ఇజ్రాయెల్ - గాజా: వెస్ట్ బ్యాంక్ చరిత్రేమిటి.. ఇజ్రాయెల్ దాన్ని ఎందుకు ఆక్రమించాలనుకుంటోంది

ఫొటో సోర్స్, Anadolu Agency/gettyimages
- రచయిత, పాల్ అడమ్స్
- హోదా, డిప్లమాటిక్ కరెస్పాండెంట్, బీబీసీ
ఇజ్రాయెల్, గాజా సంక్షోభం ముదిరి వెస్ట్ బ్యాంక్కూ హింస పాకింది. గాజా, వెస్ట్బ్యాంక్లపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాలను కలుపుకొనే దిశగా ఇజ్రాయెల్ పావులు కదపడంపై గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుయ్యాయి.
ఇంతకూ వెస్ట్ బ్యాంక్ చరిత్రేంటి? ఈ పరిణామాలు ఎటు దారితీయొచ్చు? బీబీసీ ప్రతినిధి, డిప్లమాటిక్ కరెస్పాండెంట్ పాల్ అడమ్స్ అందిస్తున్న కథనం.
కొండ ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్... సరిగ్గా ఇజ్రాయెల్కు, జోర్డాన్ నదికి మధ్య ఉంటుంది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న తీవ్రమైన విభేదాలకు కేంద్రబిందువు కూడా ఇదే.
1967 పశ్చిమాసియా యుద్ధంలో వెస్ట్ బ్యాంక్ను ఆక్రమించుకుంది ఇజ్రాయెల్.
అంతకు ముందు ఇది జోర్డాన్లో భాగంగా ఉండేది. దానికి ముందు బ్రిటిషర్లు, అంతకన్నా ముందు ఆటమన్ సామ్రాజ్యం దీన్ని పాలించాయి.


శతాబ్దాలుగా పాలస్తీనా అరబ్బుల ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం జనాభా సంఖ్య 30 లక్షల వరకు ఉంది. ఇందులో 86 శాతం పాలస్తీనీలు కాగా మిగతా 14 శాతం ఇజ్రాయెల్ పౌరులు.
వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ పౌరుల సంఖ్య 1970ల నుంచి పెరుగుతూ వస్తోంది. గత 20 ఏళ్లలో వారి జనాభా రెట్టింపైంది.
భవిష్యత్తులో పాలస్తీనా దేశం ఏర్పడితే ఇదే గుండెకాయ అని భావిస్తారు.
1967 యుద్ధం తరువాత ఇజ్రాయెల్ పౌరులు... అంటే సెటిలర్లు వెస్ట్ బ్యాంక్కు చేరుకోసాగారు.
ఒకనాటి అరబ్ నేలపై యూదు కుటుంబాలు నివాసాలు ఏర్పరచుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దీన్ని తమ పూర్వీకుల భూముల్లోకి తిరిగి అడుగుపెడుతున్నట్లుగా కొందరు యూదులు భావించారు. మొదట కొద్దిగా, 1980ల తరువాత భారీ సంఖ్యలో వారు ఇక్కడ స్థిరపడసాగారు.
తక్కువ కాలంలోనే వెస్ట్ బ్యాంక్ అంతటా యూదుల నివాసాలు వెలిశాయి.
భద్రత రీత్యా కొంత భాగం తమ అధీనంలో ఉండాలని ఇజ్రాయెల్ చెబుతోంది. తమ పూర్వీకుల నేలపై తిరిగి స్థిరపడేందుకు యూదులకు పూర్తి హక్కులున్నాయని ఆ దేశం వాదిస్తోంది.

