ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్‌-కింది

అరబిక్ కు తత్వశాస్త్రాన్ని పరిచయం చేసినవారిలో ప్రముఖుడు అల్-కింది

ఫొటో సోర్స్, CREATIVE COMMONS

ఫొటో క్యాప్షన్, అరబిక్ కు తత్వశాస్త్రాన్ని పరిచయం చేసినవారిలో ప్రముఖుడు అల్-కింది

బీబీసీ రేడియో త్రీ స్పెషల్ సిరీస్‌ ‘గోల్డెన్‌ ఏజ్‌ ఆఫ్‌ ఇస్లాం’లో ప్రొఫెసర్‌ జేమ్స్‌ మాంట్‌గోమరీ అరబ్‌ తత్వవేత్త ‘అల్‌-కింది’ గురించి ప్రస్తావించారు. ఆయన జీవిత విశేషాలను వివరించారు.

‘అబూ యూసఫ్‌ ఇబన్‌ ఐజాక్‌ అల్‌-కింది’ తొమ్మిదవ శతాబ్దంలో ఇరాక్‌లో నివసించారు. ఈ కాలం మానవ నవీన ఆలోచనలు, సాంస్కృతిక ఉద్యమాలకు కీలకమైన కాలం. ఏథెన్స్, రోమ్‌లాంటి పెద్ద నగరాలతో బాగ్దాద్ పోటీ పడిన సమయం అది.

‘కింది’ అనే పేరు అరేబియాలోని కిందా వంశంతో సంబంధం ఉన్నట్లు చెబుతారు. కింది వంశం అల్‌-అష్‌అత్‌ బిన్‌ ఖైస్‌తో సంబంధం ఉన్నది. ప్రారంభ దశలో ఇస్లాం మతంలోకి మారిన వారిలో అల్-అష్అత్ బిన్ ఖైస్ ఒకరు. ఆయన ప్రవక్తకు స్నేహితుడు కూడా.

అల్-కింది తండ్రి కుఫా అనే ప్రాంతానికి అధిపతి. ఉన్నత కుటుంబంలో జన్మించాడు. అరబిక్ భాషలో తత్వ శాస్త్రానికి పునాది వేసినట్లు సూచించేలా ఆయనకు "అరబ్ తత్వవేత్త" అనే బిరుదు కూడా ఉంది.

ఇది ఆయనకు సరైన బిరుదు కూడా. ఎందుకంటే ‘అల్-కింది’కి ముందు అరబిక్‌లో తత్వశాస్త్రంలాంటివి ఏవీ లేవు. తత్వశాస్త్రంవైపు అల్-కింది మొగ్గుచూపడం ఆయన తోటివారికి చాలామందికి నచ్చలేదు.

క్రీ.శ. 850లో బాగ్దాద్‌లో ఒక పుస్తకాల మార్కెట్‌ దృశ్యం. అక్కడ ఎంతోమంది పుస్తక ప్రియులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ప్రసిద్ధ గద్యరచయిత, వేదాంత శాస్త్ర నిపుణుడు, అనేక పుస్తకాల రచయిత జాహిజ్ రాసిన ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం అక్కడ జరుగుతోంది.

ఆయన ప్రత్యర్ధులైన రచయితలు కూడా ఈ ‘అరేబియా గద్య రచనా పితామహుడు’ (ది ఫాదర్‌ ఆఫ్ అరేబియన్‌ ప్రోస్‌) గురించి తెలుసుకోడానికి అక్కడికి వచ్చారు.

అప్పట్లో అల్‌-హవ్యాన్‌ అనేది అబు ఉస్మాన్‌ ఒమర్‌ బకర్‌ అల్‌-కనాని అల్‌ బస్రి అల్‌ మరూఫ్‌ జహీజ్‌ ఆధారంగా రాసిన పుస్తకాలలో ప్రముఖమైనది. అంతకు ముందు రాసిన కితాబ్‌ అల్‌-బయాన్‌ వ-అల్‌-తబియ్యెన్‌, సాత్‌ ఖాండో అనే రెండు పుస్తకాలు మంచి పేరు సంపాదించాయి. అరబ్‌ శైలితోపాటు వారి ప్రత్యర్ధులు ఎన్నటికీ మరచిపోలేని పుస్తకాలు ఇవి.

