వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?

అవినాష్ రెడ్డి

ఫొటో సోర్స్, FB / Avinash Reddy

ఫొటో క్యాప్షన్, వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 18న ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 18న ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు ఏప్రిల్ 24న పక్కనబెట్టింది. అవినాష్‌కు రాతపూర్వకంగా ప్రశ్నలను ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టింది.

హైకోర్టు తనకు తాను తప్పుగా అన్వయించుకుని, అసాధారణమైన ఉత్తర్వు ఇచ్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అవినాష్‌ను ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయవద్దన్న హైకోర్టు ‌ ఉత్తర్వును సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కేసు విచారణను పూర్తి చేసేందుకు సీబీఐకి ఇచ్చిన గడువును ఏప్రిల్ 30 నుంచి జూన్ 30 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది.

అవినాష్‌ విచారణలో సీబీఐకు హైకోర్టు ఆంక్షలు విధించడాన్ని సుప్రీంకోర్టు ఇంతకుముందే తప్పుబట్టింది. అవినాష్‌ను విచారించే సమయంలో ఆయనకు వేసే ప్రశ్నలను రాతపూర్వకంగా అందించాలని, వాటిని ముందస్తుగానే అందజేయాలని హైకోర్టు ఆదేశించడాన్ని ఆక్షేపించింది.

సీబీఐ విచారణకు ఇదొక ప్రామాణికమైతే, సీబీఐని మూసేయడమే మేలని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును భవిష్యత్తులో ఇతర నిందితులు ఎవరైనా ఉదాహరణగా చూపిస్తే, పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలన్నారు.

తొలుత ముందస్తు బెయిల్, ఆ తర్వాత ప్రశ్నలు రాతపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం చూస్తుంటే, క్రిమినల్ లా విధానాన్ని తిరగరాస్తున్నట్లు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

వైఎస్ వివేకానందరెడ్డి

ఫొటో సోర్స్, YSRCONGRESS

ఫొటో క్యాప్షన్, వైఎస్ వివేకానందరెడ్డి

వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసు ఇదే. తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు నాలుగేళ్లలో ఎన్నో మలుపులు తిరిగింది.

కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టు వరకూ వెళ్లింది. నిందితుల అరెస్టులు, కొందరు సాక్షులు మృతి చెందడం, ఇంకొందరు అఫ్రూవర్‌గా మారడం వంటివి జరిగాయి.

బాబాయ్ హత్య కేసులో అబ్బాయ్ విచారణ

మాజీ ఎంపీగానే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కావడంతో వివేకా హత్య కేసు అధికార, విపక్షాల మధ్య ఆరోపణలకు, ప్రత్యారోపణలకు కేంద్ర స్థానంగా ఉంటోంది.

ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రిని కూడా ఈ కేసులో సీబీఐ విచారిస్తోంది. తొలుత 2023 జనవరి 28న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు.

ఆ తరువాత కూడా అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణకు పిలుస్తూనే ఉంది.

తన మీద సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హై కోర్టుకు కూడా వెళ్లారు.

హైకోర్టు ఆదేశాల మేరకు 2020 మార్చి 11న ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 20 వరకూ 248 మందిని విచారించింది. సాక్షులు, అనుమానితుల నుంచి వివరాలు సేకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

ఫొటో సోర్స్, Y.S.VIVEKANANDA.REDDY.MLC/FACEBOOK

జగన్, భారతి అనుచరులను కూడా...

హత్య జరిగిన రోజు తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆయన భార్య భారతితో మాట్లాడినట్టు వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణలో వెల్లడయ్యిందని మీడియాలోకథనాలు వచ్చాయి. భారతి దగ్గర పనిచేసే నవీన్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా భారతితోనూ, ప్రస్తుతం సీఎంవోలో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఫోన్‌లో జగన్‌తోనూ మాట్లాడినట్టు అవినాశ్ రెడ్డి తెలపడంతో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి నుంచి కూడా సీబీఐ వివరాలు సేకరించింది. 2023 ఫిబ్రవరి 3న కడపలో వారిద్దరినీ సీబీఐ విచారించింది. ఐదు గంటల పాటు వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

హత్య జరిగిన రోజు తెల్లవారు జామున 3గం.ల సమయంలో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి నెంబర్లకు అవినాశ్ రెడ్డి ఫోన్ చేసినట్టు కాల్ డేటా చెబుతుండటంతో సీబీఐ వారివురిని ప్రశ్నించింది. పలుమార్లు వారి ఫోన్‌కి కాల్ చేసినట్టు తేలడంతో వారి నుంచి సమాచారం తీసుకున్నారు.

