సంజూ శాంసన్: భారత్ను సెమీస్కు చేర్చిన ఈ బ్యాటర్ ఇన్నింగ్స్పై పాకిస్తాన్లోనూ ప్రశంసలు

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images
కోహ్లీ లేని లోటుని సంజూ శాంసన్ తీరుస్తున్నాడు.
'తాను సెంచరీ చేయడం కంటే జట్టు గెలవడమే ముఖ్యమని సంజూ భావించాడు'
"అతనిపట్ల సరిగ్గా వ్యవహరించకున్నప్పటికీ తాను ఎంత బలమైన, దృఢ సంకల్పం ఉన్న ఆటగాడినో చూపించాడు"
సంజు శాంసన్ గురించి పాకిస్తాన్ క్రికెటర్లు, నిపుణులు చేసిన వ్యాఖ్యల్లో ఇవి కొన్ని.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్లో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులు చేసి భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఓ వైపు వరుసగా వికెట్లు పడిపోతున్నా.. ఓపెనర్గా వచ్చిన సంజూ శాంసన్ చివరి వరకు ఉండి మ్యాచ్ విన్నింగ్ షాట్ కొట్టాడు.
వెస్టిండీస్తో నిర్ణయాత్మక మ్యాచ్లో సంజూ ఇన్నింగ్స్ భారత్ను సెమీస్లోకి నడిపించాయి.
సంజూ శాంసన్ ఇన్నింగ్స్, స్ట్రోక్ ప్లే, టెక్నిక్ గురించి భారత్లోనే కాకుండా పాకిస్తాన్లోనూ చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images
'లక్ష్యం పెద్దదైనా ఛేదించవచ్చని చూపించాడు'
జియోన్యూస్ కార్యక్రమంలో ప్యానెలిస్టులు పాకిస్తాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ అమీర్, మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్, క్రికెటర్ అహ్మద్ షెహజాద్ వెస్టిండీస్తో మ్యాచ్లో సంజూ శాంసన్ ఆట తీరును ప్రశంసించారు.
"సంజు శాంసన్కు విషయంలో సెలక్టర్లు న్యాయంగా వ్యవహరించలేదు. అతను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తొలగించారు. ఇప్పుడు కూడా మిగతా ఆటగాళ్లు సరిగ్గా స్కోర్ చేయకపోవడం వల్లనే అతనికి అవకాశం వచ్చింది. భారత జట్టులో ప్లేస్ కోసం ఎంత పోటీ ఉందో దీన్ని బట్టి అర్థం తెలుస్తోంది. ఈ మ్యాచ్లో పరిస్థితుల్ని అర్థం చేసుకుని, సంజూ తనను తాను నియంత్రించుకున్న తీరు ప్రశంసనీయం" అని అహ్మద్ షెహజాద్ అన్నారు.
అదే కార్యక్రమంలో పాల్గొన్న రషీద్ లతీఫ్ సంజూ శాంసన్ టెక్నిక్ అద్భుతంగా ఉందన్నారు.
"అతను విన్నింగ్ షాట్ కొట్టిన తీరు చూస్తే బంతి ఎక్కడికి వస్తుందో అతనికి తెలిసినట్లు అనిపిస్తుంది. బంతికి తగినట్లు అతను తన ఫుట్వర్క్ను మార్చుకుంటున్నాడు. గొప్ప ఆటగాళ్ల లక్షణం ఇది" అని లతీఫ్ చెప్పారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ " 190 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ను ఛేదించాలంటే పెద్ద ఇన్నింగ్స్ అవసరం. సంజూ శాంసన్ ఆ ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు" అని చెప్పారు.
"సంజూ సెంచరీ కోసం ప్రయత్నించలేదు. జట్టు అవసరానికి తగ్గట్టు ఆడాడు. మ్యాచ్ గెలవాలని మాత్రమే కోరుకున్నాడు" అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ ఓ కార్యక్రమంలో అన్నారు. .
పాక్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసుఫ్ శాంసన్ గురించి ప్రస్తావిస్తూ, భారత్ తన క్రికెటర్లను తయారు చేసుకుంటున్న తీరును ప్రశంసించారు.
"విరాట్ కోహ్లీ స్థానంలోకి సంజూ శాంసన్ వస్తున్నాడు. భారత్లో క్రికెటర్లను తయారు చేసే వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఇది సూచిస్తోంది. శాంసన్ దూకుడుగా ఆడలేదు. స్థిరంగా టెక్నిక్తో దూకుడుని ప్రదర్శించాడు" అని మొహమ్మద్ యూసుఫ్ ఎక్స్లో పోస్ట్ చేసిన మెసేజ్లో రాశారు

ఫొటో సోర్స్, Shubhajit Roy Karmakar/NurPhoto via Getty Images
'దేశానికి గర్వకారణం'
సంజూ శాంసన్ 'కేరళకు గర్వకారణం'అని రాజ్యసభ ఎంపీ శశి థరూర్ అభివర్ణించారు.
"ఈ రోజు జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో అతని అద్భుత ఇన్నింగ్స్ చూసి గర్వపడుతున్నాను. గతంలో అతను జట్టులో స్థానం కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే ఈ రోజు తనకు జట్టులో స్థానం ఉందని అతను ప్రపంచానికి చూపించాడు. ఈ తిరువనంతపురం బిడ్డ భారత్కే గర్వకారణం" అని శశి థరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
"మనం ఎప్పుడైనా గుర్తు చేసుకోవాలనుకుంటే క్లాస్ను ఎప్పుడూ మర్చిపోకూడదని సంజూ శాంసన్ గుర్తు చేశాడు. అతను చాలా ప్రత్యేకమైన క్రికెటర్. చివరి వరకు నిలబడాలనే అతని సంకల్పం, క్రికెటర్గా అతనిలో పరిణతిను చూపించింది" అని క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఎక్స్లో రాశారు
సీనియర్ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్ కూడా సంజూ శాంసన్ ఆటతీరుని ప్రశంసించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











