హాథ్‌రస్ కేసు: కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు చేశాం.. అఫిడవిట్‌లో తెలిపిన యూపీ ప్రభుత్వం - BBC Newsreel

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

హాథ్‌రస్ ఘటనపై చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తున్నప్పటికీ తమను అప్రతిష్ట పాలుచేసే లక్ష్యంతో కొన్ని పార్టీలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

హాథ్‌రస్ ఘటనకు కులం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆ అఫిడవిట్‌లో ఆరోపించారు.

సీబీఐ విచారణ నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా కోర్టు పర్యవేక్షించాలని యూపీ ప్రభుత్వం ఆ అఫిడవిట్‌లో కోర్టును కోరింది.

మరుసటి రోజు శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న సమాచారం వల్లే బాధితురాలి మృతదేహానికి రాత్రిపూట దహనం చేశారని.. దహనం సమయంలో బాధితురాలి కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

డోనల్డ్ ట్రంప్: 20 ఏళ్ల కిందటి కంటే ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నాను

కరోనావైరస్ చికిత్సలో భాగంగా మూడు రోజులు ఆసుపత్రిలో గడిపిన అనంతరం ఊహించని రీతిలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శ్వేతసౌధానికి వచ్చారు.శ్వేతసౌధ బాల్కనీలో నిలబడి ఆయన తన మాస్క్‌ను తీసేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.''నేను చాలా బాగున్నా. కరోనాకు భయపడకండి. మీ జీవితాన్ని అంధకారం చేసుకోకండి''అని ట్రంప్ ట్వీట్ చేశారు.అయితే, ట్రంప్‌కు ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియడం లేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అయితే, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ట్రంప్ ట్వీట్ చేశారు. ''నేను 20ఏళ్ల కంటే ఇప్పుడే బావున్నా''అని ట్రంప్ వ్యాఖ్యానించారు.''త్వరలో ప్రచారం కూడా మొదలు పెట్టబోతున్నా''అని కూడా చెప్పారు.కరోనావైరస్ సోకడంతో అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచార కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. నీలం రంగు సూట్, టై, మాస్క్ వేసుకుని వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌ నుంచి ఆయన పిడికిలి చూపిస్తూ బయటకు వస్తున్నట్లు మీడియాలో దృశ్యాలు కనిపిస్తున్నాయి.''అందరికీ ధన్యవాదాలు''అని ఆయన చెప్పారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలను ఆయన దాటవేశారు. ''మీరు సూపర్ స్ప్రెడరా?''అని ఒక రిపోర్టర్ అడిగారు. ట్రంప్ దానికీ సమాధానం చెప్పలేదు.

ఐపీఎల్ 2020: దిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిన రాయల్ చాలెంజర్స్.. రబాడ ధాటికి కుప్పకూలిన కోహ్లీ సేన

రబడ, శిఖర్ ధవన్

ఫొటో సోర్స్, facebook/delhi capitals

ఐపీఎల్-2020లో ‘దిల్లీ క్యాపిటల్స్’ జట్టు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 59 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

దుబాయ్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్-2020లోని 19వ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు 196 పరుగులు చేసి రాయల్ చాలెంజర్స్‌కు గట్టి సవాలు విసిరింది.

ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు మైదానంలో దిగిన బెంగళూరు జట్టు 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ చాలెంజర్స్ జట్టులో విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఐపీఎల్ మ్యాచ్

ఫొటో సోర్స్, Bcci/ipl

కగిసో రబాడ దిల్లీ తరుపున 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. కోహ్లీ వికెట్ కూడా రబాడ ఖాతాలోనే పడింది. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు.

బెంగళూరు బ్యాట్స్‌మెన్ మొదటినుంచీ తడబడుతూనే ఉన్నారు. ఆరోన్ ఫించ్ రెండుసార్లు క్యాచ్ అవుట్ అవ్వాల్సింది కానీ తప్పించుకున్నాడు. కగిసో రబాడా వేసిన మొదటి ఓవర్లోనే రెండోబంతికి ఆరోన్ ఫించ్ ఇచ్చిన క్యాచ్ వదిలేశాడు.

తరువాతి ఓవర్లో మళ్లీ ఎన్రిచ్ నోర్జే వేసిన బంతిని శిఖర్ ధావన్ క్యాచ్ పట్టుకోలేకపోయాడు.

