కరోనావైరస్ ముంబయి: 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 8 మందికి కోవిడ్-19.. అంతా ఎలా బయటపడ్డారంటే..

పవార్ కుటుంబం

ఫొటో సోర్స్, janhavi moole

ఫొటో క్యాప్షన్, పవార్ కుటుంబం
    • రచయిత, జాహ్నవి మూలే,
    • హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి

“ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం భారిన పడ్డారు. ఒకరు దగ్గుతుంటే మరొకరు తుమ్ముతున్నారు. ఒక్కసారిగా చాలా భయమేసింది”అంటూ తన కుటుంబం మొత్తానికి ఎలా కరోనావైరస్ సోకిందో నెహాలి పవార్.. బీబీసీకి వివరించారు.

18 మంది ఉండే ఈ ఉమ్మడి కుటుంబం ముంబ‌యిలోని వాడాల పరిసరాల్లో నివసిస్తుంది. చుట్టుపక్కల అంతా గుడిసెలు, కిక్కిరిసిన వీధులు ఉన్నప్పటికీ వీరి ఇంట్లో తొమ్మిది గదులున్నాయి.

లాక్‌డౌన్‌ సమయంలో అందరిలానే ఈ కుటుంబంలోని వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. కొత్త వంటకాలు, ఆటలు, పాటలతో ఇల్లంతా సందడిగా మారింది. అయితే, నెల తిరిగేలోగా ఈ సంతోషానికి కరోనావైరస్‌తో ముగింపు పడింది. అదృష్టవశాత్తు పవార్ కుటుంబం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కింది.

తన భర్తతో నేహాలీ

ఫొటో సోర్స్, janhavi moole

ఫొటో క్యాప్షన్, తన భర్తతో నేహాలీ

‘ఒకే ఒక తప్పు.. కుటుంబం మొత్తానికి ముప్పు తెచ్చింది’

ఇంట్లో ఎంతో ఆహ్లాదకరంగా గడిపినప్పటికీ.. అవసరమైన జాగ్రత్తలు పాటించామని నెహాలి చెప్పుకొచ్చారు.

“ప్రభుత్వంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) ప్రకటించిన అన్ని నియమాలనూ పాటించాం. చేతులు కడుక్కోవడం, బయట నుంచి తెచ్చిన కూరగాయాలను, వస్తువులను శానిటైజ్ చేయడం. ఇంటిని రోజూ శుభ్రం చేసుకోవటం, వేడి నీళ్లు తాగటం.. ఇలా చేయాల్సిందంతా చేశాం.”

నెహాలి కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆమె వర్క్ ‌ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి నుంచే ప‌నిచేశారు. అయితే కొంద‌రు కుటుంబ స‌భ్యులు పని చేయ‌డానికి బయటకు వెళ్లాల్సివ‌చ్చేది. దీంతో ఇంట్లో ఎవ‌రికైనా వైర‌స్ సోకుతుందేమోనని ఆమె దిగులు ప‌డేవారు.

నెహాలి భర్త అమిత్ పవార్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఒక్కోసారి ఆయ‌న‌ వరుసగా రెండు మూడు రోజులు విధుల్లోనే ఉండాల్సి వచ్చేది. ఆమె బావ ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. మామగారు ఒక సామాజిక కార్యకర్త.

“మేం ఒకే ఒక్క తప్పు చేశాం. ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చే వారితో సామాజిక దూరం పాటించకపోవటం. మాకు ఆప్యాయతలు ఎక్కువ. అందరం సంతోషంగా ఉండేటప్పుడు.. ఒకరిని దూరం పెట్టలేం. మా ఆయన డ్యూటీకి వెళ్లి రోజుల త‌ర్వాత‌ వచ్చినా.. ఎప్ప‌టిలానే కలిసుండేవాళ్లం. సామాజిక దూరం పాటించే వాళ్లం కాదు.”

ఎప్పుడు, ఎలా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు? ఎవ‌రైనా అనారోగ్యం బారిన ప‌డితే ఎలా? లాంటి విష‌యాల్లో వారికి ఎలాంటి స్ప‌ష్ట‌తాలేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎప్పుడు, ఎలా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు? ఎవ‌రైనా అనారోగ్యం బారిన ప‌డితే ఎలా? లాంటి విష‌యాల్లో వారికి ఎలాంటి స్ప‌ష్ట‌తాలేదు

కరోనా సోకిందని ఎలా తెలిసింది?

ఏప్రిల్ 21న అమిత్ పవార్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక జ్వ‌రం ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే రెండు గంట‌ల‌కే అది త‌గ్గిపోయింది.

“కరోనావైర‌స్ సోకితే.. దగ్గు, తుమ్ములు వస్తాయని అనుకుంటాం.. కానీ ఆయనకు అవేమీ రాలేదు. అందుకే ఆయన జ్వరాన్ని అంత పట్టించుకోలేదు. చన్నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల జ్వ‌రం వ‌చ్చింద‌ని అనుకున్నాం” అని నెహాలి అన్నారు.