అల్-హవ్యాన్‌ పుస్తకం బాగా ఫేమస్‌ అయ్యింది. ఆ రచన ముందు అరిస్టాటిల్‌ పుస్తకాలు కూడా తక్కువే అనిపిస్తాయి. కొన్నేళ్ల కిందటి వరకు అరిస్టాటిల్ రచనల అనువాదం తప్ప మరొకటి చదవాలనుకునేవారు లేరు. అరిస్టాటిల్ రాసిన అల్-ఖితాబా, మాబాద్ అల్-తబియా, అల్-మకులాట్‌ వంటి పుస్తకాలను అల్‌-కింది బాగా ఇష్టపడేవాడు. అరిస్టాటిల్ జ్ఞానాన్ని ఆరాధించేవాడు.

అరబ్ తత్వ శాస్త్రం

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఇప్పుడు జాహిజ్ కారణంగా పాఠకులు వేదాంత వివాదాలపై గొప్పగొప్ప పుస్తకాలు చదవాలనుకున్నారు. ఆ సమయంలో ఇరాక్‌లోని అనేకమంది మనసులలో ఆలోచనలను రేకెత్తించినవారిపై పుస్తకం రాస్తానని జాహిజ్‌ ప్రకటించారు.

"దేవుడు ఉత్తమ ప్రపంచాన్ని సృష్టించాడా?, అతను అన్నివ్యాధులు, బాధల నుండి విముక్తి కల్పించి, మంచి ప్రపంచాన్ని తయారు చేయగలడా? అతను మంచి ప్రపంచాన్ని చేయగలిగితే ఎందుకు చేయలేదు? భూతాలు ప్రేతాల ఉనికి ఉంది అంటే దేవుడు లేడని అర్ధమా?' ఇలాంటి సందేహాలతో పుస్తకం రాశారు.

జాహిజ్ ఈ పుస్తకం ప్రచురించినప్పుడు దానిపై ఆగ్రహం వ్యక్తమైంది. జాహిజ్‌ ఈ పుస్తకానికి కితాబ్‌ అల్‌ బుఖాలా అని పేరు పేట్టారు. అయితే దీనిపై అక్కడున్న ఒక యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. జాహిజ్‌కు దెయ్యాలతో సంబంధం ఉందని ఆరోపించాడు.

అనారోగ్యంతో ఉన్న ఈ వృద్దుడు ఏదేదో రాశాడని, ఇది ఎవరికీ అర్ధం కానిదని కొందరు ఆరోపించారు. ఈ పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టినప్పుడు కొందరు నవ్వుకున్నారు. కొందరు ఎగతాళి చేశారు.

అందులో సమకాలీనులైన అనేకమంది వివరాలున్నాయి. జాహిజ్‌ రాసిన సాహిత్యంలొ వర్ణించిన పాత్రల గురించి తెలుసుకోడానికి, గుర్తించడానికి చాలామంది పోటీపడ్డారు.

నిజజీవితంలో ఈ పాత్రలు ఎవరై ఉంటారా అని విచారించడం మొదలు పెట్టారు. అందులోని కొన్ని పంక్తులపై చాలామందికి ఆసక్తి కలిగింది. అందులో అరబ్‌ తత్వవేత్త అల్‌-కింది చెప్పిన కొన్ని మాటలున్నాయి. అల్‌-కింది ఇంట్లో అద్దెకు ఉండే మాబాద్‌ అనే ఒక మత పండితుడు చెప్పిన సుదీర్ఘమైన కథ ఉంది.

అరబ్ తత్వ శాస్త్రం

ఫొటో సోర్స్, STATE OF QATAR

ఒక సందర్భంలో మాబాద్ తన ఇంట్లో ఒక నెలపాటు ఇద్దరు అతిథులను అదనంగా ఉంచవలసి వచ్చింది. అల్-కింది ఆ నెలలో అద్దెను 33శాతం పెంచారు. ఇంట్లో అదనంగా ఉన్నది ఇద్దరు వ్యక్తులు కాబట్టి తార్కికంగా, కార్యకారణ సిద్ధాంతపరంగా ఆలోచిస్తే ఉన్నది ఒక నెలే అయినా దానివల్ల యజమానిపై భారం పడుతుందని వాదించారు అల్‌-కింది.

