బాబా రామ్ దేవ్: ఏనుగుపై యోగా చేస్తూ పడిపోయిన యోగా గురు - ప్రెస్ రివ్యూ

బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ

ఫొటో సోర్స్, Getty Images

పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ ఏనుగుపై యోగా చేస్తూ కింద పడిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయని వెలుగు పత్రిక ఓ కథనం ప్రచురించింది.

బాబా రామ్ దేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్‌లో కొత్తగా యోగా నేర్పించే ప్రయత్నం చేశారు.

అలంకరించి ఉన్న ఏనుగుపై పట్టా లేకుండా ఆసనాలు వేద్దామని ఆయన పైకి ఎక్కారు. పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో ఆయన వివరిస్తున్నారు.

ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబా యోగా భంగిమను కొనసాగించారు.

మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చైనాలోని ఒక థియేటర్‌లో క్రిమి నివారణ రసాయనాలు చల్లుతున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

'సినిమా హాళ్లు తెరవడం కుదరదు'

కరోనావైరస్ అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం వెసులుబాటు కల్పించినా.. యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అందువల్ల తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

బుధవారం విజయవాడలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ కార్యాలయంలో 13 జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హాళ్లు నడవాలంటే అదనంగా లక్షల్లో ఖర్చవుతుందని ప్రతినిధులు వెల్లడించారు.

కేంద్రం ప్రకటించిన 24 నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఒక్కో ప్రేక్షకుడిపై రూ.25 అదనపు భారం పడనుందని వివరించారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీల రద్దు, ఇతర రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు చేసినట్లయితే సినిమా హాళ్లు తెరవాలని నిర్ణయించారు.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JANASENA

దసరా తర్వాత 'వకీల్‌సాబ్‌' షూటింగ్‌కు పవన్

దసరా పండగ తర్వాత జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

కరోనా వైరస్ వ్యాప్తి నడుమ నిలిచిపోయిన పవన్‌ సినిమా 'వకీల్‌సాబ్‌' చిత్రీకరణ ఇప్పటికే పునః ప్రారంభమైంది.

ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న అంజలి, నివేదా థామస్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ కూడా దసరా పండగ తర్వాత షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

ఈ నెల చివరి నుంచి పవన్‌ కల్యాణ్‌తోపాటు, శ్రుతిహాసన్‌లపై సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.

సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

రజినీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రజినీకాంత్

రజనీకాంత్‌పై హైకోర్టు ఆగ్రహం!

తన కళ్యాణ మండపానికి చెన్నై కార్పొరేషన్‌ విధించిన ఆస్తి పన్నును తగ్గించేలా, ఎలాంటి అపరాధ రుసుము విధించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

కోర్టు విలువైన సమయా న్ని వృథా చేసేలా దాఖలైన ఈ పిటిషన్‌పై జరిమానా విధించాల్సివస్తుందని న్యాయమూర్తి తీవ్రంగా హెచ్చరించడంతో రజనీ తరఫు న్యాయవాది కేసును ఉపసంహరించుకున్నారు.

చెన్నై కోడంబాక్కంలో రజనీకాంత్‌కు కల్యాణమండపం ఉంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు దాన్ని మూసివేశారు.

ఈ నేపథ్యంలో ఆస్తిపన్నును తగ్గించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనితా సుమంత్‌ ఎదుట విచారణకు వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)