ఒడిశా రైలు ప్రమాదం: ‘జీరో యాక్సిడెంట్స్’ అంటూ రైల్వే శాఖ ఇచ్చిన హామీ ఏమైంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ రైల్వేకు గత 15 ఏళ్లలో 10 మంది మంత్రులు మారారు. కానీ, రైలు ప్రమాదాల తీరు మాత్రం మారలేదు.
రైలు ప్రమాదాలను ఎంత మాత్రం సహించబోమంటూ రైల్వే మంత్రి నుంచి అధికారుల వరకూ పదే పదే అంటుంటారు.
రైలు ప్రమాదాలను నివారించడానికి గత 20 ఏళ్లలో ఎన్నో సాంకేతికతలను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ, నేటికీ భారత రైల్వేను ప్రమాదం నుంచి బయటపడేసే సాంకేతికత కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా 2022 మార్చిలో సికింద్రాబాద్ సమీపంలో జరిగిన ‘‘కవచ్’’ ట్రయల్లో పాల్గొన్నారు.
భారతీయ రైల్వేలో ప్రమాదాల నివారణకు కవచ్ వ్యవస్థ అత్యంత చౌకైన, ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం అని అప్పట్లో అందరూ అన్నారు.
అశ్విని వైష్ణవ్ స్వయంగా రైలు ఇంజిన్లో ప్రయాణిస్తూ కవచ్ ట్రయల్కు సంబంధించిన వీడియోను తీశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కవచ్ అంటే ఏంటి?
కవచ్ అనేది స్వదేశీ సాంకేతికత. రైలు ప్రమాదాలను నివారించడానికి ఈ సాంకేతికతను బిజీగా ఉండే అన్ని మార్గాల్లో ఏర్పాటు చేస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
కవచ్ అనేది ఒక సాంకేతిక పరికరం. దీన్ని రైలు ఇంజిన్లోనే కాకుండా రైల్వే రూట్లో కూడా అమర్చుతారు.
ఈ సాంకేతికత వల్ల ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు సిగ్నల్, ఇండికేటర్, అలారమ్ మోగుతుంది. తద్వారా రైలు డ్రైవర్ అప్రమత్తం అవుతారు.
కవచ్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నప్పటికీ, నేటికీ రైలు ప్రమాదాలు ఆగడం లేదు.
భారతీయ రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటని చెప్పదగిన ప్రమాదం శుక్రవారం సాయంత్రం జరిగింది.
ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది చనిపోయారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఏ రకమైన ప్రమాదాలను నివారించడానికి ‘కవచ్’ సాంకేతికతను అభివృద్ధి చేశారో, ఒడిశాలో సరిగ్గా అదే ప్రమాదం జరిగింది. కానీ, అక్కడ కవచ్ సాంకేతికత అందుబాటులో లేదు.

ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ మొదటగా బహానగా స్టేషన్లో ఆగి ఉన్న ఒక గూడ్సు రైలును ఢీకొట్టింది. దీంతో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి.
సుదీర్ఘ కాలంగా రైల్వేలపై రిపోర్టింగ్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ దీక్షిత్ మాట్లాడుతూ, ‘‘కవచ్ వల్ల 400 మీటర్ల దూరంలో రైళ్లను ఆపవచ్చని రైల్వే మంత్రి చెప్పారు. మరి ఇప్పుడు ఈ టెక్నిక్ను ఎక్కడ వాడారో మంత్రి చెప్పాలి. ఈ భయంకర ప్రమాదం ఎలా జరిగిందో ఆయన తెలపాలి’’ అని అన్నారు.
రైల్వే శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌధరీ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.
‘‘మౌలిక సదుపాయాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నేను ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నా. కానీ, రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానివల్ల ఇప్పుడు మనం నష్టపోతున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారతీయ రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం కవచ్ వ్యవస్థను దిల్లీ-ముంబై, దిల్లీ-హౌరా మార్గాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంటే ఒడిశాలో ప్రమాదం జరిగిన చోటులో కవచ్ వ్యవస్థ లేదు.
