రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత

రఖ్మాబాయి రౌత్
    • రచయిత, అనఘా పాఠక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆధునిక భారత్‌లో తొలి మహిళా డాక్టర్ అనగానే రఖ్మాబాయి రౌత్ పేరు గుర్తుకు వస్తుంది. అయితే, ఓ స్త్రీవాదిగా ఆమె ఎక్కువ మందికి సుపరిచితం. 22ఏళ్ల వయసులోనే తన విడాకుల కోసం ఆమె కోర్టులో పోరాడారు.

అప్పట్లో భార్యలను విడిచిపెట్టడం లేదా విడాకులు ఇవ్వడం సర్వసాధారణం.

అయితే, భర్త నుంచి విడాకులు కావాలని కోరిన తొలి మహిళ రఖ్మాబాయి కావొచ్చు.

ఆమె విడాకుల కేసు అప్పటి సంప్రదాయ సమాజంలో ప్రకంపనలే సృష్టించింది.

రఖ్మాబాయి రౌత్

1864లో అప్పటి బాంబే(నేటి ముంబయి)లో రఖ్మాబాయి జన్మించారు. ఆమె తల్లి ఓ వితంతువు.

రఖ్మాబాయికి 11ఏళ్ల వయసులోనే వివాహమైంది. అయితే ఎప్పుడూ ఆమె భర్తతో ఉండాలని కోరుకోలేదు. తల్లితోపాటు తన పుట్టింట్లోనే ఆమె ఉండేది.

వీడియో క్యాప్షన్, రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత

1887లో ఆమెపై హక్కులను కోరుతూ ఆమె భర్త దాదాజీ భికానీ కోర్టును ఆశ్రయించారు. అయితే తన అనుమతి లేకుండానే తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఆమె కోర్టులో వాదించారు.

చివరగా, ఆ పెళ్లికి వత్తాసు పలుకుతూ కోర్టు తీర్పునిచ్చింది.

రఖ్మాబాయి రౌత్

కోర్టు ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. భర్త దగ్గరకు వెళ్లాలని లేదా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు నిచ్చింది. దీంతో భర్తతో ఉండేకంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని రఖ్మాబాయి తెగేసి చెప్పారు. ఆ సమయంలో ఇదొక సాహసమనే చెప్పాలి.

రఖ్మాబాయి రౌత్

అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారమే రేపింది. స్వాతంత్ర్య ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్.. ఆమెకు వ్యతిరేకంగా పత్రికలో కథనం రాశారు. ఆమెను హిందు సంప్రదాయానికి మాయని మచ్చలా అభివర్ణించారు.

రఖ్మాబాయి లాంటి వారిని దొంగ, హంతకులతో సమానంగా చూడాలని ఆయన చెప్పారు. అయితే ఆమె వెనక్కి తగ్గలేదు. సవతి తండ్రి సఖారామ్ అర్జున్ సాయంతో ఆమె విడాకుల కోసం మళ్లీ పోరాడారు. మళ్లీ తన భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు నిచ్చినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. తన పెళ్లిని రద్దు చేయాలంటూ ఆమె క్వీన్ విక్టోరియాకు లేఖ రాశారు. అప్పుడు ఆ కోర్టు తీర్పును క్వీన్ రద్దుచేశారు.

Presentational grey line

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

Presentational grey line
బాలగంగాధర్ తిలక్

చివరగా తన భర్త కేసును వెనక్కి తీసుకున్నారు. డబ్బులు తీసుకొని పెళ్లిని రద్దు చేసుకున్నారు.

ఈ కేసు తర్వాత ఏం మారింది?

వివాహానికి తగిన వయసు చట్టం 1891ను ఆమోదించడంలో రఖ్మాబాయి కేసు కీలకంగా మారింది. ఈ చట్టం ద్వారా బాలికల వివాహ వయసు, ముఖ్యంగా శృంగారంలో పాల్గొనే వయసును, పది నుంచి 12ఏళ్లకు పెంచారు. ఆ మార్పు ఇప్పుడు విప్లవాత్మక మార్పులా కనబడకపోవచ్చు. కానీ చిన్న వయసుండే బాలికతో శృంగారంలో పాల్గొనే పురుషులకు శిక్ష విధించిన తొలి చట్టం ఇదే. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే అత్యాచారం చేసినట్లుగా పరిగణించేవారు.

రఖ్మాబాయి రౌత్

తన పెళ్లి రద్దయిన వెంటనే 1889లో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ ఫర్ విమెన్‌లో రఖ్మాబాయి చేరారు. 1894లో ఆమె వైద్య పట్టా పొందారు. అయితే ఆమె ఎండీ చేయాలని అనుకున్నారు. అప్పట్లో మహిళలు ఎండీ చేసేందుకు లండన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ అనుమతించేది కాదు. ఆ విద్యా సంస్థ నిర్ణయంపై ఆమె గళమెత్తారు. తర్వాత బ్రసెల్స్‌లో ఆమె ఎండీ పూర్తిచేశారు.

భారత్‌లో తొలి మహిళా ఎండీ డాక్టర్ రఖ్మాబాయి. అయితే భర్తతో విడాకుల తీసుకున్నందుకు ఆమెను చాలా మంది చిన్న చూపు చూసేవారు.

రఖ్మాబాయి రౌత్

మొదట్లో రఖ్మాబాయి ముంబయిలోని కామా ఆసుపత్రిలో పనిచేసేవారు. తర్వాత ఆమె సూరత్‌కు వెళ్లిపోయారు. మహిళల ఆరోగ్యం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. 35ఏళ్లపాటు ఆమె వైద్య సేవలు అందించారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

వీడియో క్యాప్షన్, దేవదాసీలకు కొత్త జీవితమిచ్చిన ముత్తు లక్ష్మీరెడ్డి

చిత్రాలు: గోపాల్ శూన్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)