కరోనావైరస్: భారతదేశంలో మూగబోతున్న నగరాలు

ఎర్రకోట

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ రాకతో భారతీయ నగరాల్లో జనజీవనం నాటకీయంగా మారిపోయింది

మామూలుగా జనం రద్దీతో గందరగోళంగా ఉండే నగరాలు ఇప్పుడు మూగబోయాయి. జనం ఇళ్లలోనే ఉండటంతో ట్రాఫిక్ తగ్గిపోయింది. పెళ్లిళ్లు చాలా వరకూ వాయిదా పడ్డాయి. జరుగుతున్న పెళ్లిళ్లల్లోనూ హంగూ ఆర్భాటాలూ కనిపించటం లేదు.

భారతదేశంలో నిర్ధారిత కరోనావైరస్ కేసుల సంఖ్య 341 కాగా, ఆరుగురు చనిపోయారు. అయితే, కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం వ్యాధి నిర్ధరణ పరీక్షలు చాలా పరిమితంగా ఉండటం, కేసుల సంఖ్యను తక్కువగా చెప్పటం కారణం కావచ్చునని ప్రజారోగ్య నిపుణులు భయపడుతున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) ఎలా ఉంది? ఎంత వరకూ ఉంది? అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. సామాజిక వ్యాప్తి అంటే.. ఎవరైనా ఒక వ్యక్తి.. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన మరొక వ్యక్తిని కానీ, తీవ్రంగా ప్రభావితమైన దేశానికి వెళ్లి వచ్చిన వ్యక్తిని కానీ తనకు తెలిసి కలవకుండా ఉన్నా వ్యాధి సోకటం.

అయితే.. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలక వ్యవస్థలు ఇప్పటికే స్పందించి పటిష్ట చర్యలు చేపట్టాయి.

దేశంలో అత్యంత రద్దీగా ఉండే దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశం తన పౌరులు సహా.. బ్రిటన్, చాలా యూరప్ దేశాలతో పాటు నిర్దిష్ట దేశాల నుంచి ఎవరూ దేశంలోకి రావద్దంటూ నిషేధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి వీసాలన్నిటినీ దాదాపుగా రద్దు చేసింది. దీనివల్ల చాలా విమానాలు రద్దయ్యాయి.

కొత్త నిబంధనలతో తాము ఇళ్లకు దూరంగా చిక్కుకుపోతామన్న భయంతో దేశంలో అంతర్గతంగా కూడా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో విమానయాన సంస్థలు తంటాలు పడుతున్నాయి.

డిమాండ్ పడిపోతుండటంతో దేశంలో పెద్ద విమానయాన సంస్థలు రెండు సర్వీసులను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కరోనావైరస్ జాగ్రత్తలు
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

జనం పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడకుండా నివారించటానికి దిల్లీలోని 16వ శతాబ్దానికి చెందిన ఎర్రకోట వంటి 140 ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, మ్యూజియంలను మూసివేశారు.

ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను కూడా మంగళవారం మూసివేశారు. ఈ కట్టడాన్ని తిలకించేందుకు రోజుకు 70,000 మంది వస్తుంటారు.

సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో ఇతర బహిరంగ ప్రాంతాల మూసివేత పెరిగే అవకాశముంది. పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు.

బెంగళూరు

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ భారతదేశంలోని ఐటీ హబ్ బెంగళూరులో మాల్స్‌ను మూసివేశారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు తదిరత బహిరంగ ప్రదేశాలన్నీ గత వారం రోజులుగా బందయ్యాయి.

దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక కేంద్రం ముంబై, దక్షిణాన హైదరాబాద్ వంటి ఇతర ప్రధాన నగారాల్లో కూడా ఇవే చర్యలు చేపట్టారు.

పెళ్లిళ్లు, క్రికెట్ మ్యాచ్‌లు వంటి జనం పోగయ్యే కార్యక్రమాలన్నిటి మీదా ఆంక్షలు విధించారు.

కన్నాట్ ప్లేస్

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో కన్నాట్ ప్లేస్ వంటి రద్దీ ప్రాంతాలు దాదాపుగా ఖాళీ అయ్యాయి.