మూడో ఓవర్లో దిల్లీ కేపిటల్స్ కెప్టెన్ బంతిని అశ్విన్‌కు ఇచ్చాడు. ఈ ప్రయోగం ఫలించింది. మంచి ఫామ్‌లో ఉన్న బెంగళూరు ఆటగాడు దేవదత్ పడిక్కల్ అవుట్ అయ్యాడు. దేవదత్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.

తరువాతి ఓవర్లో అక్షర్ పటేల్, ఫించ్‌ను అవుట్ చేసాడు. ఫించ్ 14 బంతుల్లో 13 పరుగులు చేసి వెనుదిరిగాడు.

ఈసారి డివిలియర్స్ కూడా విఫలమయ్యాడు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్ క్రీజులో ఉన్నప్పుడు అభిమానుల్లో కాస్త ఆశలు రేకెత్తించారు.

డివిలియర్స్ అవుట్

ఫొటో సోర్స్, Bcci/ipl

ఐదో ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన బంతులను ఇద్దరూ చెరో ఫోర్ కొట్టారు. ఆరో ఓవర్లో కూడా డివిలియర్స్, నార్జే వేసిన బంతిని బౌండరీకి తరలించాడు కానీ తరువాతి బంతికి అవుటయ్యాడు. కేవలం 9 పరుగులతో డివిలియర్స్ వెనుదిరిగాడు.

మూడో వికెట్ కోల్పోయినప్పటికి బెంగళూరు స్కోరు కేవలం 43 పరుగులు. అప్పుడు బెంగళూరు భారాన్ని కోహ్లీ, మొయిన్ అలీ తమ భుజాలపై వేసుకుని నాలుగో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. కానీ 12వ ఓవర్లో అక్షర్ పటేల్ బంతికి అలీ అవుట్ అయ్యాడు.

దీంతో వికెట్లు కాపాడుకుంటూ, స్కోరు పెంచాల్సిన బాధ్యత కోహ్లీపై పడింది. 13వ ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన బంతిని కోహ్లీ సిక్స్ కొట్టాడు. అదే ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా హర్షల్ బంతిని బౌండరీకి తరలించాడు.

రబడా

ఫొటో సోర్స్, facebook/delhi capitals

ఫొటో క్యాప్షన్, రబడా

14వ ఓవర్లో రబాడ కోహ్లీ పరుగులకు బ్రేక్ వేసాడు. ఒక సిక్స్‌, రెండు ఫోర్లతో 38 బంతుల్లో 43 పరుగులు చేసి కోహ్లీ వెనుదిరిగాడు.

తరువాత వరుసగా వాషింగ్టన్ సుందర్, శివం దూబే, ఇసురు ఉడానా వికెట్లను రబాడ తన ఖాతాలో వేసుకున్నాడు. 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు తీశాడు.

19వ ఓవర్లో నార్జే, మొహమద్ సిరాజ్‌ను పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్ దిల్లీ కేపిటల్స్ సొంతమైంది.

దిల్లీ ఆటగాళ్లు

ఫొటో సోర్స్, Bcci/ipl

బ్యాట్ ఝళిపించిన దిల్లీ (196/4)

మొదట బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ఆటగాళ్లు మైదానంలో విజృభించారు. మార్కస్ స్టొయినిస్, పృధ్వీ షా చక్కని ఇన్నింగ్స్‌తో దిల్లీకి మంచి స్కోరు అందించారు. స్టొయినిస్ 26 బంతుల్లో 53 పరుగులు చేయగా, షా 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

90 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో పడినట్టు కనిపించించిన దిల్లీ జట్టును స్టొయినిస్ మెరుపు వేగంతో గట్టెక్కించాడు. రిషబ్ పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు స్టొయినిస్ 6.5 ఓవర్లల్లో 89 పరుగులు జోడించాడు. స్టొయినిస్ రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. పంత్ మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టి 25 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

అంతకుముందు దిల్లీ ఒపెనర్ పృధ్వీ షా బ్యాట్ ఝళిపించి పరుగుల వరద కురిపించాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 23 బంతుల్లో 42 పరుగులు చేసాడు. శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు పృధ్వీ షా 68 పరుగులు జోడించాడు. ధావన్ 32 పరుగులు చేశాడు.

బెంగళూరు తరపున శిరాజ్ 34 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. ఇసురు ఉడానా, మొయిన్ అలీ చెరో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)