నిజానికి దిల్లీ-ముంబై, దిల్లీ-కోల్కతా మార్గాల్లో వేగంగా నడిచే రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఈ రూట్లలో కవచ్ను ఏర్పాటు చేస్తుంది.
ఒడిశా ప్రమాదం తర్వాత రైల్వే మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ మార్గంలో యాంటీ కొలీజన్ డివైస్లను అమర్చి ఉంటే ఈ ఘోర ప్రమాదం జరగకపోయేదని ఆమె అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
యాంటీ కొలీజన్ డివైస్లు
తాను రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో రైళ్లు ఢీకొట్టుకోకుండా ఆపేందుకు కృషి చేసినట్లు మమతా బెనర్జీ చెప్పారు.
1999లో గైసల్ వద్ద జరిగిన రైలు ప్రమాదం తర్వాతే భారత్లో రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలయ్యాయి.
గైసల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అవధ్-అస్సాం ఎక్స్ప్రెస్ రైలు, బ్రహ్మపుత్ర మెయిల్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 300 మంది చనిపోయారు.
దీని తర్వాత భారతీయ రైల్వేకు చెందిన కొంకణ్ రైల్వే గోవాలో రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే ‘యాంటీ కొలీజన్ డివైస్’ (ఏసీటీ)ను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే పనిని మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా రైళ్లలో జీపీఎస్ ఆధారిత టెక్నాలజీని అమర్చాలని అనుకున్నారు. ఇలా చేయడం వల్ల రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చినప్పుడు, రెండు రైళ్లు అత్యంత సమీపానికి వచ్చినప్పుడు సిగ్నల్, హూటర్ల ద్వారా ఈ సమాచారం ముందుగానే రైలు డ్రైవర్కు చేరుతుంది.
అయితే, మొదట్లో ఈ టెక్నిక్ వల్ల కొంత గందరగోళం తలెత్తింది. ఈ సాంకేతికతను వాడినప్పుడు ఒకే ట్రాక్పై రెండు రైళ్లు వచ్చినప్పుడే కాకుండా, మరో ట్రాక్పై రైలు వస్తున్నప్పుడు కూడా రైలు డ్రైవర్ను అప్రమత్తం చేసేలా సిగ్నల్స్ వచ్చాయి.
ఈ సాంకేతికలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికంటే మెరుగైన సాంకేతికత అవసరం ఉన్నట్లు పసిగట్టారు. దీని తర్వాత రైల్వే శాఖ ‘విజిలెన్స్ కంట్రోల్ డివైస్’’ అనే సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా ఈ తరహా గందరగోళాన్ని అరికట్టాలని భావించింది.

ఫొటో సోర్స్, RAILWAY
రైళ్లు ఢీకొనకుండా నిరోధించడానికి ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టమ్ (టీపీడబ్ల్యూఎస్), ట్రైన్ కొలీజన్ అవాయిడన్స్ సిస్టమ్ (టీసీఏఎస్)లను పరిగణలోకి తీసుకుంది.
ఈ రకమైన టెక్నాలజీని విదేశాల నుంచి కొనుగోలు చేయడం చాలా ఖరీదైనదని భావించి సొంతంగా ఇలాంటి సాంకేతికతను రూపొందించాలని పూనుకుంది. దీనికి కవచ్ అని పేరు పెట్టింది.
గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే, కవచ్ ట్రయల్ను నిర్వహించింది. దీని తర్వాత 2022-23 నాటికి 2000 కి.మీ మేర కవచ్ సాంకేతికతను అమర్చుతామని రైల్వే శాఖ ప్రకటించింది.
కానీ, ఇప్పుడు వచ్చే ఏడాది చివరి నాటికి దిల్లీ-ముంబై, దిల్లీ-కోల్కతా మార్గాల్లో మాత్రమే ఈ సాంకేతికతను అమర్చవచ్చని భావిస్తున్నారు.
