అలెగ్జాండర్ ‘గ్రేట్’ కాదా... యోగి ఆదిత్యనాథ్‌ ఏమన్నారు, పర్షియన్ చరిత్ర ఏం చెబుతోంది?

అలెగ్జాండర్
ఫొటో క్యాప్షన్, అలెగ్జాండర్
    • రచయిత, ప్రొఫెసర్ అలీ అన్సారీ
    • హోదా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇరానియన్ స్టడీస్, సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ

అలెగ్జాండర్ ది గ్రేట్ అని చరిత్రకారులు పొగుడుతుంటారని, అయితే ఆయన గొప్ప కాదని.. చంద్రగుప్త మౌర్య గొప్పవాడని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అలెగ్జాండర్‌ను చంద్రగుప్త మౌర్య ఓడించాడని కూడా యోగి చెప్పారు. ఇది నిజమో కాదో స్పష్టంగా చెప్పలేం. కానీ, అలెగ్జాండర్ గొప్పతనం గురించి మాత్రం భారతదేశం వెలుపల ఎన్నో ఏళ్లుగా ప్రశ్నలు ఉన్నాయి.

Presentational grey line

అలెగ్జాండర్ ద గ్రేట్.. ఓ మహా విజేత అని, సైనిక నేత అని గ్రీక్ ప్రభావమున్న పాశ్చాత్య చరిత్ర పుస్తకాల్లో కీర్తిస్తారు. కానీ పర్షియన్ దృక్కోణంలో ఆయన కీర్తి చాలా భిన్నంగా ఉంటుంది.

ప్రాచీన పర్షియన్ అచీమెనిడ్ సామ్రాజ్య రాజధాని ప్రాంతమైన పెర్సిపోలిస్ అద్భుత శిథిలాలను సందర్శించిన వారికి మూడు వాస్తవాలు చెప్తుంటారు: దానిని డేరియస్ ద గ్రేట్ నిర్మించాడని, అతడి కొడుకు క్సెర్క్సెస్ దానిని అద్భుతంగా తీర్చిదిద్దాడని, దానిని అల్జెగ్జాండర్ అనే వ్యక్తి ధ్వంసం చేశాడని.

అలెగ్జాండర్ అనే సదరు వ్యక్తి.. పశ్చిమ సంస్కృతిలో పర్షియా సామ్రాజ్యాన్ని జయించినట్లు అభివర్ణించిన అలెగ్జాండర్ ద గ్రేట్.

నిజానికి, కొన్ని పాశ్చాత్య చరిత్ర పుస్తకాలను చదివినవారు.. అలెగ్జాండర్ జయించటానికి అప్పటికే పర్షియన్లు ఉన్నారని భావించినందుకు క్షమించవచ్చు.

కాస్త పరిశోధించే మెదడు ఉంటే.. పర్షియన్లు దానికన్నా ముందు రెండు సార్లు గ్రీసు మీద దండయాత్ర చేశారని, వారిని గ్రీకులు ఓడించారని తెలుసుకోగలరు. ఒకసారి 490 బీసీలో డేరియస్ ద గ్రేట్, మరోసారి 480 బీసీలో అతడి కొడుకు క్సెర్క్సెస్.. గ్రీస్ మీద దండయాత్ర చేసి ఓడిపోయారు. ఆ పాలకుల మీద ప్రతీకారంగా పెర్సిపోలిస్ మీద అలెగ్జాండర్ దాడి చేశాడు.

కానీ పర్షియా కళ్లతో చూసినపుడు అలెగ్జాండర్ గొప్పవాడేమీ కాదు.

పెర్సిపోలిస్ నగరాన్ని అలెగ్జాండర్ ధ్వంసం చేశాడు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పెర్సిపోలిస్ నగరాన్ని అలెగ్జాండర్ ధ్వంసం చేశాడు

అలెగ్జాండర్ ఓ రాత్రి తప్పతాగి ఉన్నపుడు ఓ గ్రీకు వేశ్య రెచ్చగొట్టటంతో మరుసటి రోజు పెర్సిపోలిస్‌ను నేలమట్టం చేశాడు. పర్షియా పాలకుడు క్సెర్క్సెస్.. ఆక్రోపోలిస్‌ను దగ్ధం చేసినందుకు ప్రతీకారంగా ఈ పనిచేసినట్లు కనిపిస్తుంది.

అలెగ్జాండర్ తన సామ్రాజ్యమంతటా సాంస్కృతిక, మత నగరాలను తీవ్రంగా ధ్వంసం చేయటాన్ని ప్రోత్సహించాడని కూడా పర్షియన్లు ఆయనను నిందిస్తారు.

ఇరానియన్ల పురాతన మతమైన జోరాష్ట్రియనిజం ఆలయాల మీద దాడి చేసి ధ్వంసం చేశారు. ముఖ్యంగా జొరాష్ట్రియన్ల మతగురువులకు, ముఖ్యంగా మాగికి – వారి ఆలయాల విధ్వంసం ఓ పెను విపత్తులా మారింది.