ఇద్దరు వ్యక్తులు అదనంగా ఉండటం వల్ల, స్థానికంగా ఉన్న కాలువల మీద దాని ప్రభావం పడుతుంది. తాగునీటి డిమాండ్‌ పెరుగుతుంది. తన ఆస్తి విలువ తగ్గి, భవిష్యత్తులో ఇక్కడ నివసించడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. దానివల్ల యజమాని ఆర్థికంగా వెనుకబడొచ్చు అంటారు అల్‌-కింది. ఆయన వాదన కూడా సరైనదే అనిపిస్తుంది.

అల్‌-కింది ఏం చెప్పారు?

“కోరికలను తగ్గించుకోవడం వల్ల సంతోషం పెరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది’’ అంటారు అల్‌-కింది. తన సిద్ధాంతాలను కొందరు వ్యంగ్యంగా విమర్శించడంపై అల్‌-కింది ఆగ్రహించేవారు.

ప్రభువులతో ఉన్న సంబంధాలు ఖలీఫేట్‌ ఆస్థానంలో అల్-కింది ప్రాముఖ్యత ఉండేది. 833నుండి 842 వరకు పాలించిన ఖలీఫా అల్-ముతాసిమ్, అరిస్టాటిల్ "ఫస్ట్‌ ఫిలాసఫీ" పై పనిచేసే బాధ్యతను అల్-కిందికి అప్పగించారు.

తత్వశాస్త్రంపై ఒక పుస్తకం రాయడానికి ఖలీఫా తీసుకున్న చర్య చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అతను సామ్రాజ్యంలో బలమైన వ్యక్తులలో ఒకరు. కానీ ఆయన రాయిస్తున్నది అందరి మనసులను ఛిన్నాభిన్నం చేసే పుస్తకం. బహుశా అల్-ముతాసిమ్ తన జీవితమంతా యుద్ధరంగంలో గడిపిన తరువాత తన మానసిక సామర్థ్యాలను పెంచుకోవాలనుకున్నారు.

దాడులు, యుద్ధాల కారణంగా అల్-కింది సృష్టించిన లైబ్రరీలోని మేథో సంపద భవిష్యత్తు తరాలకు అందలేదు.
ఫొటో క్యాప్షన్, దాడులు, యుద్ధాల కారణంగా అల్-కింది సృష్టించిన లైబ్రరీలోని మేథో సంపద భవిష్యత్తు తరాలకు అందలేదు.

అల్‌-కింది లైబ్రరీ-దాని దురవస్థలు

ఖలీఫా అల్-ముతావాకిల్ (847–861) పాలనలో అల్-కింది చెడు రోజులను కూడా చూశారు. ప్రభువులతో సంబంధాలు, సంపన్న కుటుంబంలో పుట్టడంలాంటివి కూడా ఆయనకు ఉపయోగపడలేదు. ఖలీపాల యుగంలో బాగ్దాద్‌లో అత్యంత పోటీతత్వం నెలకొని ఉండేది. ముఖ్యంగా శాస్త్రసాంకేతిక రంగంలో ఈ పోటీ ఎక్కువగా ఉండేది.

ఆ కాలపు ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు బాను మూసాకు ఖలీఫా నుంచి పూర్తి మద్దతు ఉండేది. అల్-కింది కి, మూసాకు పడేది కాదు. ఖలీఫా ద్వారా అల్-కింది ని బాధపెట్టాలని భావించాడు బాను మూసా. అల్‌-కింది నుంచి లైబ్రరీని సొంతం చేసుకున్నారు.

లైబ్రరీ సహకారం లేకపోవడంతో ఇతర పండితుల మాదిరిగానే అల్‌-కింది కూడా ఏమీ చేయలేకపోయేవారు. అయితే కొన్ని రోజులకే బాను ముసా సోదరులు ఖలీఫా చేతిలో శిక్షకు గురయ్యే రోజులు వచ్చాయి.

సామ్రాజ్యాన్ని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ఖలీఫాకు ఉంది. ఇరాక్‌లోని ప్రధాన నగరాలగుండా వెళ్ళే వివిధ కాలువలు, జలమార్గాల నిర్వహణ కూడా ఇందులో భాగం.

బాను మూసా సోదరులు కాలువ ప్రాజెక్టు కోసం అర్హత కలిగిన ఇంజనీర్‌ను నియమించారు.అయితే ప్లాన్‌ విఫలమైంది. దీంతో అల్-కింది తన స్నేహితుల సాయంతో వీటిని రక్షించగలిగారు.

