ్లే కొడుకు. పరుశురాం త్రియంబక్ మరాఠా సామ్రాజ్యానికి సేనాపతి.

ఆ సమయంలో కోటల నిర్వహణ బాధ్యతలను కొన్ని గ్రామాలకు ఇచ్చే వారు. కోటలను మెయింటనెన్స్ చేసేందుకు ఆ గ్రామాల నుంచి పన్నులను సేకరించే వారు. నీలకంఠ్ పింగ్లే, పరశురాం త్రియంబక్‌లు రాసిన లేఖ జంజీరా, పద్మ దుర్గ్ కోటల నిర్వహణ, ఖర్చులకు చెందినది.

'ఛత్రపతి శివాజీ మహారాజ్ జంజీరా, పద్మ దుర్గ్ కోట ఖర్చులు, నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు బహిరో పండిట్‌కు రెండు గ్రామాలను కేటాయించారు. ఒప్పందం ప్రకారం ఆ గ్రామాలను పద్మదుర్గ కోటలోని గుమాస్తాకు అప్పగించాలి, ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు.' అని ఆ లేఖలో ఉంది.

శివాజీ మరణించిన తర్వాత, 1710లో సిద్ధి సురుల్ ఖాన్ పద్మ దుర్గ్ కోటను మరాఠాల నుంచి తీసేసుకున్నారు.

మళ్లీ 1732లో పీష్వాలు, జంజీరాను ఆక్రమించారు. ఆ సమయంలో సిద్ధీలు, పీష్వాల మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. జంజీరా, పద్మ దుర్గ్ కోటలు సిద్ధీల వద్దనే ఉంచుకుని, బీర్వాడి, తలే, ఘోసాలే కోటలను పీష్వాలు పొందే ఒప్పందం ఇది.

పద్మ దుర్గ్ కోట

ఫొటో సోర్స్, PADMANABH KHOPKAR & YOGESH BORANA

మళ్లీ పద్మ దుర్గ్ కోట మరాఠాల చేతిలోకి ఎప్పుడొచ్చింది?

మహారాష్ట్ర ప్రభుత్వ గెజిటీర్ ప్రకారం, మానాజీ ఆంగ్రే చనిపోయిన తర్వాత రఘూజీ ఆంగ్రే వారసత్వ సంపదను పొందారు. ఆ సమయంలో మరాఠా సామ్రాజ్యంపై సిద్ధీలు దాడి చేశారు. చాలా ఆలయాలను ధ్వంసం చేశారు. పీష్వాల సాయంతో సిద్ధీల దాడిని రఘూజీ అడ్డుకున్నారు.

ఆ సమయంలో సిద్ధీలను అడ్డుకోవడమే కాకుండా.. సిద్ధీల దగ్గర నుంచి ఉంధేరి కోటను కూడా పొందారు. ఈ యుద్ధంలో సాయం చేసినందుకు పీష్వాలకు ఉంధేరి కోటను రఘూజీ గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఆ తర్వాత ఉంధేరి కోటకు జయ దుర్గగా నామకరణం చేశారు

అదే పోరాటంలో, కన్సా ఖిల్లా(పద్మ దుర్గ్)ను కూడా సిద్ధీల నుంచి 1759 ఫిబ్రవరి 21న రఘూజీ స్వాధీనం చేసుకున్నారు.

తర్వాత కాలంలో పద్మ దుర్గ్ కోట బ్రిటీష్ వారి చేతులోకి వెళ్లింది.

బ్రిటీష్ వారే ఈ కోటలో జైలును ప్రారంభించి ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ జైళ్లలో ఉండే గదుల మాదిరి అక్కడ చిన్న చిన్న గదులను చూడొచ్చు.

నేడు పద్మ దుర్గ్ కోట ప్రాంతం పాడుబడ్డ ప్రాంతంగా మారింది. అరేబియా సముద్రపు అలలకు పద్మ దుర్గ్ టవర్‌కి చెందిన రాళ్లు కొట్టుకుపోయాయి. కానీ, దాని సున్నపు నాణ్యత మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది.

వీడియో క్యాప్షన్, దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో ఎందుకు నిర్మించారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)