ఆంధ్రప్రదేశ్: అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?

నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చడం వల్ల అనేకమంది గిరిజనులు తమ హక్కులను కోల్పోతున్నారు.
ఫొటో క్యాప్షన్, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చడం వల్ల అనేకమంది గిరిజనులు తమ హక్కులను కోల్పోతున్నారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

పుట్టింది, పెరిగింది, నివసిస్తున్నది, అంతా ఏజెన్సీ ప్రాంతంలోనే అయినా కొందరు గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేక పోతున్నారు. కొందరు మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా, కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్-షెడ్యూల్డ్ ఏరియాల్లో నమోదై ఉండటమే దీనికి కారణం.

రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజనులు ఆ హక్కులను, చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు.

మరి, కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు ? ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారు?

"నేను రోలుగుంట మండలం, లోగింగి గ్రామానికి చెందిన కామేశ్వరావు అనే గిరిజనుడ్ని వివాహం చేసుకున్నాను. ఈ కారణంగా నాకు ఇప్పటి వరకు ఉన్న గిరిజన హక్కులన్నీ పోయాయి. మాకు పుట్టే పిల్లలకు కూడా గిరిజన హక్కులుండవట. ఒక గిరిజన తెగకు చెందిన నేను అదే తెగకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల హక్కులు ఎలా కోల్పోతాను?" అని ఏజెన్సీలోని చింతపల్లి గ్రామానికి చెందిన మర్రి లలిత ప్రశ్నించారు.

ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు
ఫొటో క్యాప్షన్, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు

ఏజెన్సీ, షెడ్యూల్డ్ ఏరియా అంటే...

బ్రిటిష్ పాలనలో...గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్ (నిర్దేశిత, ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు. అందుకోసం Scheduled Districts Act 1874 అమల్లోకి తెచ్చారు.

మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్ పర్యవేక్షణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీగా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్ లో చేర్చారు. అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్ లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్-షెడ్యూల్డ్ ఏరియాలు అంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటివి 552 గ్రామాలు ఉన్నాయి.

అయిదవ షెడ్యూల్ లో ఏముంది...

అయిదో షెడ్యూలు లోని క్లాజ్ 6 ప్రకారం ప్రభుత్వం నోటిఫై చేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార, సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

అయిదో షెడ్యూల్ లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొలగించడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది.

"షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు...హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70 వంటి చట్టాలు అమలులో ఉంటాయి. అదే నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు, అమ్ముకోవచ్చు. ఈ భూములపై సివిల్ కోర్టుల్లో కేసులు కూడా వేయవచ్చు'' అని నాన్-షెడ్యూల్డ్ గిరిజనుల సంఘం అధ్యక్షులు సి.హెచ్. పోతురాజు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే సబ్ ప్లాన్ నిధులు షెడ్యూల్డ్ ఏరియాకే వర్తిస్తాయని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టంలాంటివి అమల్లో ఉంటాయని పోతురాజు వెల్లడించారు. మైనింగ్ అనుమతులు ఇవ్వాలన్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు.

''నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో పీసా చట్టం, గ్రామ సభల అనుమతులతో పని లేదు. ఇలా నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణను పొందలేకపోతున్నారు" అన్నారు పోతురాజు.

నాన్-షెడ్యూల్డ్ ఏరియా యువకులను పెళ్లి చేసుకున్న షెడ్యూల్డ్ ఏరియా మహిళలు, వారి పిల్లలు కూడా గిరిజనులకు ఉండే ప్రత్యేక హక్కులను కోల్పోతారు.
ఫొటో క్యాప్షన్, నాన్-షెడ్యూల్డ్ ఏరియా యువకులను పెళ్లి చేసుకున్న షెడ్యూల్డ్ ఏరియా మహిళలు, వారి పిల్లలు కూడా గిరిజనులకు ఉండే ప్రత్యేక హక్కులను కోల్పోతారు.

ఉద్యోగాలు రావట్లేదు

ప్రభుత్వ రికార్డులు ప్రకారం నాన్-షెడ్యూల్డ్ ఏరియాలుగా ఉన్న గిరిజన గ్రామాలు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లోని గిరిజనులు మౌలిక వసతులు, అభివృద్ధి, హక్కులు, రక్షణ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఐటీడీఏ పరిధిలో ఏదైనా ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు వెళ్లినా షెడ్యూల్డ్ ఏరియాలో లేని ఆదివాసీలుగా భావించి...ఉద్యోగాలు ఇవ్వడం లేదని నర్సీపట్నం మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న నాన్-షెడ్యూల్డ్ గిరిజన గ్రామానికి చెందిన వసుంధర చెప్పారు. ఆమె డీఎడ్ పూర్తి చేసి రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.

"నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం వల్ల షెడ్యూల్డ్ ఏరియాలో ఉండే ఆదివాసీలకు లభించే ఏ అవకాశాలు పొందలేకపోతున్నాం. చదువుకున్నా నాకు ఉద్యోగం రాకపోవడంతో మా చెల్లిని, తమ్ముణ్ని చదివిస్తున్నా...అది కూడా దండగేనని మా తల్లిదండ్రులు భావిస్తున్నారు" అని వసుంధర తెలిపారు.

రాజకీయంగా కూడా దెబ్బే...

"షెడ్యూల్డ్ ఏరియాలో గ్రామ పంచాయితీ సర్పంచ్ పోస్టులు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడి పోస్టులు అన్ని ఆదివాసీలకే రిజర్వు అయి ఉంటాయి. కానీ, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న ఆదివాసీలకు మాత్రం రోస్టర్ విధానం (వంతుల వారీగా) ఉంటుంది. అందువల్ల గిరిజనులున్న ప్రాంతాల్లో కూడా అధికారం చాలాసార్లు గిరిజనేతరులకు వెళ్తుంది. దీని వలన రాజకీయంగా కూడా మేం ఎదగలేకపోతున్నాం'' అని నాన్-షెడ్యూల్డ్ ఏరియా అజయ్ పురానికి చెందిన కిల్లో రాంబాబు చెప్పారు.

''ఉపాధి హామీ పనులకు కూడా మమ్మల్ని పిలవడం లేదు. పేరుకే ఆదివాసీలం. హక్కులు లేవు" అని రాంబాబు అన్నారు.

షెడ్యూల్డ్ ఏరియాలలో భూముల మీద గిరిజన గ్రామాసభలకే అధికారం ఉంటుంది.
ఫొటో క్యాప్షన్, షెడ్యూల్డ్ ఏరియాలలో భూముల మీద గిరిజన గ్రామాసభలకే అధికారం ఉంటుంది.

షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చమంటే... వీఎంఆర్డీఏలోకి

ఇప్పుడు నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న ఆదివాసీలకు మరో సమస్య వచ్చింది. ఇప్పటి వరకు నాన్-షెడ్యూల్డ్ ఏరియా నుంచి షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని గిరిజనులు డిమాండ్ చేస్తూంటే...వారి గ్రామాల్ని వీఎంఆర్డీఏ (విశాఖ మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ)లో చేర్చారు.

"రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 11 మండలాలను మినహాయించి...మిగిలిన జిల్లా అంతటినీ కూడా వీఎంఆర్డీఏ పరిధిలోకి తీసుకు వచ్చింది. ఇదంతా కూడా నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో మైనింగ్ యధేచ్ఛగా సాగించేందుకే. విశాఖ జిల్లాలోని సరుగుడు మండలంలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలే ఇందుకు ఉదాహరణ" అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5వ షెడ్యూల్ సాధన కమిటీ విశాఖ జిల్లా ప్రతినిధి నరసింహ మూర్తి ఆరోపించారు.

రియల్ ఎస్టేట్, మైనింగ్ కోసమే...

"విశాఖ జిల్లా రావికమతం మండలంలో ఆదివాసీ గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ గ్రామాలేవీ షెడ్యూల్డ్ ఏరియాలో ఉండవు. ఇక్కడే మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. అయిదో షెడ్యూలు ఏజెన్సీ ప్రాంతాల్లో పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే...రాష్ట్ర గిరిజన సలహా మండలి, రాష్ట్ర గవర్నర్ సిఫార్సు, సలహాలతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత మాత్రమే సాధ్యం అవుతుంది. నాన్ -షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా ఖనిజ వనరులు దోపిడీ, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యధేచ్ఛగా చేసుకోవచ్చు'' అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయిదో షెడ్యూల్ సాధన సమితి గౌరవ అధ్యక్షులు కె. గోవిందరావు బీబీసీతో అన్నారు.

అయితే ప్రజాప్రతినిధుల మాట మాత్రం వేరుగా ఉంది. "వీఎంఆర్డీఏ కలిసే ప్రాంతాలన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయి. నాన్-షెడ్యూల్డ్ ప్రాంతాలు కూడా కలవడం వల్ల అవి త్వరగా అభివృద్ధి చెందుతాయి. మైనింగ్, రియల్ ఎస్టేట్ కోసం అన్న వాదనలో నిజం లేదు'' అని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు.

మైనింగ్ కోసమే నాన్-షెడ్యూల్డ్ ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలలో కలపడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఫొటో క్యాప్షన్, మైనింగ్ కోసమే నాన్-షెడ్యూల్డ్ ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలలో కలపడం లేదన్న ఆరోపణలున్నాయి.

సరుగుడు పంచాయితీయే ఉదాహరణ...

