జిమ్మీ నీషామ్: కుంగుబాటుతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నాడు కానీ, ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో న్యూజీలాండ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్కంఠభరితంగా సాగిన చరిత్రాత్మక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన న్యూజీలాండ్.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది.

టీ20 వరల్డ్‌ కప్‌లో న్యూజీలాండ్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఆ జట్టు క్రికెటర్ల సంబరాలు మిన్నంటాయి.

ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన చివరి బంతిని కివీస్ ఓపెనర్ డారిల్ మిచెల్ బౌండరీ దాటించి, జట్టుకు విజయాన్ని అందించడంతో న్యూజీలాండ్ క్రికెటర్లు కుర్చీల్లోంచి లేచి, గెంతులు వేస్తూ వేడుకలు చేసుకున్నారు.

కివీస్ జట్టులో క్రికెటర్లంతా గట్టిగట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపిస్తుండగా ఒకరు మాత్రం గ్రౌండ్ వైపు చూస్తూ అలానే కూర్చుకున్నారు. ఆయనే జిమ్మీ నీషామ్.

నిజానికి ఈ మ్యాచ్‌లో జిమ్మీ లేకపోయుంటే ఫలితాలు వేరేలా ఉండేవని స్పోర్ట్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

మలుపు తిప్పిన జిమ్మీ

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజీలాండ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది.

న్యూజీలాండ్‌ ముందు ఇంగ్లండ్ 167 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, 13 పరుగులకే కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్లకు స్కోర్ 26ను మించలేదు. పదో ఓవర్‌కు కూడా 60 దాటలేదు.

చివరి నాలుగు ఓవర్లలో న్యూజీలాండ్ 57 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఓవర్‌కు 14 రన్లకు తగ్గకుండా కొట్టాలి.

అలాంటి పరిస్థితుల్లో క్రిస్ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో జిమ్మీ చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. మొత్తంగా 17వ ఓవర్లో అతడు 23 పరుగులు రాబట్టాడు.

దీంతో అప్పటివరకు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉన్న మ్యాచ్.. కివీస్ వైపు తిరిగింది. ఆ తర్వాతి ఓవర్లో నిషామ్ అవుట్ అయినా, అప్పటికే ఫామ్‌లో ఉన్న డారిల్ న్యూజీలాండ్‌ను విజయ తీరాల వైపు నడిపించాడు.

ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన నిషామ్.. విజయోత్సవాల సమయంలో మౌనంగా ఎందుకు కుర్చీలోనే కూర్చున్నారు?

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది న్యూజీలాండ్ క్రికెటర్లలో నీషామ్‌ ఒకరు. మంచి ‘‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’’తో ట్విటర్‌లో ఆయన జోకులు పేలుస్తుంటారు.

కానీ అబుధాబిలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆయన చాలా భిన్నంగా కనిపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆయన ఒక అంగుళం కూడా కదలినట్లు కనిపించలేదు.

సీరియస్‌గా కూర్చుని ఆయన పిచ్‌వైపు చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘జిమ్మీ నీషామ్ అసలు కదలనే లేదు’’అంటూ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో కూడా ఆయన కదలకుండా కూర్చున్న ఫోటోను ట్వీట్‌చేసింది.

ఈ ట్వీట్‌కు నీషామ్ స్పందించారు. ‘‘అప్పుడే కథ ముగిసిందా? లేదు.. లేదు..’’ అంటూ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చారు.

బహుశా ఈ మ్యాచ్‌ను తన చేతుల మీదుగా ముగించాలని ఆయన భావించి ఉండొచ్చు. చివరి ఓవర్లలో అవుట్ కావడమూ ఆయన మౌనానికి కారణం కావొచ్చు.

నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

కుంగుబాటుతో క్రికెట్ మానేద్దామని అనుకున్నాడు..

వరల్డ్‌కప్ టీ-20 సెమీఫైనల్ హీరోగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న నీషామ్ 2017లో క్రికెట్‌నే వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. కెరియర్ ఒత్తిడి ఒకవైపు, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి మరోవైపు పెరగడంతో ఆయన కుంగుబాటు బారినపడ్డారు.

ఈ విషయాన్ని న్యూజీలాండ్ క్రికెట్ ప్లేయర్ అసోసియేషన్ హెడ్ హీథ్ మిల్స్.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు ఇదే విషయాన్ని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ట్వీట్‌చేశారు.

‘‘జిమ్మీ నీషామ్, 2017లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని అనుకున్నాడు. కానీ, నేడు న్యూజీలాండ్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టేందుకు కారణమైన కీలకమైన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఎప్పుడూ ఓటమికి తలవంచకూడదు. స్పోర్ట్స్ మనకు గురువులా ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది’’ అని లక్ష్మణ్ ట్వీట్‌ చేశారు.

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

‘‘నేను నీషామ్‌ను గమనించేవాణ్ని. మానసిక సమస్యలు అతణ్ని సతమతం చేస్తున్నట్లు అనిపించింది. దీనిపై అతడితో మాట్లాడటం మొదలుపెట్టాను. అయితే, కెరియర్, వ్యక్తిగత అంశాల ఒత్తిడి భరించలేని స్థాయికి చేరడంతో, క్రికెట్‌ను వదిలేద్దామని అతడు నిర్ణయించుకున్నాడు’’ అని హీథ్ చెప్పారు.

‘‘కాస్త విరామం తీసుకోమని అతడికి సూచించాను. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం కాదని చెప్పాను. నాలుగైదు వారాలు విరామం తీసుకుని ఆలోచించమన్నాను’’ అని వివరించారు.

అయితే, 2018 డిసెంబర్‌లో న్యూజీలాండ్ జట్టుతో పాటు, దేశీయ ఒటాగో జట్టులోనూ నీషామ్‌కు చోటు దక్కలేదు. ఆ పరిణామాల తర్వాత "క్రికెట్‌తో విసుగు చెందాను, మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాను" అని నీషామ్ మీడియాతో చెప్పాడు. దాంతో, అతడు క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేస్తాడేమో అని అందరూ భావించారు.

"క్రికెట్ ఆడే అవకాశం లేనప్పుడు, ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడమే నా ముందున్న ఏకైక మార్గం. ఎందుకంటే, నా ఇంటి కోసం తీసుకున్న అప్పులు తీర్చాలి కదా" అని నీషామ్ చెప్పాడు.

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత హాల్టర్‌ అనే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలో కమ్యూనికేషన్ అసిస్టెంట్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాడు. ఆవుల కదలికలను దూరం నుంచి పర్యవేక్షించేందుకు వినియోగించే ఎలక్ట్రానిక్ పట్టీలను ఆ సంస్థ తయారు చేస్తుంది.

ఒక దశలో క్రికెట్ పట్ల తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన నీషామ్, తర్వాత ఈ ఆటను వదిలేయకూడదన్న నిర్ణయానికి వచ్చాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

నేడు నీషామ్‌తోపాటు న్యూజీలాండ్ జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ లాంటి ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆదివారం జరగబోయే ఫైనల్స్‌లో న్యూజీలాండ్‌తో పాకిస్తాన్ లేదా ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, తొలిసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని కివీస్ గెలిచినట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)