నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 14 లక్షల వరకు ఉపకారవేతనం, ఎలా పొందాలంటే

ఫొటో సోర్స్, DELHI UNIVERSITY
- రచయిత, ఎ. కిశోర్ బాబు
- హోదా, బీబీసీ కోసం
భారత్లోని వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజన కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అమలు చేస్తోంది.
వీరికి పైసా కూడా ఖర్చు లేకుండా, విమాన ఛార్జీలు కూడా ఈ పథకం ద్వారా కల్పిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ అందిస్తున్న ఈ పథకం పేరు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్.
ఇలాంటి పథకం ఉన్నట్లు చాలా మంది విద్యార్థులకు తెలియదు. ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పథకం?
డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర డిగ్రీ కోర్సులు చదివిన తరువాత విద్యార్థులు తదుపరి పోస్టు గ్రాడ్యుయేషన్, ఎం.ఫిల్, పీహెచ్డీ లాంటి ఉన్నత విద్య కోర్సులు విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఉంటారు.
ఏమాత్రం భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజన సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం చాలా కష్టంతో కూడిన పని.
ఈ వర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఇది.
విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లడానికి విమాన ప్రయాణ ఖర్చుల మొదలు, అక్కడ ఫీజుల వరకు కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం రూపంలో అందిస్తుంది.
ఒక్కో విద్యార్థికి వారు ఉన్నత విద్య చదవడానికి వెళ్లే దేశాన్ని బట్టి కోర్సు ఫీజు, అలవెన్సులు కలిపి దాదాపు రూ.14 లక్షల వరకు ఇస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత ఇస్తారు?

విమాన ప్రయాణ చార్జీల నిబంధనలు ఏంటి?
ఈ స్కాలర్ షిప్కు ఎంపికైన విద్యార్థి ప్రయాణానికి సంబంధించిన విమాన ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
విద్యార్థి తన నివాస ప్రాంతం నుంచి తాను చదవబోయే విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతానికి అయ్యే రవాణా ఛార్జీలు చెల్లిస్తుంది.
అయితే, విద్యార్థి విమాన టికెట్లను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంస్థల ద్వారానే విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలి. అవి ఏమిటంటే 1. బల్మర్ లావ్రీ అండ్ కంపెనీ లిమిటెడ్ (బీఎల్సీఎల్), 2. అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ (ఏటీటీ), 3. ఐఆర్సీటీసీ.

