భారత్- పాకిస్తాన్ క్రికెటర్లు ఆవేశంతో రెచ్చిపోయిన అయిదు సందర్భాలివే...

ఫొటో సోర్స్, MANAN VATSYAYANA
- రచయిత, పరాగ్ పాఠక్
- హోదా, బీబీసీ మరాఠీ
భారత్-పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం వీక్షకుల్లోనే కాదు, రెండు దేశాల క్రికెట్ ప్రేమికులు, ఇరు జట్ల ఆటగాళ్లలో కూడా భావోద్వేగాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి.
ఆటగాళ్లు మ్యాచ్ ఓడిపోకూడదనే ఒత్తిడిలో కఠినంగా వ్యవహరిస్తారు. అలాంటి పరిస్థితిలో నువ్వా-నేనా అనేంతలా ఫీల్డ్లో ఒకరితో ఒకరు వ్యవహరిస్తుంటారు. అలాంటి అయిదు సంఘటనలను చూద్దాం.

ఫొటో సోర్స్, GRAHAM CHADWICK
1. అమీర్ సోహైల్, వెంకటేశ్ ప్రసాద్ మధ్య గొడవ
1996 ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అమీర్ సోహైల్, భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ మధ్య ఈ గొడవ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 287 పరుగులు చేసింది.
దీనికి సమాధానంగా ఓపెనింగ్కి వచ్చిన అమీర్ సోహైల్, సయీద్ అన్వర్లు తొలి వికెట్కు 84 పరుగుల శుభారంభాన్ని ఇచ్చారు.
సోహైల్ చక్కటి ఫామ్లో ఉండగా, 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వెంకటేష్ ప్రసాద్ వేసిన బంతిని సోహైల్ బౌండరీగా మలిచాడు. బంతి బౌండరీని చేరుకున్నప్పుడు, సోహైల్, వెంకటేశ్ ప్రసాద్కు దగ్గరగా వెళ్లి తన బ్యాట్ను బౌండరీ వైపు చూపాడు.

ఫొటో సోర్స్, HAMISH BLAIR
సోహైల్ బహుశా తన దూకుడైన బ్యాటింగ్ శైలి గురించి ప్రసాద్కి సందేశం ఇవ్వడానికి ప్రయత్నించి ఉంటాడు. అయితే ఇది వెంకటేశ్ ప్రసాద్ను బాధించింది. తర్వాతి బంతికే ప్రసాద్ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. సోహైల్ ఆ బంతిని మిడ్-వికెట్లో ఆడటానికి ప్రయత్నించగా, బంతి ఆఫ్-స్టంప్ని తాకింది.
సోహైల్ను ఔట్ చేసిన తర్వాత ప్రసాద్ అతనికి పెవిలియన్ వైపు దారి చూపించాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య చెలరేగిన ఈ గొడవ, కొన్నాళ్లు చర్చనీయాంశమైంది. 25 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
2. షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్లతో గౌతమ్ గంభీర్ వాగ్వాదం
భారత క్రికెట్లో గంభీర్కు దూకుడైన ఆటగాడిగా పేరుంది. ఆయన 2007లో కాన్పూర్లో పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో ఘర్షణ పడ్డాడు.
వికెట్ల నడము పరుగు తీయడానికి పరిగెడుతున్నప్పుడు, షాహిద్ అఫ్రిదిని గంభీర్ ఢీ కొన్నాడు. తనను పరుగు పూర్తి చేయకుండా అఫ్రిది ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఆరోపణలను అఫ్రిది ఖండించాడు. దీని తర్వాత ఇద్దరు క్రికెటర్లు గొడవకు దిగారు. అంపైర్ ఇద్దరు ఆటగాళ్లను శాంతింపజేశారు.
దీని తర్వాత, 2010లో దంబుల్లాలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా, గంభీర్ పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సయీద్ అజ్మల్ వేసిన బంతికి గౌతమ్ గంభీర్ను ఔట్గా పరిగణించాలని కమ్రాన్ అక్మల్ చేసిన విజ్ఞప్తిని అంపైర్ బిల్లీ బౌడెన్ అంగీకరించలేదు.
అనంతరం డ్రింక్స్ బ్రేక్ సమయంలో గంభీర్, అక్మల్ మధ్య వివాదం చెలరేగింది. అయితే, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జోక్యం చేసుకుని వారించడంతో ఘర్షణ సద్దుమణిగింది.

ఫొటో సోర్స్, Getty Images
3. హర్భజన్ సింగ్, షోయబ్ అఖ్తర్ల ఘర్షణ
2010 దంబుల్లాలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో హర్భజన్ సింగ్, షోయబ్ అఖ్తర్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 268 పరుగులు చేయాల్సివుంది. చివరి నాలుగు ఓవర్లలో టీమిండియాకు 36 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
47వ ఓవర్లో షోయబ్ అఖ్తర్ బౌలింగ్కు వచ్చాడు. అఖ్తర్ విసిరిన రెండో బంతిని, హర్భజన్ సింగ్ సిక్సర్గా మలిచాడు. ఈ సిక్స్ తర్వాత, ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ కనిపించారు.
దీని తర్వాత మహ్మద్ అమీర్ వేసిన బంతిని హర్భజన్ సింగ్ సిక్సర్ కొట్టి భారత జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ సిక్సర్ తర్వాత, షోయబ్ అఖ్తర్ వైపు చూస్తూనే హర్భజన్ సింగ్ విజయాన్ని ఆస్వాదించడం ప్రారంభించాడు. ఇక చాలు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లంటూ షోయబ్ సైగ చేశాడు. దీన్ని యూట్యూబ్లో కూడా చూడవచ్చు.

