విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ చాంబర్ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?

ఫొటో సోర్స్, andhrauniversity.edu.in
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రా యూనివర్సీటి ఉపకులపతి (వీసీ) యూనివర్సిటీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేస్తున్నారని, ఆయన్ను రీ-కాల్ చేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు.
మరోవైపు విశాఖలో లోకేశ్ బంధువులకున్న గీతం యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చడానికి ప్రతిష్టాత్మకమైన ఏయూ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్లో విమర్శలు చేశారు.
ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇలా ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రంగా ఎందుకు మాటల యుద్ధం చేస్తున్నాయి, ఏయూలో ఏం జరుగుతోంది?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆంధ్రా యూనివర్సిటీ ఒక బ్రాండ్
రీసెర్చ్ చేయాలంటే ఆంధ్రా యూనివర్సిటీలోనే చేయాలనేంత పేరు ఏయూ కు ఉంది. అయితే, రాజకీయాలతో ఆ బ్రాండ్ను మసకబారుస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ప్రస్తుతం యూనివర్సిటీ చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తూ... యూనివర్సీటీని రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారని ఏయూ అధికారులపై విమర్శలు ఎక్కువయ్యాయి.
''విదేశీ యూనివర్సీటీలతో వందల్లో ఎంవోయూలు, నాక్ గ్రేడింగులో ఉన్నత ర్యాకింగ్, దేశంలోని ప్రఖ్యాత వర్సిటీలలో ఒకటిగా బ్రాండ్ ఉన్న ఏయూలో ఇటీవల కాలంలో రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు టీవీలు, పేపర్లలో ఏయూకు సంబంధించిన సెమినార్లు, అడ్మిషన్ల ప్రకటనలు, పరిశోధనల వివరాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు ఏయూ పేరు కనిపిస్తే అది రాజకీయ వార్తే అవుతుంది" అని యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ శ్యామ్ అన్నారు.
వర్సిటీలో రాజకీయాలు ముదురుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల ఏయూలో తరచూ ఆందోళనలు జరగుతున్నాయి. అవి కూడా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవి విద్యార్థులు, స్కాలర్స్ పై ప్రభావం చూపుతాయనే ఆందోళన కలుగుతోందని శ్యామ్ అన్నారు.

ఫొటో సోర్స్, andhrauniversity.edu.in
ఏయూలో ఏం జరుగుతోంది?
వందేళ్ల చరిత్ర ఉన్న వర్సిటీలో ఎంతోమంది వీసీలు పనిచేసినా, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిలాగా ఏయూను ఎవరూ వాడుకోలేదని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గౌరవమైన స్థానంలో ఉంటూ రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు.
''ఏయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఏపీ యూనివర్సిటీ యాక్ట్కు విరుద్ధంగా రెండోసారి రీ-ఎంప్లాయిమెంట్ పొందిన ప్రొఫెసర్ కృష్ణమోహన్ను మరోసారి రిజిస్ట్రార్ గా నియమించడం ఇందులో ఒకటి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావాల్సిన అవకాశాలను ఆయన కాల రాస్తున్నారు" అని దళిత విద్యార్థుల సంఘం జేఏసీ ప్రతినిధి ఆరేటి మహేశ్ అన్నారు.

'కుల సంఘాల గ్రూపులు'
"రెడ్డి కుల సంఘం గ్రూపులను ఏయూలో ఏర్పాటు చేసి వాటిని ప్రోత్సహిస్తున్నారు. అలాగే, వీసీ తనకున్న సొంత కళాశాలల్లోని విద్యార్థులు పాసయ్యే విధంగా రీ-రీవాల్యుయేషన్ పద్దతిని తెరపైకి తీసుకువచ్చారు. వీసీ తన ఆఫీసుని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. కుల సంఘాల పేరుతో ఏయూలో దళిత విద్యార్థులను, అధ్యాపకులను కించపరుస్తున్నారు" అని మహేశ్ ఆరోపించారు.
''సీఎం కాళ్ల వద్ద ఏయూను తాకట్టు పెట్టారు. గత ఎన్నికల సందర్భంగా మీటింగులు పెట్టి మరీ వైసీపీకి ఓట్లు వేయాలని సూచించారు. ఓట్లు వేయలేదని కొందరిని ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రోసో నిధులు దుర్వినియోగం జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి" అని ఏయూ జేఏసీ నాయకులు ప్రణవ్ గోపాల్ అన్నారు.
వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ పొలిటికల్ నివేదికలు పంపిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం రావాల్సి నియామకాల్లో నిబంధనలు పాటించడం లేదని, అగ్రవర్ణాలను ప్రోత్సహిస్తున్నారని వీసీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్ధి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ ప్రసాదరెడ్డిని రీ-కాల్ చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గవర్నర్ కు లేఖ రాయడం, దానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో ఏయూ అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది.

