చైనా ఎడారిలో అమెరికా యుద్ధనౌకలను పోలిన నిర్మాణాలు, ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

తక్లమకాన్ ఎడారిలోని నిర్మాణాల ఉపగ్రహ చిత్రం

ఫొటో సోర్స్, SATELLITE IMAGE/MAXAR TECHNOLOGIES

ఫొటో క్యాప్షన్, తక్లమకాన్ ఎడారిలోని నిర్మాణాల ఉపగ్రహ చిత్రం

చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోని ఒక ఎడారిలో అమెరికా యుద్ధనౌకలను పోలి ఉన్న నిర్మాణాలు ఉన్నట్లు ఉపగ్రహచిత్రాల్లో వెల్లడైంది.

విమాన వాహక నౌక ఆకారంలో ఉన్న ఓ నిర్మాణం రైలు పట్టాలపై ఉన్నట్లుగా అమెరికా స్పేస్ టెక్నాలజీ సంస్థ మాక్సర్ తీసిన ఒక చిత్రంలో కనిపించింది.

సాధన కోసం చైనా సైన్యం నిర్మించిన లక్ష్యాలులా ఇవి కనిపిస్తున్నాయని అమెరికా నావికదళంపై ప్రత్యేక వార్తలు అందించే యూఎస్‌ఎన్ఐ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.

చైనా గత కొన్నేళ్లుగా యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తూ, పరీక్షలు చేపడుతోంది.

అమెరికా విమాన వాహక నౌనకు పోలిన లక్ష్యం

దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఇటీవల కాలంలో చైనా తమ అణు సామర్థ్యాలు సహా సైన్యాన్ని వేగంగా విస్తరిస్తోందని అమెరికా హెచ్చరించింది.

తక్లమాకన్ ఎడారిలో కనిపిస్తున్న నిర్మాణాలు.. కేవలం అమెరికా యుద్ధ నౌకల ఆకారాల్లో కనిపిస్తున్నాయి కానీ, ఆయుధాలు, ఇతర వివరాలు ఫొటోల్లో కనిపించలేదని ఆదివారం యూఎస్ఎన్ఐ తెలిపింది.

ఒక విమాన వాహక నౌక, కనీసం రెండు అమెరికా నేవీ డిస్ట్రాయర్లను పోలి ఉన్న నిర్మాణాలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయని వెల్లడించింది.

ఈ నిర్మాణాలను రూపొందించడం బట్టి, "అమెరికా యుద్ధనౌకలే లక్ష్యంగా తమ యాంటీ-క్యారియర్ సామర్థ్యాలపై చైనా దృష్టి సారిస్తోందని" వెల్లడైందంటూ ఆ వెబ్‌సైట్ తెలిపింది.

రక్షణ, ఆర్ధిక రంగాలలో దక్షిణ చైనా సముద్రం తనకు చాలా కీలకమని చైనా భావిస్తోంది

ఫొటో సోర్స్, REUTERS/ROLEX DELA PENA

ఫొటో క్యాప్షన్, రక్షణ, ఆర్ధిక రంగాలలో దక్షిణ చైనా సముద్రం తనకు చాలా కీలకమని చైనా భావిస్తోంది

ఈ ఏడాది ప్రారంభంలో అణు సామర్థ్యం ఉన్న హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్షను చైనా నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి, ధ్వని కంటే అయిదు రెట్లు ఎక్కువ వేగంతో ఎగువ వాతావరణంలో ఎగరగల క్షిపణులు.

అయితే, ఈ వార్తలను చైనా ఖండించింది. అవి సాధారణంగా జరిగే స్పేస్‌క్రాఫ్ట్ పరీక్షలేనని చెప్పింది.

ప్రపంచంలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాలలో ఒకటైన దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళం తరచూ సైనిక నౌకలతో మిషన్లు నిర్వహిస్తుంటుంది. ఇవి సాధారణ మిషన్లేనని అమెరికా వివరించింది.

ఈ ప్రాంతంలో అధిక భాగంపై తమకు హక్కులున్నాయన్నది చైనా వాదన. కానీ, చుట్టుపక్కల దేశాలు, అమెరికా ఇందుకు అంగీకరించవు.

సంవత్సరానికి $3 ట్రిలియన్ (రూ. 2,21,67,960 కోట్లు) విలువైన వాణిజ్యాన్ని రవాణా చేయడానికి ఉపయోగించే ప్రధాన షిప్పింగ్ మార్గంలో ఈ ప్రాంతం ఒక భాగం.

దశాబ్దాల పాటుగా ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, తైవాన్, వియత్నాం దేశాలు చైనా వాదనను తిరస్కరిస్తున్నాయి.

ఈ వివాదంలో పై దేశాలకు అమెరికా మద్దతిస్తోంది.

ఇటీవల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు క్రమంగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)