జగన్ సీఎం కాక ముందు నుంచీ ఆయనకు సన్నిహితుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతి ఇంట్లో పనిచేస్తున్న నవీన్ కూడా సీబీఐ విచారించడంతో ఈ కేసు విచారణ వేగవంతమయినట్టు కనిపిస్తోంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

ఫొటో సోర్స్, UGC

అవినాష్ రెడ్డిపై సునీత ఆరోపణలతోనే మొదలు

వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె డాక్టర్ నర్రా సునీత మొదటి నుంచి నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆ తర్వాత ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో జాప్యం జరుగుతుండడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తు కోసం కోర్టుకి వెళ్లారు. విచారణ సజావుగా సాగడం లేదంటూ కేసుని ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు. చివరకు 2022 నవంబర్ 22న కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణపై మృతుడి కుమార్తె, భార్య అనుమానాల నేపథ్యంలో బదిలీకి అనుమతిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

కడప ఎంపీగా అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రపై విచారణ చేయించాలని కోరుతూ డాక్టర్ సునీత నేరుగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు కూడా చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు
ఫొటో క్యాప్షన్, సునీత

సీబీఐ ఎందుకొచ్చింది?

2019 మార్చి 14వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. 15న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల సమయంలో మృతుడి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నెం. 84/2019 గా పులివెందుల పీఎస్ లో కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు.

అదే నెల 28న ఈ కేసులో ఎం.వి. క్రిష్ణా రెడ్డితోపాటు యెర్ర గంగిరెడ్డి, ప్రకాష్ అనే వారిని సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలతో పోలీసులు అరెస్టు చేసి, పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.

“నిందితులు వివేకా మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూమ్‌కు తరలించారు. బెడ్ రూంలోని రక్తపు ఆనవాళ్లను తుడిచేసి, సాక్ష్యాలను తారుమారు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టకముందే, వివేకా శవాన్ని అంబులెన్స్‌లో పులివెందుల ప్రభుత్వాసుపత్రి మార్చురీకి మార్చారు. వివేకా, తన మరణ కారణాన్ని తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని ఆయన పీఏ క్రిష్ణా రెడ్డి దాచిపెట్టి, మరణ కారణం తెలిసి కూడా, తెలియదు అంటూ ఫిర్యాదు చేశాడు’’ అని పోలీసులు చెప్పారు.

హత్య జరిగిన రోజు తొలుత గుండెపోటు అంటూ వైఎస్సార్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రకటించినప్పటికీ తదుపరి ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దానిని హత్యగా ధ్రువీకరించారు. కానీ విచారణ మాత్రం సజావుగా సాగడం లేదంటూ 2020 ఫిబ్రవరిలో హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ ఎన్. సునీతా రెడ్డి, అల్లుడు నారెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి సి.ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి వంటి వారు ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు సీబీఐకి అప్పగించాలని కోరారు.

ఈ కేసులో 2020 మార్చి 11న తీర్పు వెలువడింది. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

ఫొటో సోర్స్, Y.S.VIVEKANANDA.REDDY.MLC/FACEBOOK

ఏపీ పోలీసుల దర్యాప్తులో ఏం జరిగింది?

వివేకా ఉదంతం వెలుగులోకి రాగానే 2019 మార్చి 15న నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం 'సిట్' ను నియమించింది. అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పడింది. కానీ 2019 జూన్ 13న ఆర్సీ నెం.266/L&O-III/2019 ప్రకారం ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు ఇన్ స్పెక్టర్లతో పాటుగా ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో కడప ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతీ నేతృత్వంలో విచారణ జరుగుతుందన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి 'సిట్' దర్యాప్తు కొనసాగించింది. 2020 ఫిబ్రవరి వరకూ దశల వారీగా విచారణ సాగింది. సుమారుగా 1,300 మంది సాక్షులను విచారించారు. ముగ్గురు అనుమానితులకు నార్కో టెస్టులు చేశారు. విచారణకు హాజరైన వారిలో వై.ఎస్. కుటుంబ సభ్యలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలోఉన్న సి.ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన బీటెక్ రవితోపాటుగా వివేకాకు చికిత్స చేసిన సన్ రైజ్ ఆస్పత్రి వైద్యులు కూడా ఉన్నారు.

అడిషనల్ డీజీ స్థాయి అధికారి స్థానంలో ఎస్పీగా ఉన్న అధికారి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం కాగా, కొద్దికాలానికే మహంతి తొలుత సెలవులో వెళ్లి, తర్వాత తెలంగాణ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. తదుపరి కడప ఎస్పీగా ఉన్న కే కే అన్బురాజన్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.

మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ చేయాలని తొలుత ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో పిటీషన్ వేసిన జగన్, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 జనవరిలో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, దస్తగిరి

సాక్షుల మృతి, అప్రూవర్‌గా దస్తగిరి

ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న కే శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్ 2న మరణించారు. ఆయన హఠాన్మరణం మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య కేసులో నిందితుడైన పరమేశ్వర్ రెడ్డికి మృతుడు శ్రీనివాసరెడ్డి తోడల్లుడు.

2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి కూడా మరణించారు. ఈ కేసులో తనను సీబీఐ ఒత్తిడి చేస్తోందని ఆరోపించిన పది రోజులకే ఆయన చనిపోయారు.

వివేకా హత్య తర్వాత తొలుత అక్కడికి వెళ్లిన వైద్యులు సన్ రైజ్ ఆసుపత్రికి చెందిన వారు. కాగా ఆ ఆసుపత్రి వైఎస్ జగన్ భార్య భారతి తండ్రి డాక్టర్ ఈసీ గండిరెడ్డిది. ఆయన 2020 మార్చి 3న మరణించారు.

ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అఫ్రూవర్ గా మారారు. 2021 ఆగస్ట్ 31న ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాంగ్మూలం ఇచ్చారు.

వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేమిటి? హత్యకు పథక రచన చేసిందెవరు? హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు.. ఎలా హత్య చేశారు? హత్య అనంతరం “కేసును తప్పుదారి పట్టించేందుకు” ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా వెలుగులోకి వచ్చిన ఆయన వాంగ్మూలం పత్రాల్లో ఉంది. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.

''2019 ఫిబ్రవరి 10న సునీల్ యాదవ్ నన్ను గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి నాతో.. 'బెంగళూరు భూమి సెటిల్మెంట్ విషయంలో వివేకానందరెడ్డికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. వివేకాను నువ్వు చంపేయ్' అని తనతో చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలంలో ఉంది.

అయితే, నేను ఆయన్ను చంపలేనని చెప్పాను. కానీ.. 'నువ్వొక్కడివే కాదు, నీతో మేమూ వస్తాం. దీని వెనుక పెద్దవాళ్లు వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్ రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడు. అందులో నీకు రూ. 5 కోట్లు ఇస్తాం' అని గంగిరెడ్డి చెప్పారు. ఆ తరువాత సునీల్ యాదవ్ ద్వారా నాకు రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చారు. అందులో రూ. 25 లక్షలు సునీల్ మళ్లీ ఇస్తానని తీసుకున్నాడు. మిగతా 75 లక్షలు నా స్నేహితుడి దగ్గరు ఉంచాను. ఆ డబ్బులు ఉంచినందుకు ఆయనకు రూ. 5 లక్షలు కమీషన్ ఇస్తానన్నాను'' అంటూ దస్తగిరి కోర్టుకి, సీబీఐకి తెలిపారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

ఫొటో సోర్స్, YSRCONGRESS

సీబీఐ చార్జ్ షీట్‌లో కీలకాంశాలు

సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చింది. అంతేగాకుండా అనేక ఆరోపణలు కూడా చేసింది. సుపారీ తీసుకుని హత్య చేయడం, ఆ తర్వాత ఆధారాలు చెరిపివేయడం సహా అంతా పెద్ద కుట్ర అంటూ పేర్కొంది. అంతేగాకుండా కడప ఎంపీ సీటు విషయంలోనే వివాదం అంటూ కూడా సీబీఐ ఛార్జ్ షీట్ పేజ్ నెం. 14లో ప్రస్తావించింది.

నేరుగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తో పాటుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శంకర్ రెడ్డి మీద కూడా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్ట్ కి సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో వీటిని పేర్కొంది.

వివేకా కుటుంబీకుల ఆరోపణలు, సీబీఐ ప్రస్తావించిన అంశాలతో పాటుగా కొనసాగుతున్న విచారణలో లభించిన ఆధారాలతో తదుపరి చర్యలకు పూనుకునే అవకాశం ఉంటుంది. అయితే సీబీఐ ఏమేరకు ఈ కేసులో ఆధారాలు సేకరించగలుగుతుంది, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలకు పూనుకుంటుందన్నది కీలకం. ఇప్పటికే నాలుగేళ్లుగా నానుతున్న కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్న దానిని బట్టి ఇది రాజకీయంగానూ ప్రభావం చూపుతుంది.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: సీఎం వస్తున్నారని చెట్లు కొట్టేశారు, ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు

ఎప్పుడు ఏం జరిగింది?

  • 2019 మార్చి 15న హత్య, అదే రోజు అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు
  • మార్చి 28న వివేకా పీఏతో పాటుగా ముగ్గురు అరెస్ట్
  • జూన్ 13న ఎస్పీ స్థాయి అధికారికి సిట్ బాధ్యతలు అప్పగింత
  • సెప్టెంబర్ 2న కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతి
  • 2020 ఫిబ్రవరి 7న సీబీ విచారణ కోరుతూ వేసిన పిటీషన్ ఉపసంహరించుకున్న జగన్
  • మార్చి 3న వైఎస్ఈ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతి
  • మార్చి 11న సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు
  • 2021 ఆగష్ట్ 3 సునీల్ యాదవ్ అరెస్ట్
  • ఆగస్ట్ 31న అఫ్రూవర్ గా మారిన దస్తగిరి కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు వాంగ్మూలం
  • సెప్టెంబర్ 9 గజ్జల ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్
  • నవంబర్ 18న వైఎస్సార్సీపీ కార్యదర్శి శంకర్రెడ్డి అరెస్ట్
  • 2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి మృతి
  • నవంబర్ 22న కేసు ని కడప కోర్టు నుంచి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు
  • 2023 జనవరి 28న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్‌ రెడ్డి విచారణ
  • ఫిబ్రవరి 3న కడపలో జగన్ ఓఎస్డీ తో పాటుగా భారతి అనుచరుడు నవీన్ విచారణ
  • ఫిబ్రవరి 23న విచారణకు హాజరుకావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)