దీన్ని బట్టి భారత రైల్వేలో ఎప్పుడూ బిజీగా ఉండే మార్గాల్లో కూడా ఈ సాంకేతికతను అమర్చడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు.
ప్రమాదాలను పూర్తిగా నిరోధిస్తామంటూ ప్రకటనలు
ఒక్క రైలు ప్రమాదాన్ని కూడా సహించలేమంటూ రైల్వే శాఖ తరచుగా చెబుతుంటుంది. ఇదే తమ తొలి ప్రాధాన్యత అంశమని ప్రతీ రైల్వే మంత్రి అంటుంటారు. గత 15 ఏళ్లలో 10 మందికి పైగా మంత్రులు వచ్చినప్పటికీ ఈ ప్రమాదాలు మాత్రం ఆగలేదు.
ప్రమాదాల పరంగా చూసుకుంటే భారత్లో గత ప్రభుత్వాల రికార్డు ఘోరంగా ఉంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా అనేక పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయి. చర్చకు కూడా రాని రైలు ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి.
ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా దీని గురించి మాట్లాడారు.
‘‘రైల్వే ట్రాక్ల మీద పనిచేస్తూ ప్రతీ ఏడాది దాదాపు 500 మంది రైల్వే సిబ్బంది చనిపోతుంటారు. ఇదే కాకుండా ముంబైలో ప్రతీరోజూ రైలు పట్టాలు దాటుతుండగా మరణాలు నమోదు అవుతుంటాయి. భద్రతను పెంచడం రైల్వేశాఖ ప్రాధాన్యతగా మారాలి తప్ప రైళ్ల వేగాన్ని పెంచడం కాదు’’ అని ఆయన అన్నారు.
రైలు ప్రమాదాలను నివారించడంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నా ఆ దిశగా ఏ పురోగతి లేదని సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ దీక్షిత్ అన్నారు. అయితే, ఏ ప్రభుత్వం కూడా దీన్నిసీరియస్గా తీసుకున్నట్లు అనిపించడం లేదని, దీనిపై ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లుగా అనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
మోదీ హయాంలో జరిగిన పెద్ద రైలు ప్రమాదాలు
2022 జనవరి 13: రాజస్థాన్లోని బికనీర్ నుంచి అస్సాంలోని గువాహటికి వెళ్తున్న బికనీర్-గువాహటి ఎక్స్ప్రెస్ 12 బోగీలు పట్టాలు తప్పాయి.
పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగుడి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్లోని మోటార్ బయట పడి, దానిపై నుంచి రైలు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 9 మందికి పైగా మరణించారు.
2017 ఆగస్టు 19: ఉత్తరప్రదేశ్లోని ఖతౌలీలో ఉత్కల్ ఎక్స్ప్రెస్కు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. పురీ నుంచి హరిద్వార్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్కడ పట్టాలను తొలగించి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 23 మంది చనిపోయారు. దీని తర్వాత అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రాజీనామా చేశారు.
2017 జనవరి 22: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు.
2016 నవంబర్ 20: కాన్పుర్ దగ్గర్లోని ఫుఖ్రాయాలో పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 150 మంది చనిపోయారు.
2015 మార్చి 20: డెహ్రాడూన్-వారణాసి జనతా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 35 మంది మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
2014 జులై 24: హైదరాబాద్ సమీపంలోని ఒక క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సు, రైలు ఢీకొనడంతో 15 మంది విద్యార్థులు చనిపోయారు. మెదక్లోని మసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
2014 మే 26: ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలి చురేబ్ స్టేషన్ సమీపంలో గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రైలు వెళ్లి గూడ్సు రైలును ఢీకొనడంతో 25 మందికి పైగా చనిపోయారు. 50 మందికి పైగా గాయాల పాలయ్యారు.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