వీడియో క్యాప్షన్, బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు

ఆటవికంగా జీవిస్తున్న తూర్పు ప్రపంచానికి నాగరికతను, సంస్కృతిని తీసుకువచ్చిన అనేక పాశ్చాత్య క్రూసేడుల్లో అలెగ్జాండర్ దండయాత్ర మొదటిదనే కథనం.. పశ్చిమ ప్రపంచంలో స్థిరపడటానికి కారణం గ్రీకు భాష, సంస్కృతుల ప్రభావమే.

కానీ నిజానికి పర్షియా సామ్రాజ్యాన్ని జయించటానికి కారణం.. ఆ సామ్రాజ్యానికి నాగరికత అవసరమై కాదు. అప్పటికి ప్రపంచంలో అతి గొప్ప సామ్రాజ్యం అది. మధ్య ఆసియా నుంచి లిబియా వరకూ విస్తరించి ఉంది.

భారీ సంపదలతో తులతూగుతున్న సామ్రాజ్యం. కాబట్టి అలెగ్జాండర్ దానిని జయించాలనుకున్నాడు.

పర్షియా సామ్రాజ్యాన్ని, దానిని పరిపాలించిన చక్రవర్తులను గ్రీకులు ప్రశంసించారని కాస్త పరిశీలనగా చూస్తే ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి.

రోమ్‌ను జయించిన బార్బేరియన్ల తరహాలోనే.. అలెగ్జాండర్ తను కనుగొన్న వాటి గురించి అబ్బురపడేవాడు. రాజాధి రాజుకు చెందిన పర్షియన్ ఉత్తరీయాన్ని కూడా సొంతం చేసుకోవాలని దీక్షబూనాడు.

పర్షియన్లను చూసి గ్రీకులు అబ్బురపడటం దీనికన్నా ముందు నుంచే ఉంది.

పెర్సిపోలిస్ నగరంలోని గోడ మీద చెక్కిన అచిమెనీద్ సైనికుల చిత్రాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పెర్సిపోలిస్ నగరంలోని గోడ మీద చెక్కిన అచిమెనీద్ సైనికుల చిత్రాలు

ఏథెన్స్‌కు చెందిన సేనాని, రచయిత క్జీనోఫోన్.. సైరస్ ద గ్రేట్‌ కోసం ఓ విజయగీతిక రాశాడు. సైరోపీడియా అనే ఆ కీర్తనలో.. ఆ పాలకుడి మీద ప్రశంసలు కురిపించాడు.

‘‘సైరస్ కేవలం తన ఉగ్ర వ్యక్తిత్వంతో తన విస్తారమైన దేశంలోకి చొచ్చుకువెళ్లగలిగాడు. దేశ ప్రజలు ఆయన ముందు సాగిలపడేవారు. కానీ అదే సమయంలో వారు తన అనుగ్రహం కోసం పరితపించేలా చేయగలిగాడు. ఆయన తీర్పు, ఆయన ఒక్కడి తీర్పు మాత్రమే చాలని వారు వేడుకునేవారు’’ అని ఆ కీర్తనలో రాశాడు.

ఆ తర్వాత పర్షియా చక్రవర్తులు డేరియస్, క్సెర్క్సెస్‌లు ఇద్దరూ గ్రీస్ మీద దండయాత్ర చేశారు. చివరికి వారిద్దరూ ఓడిపోయారు. కానీ విశేషమేమిటంటే.. గ్రీకులు పర్షియా రాజాస్థానానికి వరుసకట్టారు.

వారిలో అతి ముఖ్యమైన వాడు థెమిస్టోక్లెస్. ఆయన మారథాన్ వద్ద డేరియస్ సైన్యం మీద పోరాడాడు. సాలామిస్ దగ్గర క్సెర్క్సెస్ మీద ఎథినియన్ల విజయంలో కూడా ముఖ్యపాత్ర పోషించాడు.

ఏథెన్స్ రాజకీయాల్లో విభేదాలు రావటంతో ఆయన పర్షియా సామ్రాజ్యానికి పారిపోయాడు. పర్షియా రాజాస్థానంలో కొలువు సంపాదించాడు. ప్రాంతీయ గవర్నర్‌గా పదవి పొంది అక్కడే తన శేషజీవితం గడిపాడు.

కాలక్రమేణా, గ్రీకు నగరాలను ఒకదానిపై ఒకటి రెచ్చగొట్టటం ద్వారా అక్కడ తమ లక్ష్యాలను సాధించవచ్చునని పర్షియన్లు కనిపెట్టారు. అలా.. పెలోపొనీసియన్ యుద్ధంలో పర్షియా నుంచి నిధులు పొందిన స్పార్టా.. ఏథెన్స్ మీద గెలిచింది.

ఈ వ్యూహంలో కీలక వ్యక్తి పర్షియా యువరాజు, ఆసియా మైనర్ గవర్నర్ సైరస్ ద యంగర్. ఆయన గ్రీకు ప్రముఖులతో ఎంతటి సత్సంబంధాలు అభివృద్ధి చేసుకున్నాడంటే.. తను సింహాసనం హస్తగతం చేసుకోవాలని నిర్ణయించుకున్నపుడు 10,000 మంది గ్రీకు యోధులను చాలా సులభంగా సంపాదించుకోగలిగాడు.