ఫొటో సోర్స్, Getty Images
తిరుగు ప్రయాణం టికెట్లు కూడా ఇక్కడే బుక్ చేసుకోవాలా?
కాదు. కోర్సు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేయాల్సి వస్తే ఆ విద్యార్థి చదువుతున్న దేశంలో భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ)కి తెలియజేస్తే అక్కడి అధికారులు విద్యార్థికి తిరుగు ప్రయాణం టిక్కెట్లు బుక్ చేస్తారు.
ఎన్నేళ్లపాటు ఈ ఆర్థిక సాయం అందిస్తారు?
కోర్సును బట్టి కాలపరిమితి ఉంటుంది. పీహెచ్డీ కోర్సుకు 4 ఏళ్లు, మాస్టర్స్ డిగ్రీకి 3 ఏళ్లు, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చికి 2 ఏళ్లు సహయం అందిస్తారు.
ఏ విశ్వవిద్యాలయంలో చేరినా ఈ స్కాలర్షిప్పు ఇస్తారా?
ఏ దేశంలోనైనా అక్కడి ప్రభుత్వం గుర్తించిన సంస్థలు లేదా విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాల్లో క్యూఎస్ అధ్యయనంలో టాప్ 500 ర్యాంకులు సాధించిన విదేశీ విశ్వద్యాలయాలు, కళాశాలల్లో మాత్రమే సీటు పొందగలగాలి
ఎస్టీ విద్యార్థులు మాత్రం టాప్ 1000 ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వ విద్యాలయాల్లో దేనిలోనైనా సీటు సంపాదించుకోవచ్చు.
ఈ యూనివర్సీటీల జాబితా ఎక్కడ దొరకుతుంది?
https://www.topuniversities.com/university-rankings/world-university-rankings/2023
వెబ్సైట్లో లభిస్తుంది. ఇందులోని యూనివర్సిటీలకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థులు ప్రవేశం పొందాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ యూనివర్సిటీల్లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందా?
చేయదు. ఈ యూనివర్సిటీల్లో సీటు తెచ్చుకోవడమనేది పూర్తిగా ఆ విద్యార్థి సత్తాపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ యూనివర్సిటీలో ఆ విద్యార్థికి ప్రవేశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ నుంచి అన్ కండీషనల్ ఆఫర్ లెటర్ తప్పనిసరిగా పొంది ఉండాలి.
మార్కుల శాతం ఎంత ఉండాలి?
డిగ్రీ, ఇంజినీరింగ్ తత్సమాన కోర్సుల్లో విద్యార్థికి కనీసం 60 శాతానికి తక్కువ కాకుండా మార్కులు సాధించి ఉండాలి.
వయో పరిమితి ఎంత ఉండాలి?
ఆయా విద్యా సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీకి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్టీ విద్యార్థులకు వయో పరిమితి 38 సంవత్సరాలు.
కుటుంబ వార్షికాదాయ పరిమితి ఎంత ఉండాలి?
కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలకు మించి ఉండకూడదు.
షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులకు వార్షికాదాయ పరిమితి రూ.6 లక్షలకు మించి ఉండకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏటా ఎంత మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు?
షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులను 17 మందిని ఎంపిక చేస్తారు. షెడ్యూలు కులాల నుంచి 115 మందిని, డీనోటిఫైడ్ ట్రైబ్స్ నుంచి ఆరుగురిని, వ్యవసాయ కూలీలు, హస్తకళాకారుల కుటుంబాలకు చెందిన నలుగురు చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తారు.
విద్యార్థినులకు రిజర్వేషన్ ఉంటుందా?
మహిళల కోసం 30 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఒక వేళ వారు అంతమంది లేనప్పుడు ఆ సీట్లను ఇతర విద్యార్థులకు కేటాయిస్తారు.
విశ్వవిద్యాలయం నుంచి మధ్యలో మారొచ్చా?
కుదరదు. విద్యార్థి ఒకసారి ఒక విదేశీ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుంటే ఇక అందులోనే చదవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి దరఖాస్తు చేసుకున్నాక యూనివర్సిటీ మార్చుకోవడం సాధ్యం కాదు.
ష్యూరిటీ బాండ్లు ఇవ్వాల్సి ఉంటుందా?
ఈ పథకానికి ఎంపికైన విద్యార్థి నోటరీ నుంచి ఒక నాన్ జ్యూడీషియల్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. తాను ప్రభుత్వానికి వెల్లడించిన సమాచారం అంతా వాస్తవమేనని, ప్రభుత్వ నిబంధనలన్నీ పాటిస్తానని, తాను వీటికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు తనను డీఫాల్టర్గా ప్రకటించవచ్చని అందులో తెలియజేయాల్సి ఉంటుంది.
మరో ఇద్దరు వ్యక్తులు విద్యార్థి తరఫున ఒక్కోక్కరు రూ.50,000 ష్యూరిటీ బాండు ఇవ్వాల్సి ఉంటుంది.
విద్యార్థి డీఫాల్టర్ అని తేలితే ఈ సొమ్మును తాము ప్రభుత్వానికి చెల్లిస్తామని వారు ఈ బాండ్లో పేర్కొనాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ రాయబార కార్యాలయాల పాత్ర ఎలా ఉంటుంది?
విద్యార్థి ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో ప్రవేశం పొందితే, ఆ విశ్వ విద్యాలయానికి ట్యూషన్ ఫీజులు తదితరాలన్నీ కూడా ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయ అధికారులే నేరుగా చెల్లిస్తారు.
విద్యార్థుల ప్రగతిని కూడా ఇది పర్యవేక్షిస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఆ విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్టును తెప్పించుకుని పరిశీలిస్తుంటుంది.
ఒకవేళ విద్యార్థి నిర్దేశిత కాలంలో కోర్సు పూర్తి చేయలేకపోతే?
విద్యార్థి తప్పనిసరిగా నిర్ణీత గడువులోపు తన కోర్సును పూర్తి చేయాలి. లేకపోతే ఆ విద్యార్థిపై పెట్టిన ఖర్చును ప్రభుత్వం వసూలు చేస్తుంది.
అలాంటి విద్యార్థిని ఆ దేశం నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం వెంటనే భారత్కు పంపిస్తుంది.
విద్యార్థి డీఫాల్టర్గా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే?
విదేశాల్లో ఈ స్కాలర్ షిప్పు కింద చదివే విద్యార్థి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను ఉల్లంఘించినప్పుడు అతడ్ని డీఫాల్టర్గా ప్రకటించి ఆ దేశం నుంచి స్వదేశానికి పంపిస్తారు.
అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును 2.5 శాతం వడ్డీతో కలిపి చట్ట ప్రకారం వసూలు చేస్తారు.
ఆ విద్యార్థి సొమ్ము చెల్లించకపోతే అతడికి షూరిటీ ఇచ్చిన వారి నుంచి వసూలు చేస్తారు.
తప్పుడు సమాచారం ఇచ్చాడని తేలితే అప్పటి వరకు ఆ విద్యార్థిపైన పెట్టిన ఖర్చు మొత్తాన్ని 15 శాతం వడ్డీతో వసూలు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది?
- దరఖాస్తు సమయంలో కింది పత్రాలను ఇవ్వాలి.
- పదో తరగతి సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఫొటోలు
- స్కాన్ చేసిన సిగ్నేచర్
- ప్రస్తుత, శాశ్వత అడ్రస్
- డిగ్రీ మార్కుల పత్రం
- విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్కు సంబంధించిన తగు పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- ఐటీఆర్ పత్రం
విదేశీ ఉన్నత విద్య స్కాలర్ షిప్పుకు ఎంపికైనప్పుడు ఏమేం పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది?
- అటెస్టేషన్ ఫామ్
- వార్షికాదాయ పత్రం, సెల్ఫ్ డిక్లరేషన్
- పాస్పోర్ట్ కాపీ
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లోనే చేయాల్సి ఉంటుంది
ఎస్సీలు, వ్యవసాయ కూలీలు, హస్తకళాకారులు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు https://nosmsje.gov.in/(X(1)S(a2c5g2t4qgkns3zy5lijhb2l))/Login.aspx వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
షెడ్యూలు ట్రైబ్ విద్యార్థులు https://overseas.tribal.gov.in వెబ్ సైటులో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ఎప్పుడు ఆహ్వానిస్తారు?
నోటిఫికేషన్లను పైన తెలిపిన వెబ్సైట్లలో ప్రచురిస్తారు.
సాధారణంగా ప్రతీ విద్యా సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31వ తేదీ మధ్య దరఖాస్తులను ఆహ్వానిస్తారు. కొన్నిసార్లు ఈ తేదీల్లో మార్పు కూడా చోటు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














