‘నిమిష ప్రియ లేకుండా నేను తిరిగి రాలేను’.. బీబీసీతో కేరళ నర్స్ తల్లి ఏం చెప్పారంటే..

- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యెమెన్ రాజధాని సనాలోని సెంట్రల్ జైల్లో కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సు ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ పౌరుడిని హత్య చేసినందుకు ఆమెకు మరణ శిక్ష విధించారు.
యెమెన్లో ఇస్లామిక్ షరియా చట్టం అమల్లో ఉంది. దీని ప్రకారం, ''బ్లడ్ మనీ''గా పిలిచే పరిహారం తీసుకుని, మహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిష ప్రియ మరణశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. నిమిష, ఆమె కుటుంబం అదే ఆశతో ఉన్నారు.
అందుకోసం, నిమిష తల్లి ప్రేమ కుమారి భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని 2024 ఏప్రిల్లో యెమెన్ వెళ్లారు.

అయితే, తమను షాక్కి గురిచేస్తూ.. జూలై 16న మరణశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటన వెలువడిందని నిమిష కుటుంబం తెలిపింది.
నిమిష కుటుంబం తరఫున కేసు వ్యవహారాలు చూసే అధికారం ఉన్న శామ్యూల్ జెరోమ్ మరణశిక్ష అమలు తేదీ గురించి బీబీసీతో చెప్పారు. అయితే, దీనిని బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు.
మరణశిక్ష అమలుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో, జూలై 11వ తేదీ రాత్రి నిమిష తల్లి ప్రేమ కుమారి, సోషల్ యాక్టివిస్ట్ శామ్యూల్ జెరోమ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.


శామ్యూల్ జెరోమ్ బదులిస్తూ, ''సనా సెంట్రల్ జైలు చీఫ్ నుంచి జూలై 7న నాకు కాల్ వచ్చింది. నాకు చెప్పడానికి ముందే నిమిషకు సమాచారం ఇచ్చినట్లు జైలు అధికారులు నాతో చెప్పారు.''
అమలు తేదీ ప్రకటన తర్వాత, నిమిష జైలు యంత్రాంగం ద్వారా తనకు ఒక మెసేజ్ పంపించిందని ఆమె తల్లి ప్రేమ కుమారి చెప్పారు.
''అందులో ఈ ప్రకటన గురించి ఏమీ ప్రస్తావించలేదు. నా బాగోగులు అడిగింది. నేను బాధపడకూడదని, దాని గురించి ఏమీ మాట్లాడలేదు.'' అని ప్రేమ కుమారి అన్నారు.
నిరుడు యెమెన్కు వెళ్లిన ప్రేమ కుమారి రెండుసార్లు నిమిషను జైలులో కలిశారు.


''నేను 12 ఏళ్ల తర్వాత నిమిషను చూశా. నిరుడు ఏప్రిల్ 23న. నాతో పాటు ఎంబసీ అధికారులు కూడా వచ్చారు. కలవడానికి అనుమతి ఇవ్వరేమోనని భయపడ్డాను.ఆ తర్వాత కొద్దిసేపటికి, తను మరో ఇద్దరితో కలిసి వచ్చింది. అందరూ ఒకే డ్రెస్లో ఉన్నారు. నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నన్ను కౌగిలించుకుని ఏడ్చింది. నాకు కూడా ఏడుపొచ్చింది. అక్కడున్న వారు మమ్మల్ని వారించారు. 12 ఏళ్ల తర్వాత, మొదటిసారి చూశా. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. సంతోషంగా ఉన్నట్లు నా ముందు నటించింది'' అని ఆమె చెప్పారు

''నేను టామీతో మాట్లాడా, నా మనవరాలు కూడా మాట్లాడింది. నాతో మాట్లాడిన ప్రతిసారీ, 'నువ్వు అమ్మను తీసుకొస్తావు కదా?' అని అడుగుతుంది. నిమిషతో మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పా. నేను నిన్ను తిరిగి తీసుకొస్తానని చెప్పి వచ్చా. ఇప్పుడు వాళ్లకి ముఖం ఎలా చూపించేది? నువ్వు లేకుండా నేను తిరిగి వెళ్లలేను'' అని చెప్పానని ప్రేమ కుమారి అన్నారు.