1985 వరకూ సరుగుడు ఏజెన్సీ ప్రాంతమంతా కొయ్యూరు తాలూకాలో ఉండేది. ఈ పంచాయితీలో 16 గ్రామాల్లో లేటరైట్ గనులు విస్తారంగా ఉన్నాయి. అయితే సరుగుడు ఏజెన్సీ మండలాల విభజనలో నాతవరం మండలంలోకి మారింది. నాతవరం మండలం నాన్ -షెడ్యూల్డ్ ఏరియాలో ఉంది.

"షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు గిరిజనేతరులకు, బినామీలకు ఇవ్వడం చట్ట విరుద్ధం. సరుగుడు ప్రాంతంలో లేటరైట్ ఖనిజ తవ్వకాల ప్రక్రియలో ఈ నిబంధనలేవి పాటించడం లేదు. ఇక్కడ పూర్తిగా గిరిజన కుటుంబాలే ఉన్నాయి. అయినా అధికారుల దగ్గర వారు తాము గిరిజనులమని నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈ తరుణంలో సరుగుడు ప్రాంతాన్ని వీఎంఆర్డీఏ లో చేర్చారు. ఇదంతా లేటరైట్ మైన్స్ కోసమే" అని నాతవరం గిరిజన సంఘం నాయకులు కిల్లో రాము అన్నారు.

షెడ్యూల్డ్ ప్రాంతంగా మారాలంటే...

విశాఖపట్నంలోని నాన్ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పుపడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్ కనకరావు బీబీసీతో చెప్పారు.

"రావికమతం మండలంలో నాన్ -షెడ్యూల్డ్ ఏరియాలో 33 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఎస్టీ జనాభా 50 శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత, సమీప షెడ్యూల్డ్ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ గైడ్ లైన్స్ లో ఉంది. రావికమతం మండలంలో 5 గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు" అని కనకరావు చెప్పారు.

నాన్-షెడ్యూల్డ్ ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలంటూ గిరిజనులు ఆందోళన చేస్తున్నారు
ఫొటో క్యాప్షన్, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలంటూ గిరిజనులు ఆందోళన చేస్తున్నారు

గతంలో జరిగిన ప్రయత్నాలేంటి...

1976 లో ఉమ్మడి రాష్ట్రంలో 800 గిరిజన గ్రామలు నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయని...వాటిని షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో మంత్రి మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

"2007లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న రెడ్యా నాయక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 800 గిరిజన గ్రామాలను (శ్రీకాకుళం-240, విజయనగరం-181, విశాఖపట్నం-90, తూర్పుగోదావరి-40, పశ్చిమ గోదావరి -01) షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన ఉన్నట్లు అసెంబ్లీలో తెలిపారు. ఆ తర్వాత దీనిపై మళ్లీ చర్చ జరగలేదు. అయితే 2018లో రాజస్థాన్‌లోని 6 జిల్లాలలో ఉన్న 9 మున్సిపాలిటీలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికైనా మన రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి" అని విశాఖ జిల్లా ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షుడు ధనుంజయ్ అన్నారు.

వైఎస్సార్ హామీని...జగన్ నెరవేరుస్తారా

‘‘2004లో పాదయాత్ర సందర్భంగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విశాఖ జిల్లా వడ్డాదిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని నాన్- షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే, వైఎస్సార్ మరణం, రాష్ట్రంలో సమైక్య, ప్రత్యేక ఉద్యమాలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం తెరమరుగైంది’’ అని రోలుగుండ మండలం లోసింగి గ్రామానికి చెందిన కిల్లో నాగేశ్వరావు అన్నారు.

అయితే, ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని...అర్హతలున్న అన్ని నాన్-షెడ్యూల్డ్ గ్రామాల్ని షెడ్యూల్డ్ ఏరియాలో చేరుస్తామని పాడేరు ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ బీబీసీతో అన్నారు.

కొన్ని నాన్-షెడ్యూల్డ్ ఏరియాలను వీఎంఆర్డీఏ పరిధిలోకి తెస్తూ విడుదలైన జీవో
ఫొటో క్యాప్షన్, కొన్ని నాన్-షెడ్యూల్డ్ ఏరియాలను వీఎంఆర్డీఏ పరిధిలోకి తెస్తూ విడుదలైన జీవో

‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’

రాజ్యాంగంలో ఆర్టికల్ 244(1) ఆర్టికల్, అయిదవ షెడ్యూల్ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు విఫలమయ్యారని ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు.

గిరిజనుల హక్కులు, సంక్షేమం, నాన్ షెడ్యూల్డ్ ఏరియాల అంశాలను ప్రస్తావిస్తూ...తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ లకు ఆయన లేఖలు రాశారు.

"ప్రాజెక్టుల విషయంలో పీసా, అటవీ హక్కుల చట్టాల కింద గ్రామ సభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభుత్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనేతరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయాలను గుర్తించి, మీరు తగిన చర్యలను తక్షణమే తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)