దీంతో బానుమూసాపై ఖలీఫాకు కోపం వచ్చింది. కొద్దిరోజులకే అల్‌-కింది చేతికి లైబ్రరీ వచ్చింది.

అరబ్ తత్వ శాస్త్రం

ఫొటో సోర్స్, Getty Images

9వ శతాబ్దంలో, ఇరాక్‌లోని వివిధ విభాగాలకు చెందిన పండితులకు కొరత లేదు. అయినా అటువంటి యుగంలో కూడా అల్-కింది నైపుణ్యం, వివిధ రంగాలలో తెలివితేటలు అతనికి ప్రాముఖ్యతను, సామాజికంగా గౌరవాన్నితెచ్చాయి.

అల్-కింది గొప్ప తత్వవేత్త మాత్రమే కాదు, అతని సేవలు సైనిక రంగానికి కూడా అందుబాటులో ఉన్నాయి. గాజుతో ఆయన తయారు చేసిన వస్తువులు ఖలీఫా సైన్యంలో ఆయుధంగా ఉపయోగించారు.

వివిధ రకాల కత్తులు, ఇనుముతో అనేకరకాల ఆయుధాలు తయారు చేశారు అల్‌-కింది. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా సైన్యానికి నేర్పేవారు.

సముద్ర తరంగాలు, పిడుగులు, సముద్రంలో ఏర్పడే మెరుపులు, ఇతర వాతావరణ మార్పులకు గురించి కూడా అల్‌-కింది పరిశోధించారు. పెద్ద జంతువులు నుంచి చిన్న ఈగల వరకు, పరిమళాల నుంచి దూరపు కొలతల వరకు ఆయన పరిశోధనలు సాగాయి.

రాజకీయాలు, నీతిశాస్త్రంలాంటి వాటిపై కూడా పరిశోధనలు చేశారు. సోక్రటీస్ సంకలనాన్ని సిద్ధం చేశారు. దుఃఖాన్ని జయించడం, విచారాన్ని ఎదుర్కోవడంలాంటి అంశాలపై కూడా అల్‌-కింది రచనలు సాగించారాయన.

ఆత్మలపై వాదనలు, ఇస్లామేతర మతాలలో ఉన్న సిద్ధాంతాలను కూడా పరిశీలించారు అల్‌-కింది. ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, విశ్వోద్భవ సిద్ధాంతాలు, ఔషధాలు, గణితం, వృత్తాలు, సంగీతంపై కూడా ఆయనకు దృష్టి ఉండేది.

తర్కం, తత్వశాస్త్రాలను కూడా ఆయన తరచి చూశారు. తత్వశాస్త్రం, అరిస్టాటిల్‌ పుస్తకాలకు సవరణలు రాశారు. అందులో అరిస్టాటిల్‌ ‘ఫస్ట్‌ ఫిలాసఫీ’ మీద ఆయన రాసింది విస్తృతమైన రచన.

ఏ విధంగా చూసినా ఆయన రచనల జాబితా చాలా విలువైనది. కానీ అల్‌-కింది లైబ్రరీప్రపంచానికి మిగల్లేదు. ఆ మేధావి రచనలు అందుబాటులోకి లేకుండా పోయాయి.

అల్-కింది రచనల్లో అన్నింటికన్న ప్రముఖమైంది 'ఫస్ట్‌ ఫిలాసఫీ'. ఆ పుస్తకంలో మొదటి భాగం మాత్రమే భద్రంగా ఉంది. నాలుగు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో ఒక్కో భాగంలో ఒక్కో అంశంపై చర్చించారు.

మొదటి భాగమంతా తత్వశాస్త్రాన్ని సమర్ధిస్తూ సాగుతుంది. దాని ద్వారా అల్‌-కింది అరబిక్‌కు తత్వశాస్త్రాన్ని పరిచయం చేశాడని గుర్తుంచుకోవాలి. అప్పట్లో ఆయన పరిచయం చేసిన తత్వశాస్త్రానికి ప్రత్యర్ధులు కూడా ఉండేవారు.

రెండో భాగంలోని తాత్విక దృక్పథం ఈ ప్రపంచం శాశ్వతమైనది అన్న భావనను తిరస్కరించింది. మూడో భాగం ఏకధర్మపు నిజమైన అర్ధం గురించి చర్చిస్తుంది.