ఏప్రిల్ 25న వారి ఇంటి ప‌రిస‌రాల్లో కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల శిబిరం ఏర్పాటుచేశారు. దీంతో బ‌ట‌య‌కు త‌ర‌చూ వెళ్లే ఐదుగురు కుటుంబ స‌భ్యులూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని అనుకున్నారు. అయితే అమిత్ ద‌గ్గుతున్నార‌ని తెలియ‌డంతో ఆయ‌న‌కు వెంట‌నే వైద్యులు స్వాబ్ టెస్ట్ చేశారు.

నాలుగు రోజుల త‌ర్వాత‌, ఏప్రిల్ 28న‌, అమిత్ డ్యూటీకి వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఇంటి ద‌గ్గ‌ర‌కు కొంద‌రు వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించే పీపీఈ సూట్లు వేసుకొని వ‌చ్చారు. శానిటైజ‌ర్‌ను చ‌ల్ల‌డ‌మూ మొద‌లుపెట్టారు. అమిత్‌కు క‌రోనావైర‌స్ సోకిన‌ట్లు నిర్ధ‌ర‌ణ అయ్యింద‌ని వారే చెప్పారు. అంతేకాదు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని సూచించారు. ఆ మ‌రుస‌టి రోజే అమిత్‌ను వాడాలాలోని ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వ‌చ్చింది.

“నాకు ఆ స‌మ‌యంలో ఏం చేయాలో అర్థంకాలేదు. నేను దాదాపుగా కుప్ప‌కూలిపోయాను. మా ఆయ‌న్ను మ‌ళ్లీ చూడ‌గ‌లుగుతానా? మా కుటుంబంలో ఎంత మందికి క‌రోనావైర‌స్ సోకింది? ఒక్కోరోజు మా ఇంట్లో తెల్లవారుజామున 3.30 వ‌ర‌కు అంద‌రమూ చిన్న‌చిన్న గేమ్స్ ఆడుకునేవాళ్లం. అవ‌న్నీ మ‌ళ్లీ చూడ‌గ‌ల‌నా అనిపించింది” అని నెహాలి వివ‌రించారు.

18 మందిలో ఎనిమిది మందిని ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్‌లోని వార్డుకు త‌ర‌లించారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR

ఫొటో క్యాప్షన్, 18 మందిలో ఎనిమిది మందిని ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్‌లోని వార్డుకు త‌ర‌లించారు

టెస్టింగ్ స‌మ‌యంలో స‌మ‌స్య‌లు

ఇంట్లో మ‌రుగుదొడ్లు విడివిడిగా ఉండ‌టంతో.. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యేందుకు ప‌వార్ కుటుంబానికి అనుమ‌తిచ్చారు. అయితే త‌మ‌కు ఎప్పుడు, ఎలా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు? ఎవ‌రైనా అనారోగ్యం బారిన ప‌డితే ఎలా? ఇలాంటి విష‌యాల్లో వారికి ఎలాంటి స్ప‌ష్ట‌తాలేదు. త‌ర్వాత కొన్ని రోజుల‌కే ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అనారోగ్యం బారిన ప‌డ‌టం మొద‌లైంది.

“మేం రోజూ బీఎంసీకి ఫోన్ చేసేవాళ్లం. అయితే ప‌రీక్ష‌ల కిట్లు అయిపోయాయ‌ని వారు చెప్పేవారు. దీంతో మూడు రోజులు అలానే ఉండిపోయాం. అప్ప‌టికి ప్రైవేటు ఆసుప‌త్రులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవి కాదు. మా చేతిపై క్వారంటైన్ ముద్ర‌లు వేయ‌డంతో.. మేం బ‌య‌ట‌కు కూడా వెళ్ల‌లేక‌పోయేవాళ్లం. ఇంటికి వ‌చ్చి కూడా ఎవ‌రూ ప‌రీక్ష‌లు చేసేవారు కాదు.”

నెహాలి భ‌ర్త సోద‌రుల్లో ఒక‌రు క‌ళాకారుడు. ఆయ‌న త‌మ ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఫేస్‌బుక్ లైవ్ చేశారు. దీంతో సోష‌ల్ మీడియాతోపాటు స్థానిక టీవీ ఛానెళ్ల‌కూ స‌మాచారం అందింది. అనంత‌రం మే 2న ల‌క్ష‌ణాలు బ‌ట‌య‌కు క‌నిపించిన ఏడుగురికి బీఎంసీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. వీరంతా పాజిటివ్‌గా తేలారు. దీంతో వీరంద‌రినీ మిగ‌తా కుటుంబ స‌భ్యుల నుంచి విడిగా ఉంచారు.

కరోనా రోగి

ఫొటో సోర్స్, REUTERS

క్వారంటైన్ సమయం

18 మందిలో ఎనిమిది మందిని ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్‌ వార్డుకు త‌ర‌లించారు. మిగతా పది మందిని ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో నాలుగేళ్ల బాబుతో పాటు 15, 14 ఏళ్ల వ‌య‌సున్న‌ పిల్లలు కూడా ఉన్నారు. ఈ సమయంలో తల్లి దండ్రులకు దూరంగా ఉండటంతో తన మేనల్లుడు చాలా భయపడ్డాడని నెహాలి చెప్పారు.

