జమ్మూకశ్మీర్: లష్కరే తోయిబా మిలిటెంట్ అనే అనుమానంతో అరెస్టయిన వ్యక్తికి బీజేపీకి ఏమిటి సంబంధం?

ఫొటో సోర్స్, J&K Police
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ కోసం
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో అనుమానిత లష్కరే తోయిబా మిలిటెంట్ తాలిబ్ హుస్సేన్ షాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతడు బీజేపీ కార్యకర్త అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాలిబ్ను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూలోని రేయాసి ప్రాంతంలో స్థానికులు అతడిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారని చెప్పారు.
తాలిబ్తో బీజేపీకి సంబంధముందనే వార్తలను జమ్మూకశ్మీర్ బీజేపీ విభాగం అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకుర్ ఖండించారు. అయితే, ఆన్లైన్లో తాలిబ్.. బీజేపీ సభ్యత్వం తీసుకుని ఉండొచ్చనే విషయాన్ని ఆయన అంగీకరించారు.
మరోవైపు రెండు నెలల క్రితం తాలిబ్ను జమ్మూ సోషల్ మీడియా, ఐటీ విభాగం ఇన్ఛార్జిగా చేశారని, ఆ తర్వాత ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారని జమ్మూకశ్మీర్ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బషీర్ చెప్పారు.
తాలిబ్తోపాటు కశ్మీర్లోని పుల్వామా జిల్లాకు చెందిన ఫాజిల్ డార్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఫాజిల్ కూడా మిలిటెంటేనని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
తాలిబ్, ఫాజిల్..
తాలిబ్, ఫాజిల్ల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాలిబ్ దగ్గర ఎక్కువ ఆయుధాలు దొరికినట్లు చెప్పారు.
ఆరు బాంబులు, మూడు మ్యాగజైన్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, 30 బోర్ పిస్టల్స్, ఒక యూబిల్ లాంచర్, మూడు యూజీబీఎల్ గ్రెనేడ్లు, 75 రౌండ్ల ఏకే-47 తూటాలు, ఒక ఐఈడీను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాలిబ్, ఫాజిల్లను పట్టించిన వారికి రూ.2 లక్షలు చొప్పున నజరానా ఇస్తామని జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఇటీవల ప్రకటించారు.
తాలిబ్, ఫాజిల్ల అరెస్టుపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా స్పందించారు. ‘‘ఇద్దరు కరడుగట్టిన మిలిటెంట్లను ధైర్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన రేయాసి గ్రామస్థుల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను. ఉగ్రవాదానికి ముగింపు ఎంతో దూరంలో లేదు. సామాన్యులు ఇలా ధైర్యంగా వ్యవహరిస్తే, త్వరలో దానికి తెరపడుతుంది. గ్రామస్థుల కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది’’అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాజౌరీలో మూడు బాంబు దాడుల్లో తాలిబ్ సూత్రధారిగా ఉన్నాడని రాజౌరీ ఎస్పీ అసలమ్ చౌధరి బీబీసీతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తాలిబ్ను పట్టించినవారికి నజరానా ఇస్తామని ఆరు రోజుల క్రితమే ట్విటర్ వేదికగా జమ్మూ ఏడీజీపీ ప్రకటించారు.

ఫొటో సోర్స్, ANI
తాలిబ్ ఎవరు?
రెండు నెలల క్రితం జమ్మూ సోషల్ మీడియా ఐటీ విభాగం ఇన్ఛార్జిగా తాలిబ్ హుస్సేన్ను జమ్మూకశ్మీర్ బీజేపీ మైనారిటీ మోర్చా నియమించింది.
తాలిబ్ సొంత ఊరు రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామం. బీజేపీలో చేరే ముందు అతడు వడ్రంగి కార్మికుడిగా పనిచేసేవాడు.
తాలిబ్కు ముగ్గురు సోదరులు ఉన్నారు. వీరిలో తాలిబ్ పెద్దవాడని అతడి కుటుంబం చెబుతోంది.

ఫొటో సోర్స్, J&K Police
2008లో తాలిబ్కు వివాహమైంది. తాలిబ్ అరెస్టుకు ముందురోజు ఒక బిడ్డకు అతడి భార్య జన్మనిచ్చింది.
2017లో తాలిబ్ బీజేపీలో చేరాడని అతడి కుటుంబం చెబుతోంది. బీజేపీలో భిన్న స్థాయిల్లో పనిచేశాడని వివరిస్తోంది.
మాటల యుద్ధం..
తాలిబ్ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
బీజేపీలో లష్కరే తోయిబా అనుమానిత మిలిటెంట్లకు చోటుపై ఆ పార్టీ పెదవి విప్పాలని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోంది.
‘‘అతడు బీజేపీలో సీనియర్ అఫీసర్గా పనిచేశాడు. అతడి దగ్గర పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. దీనిపై ఆ పార్టీ స్పందించాలి’’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవీంద్ర శర్మ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
అతడు అరెస్టు అయిన తర్వాత, అతడితో తమకేమీ సంబంధంలేదని బీజేపీ చెబుతోందని శర్మ అన్నారు.
‘‘అసలు తాలిబ్ను బీజేపీ మైనారిటీ సెల్ విభాగం ఇన్ఛార్జిగా ఎవరు చేశారు? ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలి’’అని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్తో తాలిబ్ కలిసి దిగిన ఒక ఫోటో ఆన్లైన్లో వైరల్ అవుతోందని శర్మ చెప్పారు. ‘‘ఒకవేళ తాలిబ్.. బీజేపీ సభ్యుడు కాకపోతే అమిత్ షా సమావేశంలో అతడు ఎలా కనిపిస్తున్నాడు?’’అని ఆయన ప్రశ్నించారు.
తాలిబ్తో సంబంధమున్న అందరిపైనా దర్యాప్తు చేపట్టాలని శర్మ డిమాండ్ చేశారు. ఇలాంటి సంబంధాలు దేశ భద్రతకే ముప్పు తెస్తాయని ఆయన అన్నారు.
అయితే, తాలిబ్ లాంటి వాళ్లు బీజేపీ ఆన్లైన్ సభ్యత్వం సాయంతో పార్టీలో చేరుతుంటారని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకుర్ అన్నారు.
‘‘ఆన్లైన్ సభ్యత్వ సమయంలో బ్యాగ్రౌండ్ చెక్లు చేయడం సాధ్యంకాదు. తాలిబ్ హుస్సేన్ కూడా అలానే వచ్చుంటాడు. బీజేపీ నాయకులే లక్ష్యంగా అతడిని పంపించి ఉంటారు. అతడు బీజేపీ సభ్యుడు కాదని మేం కచ్చితంగా చెప్పగలం. ఇకపై ఆన్లైన్ సభ్యత్వం విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం’’అని ఠాకుర్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












