కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?

కరోనావైరస్

ఫొటో సోర్స్, SOPA IMAGES

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో ఇప్పటివరకు 60 లక్షలకుపైగా మంది కరోనావైరస్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 50 లక్షల మంది కోలుకున్నారు. మరో పది లక్షల మంది ఇంకా వైరస్‌తో పోరాడుతున్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల రెండో సెరో సర్వే నిర్వహించింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి వాస్తవంగా ఎలా ఉందో తెలుసుకునేందుకు దీన్ని చేపట్టారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ గత మూడు వారాలుగా ప్రతి ఆదివారం సోషల్ మీడియాలో జనాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు.

ఇటీవల ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ... ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ సాధించేందుకు భారత్ ఇంకా చాలా దూరంలో ఉందని హర్షవర్ధన్ అన్నారు.

‘‘ఐసీఎంఆర్ సెరో సర్వే నివేదిక ప్రజల్లో భ్రమలకు కారణమవుతోంది. జనాభాలో చాలా మందికి ఇప్పటికే కరోనా సోకిందనుకుని చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి వైఖరి ఉంటే, కరోనాను నిర్మూలించలేం కదా?’’ అని బెంగళూరుకు చెందిన సోమ్‌నాథ్ అనే వ్యక్తి హర్షవర్ధన్‌ను ట్విటర్‌లో ప్రశ్నించారు.

దీనికి హర్షవర్ధన్ బదులిస్తూ... ‘‘ఐసీఎంఆర్ ఇప్పటివరకూ రెండు సెరో సర్వేలు చేసింది. మొదటిది మేలో జరిగింది. అప్పుడు దేశంలో 0.73 శాతం మందికి కరోనా సోకిందని తెలిపింది. రెండో సర్వేను ఇటీవలే చేసింది. ఇందులో 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఈ సర్వే ఫలితాలు ఇప్పటికీ భారత్ హెర్డ్ ఇమ్యూనిటీకి చాలా దూరంలోనే ఉందని సూచించాయి. త్వరలోనే ఈ ఫలితాలు బయటకు వస్తాయి’’ అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హర్షవర్ధన్ ఈ వివరణ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హెర్డ్ ఇమ్యూనిటీ గురించి చాలా చర్చ జరిగింది.

దీని గురించిన సందేహాలకు ఆయన సమాధానం ఇచ్చారు.

‘‘జనాభాలో 60 నుంచి 70 శాతం మందికి రోగం సోకితే, హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. సెరో సర్వేని బట్టి చూస్తే, భారత్‌లో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. దేశంలో కరోనా సోకనివారు ఇంకా చాలా మంది ఉన్నారు. సెరో సర్వే ఫలితాలను జనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలసత్వం పనికిరాదు’’ అని ఆయన అన్నారు.

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే...

జనాభాలోని పెద్ద భాగానికి ఏదైనా ఒక అంటువ్యాధి వ్యాపించి, వారు కోలుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది.

వ్యాధి బారినపడి కోలుకున్నవారికి ఆ వ్యాధిపై పోరాడే రోగ నిరోధక శక్తి వచ్చేస్తుంది. ఫలితంగా వారి నుంచి మిగతా జనాలకు ఆ రోగం వ్యాపించే ముప్పు తగ్గుతుంది. అంటే, పరోక్షంగా మిగతావారికి కూడా వీరి ద్వారా రక్షణ లభిస్తుంది.

దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. మనుషుల గుంపును ఇంగ్లీష్‌లో హెర్డ్ అంటారు.

"గుంపులో ఎక్కువ మందికి వైరస్ నుంచి రోగనిరోధక శక్తి లభిస్తే, వారి ద్వారా అది మిగతావారికి వ్యాపించే ప్రమాదం తగ్గిపోతుంది. అంటే, ఒక పరిమితి తర్వాత వ్యాధి వ్యాప్తి ఆగిపోతుంది. కానీ, ఈ ప్రక్రియకు సమయం పడుతుంది’’ అని అమెరికా హార్ట్ అసోసియేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎడ్వర్డ్ శాంచెజ్ తన బ్లాగ్‌లో వివరించారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

సెరో సర్వేలో ఏం ఉంటుంది?

దేశంలో ఎంత జనాభా కరోనావైరస్ బారినపడి ఉండొచ్చన్నది అంచనా వేసేందుకు సెరో సర్వే నిర్వహించారు.

దిల్లీలో నిర్వహించిన తొలి సెరో సర్వేలో దిల్లీలో పావు వంతు జనాభాకు కరోనా సోకిందని, రెండో సెరో సర్వేలో 29 శాతం జనాభాకు సోకిందని వెల్లడైంది.

ఈ ఫలితాలను బట్టి చూస్తే, దిల్లీలో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పే పరిస్థితి లేదు.

సెరో సర్వేలో చాలా సార్లు తప్పుడు ఫలితాలు వస్తుంటాయని పబ్లిక్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ సర్వే ఫలితాలపై ఆధారపడి హెర్డ్ ఇమ్యూనిటీ గురించి అంచనా వేయలేమని ఆయన అన్నారు.

‘‘సెరో సర్వేలో జనాల శరీరంలో యాంటీ బాడీలు తయారయ్యాయా? లేదా? అన్న విషయాన్ని బట్టి ఎంత మంది కరోనా నుంచి కోలుకున్నారన్నది అంచనా వేస్తారు. కానీ, కరోనా యాంటీ బాడీలను పోలిన యాంటీ బాడీలే మరో రెండు, మూడు రోగాలకూ వస్తాయి. మామూలు జలుబు కూడా వీటిలో ఒకటి. ఆ యాంటీబాడీలను బట్టి వాళ్లందరినీ కరోనా కేసులుగా పరిగణించలేం’’ అని శ్రీనాథ్ రెడ్డి అన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE VIA GETTY IMAGS

వ్యాక్సీన్, హెర్డ్ ఇమ్యూనిటీ మధ్య తేడా ఏంటి?

ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినా, వ్యాక్సీన్ కోసం మనం వేచి చూడక తప్పదని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అంటున్నారు.

‘‘దిల్లీలో 60-70 శాతం జనానికి కరోనావైరస్ వ్యాపించి, హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందే అనుకోండి. రాయ్‌పుర్‌లో జనంలో 10 శాతానికి సోకిందనుకోండి. కానీ, ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు ఉంటాయిగా? అప్పుడెలా వ్యాప్తిని ఆపగలం’’ అని ఆయన అన్నారు.

నిజానికి హెర్డ్ ఇమ్యూనిటీ అనేది పరోక్ష రక్షణ.

ఎక్కువ మంది వైరస్‌ను వ్యాపింపచేయట్లేదు కాబట్టి, మిగతావారికి అది సోకట్లేదు.అంతేగానీ, ఒకవేళ వైరస్‌ను వ్యాపింపజేసేవారు చుట్టూ ఉంటే, అది సోకే ప్రమాదమూ ఉంటుంది.

వ్యాక్సీన్ అలా కాదు. అది తీసుకున్నవారికి ఇతరులతో సంబంధం లేకుండా వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. వేరేవారి పరిస్థితితో సంబంధం ఉండదు.

జనాభాలో ఎక్కువ భాగం వ్యాక్సీన్లు వేసుకున్నా, హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది.

అందుకే, వ్యాక్సీన్ వచ్చేదాకా జనాలు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని వైద్యులు అంటున్నారు. మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి మానవద్దని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)