పరీక్షల్లో మోసం చేసేవారిని యూపీ అధికారులు హైటెక్ టూల్స్తో ఎలా పట్టుకున్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనంత్ ఝణానే
- హోదా, బీబీసీ ప్రతినిధి
పరీక్షల్లో మోసాలను అడ్డుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త విధానంపై చర్చ జరుగుతోంది.
తాజాగా జరిగిన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వీడీవో) నియామక పరీక్షల్లో మోసాలకు పాల్పడిన దాదాపు 200 మందిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (యూపీఎస్టీఎఫ్) ఈ కొత్త టెక్నిక్ సాయంతోనే పట్టుకుంది.
రాష్ట్రంలో మోసాలకు పాల్పడే డమ్మీ అభ్యర్థులను పట్టుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయాన్ని అధికారులు తీసుకుంటున్నారు.
అసలు అధికారులు ఎలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మోసం చేస్తున్నారు?
రాష్ట్రంలో మొత్తంగా మోసాలకు పాల్పడిన దాదాపు 200 మందిని పట్టుకున్నట్లు యూపీఎస్టీఎఫ్ తాజాగా వెల్లడించింది.
మొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పరీక్షల్లో ‘ఫోటో మిక్సింగ్’ను గుర్తించామని, ఫలితంగా అభ్యర్థులకు బదులుగా వచ్చిన ఫేక్ క్యాండేట్లు పట్టుబడ్డారని పోలీసు అధికారులు చెప్పారు.
సాధారణంగా అడ్మిట్ కార్డులోని అభ్యర్థుల ఫోటోలను ట్యాంపరింగ్ చేసి ఫేక్ అభ్యర్థులు పరీక్షల్లో కూర్చుంటారు.
ఫోటోషాప్ సాఫ్ట్వేర్లోని అధునాత వెర్షన్ను ఉపయోగించి ఆ అడ్మిట్ కార్డులో డమ్మీ అభ్యర్థులు మార్పులు చేస్తుంటారు. దీన్నే ‘ఫేస్ మిక్సింగ్’అని అంటారు.
అయితే, ఇలాంటి ఫేక్ అభ్యర్థులను గుర్తుపట్టడం ఇన్విజిలేటర్లకు చాలా కష్టం అవుతుంది.

ఫొటో సోర్స్, AFP
ప్రస్తుతం ఎలా కనిపెట్టారు?
పరీక్షల్లో డమ్మీ అభ్యర్థులు కూర్చొని, మోసాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న యూపీఎస్టీఎఫ్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంది.
ఫేస్ మిక్సింగ్ అభ్యర్థులను గుర్తుపట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన తొలి పరీక్ష ‘‘విలేజ్ డెవలప్మెంట్ ఈఫీసర్’’ నియామక పరీక్షేనని యూపీఎస్ఎస్ఎస్సీ తెలిపింది.
అభ్యర్థుల ఫోటోను ఫేక్ అభ్యర్థుల ఫోటోతో ‘ఫేక్ మిక్సింగ్’ చేసి, ఆ డమ్మీ అభ్యర్థులు పరీక్షల్లో కూర్చుంటే ‘ఫేక్ రికగ్నిషిన్’, ‘రెటీనా’ల సాయంతో గుర్తుపట్టేందుకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించారు.
ప్రస్తుతం పరీక్షలు నిర్వహించిన సంస్థ ముందుగానే ఆధార్ కార్డు వివరాలను సేకరించింది. దీంతో ముందుగానే అభ్యర్థుల ఫోటో సహా ఇతర వివరాల సమాచారం వీరి దగ్గర ఉంది.
పరీక్షల సమయంలో ఈ డేటా ఎస్టీఎఫ్ చేతికి ఇస్తున్నారు. దీంతో అడ్మిట్కార్డులోని ఫోటోలను, తమ డేటాబేస్లోని ఫోటోలతో సరిపోలుస్తున్నారు.
పరీక్ష నిర్వహిస్తున్నప్పుడే ‘లైవ్ చెకింగ్’ నిర్వహిస్తుండటంతో డేటా ట్రాన్స్ఫర్ కూడా సకాలంలో జరగడం చాలా ముఖ్యమని, అప్పుడే డమ్మీ అభ్యర్థులను స్పాట్లోనే పట్టుకోవచ్చని ఎస్టీఎఫ్ చెబుతోంది.
‘‘ఈ సారి పరీక్ష మొదలైన గంటలోనే విద్యార్థుల ఫోటోల డేటాబేస్ మాకు అందింది. వెంటనే మేం పరిశీలనలు మొదలుపెట్టాం.’’ అని ఎస్టీఎఫ్ తెలిపింది.
ఒకసారి డమ్మీ అభ్యర్థులను గుర్తించిన వెంటనే, వీటిని మొదట ఎస్టీఎఫ్ ప్రశ్నించింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పెద్ద సంఖ్యలో డమ్మీ అభ్యర్థులను పట్టుకోవడం ఇదే తొలిసారని ఎస్టీఎఫ్ వర్గాలు బీబీసీకి వెల్లడించాయి.

