నైజీరియా: ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు

నైజీరియాలో దోపిడిని అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన పోలీస్ బృందం అరాచకం సృష్టిస్తోంది

ఫొటో సోర్స్, Nigerian Police Force

ఫొటో క్యాప్షన్, నైజీరియాలో దోపిడిని అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన పోలీస్ బృందం అరాచకం సృష్టిస్తోంది

నైజీరియాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్‌ విభాగంపై చర్యలు తీసుకుంటామని ఆ దేశంలోని లాగోస్‌ రాష్ట్ర గవర్నర్ హెచ్చరించారు.

స్పెషల్‌ యాంటీ రాబరీ స్క్వాడ్‌ (SARS-సార్స్‌)కు చెందిన సిబ్బంది, అధికారులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు రావడం ఆందోళకరమని లాగోస్‌ గవర్నర్‌ బాబాజీడేశాన్వో-ఓలు అన్నారు.

ఈ పోలీసులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు, కాల్పులు జరుపుతున్నట్లు అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఈ పోలీసు విభాగాన్ని రద్దు చేయాలని నైజీరియన్లు కొద్దికాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

లాగోస్‌లో శనివారం ఒక యువకుడిని రాబరీ స్క్వాడ్‌ అధికారులు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ పోలీసు విభాగాన్ని రద్దు చేయాలంటూ #EndSARS అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

సార్స్‌ పోలీస్‌ యూనిట్‌ పాల్పడిన దురాగతాలను, క్రూరత్వాన్ని బైటపెట్టడానికి ప్రజలు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నారు.

మూడేళ్ల కిందట సార్స్‌ టీమ్‌ అకృత్యాలపై సోషల్‌ మీడియాలో వీడియోలు వెల్లువెత్తడంతో ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని అప్పటి పోలీస్‌ చీఫ్‌ ప్రకటించారు.

సార్స్‌ సభ్యులు అనుమానితుల నుంచి నేరానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి, శిక్షించడానికి క్రూరమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారని మానవహక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జూన్‌లో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

2017 జనవరి నుంచి మే 2020 మధ్యకాలంలో వీరిపై ఇలాంటి 82 కేసులు నమోదయ్యాయి.

సార్స్‌ అధికారులు టార్గెట్‌ చేసుకునే వ్యక్తులు ఎక్కువగా 17 నుంచి 30 సంవత్సరాల వయసు వారేనని ఆమ్నెస్టీ గుర్తించింది.

"ఖరీదైన డ్రెస్సులు, కార్లు, గాడ్జెట్లు వాడేవారిని సార్స్‌ అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు " అని ఆమ్నెస్టీ తెలిపింది.

"అధికారులు మాటలు, ప్రకటనలు ఆపి నిజమైన సంస్కరణలను మొదలుపెట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ నైజీరియా డైరక్టర్‌ ఒసాయ్‌ ఓజిగో అన్నారు.

“వీలైనంత వేగంగా చర్యలు తీసుకుంటాం” అని లాగోస్ గవర్నర్ ఆదివారం ట్వీట్‌ చేశారు.

సార్స్‌ పోలీసు విభాగం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది.

సార్స్ పోలీసు విభాగంపై చర్యలు తీసుకున్న నైజీరియా

ప్రమాదకరమైన యూనిట్‌గా ముద్రపడ్డ సార్స్ పోలీసు విభాగం ఇకపై ప్రజలను, వాహనాలను ఆపి, సోదాలు చేసే అధికారాలను రద్దు చేస్తున్నట్లు నైజీరియా పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ మొహమ్మద్ అదాము ప్రకటించారు.

సార్స్ యూనిట్ సభ్యులంతా ఇకపై విధిగా యూనిఫామ్‌ కూడా ధరించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)