కానీ దాదాపు అన్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఈ సెటిల్మెంట్లన్నీ చట్టవిరుద్ధమైనవే.
1967 నుంచి వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలెంలలో నివసించే యూదుల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది.
ఈనాటి వెస్ట్ బ్యాంక్ మ్యాప్ను చూస్తే సెటిల్మెంట్లతో నిండిపోయి కనిపిస్తుంది.
పాలస్తీనా పట్టణాల మధ్య కొన్ని, వాటి చుట్టూ కొన్ని ముక్కలు చెక్కలుగా ఈ సెటిల్మెంట్లు కనిపిస్తాయి.
సెటిలర్ల భద్రత కోసం కంచెలు, రోడ్లు, చెక్ పాయింట్లు ఉన్నాయి.
భవిష్యత్తు పాలస్తీనా దేశం ఇదే అయితే ఇది ఏ మాత్రం ఆచరణయోగ్యంగా ఉండదని చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
వెస్ట్ బ్యాంక్ను కలుపుకొంటే ఇజ్రాయెల్ పౌరులైన యూదు సెటిలర్లు అధికారికంగానే ఇజ్రాయెల్ భూభాగంలో నివసించినట్టవుతుంది.
గత శాంతి పథకాల్లో పేర్కొన్నట్టుగా కొన్ని సెటిల్మెంట్లకు కాకుండా.. 2020లో అన్నింటికీ రాజముద్ర వేయాలని ప్రయత్నించారు.
ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనల్డ్ ట్రంప్ గతంలో ఏ అమెరికన్ అధ్యక్షుడూ లేనంతగా ఇజ్రాయెల్కు అత్యంత అనుకూలంగా ఉన్నారు ట్రంప్.
"వైట్హౌస్లో మీ అంత గొప్ప స్నేహితుడిని ఇజ్రాయెల్ ఇంత వరకూ ఎన్నడూ చూడలేదు" అని గతంలో ట్రంప్ను ఉద్దేశించి బెంజామిన్ నెతన్యాహు అన్నారు.
2020 ప్రారంభంలో కొత్త శాంతి ఒప్పందాన్ని ప్రకటించారు ట్రంప్.
ఈ పథకం... గత ప్రతిపాదనల కంటే చాలా ఎక్కువగా మూడో వంతు వెస్ట్ బ్యాంక్ను ఇజ్రాయెల్కు కట్టబెట్టనుంది.
అది పోను మిగిలిన భూభాగం భవిష్యత్తులో ఏర్పడే పాలస్తీనా దేశానికి దక్కుతుందని ఒప్పందం చెబుతోంది.
అది కూడా నాలుగేళ్ల తరువాత... కొన్ని కఠినమైన షరతులకు లోబడి.

వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయెల్ అధికారాన్ని సుస్థిరం చేసిన నాయకునిగా చరిత్రలో నిలిచి పోవాలని నెతన్యాహు తహతహలాడారు.
అయితే, వెస్ట్ బ్యాంక్ను ఎప్పుడు, ఎలా కలుపుకోవాలనే దానిపై నెతన్యాహు, ఆయన మిత్ర పార్టీలు ఒక అంగీకారానికి రాలేదు.
దీనికొక కచ్చితమైన ప్రణాళికను వాళ్లు రూపొందించాల్సి ఉంది.
తాము పచ్చజెండా ఊపడానికి ముందు ఇజ్రాయెల్ నాయకులు ఏకాభిప్రాయానికి రావాలని అమెరికా కోరుకుంది.
భవిష్యత్తు పాలస్తీనా ప్రతిపాదనను నెతన్యాహు తేలిగ్గా కొట్టిపారేస్తారా అన్న విషయం కూడా వైట్హౌస్కు తెలియదు.
అత్యధిక యూదు సెటిలర్లు పాలస్తీనా దేశాన్ని కచ్చితంగా కోరుకోరు.
స్వతంత్ర పాలస్తీనా కోసం కలలు కంటున్న పాలస్తీనీయులు దీన్నొక ఎదురుదెబ్బగా.. లేదా చిట్టచివరి శరాఘాతంగా భావిస్తారు.
ఇవి కూడా చదవండి:
- ‘కశ్మీర్పై భారత్కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- గాజాలో జీవితం: ఎటు నుంచి ఏ తూటా వచ్చి ప్రాణం తీస్తుందో...
- గాజా: అక్కడ బతుకు నిత్య నరకం
- బెంజమిన్ నెతన్యాహు: అవినీతి కేసులో కోర్టు విచారణకు హాజరైన ప్రధాన మంత్రి
- 'జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ఒప్పుకునేదే లేదు'
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- జెరూసలెం: మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?
- జెరూసలెం.. ఎందుకంత పవిత్రం? ఎందుకంత వివాదాస్పదం?
- హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయా? ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి?
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










