పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌కు చికిత్స అందించిన ఈ డాక్టర్ భారతీయుడు

మొహమ్మద్ రిజ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్ సెహిర్ సెన్ ఉల్ అబిదీన్ (ఎడమవైపు), మొహమ్మద్ రిజ్వాన్
    • రచయిత, అబ్దుల్ రషీద్ షకూర్
    • హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి

ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ వికెట్ కీపర్, బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ 36 గంటల పాటు ఐసీయూలో చికిత్స పొందాడు. ఆ తర్వాత నేరుగా సెమీఫైనల్ బరిలో దిగి 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో అర్ధసెంచరీ బాదాడు.

నవంబర్ 9 ఉదయాన రిజ్వాన్ అనారోగ్యం బారిన పడటంతో దుబాయ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు.

రిజ్వాన్‌ను ఆసుప్రతిలో చేర్చినప్పుడు అతని పరిస్థితి చూడగానే తనకు అది హార్ట్ ఎటాక్‌లాగా అనిపించిందని రిజ్వాన్‌కు చికిత్స అందించిన డాక్టర్ బీబీసీతో చెప్పారు.

మొహమ్మద్ రిజ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

దుబాయ్‌లోని మెడియార్ ఆసుపత్రిలో రిజ్వాన్‌కు డాక్టర్ సెహిర్ సెన్ ఉల్ అబిదీన్ చికిత్స అందించారు.

''రిజ్వాన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఆయన విపరీతమైన ఛాతి నొప్పితో ఉన్నారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే, ఆయన నొప్పి స్థాయిని ఒక స్కేల్‌పై కొలిచినప్పుడు దాన్ని పదికి పదిగా చెప్పవచ్చు. ఆ నొప్పిని రిజ్వాన్ భరించలేకపోయాడు. వెంటనే ఇది గుండెనొప్పి అయితే కాదు కదా అనే సందేహం వచ్చింది.''

''గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన గొంతు, శ్వాసనాళం కుచించుకుపోయింది. ఐసీయూలో ఉండే మందుల సహాయంతో ముందుగా ఛాతీనొప్పిని తగ్గించడానికి ప్రయత్నించాం. అందుకే అతన్ని ఐసీయూలో చేర్చాం'' అని సెహిర్ వెల్లడించారు.

ఆ సమయంలో రిజ్వాన్ ధైర్యంగా, సానుకూలంగా స్పందించాడని, అందువల్లే అతను త్వరగా కోలుకోగలిగాడని డాక్టర్ సెహిర్ పేర్కొన్నారు.

ఉన్నతమైన ఆశయాలే రిజ్వాన్‌కు ఉన్న అతిపెద్ద బలం అని డాక్టర్ సెహిర్ చెప్పారు.

మొహమ్మద్ రిజ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

''రిజ్వాన్‌ సెమీఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉందని, అతను జట్టుతో చేరాలని తనని తీసుకొచ్చిన వారు చెబుతున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న రోగి కోలుకోవాలంటే 5 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. కానీ రిజ్వాన్ మాత్రం నమ్మశక్యం కాని రీతిలో కోలుకున్నాడు.''

సంకల్ప బలం, అతనికి దేవునిపై ఉన్న భక్తి కారణంగానే రిజ్వాన్ త్వరగా కోలుకోగలిగాడని సెహిర్ నమ్ముతున్నారు.

36 గంటలు ఐసీయూలో ఉన్న ఒక ప్లేయర్‌ను మ్యాచ్ ఆడేందుకు అనుమతించడం సరైన నిర్ణయమేనా అని సెహిర్‌ను ప్రశ్నించగా... వైద్యులు చెప్పేంతవరకు రిజ్వాన్‌ను ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లనివ్వలేదని అన్నారు. వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేశాకే పంపించినట్లు చెప్పారు.

''ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే సమయంలో అతనికి వివిధ రకాల మందులు ఇచ్చాం. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో కూడా అవసరమైతే వాటిని ఉపయోగించవచ్చు. ఇక అతను మ్యాచ్ ఆడే విషయానికి వస్తే, పాకిస్తాన్ క్రికెట్ మెడికల్ ప్యానెల్ అన్ని అంశాలతో సంతృప్తి చెందిన తర్వాతే అతను మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది.''

మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఆటగాళ్లు తరచూ తమ ఆసుపత్రికి వస్తుంటారని, కానీ తన కెరీర్‌లో తొలిసారిగా ఒక క్రికెటర్‌కు ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స చేశానని సెహిర్ పేర్కొన్నారు.

మొహమ్మద్ రిజ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

రిజ్వాన్ బహుమతి

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక, ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో రిజ్వాన్ ఆడిన తీరు, సిక్సర్లు కొట్టడం పట్ల తనకు చాలా సంతోషం కలిగిందని సెహిర్ చెప్పారు.

తనకు చికిత్స అందించిన డాక్టర్ సెహిర్‌కు రిజ్వాన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను ధరించే పాకిస్తాన్ జట్టు టీ షర్ట్‌ను ప్రత్యేక బహుమతిగా అందజేశారు. ఆ టీషర్ట్‌ను తన పిల్లలు, మనమలు చూసే విధంగా ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటానని సెహిర్ అన్నారు.

అయితే తన వయస్సు ఇంకా 40 సంవత్సరాలేనని, తనకు ఒక పాప, బాబు ఉన్నారని మనవలు ఇంకా లేరని సెహిర్ నవ్వుతూ చెప్పారు.

వీడియో క్యాప్షన్, టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాపై గెలిచాక పాక్ కెప్టెన్ బాబర్ ఏమన్నాడు?

''మొహమ్మద్ రిజ్వాన్ నా అభిమాన క్రికెటర్. అతని బ్యాటింగ్ స్టయిల్, అతని నవ్వు నాకు చాలా నచ్చుతాయి. కానీ ఆసుపత్రి నిబంధనల మేరకు నా అభిమాన క్రికెటర్‌తో ఫొటో దిగలేకపోయాను'' అని సెహిర్ చెప్పారు.

డాక్టర్ సెహిర్ సెన్ ఉల్ అబిదీన్ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఆయన గత ఆరేళ్లుగా యూఏఈలో నివసిస్తున్నారు. ఆయనో క్రికెట్ వీరాభిమాని. కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను మైదానానికి వెళ్లి చూడలేకపోతున్నానని చెప్పారు.

ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ కోసం బయో సెక్యూర్ బబుల్‌ ఏర్పాటు చేసిన వీపీఎస్ మెడల్ గ్రూప్‌లో తమ ఆసుపత్రి ఒక భాగమని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)