జెరూసలెం: ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?

ఫొటో సోర్స్, AFP
జెరూసలెం.. అతి పురాతన చారిత్రక నగరం. ఇది మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది? ఈ క్రమాన్ని తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే.
కొన్ని దశాబ్దాలుగా వివాదాలకూ నిలయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నగరం జెరూసలెం.
వీటన్నింటికి మించి ఇది మూడు మతాలకు పవిత్ర ప్రదేశం.
జెరూసలెం తమ రాజధాని అని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. తాజాగా అమెరికా దీన్ని అధికారింగా గుర్తించేందుకు సిద్ధమైంది.
దీన్ని పలు ముస్లిం దేశాలతో పాటు, అమెరికా మిత్ర దేశాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
మూడు మతాలకు పవిత్రస్థలం
పురాతన జెరూసలెంలో మూడు మతాలకు చెందిన పవిత్ర కట్టడాలు ఉన్నాయి.
ఇందులో డోమ్ ఆఫ్ ది రాక్, అల్ అక్సా మసీదు ముస్లింలకు చెందినవి.
వెయిలింగ్ వాల్ యూదులకు పవిత్రమైనది.
హోలీ సపుల్కా చర్చిని క్రైస్తవులు పవిత్రంగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Lior Mizrahi/getty images
అతి పురాతనమైనది
- ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాలలో జెరూసలెం ఒకటి. దీనికి ఎంతో చరిత్ర ఉంది.
- ఈ నగరానికి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
- హిబ్రూ భాషలో దీన్ని 'యేరుసలాయిం' అంటున్నారు.
- అరబిక్లో 'అల్ కుద్' అని పిలుస్తున్నారు.
- కొన్ని శతాబ్దాల పాటు ఎన్నో దండయాత్రలకు, దాడులకు జెరూసలెం నిలయంగా ఉంది.
- ఈ నగరాన్నిజయించిన వారు ఎన్నోసార్లు ధ్వంసం చేశారు. పూర్తిగా నేలమట్టం చేశారు. అనేక సార్లు నిర్మించారు.
- జెరూసలెం మట్టిలోని ఒక్కో పొర ఒక్కో చరిత్రకు సాక్ష్యంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ నివసిస్తున్న భిన్న మతాల ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించే.. కథలు, కథనాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి.
కానీ వీరందరినీ కలిపి ఉంచే ఏకైక సూత్రం జెరూసలెం పవిత్రతే. క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, ఆర్మేనియన్లకు చెందిన ఎన్నో చారిత్రక కట్టడాలు జెరూసలెం పాత నగరంలో ఉన్నాయి.
ఇవన్నీ పక్కపక్కనే ఇరుగుపొరుగులా కనిపిస్తుంటాయి.

ఫొటో సోర్స్, THOMAS COEX/getty images
చర్చి
- హోలీ సపుల్కా చర్చి.. క్రైస్తవులకు అతి పవిత్రమైన కట్టడాలలో ఒకటి.
- బైబిల్ ప్రకారం ఏసు క్రీస్తు జీవిత చరిత్రకు ఈ ప్రాంతానికి విడదీయరాని సంబంధం ఉంది.
- క్రీస్తు శిలువ, మరణం, పునరుత్థానం వంటివి దీనితో ముడిపడి ఉన్నాయి.
- ఇక్కడి కల్వరి పర్వతంపై క్రీస్తును శిలువ వేసారన్నది క్రైస్తవుల విశ్వాసం.
- మరణం తరువాత ఈ చర్చిలోనే క్రీస్తు పునరుత్థానం చెందినట్లు క్రైస్తవులు నమ్ముతారు.
- ప్రపంచవ్యాప్తంగా లక్షలాది క్రైస్తవులు ప్రతి ఏడాది ఇక్కడి క్రీస్తు సమాధిని దర్శించుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అల్ అక్సా మసీదు
- జెరూసలెంలో ముస్లింలకు రెండు పవిత్రమైన కట్టడాలు ఉన్నాయి.
- ఒకటి డోమ్ ఆఫ్ ది రాక్. రెండోది అల్ అక్సా మసీదు.
- ముస్లింలకు అతి పవిత్రమైన మూడో కట్టడం అల్ అక్సా మసీదు.
- మక్కా నుంచి జెరూసలెం చేరుకున్న మహమ్మద్ ప్రవక్త ఈ మసీదులోనే ప్రార్థనలు చేశారనేది వారి విశ్వాసం.
- ఈ మసీదు కొన్ని అడుగుల దూరంలో డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది. ఇక్కడి నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి పోయాడని వారు నమ్ముతారు.
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో ప్రతి శుక్రవారం వేలాది ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేస్తారు.

ఫొటో సోర్స్, Chris McGrath/getty images
వెయిలింగ్ వాల్
- యూదులకు 'వెయిలింగ్ వాల్' ఎంతో పవిత్రమైనది.
- మౌంట్ మోరియా చుట్టూ ఉన్న నాలుగు గోడల్లో ఇది ఒకటి.
- రెండో యూదు మందిరాన్ని ఇక్కడే నిర్మించారు.
- మందిరంలోని అంతర్భాగాన్ని యూదులు 'అతి పవిత్ర ప్రదేశం' (హోలీ ఆఫ్ హోలీస్)గా భావిస్తారు.
- దేవుడు లోకాన్ని సృష్టించేటప్పుడు తొలి రాయిని ఈ గోడ వద్దే వేసినట్లు యూదులు నమ్ముతారు.
- దేవుడి ఆదేశం ప్రకారం అబ్రహాం తన కుమారుడు ఇసాక్ను ఈ గోడ వద్దే బలి ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు యూదులు విశ్వసిస్తారు.
- ముస్లింలు పవిత్రంగా భావించే డోమ్ ఆఫ్ ది రాక్ తమ మత కట్టడంగా చాలా మంది యూదులు భావిస్తారు. అదే అసలైన 'అతి పవిత్ర ప్రదేశం' (హోలీ ఆఫ్ హోలీస్)గా నమ్ముతున్నారు.
- వెయిలింగ్ వాల్కు దగ్గర్లోనే ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తారు. తమ వారసత్వాన్నిగుర్తు చేసుకుంటారు.
సంబంధిత కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








