కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో మరణాలకు కారణం ఏమిటి...

ఫొటో సోర్స్, AFP
- రచయిత, జేమ్స్ గళగర్
- హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరస్పాండెంట్
కొత్త కరోనావైరస్ గత డిసెంబర్ నెలలోనే బయటపడి.. ఇంతలోనే ప్రపంచ మహమ్మారిగా మారింది. ఈ వైరస్తో, ఇది కలిగించే కోవిడ్-19 వ్యాధితో అంతర్జాతీయ సమాజం తలపడుతోంది.
చాలా మంది మీద ఈ వ్యాధి తేలికపాటి ప్రభావమే చూపుతోంది. కానీ కొంత మంది ప్రాణాలను హరిస్తోంది.
ఈ వైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తోంది? కొంత మంది ఎందుకు చనిపోతున్నారు? దీనికి చికిత్స చేయటం ఎలా?
ఇంక్యుబేషన్ పీరియడ్
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది.
వైరస్లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి.
కొత్త కరోనావైరస్ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్ను స్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది.

మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని 'కరోనావైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఉప్పెనలా మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.
ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ - అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం - ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.

స్వల్ప వ్యాధి
చాలా మందికి ఇలాగే ఉంటుంది.
కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి స్వల్ప ఇన్ఫెక్షన్గానే ఉంటుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు.
ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు.
జ్వరం రావటానికి, నలతగా ఉన్నట్లు అనిపించటానికి కారణం.. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు ప్రతి స్పందించటమే. శరీరంలో ప్రవేశించిన వైరస్ను దాడి చేసిన శత్రువుగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించి.. ఏదో తేడా ఉందంటూ కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేయటం ద్వారా శరీరంలోని మిగతా భాగమంతటికీ సంకేతాలు పంపిస్తుంది.
నిజానికి ఈ కైటోకైన్లు మన రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

కరోనావైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.
ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్తో పోరాడి దానిని తరిమేస్తుంది.
అయితే.. కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని ఇప్పుడిప్పుడే పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ముదిరిన వ్యాధి
ఈ వ్యాధి ముదిరిందంటే.. దానికి కారణం మన రోగనిరోధక వ్యవస్థ - వైరస్ మీద పోరాడటానికి అతిగా ప్రతిస్పందించటం.
రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని మిగతా భాగానికి పంపించే రసాయన సంకేతాలైన కైటోకైన్ల వల్ల వాపు రావచ్చు. దీంట్లో సున్నితంగా సంతులనం సాధించాల్సి ఉంటుంది. వాపు విపరీతంగా పెరిగినట్లయితే శరీరమంతటా చాలా నష్టం జరగవచ్చు.
''శరీర రోగనిరోధక వ్యవస్థలో ఈ వైరస్ ఒక అసంతులనాన్ని రాజేస్తోంది. వాపు చాలా అధికంగా ఉంటోంది. వైరస్ ఈ పని ఎలా చేస్తోందనేది మనకు తెలియదు'' అని కింగ్స్ కాలేజ్ లండన్కు చెందిన డాక్టర్ నథాలీ మాక్డెర్మాట్ చెప్పారు.
ఊపిరితిత్తుల వాపును న్యుమోనియా అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, SPL
ఈ ఊపిరితిత్తులు రెండు చిన్న పాటి గాలి సంచుల్లా ఉంటాయి. మన శ్వాసప్రక్రియలో.. ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించటం, కార్బన్డయాక్సైడ్ వెలుపలికి రావటం జరిగేది ఈ ఊపిరితిత్తుల్లోనే. కానీ న్యూమోనియా వచ్చినపుడు.. ఈ గాలి సంచులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది.
కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస పరికరం) అవసరమవుతుంది.
చైనా నుంచి అందిన సమాచారం ఆధారంగా చూస్తే.. కరోనావైరస్ సోకిన వారిలో సుమారు 14 శాతం మంది ఈ దశకు చేరుతున్నట్లు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
విషమించిన వ్యాధి
మొత్తం మీద ఆరు శాతం కేసుల్లో విషమంగా జబ్బుపడుతున్నట్లు అంచనా.
ఈ దశకు వచ్చేసరికి.. శరీరం విఫలమవటం మొదలవుతుంది. మరణం సంభవించే అవకాశం అధికం.
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పిపోతూ.. శరీరమంతటినీ పాడుచేస్తుండటం ఇక్కడ సమస్య.
దీనివల్ల 'సెప్టిక్ షాక్' సంభవించవచ్చు. అంటే.. రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయి, అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయటం ఆగిపోయి చివరికి పూర్తిగా విఫలమవుతాయి.
ఊపిరితిత్తుల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాపు వల్ల.. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తలెత్తుతుంది. అంటే శ్వాసప్రక్రియ దాదాపుగా ఆగిపోయి.. శరీర మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఆక్సిజన్ అందకపోతే.. శరీరంలోని కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. పేగులు దెబ్బతింటాయి.
Sorry, your browser cannot display this map
''ఈ వైరస్ ఎంత భారీగా వాపు సంభవిస్తుందంటే.. దానివల్ల శరీరంలోని అనేక అవయవాలు విఫలమై మరణం సంభవిస్తుంది'' అని డాక్టర్ భరత్ పంకానియా చెప్పారు.
వైరస్ను రోగ నిరోధక వ్యవస్థ అదుపులోకి తేలేకపోయినట్లయితే.. ఆ వైరస్ శరీరంలోని ప్రతి మూలకూ విస్తరిస్తుంది. దానివల్ల మరింత విధ్వంసం జరుగుతుంది.
ఈ దశలో చికిత్స అందించటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈసీఎంఓ - ఎక్స్ట్రా-కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ కూడా చేయాల్సి రావచ్చు.
అంటే.. కృత్రిమ ఊపిరితిత్తులు శరీరంలోని రక్తాన్ని ట్యూబుల ద్వారా బయటకు తీసి, దానికి ఆక్సిజన్ అందించి మళ్లీ శరీరంలోకి పంపిస్తుంది.
కానీ.. చివరికి శరీరంలో అంతర్గత విధ్వంసం ప్రాణాంతక స్థాయికి చేరవచ్చు.. అప్పుడు అంతర్గత అవయవాలు ఇక శరీరాన్ని సజీవంగా ఉంచలేవు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి మరణాలు...
తాము శాయశక్తులా ప్రయత్నించినా కూడా కొంతమంది పేషెంట్లు ఎలా చనిపోయారనేది డాక్టర్లు వివరించారు.
చైనాలోని ఉహాన్లో గల జిన్యిన్టాన్ హాస్పిటల్లో చనిపోయిన మొదటి ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ.. వారు దీర్ఘకాలంగా ధూమపానం చేస్తున్నారని, దానివల్ల వారి ఊపిరితిత్తులు దెబ్బతిని ఉంటాయని.. లాన్సెట్ మెడికల్ జర్నల్లో వివరించారు.
మృతుల్లో మొదటి వ్యక్తి వయసు 61 సంవత్సరాలు. ఆయన ఆస్పత్రికి వచ్చేటప్పటికే న్యుమోనియా తీవ్రంగా పెరిగింది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించినప్పటికీ.. ఊపిరితిత్తులు విఫలమయ్యాయి. అతడి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.
ఆస్పత్రిలో చేర్చిన 11 రోజుల తర్వాత అతడు చనిపోయాడు.
మృతుల్లో రెండో వ్యక్తి వయసు 69 సంవత్సరాలు. ఆయనకు కూడా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ తలెత్తింది.
ఆయనకు ఈసీఎంఓ మెషీన్ (కృత్రిమ ఊపిరితిత్తులు) ఉపయోగించినా కూడా సరిపోలేదు. ఆయన తీవ్రమైన న్యుమోనియాతో పాటు, రక్తపోటు పడిపోవటంతో సెప్టిక్ షాక్ వల్ల చనిపోయాడు.
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది? టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి
- కరోనావైరస్: దిల్లీలో ఓ మహిళ మృతి.. భారత్లో రెండుకు చేరిన మరణాల సంఖ్య; కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు బంద్
- కరోనావైరస్: ‘నాకూ కోవిడ్-19 పరీక్ష జరగొచ్చు’ - డోనల్డ్ ట్రంప్.. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