ఫొటో సోర్స్, BBC WORLD SERVICE
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిఘా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పక్కాగా డమ్మీ అభ్యర్థులపై నిఘా పెట్టొచ్చని యూపీఎస్టీఎఫ్ చెబుతోంది.
ప్రస్తుతం చాలా పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇక్కడ అభ్యర్థులు అవకతవకలకు పాల్పడే అవకాశం కూడా పెరుగుతోంది.
కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సదరు అభ్యర్థి ఇంటర్నెట్ ఉపయోగించాడా? అతడి స్క్రీన్ను వేరొకరికి షేర్ చేశాడా? లాంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మోసాలను అడ్డుకునేందుకు మూడంచెల వ్యస్థను యూపీఎస్టీఎఫ్ అనుసరిస్తోంది. దీని కోసం మొదటగా పోలీసులతో కలిసి సంస్థ పనిచేస్తోంది.
రాష్ట్రంలోని భిన్న బోర్డులు, కమిషన్లు కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా చూస్తోంది.
మరోవైపు పేపర్ లీక్లను అడ్డుకోవడంలో విఫలం అవుతున్న సంస్థలపైనా ఎస్టీఎఫ్ చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో ప్రమేయమున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపైనా ఎస్టీఎఫ్ దర్యాప్తు చేపడుతోంది.
‘‘ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కాపీయింగ్ జరిగే అవకాశం ఎక్కువ. అలాంటి ప్రాంతాల్లో భద్రత, పర్యవేక్షణ కూడా తక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలు జిల్లా ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉంటాయి.’’ అని ఎస్టీఎఫ్ అధికారులు చెప్పారు.
‘‘అలాంటి సెంటర్లనే కాపీయింగ్ మాస్టర్లు లక్ష్యంగా చేసుకుంటారు. దీని కోసం కొన్ని ముఠాలతో వారు కుమ్మక్కవుతుంటారు. పరీక్షల్లో సమాధానాల కోసం చాట్జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ల సాయం కూడా తీసుకుంటారు.’’ అని అధికారులు వివరించారు.
మరోవైపు తాజా మోసాల్లో పరీక్షల నిర్వహకులపైనా ఎస్టీఎఫ్ చర్యలు తీసుకుంది. మొత్తంగా ఆరుగురు నిర్వహకులను ప్రస్తుతం జైలుకు తరలించారు. ఈ మోసాలకు కేంద్రమైన స్కూళ్లను కూడా బ్లాక్లిస్టులో పెట్టారు.
మొదట్లో కేవలం డమ్మీ అభ్యర్థులను మాత్రమే పట్టుకునేవారు. ప్రస్తుతం వారితోపాటు వారి వెనుక ఉన్న ముఠాలను కూడా పట్టుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం డమ్మీ అభ్యర్థులు, మాఫియా గ్యాంగ్లకు సంబంధించి ఒక డేటా బేస్ను యూపీఎస్టీఎఫ్ సిద్ధం చేస్తోంది. దీంతో వీరి చర్యలపై పరీక్షల ముందు నిఘా పెడుతున్నారు.

ఫొటో సోర్స్, ANI
ఉత్తర్ ప్రదేశ్లో కొత్త చట్టం..
ప్రస్తుతం రాష్ట్రంలో కాపీయింగ్ను అడ్డుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొని వస్తోంది.
రాష్ట్రంలో భిన్న ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరీక్షల్లో మోసాలను పరిశీలించిన అనంతరం ఈ చట్టం ముసాయిదాను రూపొందించారు.
తరచూ మోసాలకు సంబంధించి వస్తున్న వార్తలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయని, దీని వల్ల మంచి అభ్యర్థులు నష్టపోతున్నారని స్టేట్ లా కమిషన్ తాజాగా వ్యాఖ్యలు చేసింది.
తాజా ముసాయిదాలో పరీక్షల్లో మోసం చేస్తూ పట్టుబడితే గరిష్ఠంగా 14 ఏళ్ల వరకూ జైలుశిక్షతోపాటు రూ.25 లక్షల వరకూ జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్ను చైనా ఒప్పిస్తుందా? భారత్లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