ఒకరు ఛలో ఏయూ...మరొకరు సేవ్ ఏయూ
ఏయూలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎదుర్కొనేందుకు విద్యార్థి సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి ఛలో ఏయూకు పిలుపునిచ్చాయి. దీనికి టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలికాయి. ఇదే సమయంలో కొందరు కక్షపూరితంగా ఆందోళనల పేరుతో ఏయూ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారంటూ మరో వర్గం మహాధర్నాకు పిలుపునిచ్చింది.
ఏయూ పరిరక్షణ సమితి పేరుతో ఏయూలోని కొందరు ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాప్ కలిపి ఏర్పాటు చేసిన సంఘం ఇది.
మార్చి మూడో తేదీన జరిగిన ఈ పోటాపోటీ ఆందోనళలకు రాజకీయ పార్టీలు మద్ధతివ్వడంతో, ఏయూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సెక్షన్ 144 విధించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలను, ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

'ఏయూని రాజకీయాలకు వాడకండి'
మరో మూడేళ్లలో ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏయూ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులందరిని ఆహ్వానిస్తున్నారు.
ఇలాంటి ఏయూను రాజకీయాలకు వేదికగా మార్చడం బాధకరమని...అందుకే దీనిని పరిరక్షించేందుకు ఒక సంఘంగా ఏర్పడ్డామని ఏయూ పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు చెబుతున్నారు.
''ఏ పార్టీ అధికారంలో ఉన్నా...ఆ పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షనాయకులు ఎవరు వర్సిటీకి వచ్చినా వారిని గౌరవించడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకానీ వారితో కలిసి ఏయూలో రాజకీయాలు చేయడం జరగదు. ప్రసాదరెడ్డి వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏయూ అనేక అంశాల్లో అభివృద్ధి చెందింది. ఇది నచ్చని కొందరు ఆయనపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు" అని ఏయూ పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధి ప్రొఫెసర్ ఎన్.ఎస్.ఎస్.పాల్ అన్నారు.

ఫొటో సోర్స్, @naralokesh
'లోకేశ్ 'ఛలో గీతం' నిర్వహించగలరా..?
"గీతం యూనివర్సిటీపై అనేక ఆరోపణలున్నాయి. కోట్లు విలువ చేసే భూమిని విద్యసంస్థ పేరుతో కబ్జా చేశారనే వార్తలు నిత్యం వస్తుంటాయి. అయితే, ఈ వర్సిటీ లోకేశ్ కుటుంబ సభ్యుల బంధువులది కావడంతో దీనికి జోలికి పోరు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించరు. ఏయూ బ్రాండ్ వాల్యూని తగ్గించే విధంగా వ్యవహరిస్తూ, అది తమ బంధువుల యూనివర్సిటీకి లాభంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 'ఛలో గీతం' అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ అవినీతిని లోకేశ్ ప్రశ్నించగలరా?'' అని పాల్ ప్రశ్నించారు.
వీసీ, రిజిస్ట్రార్ ఏమన్నారంటే...
ఏయూ చుట్టూ ముదిరిన ఈ వివాదాలు, రాజకీయాలు, వస్తున్న ఆరోపణలపై ఏయూ వీసీని బీబీసీ సంప్రదించింది.
''ఈ అంశాలపై మాట్లాడేందుకు నేను రైట్ పర్సన్ కాదు. దీనిపై మాట్లాడేందుకు ఏయూ ఆఫిషియల్ స్పోక్స్ పర్సన్ రిజిస్ట్రారే. ఆయనను సంప్రదిస్తే మీకు కావాలసిన సమాచారం అందిస్తారు" అని ఏయూ వీసీ ప్రసాదరెడ్డి చెప్పారు.
లోకేశ్ గవర్నర్కు లేఖ రాసిన విషయం, ఏయూ చుట్టూ ముదురుతున్నరాజకీయ వివాదాలపై ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఇది చాలా ముఖ్య విషయం. దీనిపై చాలాసేపు మాట్లాడాలి’’ అని అన్నారు. కానీ, ఆ తర్వాత బీబీసీ ప్రతినిధి ఫోన్లకు, మెసేజ్లకు ఆయన స్పందించ లేదు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: రూ. 2.56 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, కేటాయింపులు ఇలా...
- భావన మేనన్: లైంగిక దాడికి గురైన అయిదేళ్లకు గొంతు విప్పిన నటి, ఆమె ఏం చెప్పారంటే...
- మాచ్ఖండ్ విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు ఎలా మొదలైంది
- యుక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాతో పోరాడుతున్న తమిళనాడు విద్యార్థి
- తెలంగాణ: 80,039 ఉద్యోగాల భర్తీకి నేడే నోటిఫికేషన్ - కేసీఆర్
- భారత్లో పెటర్నిటీ లీవ్ తీసుకునేవారు పెరుగుతున్నారా? పిల్లల పెంపకంలో తండ్రుల పాత్రను ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేనా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