“నాలుగేళ్ల బాబుకు ఇది పెద్ద షాక్ లాంటిది. తనను ఎవరూ హత్తుకోవటం లేదు. ఎవరూ ఎత్తుకోవటం లేదు. తన వస్తువులను కూడా పక్కకు తీసి పెట్టారు. నన్ను ఇప్పటికీ అడుగుతాడు.. చిన్నమ్మా, నేను నీ దగ్గరకు రానా? నిన్ను హత్తుకోనా? అని.”

కుటుంబంలో వయసు పైన‌పడ్డ వారికి ఇది చాలా కష్టమైన సమయం. “62 ఏళ్ల వ‌య‌సున్న‌ పెద్ద మామ గారిని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన్ను కృత్రిమ శ్వాస‌పై ఉంచారు. 60ఏళ్ల వ‌య‌సున్న మ‌రో మామ గారికి గుండె జ‌బ్బు ఉంది. ఆయన్ను ఐసీయూ వార్డులో ఉంచారు. వారిద్దరికీ మధుమేహం ఉంది.”

నెహాలిలో మాత్రం ఏ లక్షణాలు కనపడలేదు. మొదటి రెండు రోజులు తనను క్వారంటైన్ లో ఉంచారు. ఆ త‌ర్వాత‌ ఐసోలేషన్ వార్డుకు మార్చారు.

“రాత్రి మాత్ర‌మే క్వారంటైన్ కేంద్రానికి డాక్ట‌ర్లు వ‌చ్చేవారు. ఆ రోజు జ‌రిగినవ‌న్నీ.. అప్పుడే వారికి మ‌నం చెప్పాలి. అయితే న‌ర్సులు మాత్రం 24 గంట‌లూ ఐసోలేష‌న్ వార్డుల్లో ఉండేవారు. విడిగానే ఉంటున్న‌ప్పటికీ.. చుట్టుప‌క్క‌ల‌ ల‌క్ష‌ణాలు ఉండేవారు కూడా ఉన్నార‌ని చాలా భ‌యం వేసేది.”

“కోవిడ్‌-19కు ఎలాంటి ప్ర‌త్యేక‌మైన ఔష‌ధ‌మూ లేక‌పోవ‌డంతో మాకు విట‌మిన్లు, యాంటీబ‌యోటిక్ ఔష‌ధాలు ఇచ్చేవారు. భోజ‌నం విష‌యానికి వ‌చ్చేస‌రికి... శుభ్ర‌మైన మంచి ఆహారం ఇచ్చేవారు. అయితే మాకు ఎలాంటి రుచులూ తెలిసేవి కాదు. దీంతో ఎంతో ఏం తింటున్నామో కూడా తెలిసేదికాదు.”

“సెవెన్ హిల్స్ ఆసుప‌త్రిలో అయితే రోగులు బ‌య‌ట నుంచి భోజ‌నం తెచ్చుకునేందుకు అనుమ‌తించేవారు. దీంతో మా మామయ్యగారికి బంధువుల్లో ఒక‌రు భోజ‌నం తీసుకెళ్లేవారు. మా ఇంటికి ద‌గ్గ‌ర్లో ఉండే ఓ మ‌హిళ‌, దాద‌ర్‌లో ఉండే మా అమ్మ కూడా సాయం చేశారు. మాకు ప్ర‌తి అడుగులోనూ చాలా మంది సాయం చేశారు. మా వెన‌క అండ‌గా నిల‌బడ్డారు.”

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్‌-19 నేర్పిన పాఠాలు

“మే 7, బుద్ధ పూర్ణిమ‌నాడు శుభ‌వార్త విన్నాం. నా భ‌ర్త అమిత్‌కు న‌య‌మైంద‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప‌ది నుంచి 12 రోజుల్లో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు.. అంద‌రమూ ఇంటికి వ‌చ్చేశాం” అని నెహాలి చెప్పారు.

“ఇంటికి వ‌చ్చే అంద‌రికీ చ‌ప్ప‌ట్ల‌తో స్వాగతం ప‌లికారు. అయితే ఇదివ‌ర‌క‌టిలా జీవితం ఉండ‌బోద‌ని ప్ర‌తి ఒక్క‌ర‌మూ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లో కూడా భౌతిక దూరం త‌ప్ప‌కుండా పాటిస్తున్నాం.”

“బ‌య‌ట‌కువెళ్లే ప్ర‌తి ఒక్క‌రూ ఇత‌రుల నుంచి సామాజిక దూరం పాటిస్తున్నాం. ఇంట్లో మిగ‌త‌వాళ్లం కూడా ఒక‌రి నుంచి ఒక‌రం దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. మా వ‌స్తువులు, బ‌ట్ట‌లు ఇలా అన్నీ.. వేర్వేరుగా ఉంచుకుంటున్నాం.”

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)