శామ్యూల్ సమాధానమిస్తూ, ''భారత రాయబార కార్యాలయం మొదటి నుంచీ సాయం అందిస్తోంది. 2017లో నిమిష ప్రియ అరెస్ట్ అయినప్పుడు, అంతర్యుద్ధం కారణంగా యెమెన్లోని ఇండియన్ ఎంబసీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఆ సమయంలో, ఒక యెమెన్ యాక్టివిస్ట్ నాకు ఫోన్ చేసి, భారత ప్రభుత్వాన్ని సంపద్రించకపోతే నిమిష విషయంలో న్యాయబద్దమైన విచారణ జరగదని చెప్పారు. నేను అప్పటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ను సంప్రదించి సాయం కోరా.
చర్యలు చేపడతామని ఆయన నాకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత, ఈస్ట్ ఆఫ్రికాలోని జిబౌటీలో ఉన్న భారత రాయబార క్యాంప్ కార్యాలయం ద్వారా ఒక 'నోట్ వెర్బల్' (అధికారిక రిక్వెస్ట్ పత్రం) పంపించారు. మేం అది తీసుకుని హూతీ విదేశాంగ శాఖకు సమర్పించాం. ఆ తర్వాతే నిమిషను అల్-బైడా నుంచి సనాకు మార్చారు. సరైన దర్యాప్తు జరిగింది."
''నిమిష ఇంకా బతికి ఉండడానికి వీకే సింగ్ పంపించిన ఆ లేఖే కారణం'' అని వివరించారు.


''వాళ్లు నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు నిరాకరించలేదు, అలాగని అంగీకరించనూలేదు'' అని శామ్యూల్ బదులిచ్చారు.

ఈ ప్రశ్నకు శామ్యూల్ బదులిస్తూ, ''హత్య ఉత్తర యెమెన్లో జరిగింది. కానీ, నిమిష మారిబ్లో అరెస్టయ్యారు. మహదీ కుటుంబమే నిమిషను మారిబ్ జైలు నుంచి ఉత్తర యెమెన్కు వారి సొంత వాహనంలో తీసుకొచ్చారు. ఆమె అక్కడే(దక్షిణ యెమెన్) ఉండి ఉంటే, చట్టబద్దమైన విచారణ జరిగేది కాదు. అలా చూస్తే, చట్టబద్దమైన న్యాయ విచారణ కొనసాగడంలో మహదీ కుటుంబం కూడా కీలకపాత్ర పోషించింది. కాకపోతే, వారు నిమిషను అక్కడి నుంచి వేరే కారణంతో తీసుకొచ్చారు'' అన్నారు.
''మహదీ కుటుంబం ఒసాబ్ గిరిజ తెగకు చెందినది. సనా సమీపంలోని ధమర్ ప్రాంతానికి చెందిన వారి కుటుంబం వ్యాపార నిమిత్తం అల్ బైడాకి వచ్చింది. స్వాధియా తెగ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం అల్ బైడా.
హత్య అల్ బైడాలో జరిగినందువల్ల, ఆ నింద స్వాధియా తెగపై పడే ప్రమాదముంది. యెమెన్లో, మరో తెగకు చెందిన వ్యక్తి మీ ప్రాంతంలో మరణిస్తే, మీ తెగ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పటికి, హత్య చేసింది నిమిష అని తెలియదు. దీంతో రెండు తెగల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది.
అసలు నిజం తెలుసుకున్న తర్వాత, మహదీ కుటుంబం తన సొంత వాహనంలో మారిబ్కు వెళ్లి అక్కడి నుంచి నిమిషను తీసుకొచ్చారు. కోపంలో ఆమెను దారిలోనే ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ వాళ్లు ఆమెను సురక్షితంగా తీసుకొచ్చారు.
అనంతరం, హూతీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిమిషను సనాకు పంపించాలని ఆదేశించినప్పుడు, ఆ నిర్ణయాన్ని గౌరవించి ఆమెను పంపించారు'' అని శామ్యూల్ చెప్పారు.


''యెమెన్ ప్రజలు, ఇక్కడి మీడియా నిమషపై ఆగ్రహంగానే ఉంది. వాళ్ల పౌరుడిని చంపినందుకు. అదే సమయంలో, ఆమె గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం ఆమెను వదిలేయాలని అనుకుంటారు'' అని శామ్యూల్ చెప్పారు.

అందుకు బదులిస్తూ, ''తెలీదు. భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడుతున్నాం. మా శాయశక్తులా ప్రయ్నత్నిస్తాం'' అని శామ్యూల్ అన్నారు.
2020లో, సనాలోని ఒక కోర్టు నిమిష ప్రియుకు మరణశిక్ష విధించింది. అనంతరం యెమెన్ సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఆ తర్వాత, అధ్యక్షుడు మరణశిక్షకు ఆమోదం తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














