కరోనావైరస్: పాకిస్తాన్‌ను భయపెడుతున్న కోవిడ్-19.. వైద్యులే వణికిపోతున్నారు

పాకిస్తాన్‌లో మాంసం దుకాణాల ఎదుట దూరందూరం నిల్చున్న కొనుగోలుదారులు

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో మాంసం దుకాణాల ఎదుట దూరందూరం నిల్చున్న కొనుగోలుదారులు
    • రచయిత, సికిందర్ కిర్మాణీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

ఉత్తర పాకిస్తాన్‌లోని మర్దాన్ నగర సమీపంలోని ఓ గ్రామంలో నివసించే సాదత్ ఖాన్ సౌదీ అరేబియా తీర్థయాత్రకు వెళ్లి ఈ నెల ప్రారంభంలో సొంతూరికి తిరిగివచ్చారు.

తీర్థయాత్ర ముగించుకుని వచ్చిన సందర్భంగా గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. 600 మంది ఆ విందుకు వచ్చారని సాదత్ ఖాన్ కుమారుడు హక్ నవాజ్ చెప్పారు.

‘‘అన్నం, మటన్, చికెన్ వండి వడ్డించాం... గ్రామస్థులంతా వచ్చి నాన్నకు అభినందనలు తెలిపారు’’ అని చెప్పారు హక్ నవాజ్.

మతపరంగా ముఖ్యమైన ఇలాంటి తీర్థయాత్రలు పూర్తిచేసుకుని వచ్చిన తరువాత విందు ఇవ్వడం పాకిస్తాన్‌లో ఆచారం.

విందు ఇచ్చిన మరుసటి రోజే సాదత్ ఖాన్ చనిపోయారు. పాకిస్తాన్‌లో కరోనావైరస్ కారణంగా చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే.

సాజిద్ ఖాన్ (కుడివైపు)

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, సాజిద్ ఖాన్ (కుడివైపు)

పెద్ద కుటుంబాలు.. చాలీచాలని వైద్య సదుపాయాలు

సాదత్ మరణించిన వెంటనే అధికారులు ఆ జిల్లా మొత్తం లాక్ డౌన్ చేశారు. సాదత్ ఖాన్ ఉండే ప్రాంతంలోని 46 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్‌గా తేలింది.

సాదత్‌తో పాటు సౌదీ వెళ్లొచ్చిన ఆయన ఇద్దరు స్నేహితులకూ ఆ వైరస్ సోకింది. పాకిస్తాన్ వంటి దేశాల్లో కరోనావైరస్‌తో పోరాటంలో ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివో సాదత్ ఖాన్ మరణం చెప్పింది.

ఎక్కువమంది సభ్యులుండే కుటుంబాలు.. తరచూ జనం గుంపులు గుంపులుగా పోగవడం.. ఇప్పటికే ఆరోగ్య సేవల వ్యవస్థలు అంతంతమాత్రంగా ఉండడం వంటివన్నీ పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోవడంలో ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి.

అందుకే.. కరోనా విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్ స్మశానంగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాక్‌లో రాకపోకలపై నిషేధం

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, పాక్‌లో రాకపోకలపై నిషేధం

ఎక్కువ కేసులు ఇరాన్ నుంచి వచ్చినవారే..

పాకిస్తాన్‌లో ఇప్పటికే 1200కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మరణించారు. వీరిలో చాలామంది ఇరాన్ నుంచి వచ్చినవారే. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇరాన్ ఒకటి.

దీంతో ఇక ఈ వైరస్ స్థానికంగా సంక్రమించడం మొదలవుతుందని లాహోర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ వైస్ చాన్సలర్ జావేద్ అక్రమ్ ఆందోళన వ్యక్తంచేశారు.

పాకిస్తాన్‌లో కానీ, మిగతా దేశాల్లో కానీ చెబుతున్న లెక్కల కంటే బాధితుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చని అక్రమ్ అన్నారు. వైరస్ ఉందో లేదో నిర్ధరించే పరీక్షలు చేసే సౌకర్యాలు అంతంతమాత్రం కావడమే దీనికి కారణమన్నారాయన.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

పాకిస్తాన్‌లో 20 కోట్లకుపైగా జనాభా ఉండగా ఇప్పటివరకు 6 వేల మందికి మాత్రమే పరీక్షలు చేశారు.