ఫొటో సోర్స్, SCOTT BARBOUR
4. షోయబ్ అఖ్తర్తో సెహ్వాగ్ అలా అన్నాడా?
భారత క్రికెట్ జట్టులో అత్యంత దూకుడుగా ఉండే బ్యాట్స్మెన్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. అతను ఒక టీవీ కార్యక్రమంలో షోయబ్ అక్తర్తో తన వివాదానికి సంబంధించిన కథను చెప్పాడు.
ఈ కథనం ప్రకారం, షోయబ్ అఖ్తర్ 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తూ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ల భాగస్వామ్యాన్ని విడగొట్టాలనుకున్నాడు.
సెహ్వాగ్ ప్రకారం.. అప్పుడు నా వ్యక్తిగత స్కోరు 200 సమీపిస్తుండగా, షోయబ్ హుక్ షాట్లు ఆడమని పదే పదే బౌన్సర్లను విసిరాడు. "అతను నన్ను రెచ్చగొట్టాలనుకున్నాడు. అలాంటి పరిస్థితిలో, నేను అతనితో అవతలి వైపున ఉన్న సచిన్ టెండూల్కర్ను చూపిస్తూ, ''నాన్ స్ట్రైకింగ్లో 'తేరా బాప్ (నీ అయ్య) ఉన్నాడు. ఆయనను అడుగు హుక్ షాట్ ఆడమని'' అని చెప్పా. ఆ మరుసటి ఓవర్లోనే షోయబ్ వేసిన బౌన్సర్ను లిటిల్ మాస్టర్ సిక్స్గా మలిచాడు. నేను వెంటనే అఖ్తర్తో ''బేటా బేటా హోతా హై, బాప్ బాప్ హోతా హై' అని చెప్పాను" అని సెహ్వాగ్ చెప్పాడు.
సెహ్వాగ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఏడాదిన్నర క్రితం షోయబ్ అఖ్తర్, అలాంటి ఘటనేమీ జరగలేదని కొట్టిపారేశాడు. ''సెహ్వాగ్ ఒక ఫన్నీ కథ చెప్పాడు. సెహ్వాగ్ నిజంగా నాతో అలా అని ఉంటే, నేను అతడిని ఫీల్డ్లోనే కొట్టేవాడిని'' అని అన్నాడు.
షోయబ్ చెప్పింది నిజమే అయిఉండవచ్చు. ఎందుకంటే, సెహ్వాగ్ పాకిస్తాన్ మీద త్రిపుల్ సెంచరీ చేసినప్పుడు సచిన్ 194 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ ఇన్నింగ్స్లో సచిన్ ఒక్క సిక్సర్ కూడా కొట్ట లేదు.

ఫొటో సోర్స్, FAIRFAX MEDIA ARCHIVES
5. కిరణ్ మోరే అపీళ్లతో జావేద్ మియాందాద్ చిందులు
జావేద్ మియాందాద్-కిరణ్ మోరే వివాదం భారత్-పాక్ క్రికెట్లో ఎక్కువగా మాట్లాడుకునే వివాదాల్లో ఒకటి.
1992 ప్రపంచ కప్ వేదికగా సిడ్నీలో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 54 నాటౌట్, కపిల్ దేవ్ 26 బంతుల్లో 35 పరుగులు చేశారు.
ఆ తర్వాత పాక్ 17 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. దీని తర్వాత అమీర్ సోహైల్, జావేద్ మియాందాద్ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. పాకిస్తాన్ స్కోరు రెండు వికెట్లకు 85 పరుగులు ఉన్నప్పుడు ఈ వివాదం చెలరేగింది.
సచిన్ టెండూల్కర్ బౌలింగ్లో ఆడాలని మియాందాద్ ప్రయత్నించినప్పుడు, ఆ బంతి అందుకున్న వికెట్ కీపర్ కిరణ్ మోరే అవుట్కు అపీల్ చేశాడు. మియాందాద్ తర్వాత అదే ఓవర్లో పరుగు కోసం ముందుకు వెళ్లినపుడు స్టంప్స్ పడగొట్టిన మోరే తర్వాత రనౌట్ కోసం అపీల్ చేశాడు. అప్పటికే క్రీజులోకి వచ్చిన మియాందాద్ మోరే పదే పదే అపీల్ చేయడంతో చిరాకు పడ్డాడు. అతడిని అనుకరిస్తూ గంతులు వేశాడు.
భారత బౌలర్లు నిర్ణీత వ్యవధిలో వికెట్లు తీయడం ద్వారా ఈ మ్యాచ్లో విజయం సాధించారు. అయితే మియాందాద్, మోరే మధ్య వివాదం ఈ మ్యాచ్ విజయాని కంటే ఎక్కువ చర్చకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్: ‘దుర్గాపూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని గుర్తించాం’ - పోలీసుల ప్రకటన
- ఆర్యన్ ఖాన్ కస్టడీ అక్టోబరు 30 వరకు పొడిగింపు
- ఫేస్బుక్ ఇక కొత్త ప్రపంచాన్ని చూపించనుందా? ఏమిటీ మెటావర్స్
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- వైఎస్ జగన్: ‘విపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు’
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