నాలుగో భాగం ఏకధర్మం గురించి మాట్లాడుతుంది. వాస్తవానికి దాని ఉనికిని వివరంగా వర్ణించలేము. ఎందుకంటే ఇది వర్ణించలేనిది. ఈ నాలుగు ఇతివృత్తాలలో అల్-కింది నాలుగు ప్రధాన తాత్విక దృక్పథాలను సూచిస్తాయి.

ఆయన తత్వ మీమాంసను ఒక ప్రత్యేకమైన భక్తిగా చూస్తారు. దీని ద్వారా విద్యావంతులైన ప్రభువులు తమ జీవితాలను సరిదిద్దుకొని స్వర్గంలోకి ప్రవేశిస్తారని నమ్ముతారు.

ఆయన చెప్పే ఇతివృత్తాలన్నీ ప్రధానంగా ఇస్లామిక్ భావజాలం చుట్టూ తిరుగుతాయి.

ఇస్లామిక్ ఫిలాసఫీ

ఫొటో సోర్స్, CREATIVE COMMONS

దీనికి ‘ఫస్ట్ ఫిలాసఫీ’ అనే పేరు ఎందుకు పెట్టారు?

ఈ పుస్తకం దేవుడి ఏకత్వాన్ని గురించి చెబుతుంది. దేవుడు ప్రతిదానికీ ముందు ఉంటాడు. అలాగే సంఖ్య 1 కూడా అన్నింటికంటే ముందుంటుంది. అసలు అల్-కింది సహచరులు 1ని ఒక సంఖ్యగా గుర్తించలేదు. అందుకే "ఫస్ట్‌ ఫిలాసఫి" భౌతికశాస్త్రం, నీతిశాస్త్రాలతో సహా అన్ని తాత్విక ఊహాగానాలకన్నా ముందు ఉంటుంది.

అల్-కింది కి సంఖ్యలపై చాలా ఆసక్తి ఉండేది. ఆయన తన అన్ని ఆలోచనలకు సంఖ్యలను ఉపయోగించాడు. ఆయన వాస్తవానికి సంఖ్యా శాస్త్రవేత్త (న్యూమరాలజిస్ట్). ఈ విశ్వం పాలిహైడ్రిక్ రూపాల నుండి ఉనికిలోకి వచ్చిందని నమ్ముతారు.

తాను కోరుకున్నట్లు జీవించిన వ్యక్తి అల్‌-కింది. ఆయన ఎప్పుడు మరణించాడో తెలియదు కానీ, కొన్ని ఆధారాలు ఆయన 873లో మృతి చెందినట్లు చెబుతున్నాయి.

అయితే ఆయన ఎందుకు మరణించారో తెలియదుగానీ, ఎలా మరణించారో తెలుసు. ఆయన మరణం ఏథెన్స్‌ జైలులో సోక్రటీసు మరణం అంత గొప్పది కావచ్చు. ఒక వైద్యుడిగా ఆయన తనను తానే చంపుకున్నాడని మాత్రం చెప్పక తప్పదు.

ఆయన మోకాలికి ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడింది. దానికి చీము పట్టింది. చీము అనేది ఒక ద్రవం కాబట్టి ద్రవంతోనే చికిత్స చేయాలనుకున్నారు అల్-కింది. ఈ శ్లేష్మాన్ని తగ్గించడానికి పాత మద్యం తాగారు. కానీ అది ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత తేనె తాగారు. అది కూడా ప్రభావం చూపలేదు.

మద్యం, తేనె ఉపయోగించడం ద్వారా ఆయన ఆశించిన సమతుల్యం సాధ్యం కాలేదు. దానికి విరుద్దంగా శ్లేష్మం ఎదురు దాడి చేసింది. ఆ దాడితో ఆయన మరణించారు.

ఆయన మరణం గురించి రాస్తున్నప్పుడు ఆయన పరిశోధనల్లో ఒకటైన “శ్లేష్మం లక్షణాలు-ఆకస్మిక మరణానికి కారణం’’ అనే శీర్షిక కళ్ల ముందు కదలాడుతుంది. ఇది ఆయన పరిశోధనల్లో ప్రముఖమైనది. కానీ చివరకు ఆయన దానితోనే మరణించడం విషాదం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)