పాకిస్తాన్‌కు వాణిజ్య కేంద్రంలాంటి రేవు పట్టణం కరాచీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సింధ్ ప్రావిన్స్ విద్యాశాఖ మంత్రి సయీద్ ఘనీ కూడ ఈ వైరస్ బారినపడ్డారు.

ఐసోలేషన్‌లో ఉన్న ఘనీ ‘బీబీసీ’తో మాట్లాడుతూ... ‘‘నాకు ఈ వైరస్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు’’ అన్నారు.

పాకిస్తాన్ కరోనావైరస్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

కేంద్రం, రాష్ట్రాల మధ్య కనిపించని సమన్వయం

సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తోంది. నిత్యావసర, మందుల దుకాణాలు మాత్రమే అక్కడ తెరుస్తున్నారు. మిగతావి తెరవడం నిషేధం. అలాగే అత్యవసర వస్తువులను రవాణా చేసే వాహనాలు తప్ప మిగతావి ఏవీ తిరగరాదు.

ఇప్పుడు పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా దాదాపు ఇలాంటి చర్యలే ప్రకటించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

అయితే, రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇమ్రాన్ ఖాన్ మధ్య సమన్వయం ఉన్నట్లుగా కనిపించడంలేదు.

ఇమ్రాన్ ఇంతకుముందు ‘లాక్ డౌన్ వల్ల పాక్‌లోని నిరుపేదలు తీవ్రంగా దెబ్బతింటారు’’ అన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఆయన తన పాత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

కర్ఫ్యూ వంటి పరిస్థితుల వల్ల పేదలకు కష్టాలొస్తాయన్నానని ఆ తర్వాత ఆయన చెప్పారు. రోజు కూలిపై ఆధాపడి బతికేవారి కోసం కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించారాయన.

డాక్టర్ రియాజ్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, డాక్టర్ రియాజ్

అన్ని ముస్లిం దేశాలూ ఆపేసినా శుక్రవారం ప్రార్థనలు ఆపని పాక్

అయితే.. మిగతా ముస్లిం దేశాలన్నీ శుక్రవారం సామూహిక ప్రార్థనలను సైతం ఆపేయగా ఇమ్రాన్ ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలేవీ తీసుకోలేదు.

ఈ వ్యాధి ప్రబలడానికి ముందే నివారణ చర్యలు చేపట్టాలని.. లేదంటే ఇటలీలాంటి పరిస్థితులు ఏర్పడతాయని ప్రొఫెసర్ అక్రమ్ అన్నారు.

పాక్‌లో వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇది పరీక్షా సమయంగా మారిందని... ఇప్పటివరకు చనిపోయినవారిలో యువ వైద్యుడొకరు ఉన్నారని చెప్పారు.

గిల్జిత్ బాల్టిస్తాన్‌లో ఇరాన్ నుంచి వచ్చిన యాత్రికులకు స్క్రీనింగ్ చేసిన డాక్టర్ ఉస్మాన్ రియాజ్ (26) వైరస్ బారిన పడి మరణించారు.

సరైన రక్షణ దుస్తులు వంటివి లేకపోవడం వల్లే రియాజ్ మరణించారని వైద్యులు ఆరోపిస్తున్నారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

అయితే.. రియాజ్ మరణం తరువాత తమకు రక్షణ దుస్తులు అందించారని, కానీ, మిగతా ప్రాంతాల్లో చాలామందికి ఇంకా లేవని రియాజ్ సహచర వైద్యుడొకరు చెప్పారు.

‘‘చావుబతుకులు దేవుడి చేతుల్లో ఉన్నాయి కానీ సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండా కరోనా పరీక్షలు చేయడం ఆత్మహత్యతో సమానం’’ అన్నారాయన.

అయితే... వైద్య రంగంలో పనిచేస్తున్నవారికి సరైన రక్షణ వసతులు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇక పాక్‌లో తొలి కరోనా బాధితుడు సాదత్ ఖాన్ గ్రామానికొస్తే అక్కడి ప్రజలంతా భయపడుతున్నారు. సాదత్ ఖాన్ బంధువొకరు బీబీసీ‌తో మాట్లాడుతూ తనకూ కరోనా సోకిందని చెబుతూ ఈ వ్యాధి ఇంత ప్రాణాంతకం ఎందుకో అర్థం కావడం లేదన్నారు.

‘‘మనం దీన్ని చూడలేం. కానీ, ప్రతి ఒక్కరూ దీని పేరు చెబితేనే భయపడుతున్నారు’’ అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)