ఆస్ట్రేలియా: అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?

ఆస్ట్రేలియా: మహేశ్ పాట్రిక్, ఎమిట్జా అడవిలో తప్పిపోయి చివరకు దొరికారు

ఫొటో సోర్స్, NT POLICE

ఫొటో క్యాప్షన్, మహేశ్ పాట్రిక్, ఎమిట్జా

అడవిలో తప్పి పోయిన ఓ జంట, దాదాపు అయిదు రోజులపాటు నీళ్లు లేకుండా గడపగలిగిందని, ఇదొక అద్భుతం లాగా ఉందని ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. ఆ దేశంలోని నార్తర్న్‌ టెరిటరీ ప్రాంతంలో ఈ జంట విహార యాత్రకు వెళ్లి తర్వాత ఆచూకీ లేకుండా పోయింది.

పధ్నాలుగేళ్ల మహేశ్ పాట్రిక్, 21 సంవత్సరాల షాన్ ఎమిట్జా లు ఎలైస్ స్ప్రింగ్ ప్రాంతంలోని వేరు వేరు ప్రదేశాలలో దొరికారు. శుక్రవారం మహేశ్‌ను, శనివారం ఎమిట్జా ను గుర్తించారు.

వీళ్లను గుర్తించేటప్పటికే పూర్తిగా డీహైడ్రేట్ అయిన స్థితిలో, నీరసంగా కనిపించారని, అవి తప్ప మిగతా సమస్యలు ఏమీ లేవని పోలీసులు వెల్లడించారు.

ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉంటాయి.

అసలేం జరిగింది?

నార్తర్న్ టెరిటరీ ప్రాంతంలోని ఓ మారుమూల నిర్జన ప్రాంతానికి వెళ్లిన ఈ జంటకు, తమ వాహనం ఇసుకలో కూరుకుపోవడంతో సమస్య మొదలైంది.

కారును బయటకు తీయలేకపోయిన ఆ ఇద్దరు ఆ రాత్రంతా అక్కడే గడిపారు. మరుసటి రోజు మంచి నీటిని వెతుక్కుంటూ బయలుదేరారు.

సుమారు 5 కిలో మీటర్లు నడిచి, ఓ కొండ ప్రాంతానికి చేరుకున్న తర్వాత, తాము అడవిలో దారి తప్పిపోయినట్లు వారికి అర్ధమైంది.

''సమీంలోని శాండోవర్ హైవేకు వెళదామని వారు బయలుదేరారు. తాము నడుస్తున్న బాట హైవే వరకు వెళుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు'' అని నార్తర్న్ టెరిటరీ పోలీసులు వెల్లడించారు.

సాయంత్రానికి ఎలైస్ స్ప్రింగ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్మాన్స్‌బర్గ్‌కు తిరిగి చేరుకోవాల్సి ఉంది. కానీ, వారు రాకపోయేసరికి ఎక్కడో తప్పిపోయినట్లు అర్ధమైందని అధికారులు వెల్లడించారు.

నీళ్లు ఉన్న ఓ కొండ దగ్గర వీళ్లు రాత్రి పూట క్యాంప్ చేసి ఉంటారని పోలీసులు భావించారు. "వాళ్లు మంగళవారం నాడు చివరిసారిగా మంచి నీళ్లు తాగి ఉంటారని మేం అనుకుంటున్నాం'' అని యాక్టింగ్ కమాండర్ కిర్‌స్టన్ ఎంగెల్స్ అన్నారు.

అడవిలో నడుస్తూ వెళ్లిన వారిద్దరూ, తెలియని కారణాలతో విడిపోయి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారని పోలీసులు వెల్లడించారు.

35 కిలోమీటర్లు నడిచిన తర్వాత మహేశ్ ఒక ఇనుప కంచె కనిపించింది. దాన్ని ఆధారంగా చేసుకుని మరో రెండో కిలోమీటర్లు నడిచారు. చివరకు శుక్రవారం నాడు స్థానికులు ఆయనను గుర్తించారు. "స్థానికులు మహేశ్‌ను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు'' అని ఏంగెల్స్ అన్నారు.

మహేశ్ పాట్రిక్ దొరికిన తర్వాత ఎమిట్జా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మహేశ్ తనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులు అందించారు.

ఆస్ట్రేలియా కొన్ని మారుమూల అటవీ ప్రాంతాలలో మంచినీళ్లు కూడా దొరకవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా కొన్ని మారుమూల అటవీ ప్రాంతాలలో మంచినీళ్లు కూడా దొరకవు

జాగ్రత్తలు పాటించకపోతే...

"వారు బతికి ఉండటం అదృష్టమే. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అందరికీ తెలుసు'' అని కమాండింగ్ ఆఫీసర్ ఏంగెల్స్ వ్యాఖ్యానించారు.

మారుమూల, నిర్జన ప్రదేశాలకు వెళ్లి ఎవరైనా ఇబ్బందుల్లో పడితే వారు కారులోనే ఉండాలని పోలీసులు సూచించారు. దీనివల్ల అందులోని వ్యక్తులకు భద్రతతోపాటు, హెలీకాప్టర్ సెర్చ్ ఆపరేషన్‌కు ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియా పోలీసులు చెప్పారు.

ఇలా సుదూర అటవీ ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్లే వారు ఒక్కొక్కరికి రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీళ్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కూడా పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)