కానీ దురదృష్టవశాత్తూ అతడు సింహాసనం కోసం పోరాడుతూ చనిపోయాడు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

సేనాని, చరిత్రకారుడు, తత్వవేత్త క్జెనోఫోన్ కూడా ఆయన వద్ద చేరిన యోధుల్లో ఒకడు. ‘‘సైరస్ ద గ్రేట్ తర్వాత జీవించిన పర్షియన్లందరిలోకీ.. ఇతడు రాజు వంటి వాడు. సామ్రాజ్య అర్హత కలిగినవాడు’’ అని సైరస్ ద యంగర్ యువరాజును కీర్తిస్తూ రాశాడు క్జెనోఫోన్.

స్పార్టా సేనాని లిసాండర్ కూడా ఓసారి ప్రాంతీయ రాజధాని సార్డిస్‌లో సైరస్ ద యంగర్‌ను కలిశాడు.

సైరస్ తనను ఎంత గౌరవంగా చూసుకున్నాడో, తన తోట పారాడీసోస్‌ను (పారడైజ్ అనే ఆంగ్ల పదానికి మూలం) ఎలా దగ్గరుండి చూపించాడో లిసాండర్ వివరిస్తూ రాశాడు.

ఆ తోట పని చేసిన, అందమైన ప్రణాళికను రూపొందించిన బానిసను అభినందించాలని తాను కోరుకుంటున్నానని చెప్పగా.. ఆ తోటను డిజైన్ చేసింది తానేనని, స్వయంగా కొన్ని మొక్కలను కూడా నాటానని సైరస్ నవ్వుతూ చెప్పినట్లు కూడా లిసాండర్ వివరించాడు.

తన ప్రతిస్పందనను చూసిన సైరస్.. ‘‘రోజులో ముందుగా యుద్ధ కళకు సంబంధించిన పని కానీ, వ్యవసాయానికి సంబంధించిన పని కానీ చేయకుండా.. అందులో ఒళ్లు వంచి చెమట చిందించకుండా నేను ఏ నాడూ భోజనం చేయలేదు.. మిత్రాస్ మీద ఓట్టేసి చెప్తున్నా’’ అని కూడా రాశాడు లిసాండర్.

ఇటువంటి కథలు అలెగ్జాండర్‌కు బాగా తెలిసి ఉండవచ్చు. పర్షియా సామ్రాజ్యాన్ని జయించటం అనేది ఏదో సాధించాల్సిన విజయం మాత్రమే కాదు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అలెగ్జాండర్‌ను విధ్వంసకుడిగా, దుస్సాహసిగా, కొంతవరకూ ఆలోచనలేని యువకుడిగా పర్షియన్లు చిత్రీకరించారు. అయితే.. పర్షియన్ల మీద ఆయనకు ఆ తర్వాత కూడా మంచి గౌరవమే ఉందని ఆధారాలు చెప్తున్నాయి.

తన దండయాత్ర వల్ల జరిగిన విధ్వంసం పట్ల అలెగ్జాండర్ పశ్చాత్తాపం చెందాడు. పెర్సిపోలిస్‌కు కాస్త ఉత్తరంగా ఉన్న పసర్గాడ్ లోని సైరస్ ద గ్రేట్ సమాధిని ధ్వంసం చేసిన తీరును చూసిన అలెగ్జాండర్.. చాలా విచారించాడు. దానికి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించాడు.

అతడు 32 ఏళ్ల వయసు తర్వాత కూడా జీవించినట్లయితే.. మరిన్ని శిథిలాలకు మరమ్మతులు చేయించి పునరుద్ధరించి ఉండేవాడు. కాలక్రమంలో పర్షియన్లు ఈ మాసిడోనియా విజేతను.. ఆయన తర్వాత దండెత్తివచ్చిన వారిలాగానే తమ జాతి చరిత్రలో సంలీనం చేసుకున్నారు.

అందువల్లనే.. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో రాసిన ఇరాన్ గొప్ప జాతీయ కావ్యం షానామాలో అలెగ్జాండర్‌ను విదేశీ యువరాజుగా కాకుండా ఒక పర్షియా తండ్రిగా అభివర్ణించారు.

అది కాల్పనికమే. కానీ చరిత్ర దాచేసిన నిజం కన్నా.. మరింత ఎక్కువగా నిజాన్ని మోసం చేస్తున్న కల్పన కావచ్చు.

అలీ అన్సారీ.. స్కాట్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో ఆధునిక చరిత్రలో ప్రొఫెసర్‌గా పనిచేశారు, .. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇరానియన్ స్టడీస్‌ విభాగానికి అధిపతిగా ఉన్నారు.

(అలెగ్జాండర్: 20 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కడం నుంచి అంతుచిక్కని మరణం వరకు.. ఈ కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి)

(ఖైబర్ కనుమలు: అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు అందరి గర్వాన్నీ అణిచేసిన మృత్యులోయ.. ఈ కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)