హోటళ్ళు, రెస్టారెంట్లలో ఏదైనా తిన్న తరువాత సర్వీస్ చార్జి ఇవ్వమంటే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, SHELYNA LONG
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు ఫుడ్ బిల్లులో సర్వీస్ చార్జీలు విధించడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సోమవారం నిషేధం విధించింది.
సర్వీస్ చార్జీలపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. సర్వీస్ చార్జి చెల్లించాలని ఎవరినీ బలవంతం చేయకూడదని 2017లో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
భోజనం చేయడానికి రెస్టారెంట్కు మీరు వెళ్లినప్పుడు బిల్లులో ఆహారంతో పాటు సేవా రుసుం (సర్వీస్ చార్జి)ను రెస్టారెంట్ జోడిస్తే, మీరు సేవా రుసుంను చెల్లించడానికి నిరాకరించవచ్చు అని తెలిపింది.
కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన అయిదేళ్ల తర్వాత కూడా దేశంలోని చాలా రెస్టారెంట్లు ఇప్పటికీ సర్వీస్ చార్జిని వసూలు చేస్తున్నాయి.
రెస్టారెంట్లు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీ రత్న కంపెనీల్లో ఒకటైన ఐఆర్సీటీసీ కూడా ఈ రుసుమును వసూలు చేస్తోంది.
సీసీపీఏ తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత ప్రజలు, సామాజిక మాధ్యమాల్లో తమ ఫుడ్ బిల్లులను పంచుకుంటూ ఇప్పుడు ఏం మారబోతుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు హోటల్-రెస్టారెంట్ సంఘం ఈ మార్గదర్శకాలను 'అనవసరమైనవి'గా అభివర్ణిస్తోంది.

సీసీపీఏ మార్గదర్శకాల్లో ఏముంది?

- హోటళ్లు లేదా రెస్టారెంట్లు ఆహారం బిల్లులో సర్వీస్ చార్జిని కలపకూడదు.
- ఏ ఇతర పేరుతో సర్వీస్ చార్జిని వసూలు చేయకూడదు.
- హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జిలు చెల్లించాలంటూ వినియోగదారులను బలవంతపెట్టకూడదు.
- సర్వీస్ చార్జి చెల్లించాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టం మీద వదిలేయాలి.
- సర్వీస్ చార్జి చెల్లించకపోతే, సేవలను రెస్టారెంట్ తిరస్కరించకూడదు.
- ఆహారబిల్లుకు సర్వీస్ చార్జి జోడించి, దానికి జీఎస్టీని కలుపకూడదు.
- మార్గదర్శకాలను ఉల్లంఘించి ఒకవేళ హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ చార్జిని విధిస్తున్నట్లు ఎవరైనా వినియోగదారు గుర్తిస్తే, బిల్లు మొత్తం నుంచి సర్వీస్ చార్జిని తీసేయమని సంబంధిత హోటల్ను అడగవచ్చు.
- 1915 నంబర్కు కాల్ చేసి నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ (ఎన్సీహెచ్)లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్సీహెచ్ మొబైల్ యాప్ను కూడా ఉపయోగించవచ్చు.
- తప్పుడు వ్యాపార పద్ధతికి వ్యతిరేకంగా వినియోగదారుల కమిషన్లో కూడా కస్టమర్ ఫిర్యాదు చేయవచ్చు.
- త్వరగా, సమర్థవంతమైన పరిష్కారం కోసం ఈ-దాఖిల్ పోర్టల్ WWW.e-daakhil.nic.inలో ఫిర్యాదు నమోదు చేయండి.
- ఇంకా సీసీపీఏ ద్వారా తదుపరి విచారణ కోసం వినియోగదారుడు సంబంధిత జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయవచ్చు.
- సీసీపీఏకు ఫిర్యాదును [email protected]. ఈ మెయిల్ ద్వారా ద్వారా పంపవచ్చు.