దేశంలో అత్యధిక శాతం ప్రజల రవాణా సాధమైన రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.

ముంబై నుంచి పుణె నగరానికి వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ 30 శాతం తగ్గిపోయిందని ఒక అంచనా.

కరోనావైరస్ లక్షణాలు

ఈ రెండు నగరాలున్న మహారాష్ట్రలోనే ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

సెంట్రల్ రైల్వే ఇప్పటికే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే 23 రైళ్లను రద్దు చేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించటంతో పాటు, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవటమూ దీనికి కారణమని ముంబయి అధికారులు చెప్పారు.

రైలు

ఫొటో సోర్స్, Getty Images

మొత్తంగా దేశవ్యాప్తంగా 150 రైళ్లు రద్దయ్యాయి. మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

సిక్కుల పవిత్ర క్షేత్రమైన గోల్డెన్ టెంపుల్ వంటి చాలా పుణ్యక్షేత్రాలను సందర్శించే వారి సంఖ్య చాలా తగ్గినా కూడా వాటిని తెరిచే ఉంచారు. అత్యంత రద్దీగా ఉండే ఆలయాల్లో ఒకటైన స్వర్ణ దేవాలయం వంటి చోట ఇంత తక్కువ మంది కనిపించటం అసాధారణం.

స్వర్ణ దేవాలయం

ఫొటో సోర్స్, Getty Images

అత్యంత సంపన్న హిందూ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చరిత్రలో మొట్టమొదటిసారిగా మూసివేశారు.

ముంబై నడిబొడ్డున ఉండే సిద్ధివినాయక ఆలయం, వైష్ణోదేవి గుహాలయాలు కూడా మూతపడ్డాయి.

దిల్లీలో వైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి నగర అధికారులు ఆటో రిక్షాలు, టాక్సీలను ప్రక్షాళన చేయటం మొదలుపెట్టారు.

ఆటో

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ విజృంభణను అరికట్టటానికి ప్రజా రవాణా పెద్ద సవాలుగా మారింది. ప్రజలు సాధ్యమైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నప్పటికీ.. దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా వినియోగం కొనసాగుతోంది.

అన్ని కార్యాలయాలకూ ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు లేదు. ఇంటి పనివారు, స్ట్రీట్ వెండర్లు, రోజు వారీ కార్మికులు వంటి కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు ఇది పెద్ద సవాలు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ధర్నాలు దిల్లీ, బెంగళూరు సహా కొన్ని నగరాల్లో ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి.

షహీన్ బాగ్

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసన ధర్నా వీటిలో అత్యంత ప్రముఖమైనది. ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని విమర్శకులు తప్పుపడుతున్న చట్టాన్ని నిరసిస్తూ వేలాది మంది నిరసనకారులు - ప్రధానంగా ముస్లిం మహిళలు డిసెంబర్ నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.

అయితే.. దిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, నైట్ క్లబ్‌లు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేశారు. యాబై మంది కన్నా ఎక్కువ మంది గుమిగూడే అన్ని సామాజిక, రాజకీయ, మత సమావేశాలన్నిటినీ నిలిపివేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

స్క్రీనింగ్

ఫొటో సోర్స్, Getty Images

శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయటం అన్ని నగరాల్లోనూ సాధారణ విషయంగా మారిపోయింది. కోల్‌కతాలోని హైకోర్టు లోపలికి వస్తున్న ప్రజలకు స్క్రీనింగ్ చేయటం వంటి దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి.

ఆంక్షలు ఉన్నప్పటికీ తెరచి ఉంచిన విమానాశ్రయాలు, కార్పొరేట్ కార్యాలయాలు వంటి అనేక ప్రాంతాలు ఈ స్క్రీనింగ్ చేపట్టాయి.

మాస్కులు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ నగరంలో పదో తరగతి తుది పరీక్షలకు హాజరవటానికి విద్యార్థులు మాస్కులు ధరించి వచ్చారు.

దిల్లీలో స్కూలు పరీక్షలన్నిటినీ వాయిదా వేశారు.

కరోనావైరస్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ భారతదేశం మరింత తీవ్రంగా నిర్బంధ చర్యలు చేపట్టవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)