ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు

హసన్ అబాద్ స్క్వేర్
ఫొటో క్యాప్షన్, హసన్ అబాద్ స్క్వేర్
చదివే సమయం: 3 నిమిషాలు

ఇరాన్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా.. ఇరాన్‌లో యూఎస్ పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ‘ట్రూత్‌ సోషల్’లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపారు.

కాగా తాాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.

ఇరాన్ మీడియాలో కథనాల ప్రకారం.. టెహ్రాన్‌ నగరం మధ్యలో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ రాజధానిలోని రిపబ్లిక్ ఏరియాపై క్షిపణి దాడులు జరిగినట్లుగా తమకు రిపోర్ట్స్ వచ్చాయని ఫార్స్ వార్తాసంస్థ పేర్కొంది.

టెహ్రాన్‌లోని జంహూరీ స్క్వేర్, హసన్ అబాద్ స్క్వేర్ ప్రాంతాల్లో పొగలు వస్తున్న చిత్రాలు షేర్ అవుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క్షిపణి దాడి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:15 గంటలకు ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయని జెరూసలేంలో బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్ హ్యూగో బచేగా తెలిపారు.

ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా ఛానల్ ఐఆర్ఐఎన్ఎన్ ధ్రువీకరించింది.

ఆ ఛానల్ ప్రసారాల్లో ఉదయం 8:30 గంటలకు (6:30GMT ) స్వల్పంగా ఆడియో అంతరాయం ఏర్పడింది. ప్రసారాలు తిరిగి ప్రారంభమైన తర్వాత, రాజధానిలోని పలు ప్రాంతాలలో పొగ మేఘాలు కమ్ముకున్నాయని, భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని రిపోర్ట్(టిక్కర్ ద్వారా) చేసింది

Tehran's Jomhouri Square

ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడానికి, యుద్ధాన్ని నివారించడానికి అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. ఈ చర్చలు వచ్చే వారం కూడా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

చర్చల్లో ఇరాన్ కొన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాత్రం నిన్న మాట్లాడుతూ.. చర్చలు జరుగుతున్న తీరుపై తాను అంత "ఉత్సాహంగా" లేనని పేర్కొన్నారు.

'అమెరికాకు ముందస్తు సమాచారం'

ఇరాన్‌పై దాడి విషయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా సమన్వయం చేసుకున్నట్లు ఇజ్రాయెల్, అమెరికా మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

అమెరికాతో సమన్వయం చేసుకున్న తర్వాతే ఇజ్రాయెల్ దాడి చేసిందని సీఎన్ఎన్ రిపోర్టు చేయగా, ఇజ్రాయెల్‌కు చెందిన వైనెట్ న్యూస్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దీనిపై ధృవీకరణ కోసం బీబీసీ అమెరికా అధికారులను సంప్రదించింది.

శనివారం ఉదయం ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ తన గగనతలాన్ని పౌర విమానాలకు మూసివేసినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు అనుబంధంగా ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ రిపోర్టుల ప్రకారం, ఇరాన్ కూడా తన గగనతలాన్నిమూసివేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)