ఫొటో సోర్స్, TWITTER
టీ ధర రూ. 20, సేవా రుసుం రూ. 50
కన్జూమర్ హెల్ప్లైన్ నుంచి ఈ-ఫైలింగ్ పోర్టల్ వరకు ఫిర్యాదు చేసే ప్రక్రియ ఎంత సులభంగా? ఎంత ప్రభావవంతంగా? ఉంటుందనేది ఇప్పుడు వినియోగదారులు అడుగుతోన్న ప్రశ్న.
ఎందుకంటే, ఐఆర్సీటీసీ వంటి సంస్థలు టీ ఖరీదు 20 రూపాయలు అయితే దానికి 50 రూపాయల సర్వీస్ చార్జిని జోడిస్తున్నాయి. ఈ బిల్లులను సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తున్నారు.
చాలా హోటళ్లలో 7 నుంచి 15 శాతం వరకు సర్వీస్ చార్జిని వసూలు చేస్తున్నారంటూ తమ ఫుడ్ బిల్లులను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
చాలా రెస్టారెంట్ల ముందు 'మేం సర్వీస్ చార్జిలు తీసుకుంటాం' అని బోర్డులు కూడా కనిపిస్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శైలేష్ కుమార్ అనే ట్విటర్ ఖాతాదారుడు దీని గురించి ఒక ట్వీట్ చేశారు.
''గుర్గావ్ సెక్టార్ 29లోని రెస్టారెంట్లు అన్నీ 10 శాతం సర్వీస్ చార్జిని వసూలు చేస్తాయి. 'మీకు సర్వీస్ చార్జి చెల్లించాలని లేకుంటే ఇక్కడికి రావొద్దు' అని గేటు ముందు స్పష్టంగా రాసి పెడతాయి'' అని ట్వీట్లో పేర్కొన్నారు.
ట్విటర్లో సర్వీస్ చార్జి అని టైప్ చేస్తే... అందులో మీకు, సేవా చార్జీలు చెల్లించడం గురించి ప్రజలు తమ అనుభవాలు పంచుకున్న వేలాది ట్వీట్లు మీకు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Alamy
కొత్త నియమాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి?
తాజా మార్గదర్శకాలతో ఏమి మారుతుందనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది.
2017లో జారీ అయిన మార్గదర్శకాలతో పోలిస్తే, తాజా మార్గదర్శకాలు ప్రభావవంతమైనవి అని అనడానికి రుజువులేంటి?
సీనియర్ జర్నలిస్ట్, రచయిత పుష్ప గిరిమాజీ మాట్లాడుతూ సర్వీస్ చార్జిల స్వరూపాన్ని మార్చే సామర్థ్యం తాజా మార్గదర్శకాలకు ఉందని అభిప్రాయపడ్డారు. ఆమె గత 30 సంవత్సరాలుగా వినియోగదారుల వ్యవహారాలపై పని చేస్తున్నారు.
''ఈసారి జారీ అయిన మార్గదర్శకాలు భిన్నమైనవి. అలాగే ప్రభావవంతమైనవి. ఎందుకంటే వీటిరి కన్జూమర్ ప్రొటెక్షన్ చట్టం- 2019 కింద సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విడుదల చేసింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే దీని ముఖ్య విధి. నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష, 20 లక్షల వరకు జరిమానా విధించవచ్చు'' అని ఆమె చెప్పారు.
అయితే, నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లు లేదా రెస్టారెంట్లపై ఫిర్యాదు చేసి న్యాయం పొందే ప్రక్రియ ఎంతవరకు సజావుగా సాగుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఎందుకంటే భారతదేశంలో వినియోగదారుల కేసుల్లో జరిగే ఆలస్యం కారణంగా ప్రజలు, తరచుగా ఇలాంటి కేసులను కన్స్యూమర్ కోర్టుల దృష్టికి తీసుకురాకుండా వదిలేస్తారు.
దీనిపై పుష్ప మాట్లాడుతూ, ''ఇదంతా వినియోగదారులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం కంటే ముందు, సర్వీస్ చార్జి చెల్లించడాన్ని వినియోగదారులే వ్యతిరేకించాల్సి ఉంటుంది. సర్వీస్ రుసుం చెల్లించడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ, దానిపై ఫిర్యాదు చేసే తీరిక, ఓపిక లేక సర్వీస్ ఫీజును వ్యతిరేకించడం మానేస్తున్నారు. వినియోగదారులు ముందు ఈ వైఖరిని మార్చుకోవాలి. సర్వీస్ చార్జి వసూలు చేసే చోట మేం భోజనం చేయబోమని అందరూ నిర్ణయం తీసుకుంటే, ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది'' అని ఆమె అన్నరు.

ఫొటో సోర్స్, Getty Images
హోటల్ అసోసియేషన్ ఏం చెబుతోంది?
భారతీయ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆదర్శ్ శెట్టితో బీబీసీ మాట్లాడింది.
తాజా నిబంధనలతో కొన్ని రెస్టారెంట్లు ధరలు పెంచొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
''సర్వీస్ చార్జి చెల్లించడం తప్పనిసరి కాదని అందరికీ తెలుసు. కస్టమర్కు హోటల్ సర్వీస్ నచ్చితే సేవా రుసుం చెల్లించేవారు. హోటల్ సర్వీస్ నచ్చనివారు చెల్లించకపోయేవారు. ఇలా వసూలు చేసిన డబ్బులు హోటళ్లలో వంట చేసేవారికి, వడ్డించేవారికి ఇచ్చేవారు. కానీ, కొత్త నియమాల రాకతో సర్వీస్ చార్జి వసూళ్లు ఆగిపోతాయి. దీంతో కొన్ని రెస్టారెంట్లు సేవా రుసుం తీసుకోకపోవచ్చు. మరికొన్ని రెస్టారెంట్లు తమ వద్ద పనిచేసే వెయిటర్లు, వంట మనుషులను దృష్టిలో పెట్టుకొని సేవా రుసుం స్థానంలో ఆహారపదార్థాల ధరలను పెంచుతాయి'' అని వివరించాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో చైనా పౌరులపై దాడుల వల్ల సీపెక్ ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయా?
- ముద్దు పెట్టుకోవడం ఎలా మొదలైంది?
- ఉత్తర్ ప్రదేశ్: హిందూ దేవుళ్ల బొమ్మలున్న న్యూస్ పేపర్లో చికెన్ అమ్మినందుకు ముస్లిం వ్యక్తి అరెస్టు
- 95-0, 91-1: దేశ ఫుట్బాట్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన మ్యాచ్లు.. విచారణ చేపట్టిన అధికారులు
- IND vs ENG: ఐదో టెస్టులో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం.. టీమిండియా పొరపాట్లు ఇవేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












