కరోనావైరస్: భారత్‌లో మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫైసల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రస్తుతం భారత్‌లో మొత్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1.82 లక్షలు దాటింది. ఈ వ్యాధితో మరణించినవారి సంఖ్య 5,000కు పైనే ఉంది. అయితే, మరణాల సంఖ్య విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. అందుకు రకరకాల కారణాలున్నాయి.

పట్టణ ప్రాంతాల్లోనైతే శ్మశానాల నుంచి మరణాల గణాంకాలు సేకరించవచ్చు. కానీ, గ్రామాల్లో ఆ పని అంత సులువు కాదు. చాలా వరకూ అంత్యక్రియలు బహిరంగ ప్రదేశాల్లో, వారి వారి సొంత ప్రదేశాల్లో జరుగుతుంటాయి.

సాధారణ రోజుల్లో భారత్‌లో కేవలం 22 శాతం మరణాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుంటోంది. గ్రామాల్లో, ఇళ్లలో జరిగే మరణాల్లో ఎక్కువ వాటికి వైద్య సర్టిఫికేట్ ఉండదు. అది లేకుండా మరణానికి కారణం ఏమిటన్నది చెప్పడం కష్టం. గుండెపోటు, మలేరియా... ఇలా ఏదైనా కారణం కావొచ్చు.

ఆసుపత్రుల్లో జరిగిన మరణాల్లో కరోనావైరస్ కేసులను గుర్తించవచ్చు. పరీక్షలో రోగికి కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చి, శ్వాస కోశ వ్యవస్థ పనిచేయడం ఆగిపోవడమే మరణానికి కారణమని తేలితే, ఆ మరణాన్ని కరోనావైరస్ మరణాల్లో చేర్చవచ్చు.

‘పరీక్షల నిర్వహణలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ చాలా వెనుకబడి ఉంది’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘పరీక్షల నిర్వహణలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ చాలా వెనుకబడి ఉంది’

రకరకాల కొలమానాలు

కరోనావైరస్ మరణాల సంఖ్య విషయంపై వివాదాల అనంతరం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి ముందు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా గణాంకాలు ఇస్తూ వచ్చాయి.

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం వైద్యులు మూడు కాలమ్స్ నింపాల్సి ఉంటుంది. అందులో మరణానికి ప్రాథమిక కారణం, అంతకుముందు కనిపించిన కారణాలు, ఇతర కారణాలు వీటిలో రాయాలి. కరోనావైరస్ సోకినవారిలో చాలా మందికి ముందే డయాబెటిస్, గుండె జబ్బులు, ఇతర తీవ్ర వ్యాధులు ఉండొచ్చు. ఈ పరిస్థితిని కో-మార్బిడిటీ అంటారు. అంటే కరోనావైరస్ కాకుండా మిగతా కారణాలతోనూ వారి ప్రాణం పోవచ్చు.

మెడికల్ సర్టిఫికెట్‌పై మరణానికి అసలు కారణం కరోనావైరస్ అని రాసేవరకూ అది కరోనావైరస్ మరణాల లెక్కలోకి రాదు.

మెడికల్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కొన్ని మరణాల విషయంలో కారణాలపై స్పష్టత రాదు. భారత్‌తో పాటు మిగతా దేశాల్లోనూ ఈ సమస్య ఉంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

మరణ ధ్రువీకరణ పత్రం

మెడికల్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ పత్రం రెండూ వేర్వేరు.

ఫలానా వ్యక్తి మరణించినట్లుగా జారీ చేసే మున్సిపల్ ఏరియా సర్టిఫికెట్ మరణ ధ్రువీకరణ పత్రం. దీన్ని ఎక్కువగా ఆస్తి పంపకాలు, పెన్షన్, బ్యాంకు తదితర అవసరాల కోసం తీసుకుంటారు. మెడికల్ సర్టిఫికెట్ ఆఫ్ డెత్‌లో మరణానికి కారణం ఏంటన్నది వైద్యపరంగా ఉంటుంది.

‘‘చాలా కేసుల్లో మరణానికి కారణం ఏమిటన్నది కచ్చితంగా గుర్తించడంలో వైద్యులు శిక్షణ తీసుకుని ఉండరు. మెడికల్ సర్టిఫికెట్‌లో ‘ఎలా మరణించారు? మరణానికి కారణం ఏమిటి?’ అనే విషయాల్లో తప్పొప్పులు ఉంటాయి’’ అని ప్రజా వైద్య నిపుణురాలు డాక్టర్ సిల్వియా కర్పగమ్ అన్నారు.

వృద్ధులు, లేదా ఇదివరకే వ్యాధులతో ఉన్నవాళ్లకు కరోనావైరస్ వల్ల మరణ ముప్పు మరింత పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇలాంటివాళ్లు ఆసుపత్రిలో చేరి, మరణిస్తే, కారణం ఏమని నమోదు చేస్తారు?

కరోనావైరస్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించక, పరీక్షలు చేయించుకోకుండా చనిపోయినవారి మాటేమిటి?

ప్రజల్లో మనోధైర్యం దెబ్బతినకుండా, పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారన్న ఆరోపణలు రాకుండా... ప్రభుత్వాలు మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయని కూడా కొందరు ఆరోపిస్తున్నారు.

భారత్‌లో ఏ వ్యాధి వ్యాప్తి గురించైనా పూర్తి వివరాలు బయటకు రాకుండా ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని ఆరోగ్య రంగానికి చెందిన వ్యక్తులు అంటున్నారు.

తమిళనాడులో ఓ సమయంలో మలేరియా వల్ల సంభవించిన మరణాలను జ్వరం కారణంగా జరిగిన మరణాలుగా వెల్లడించారని, చెన్నై లాంటి ప్రాంతంలో మలేరియా అంతం చేశామని చెప్పుకొనేందుకే అలా చేశారని ఉదాహరణగా వారు ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇలాగే కలరా కేసులను గ్యాస్ట్రోఎంట్రైటిస్ కేసులుగా చూపించారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

గణాంకాల విశ్వసనీయతపై ప్రశ్నలు

కరోనావైరస్ మరణాలను నిర్ధారించేందుకు పశ్చిమ బెంగాల్ ఓ ఆడిట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై వివాదం రేగింది. కరోనావైరస్ మరణాలను వేరే వ్యాధుల మరణాల ఖాతాలో వేశారని ఆరోపణలు వచ్చాయి.

దిల్లీలోనూ చాలా మున్సిపల్ ఏరియాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడిస్తున్న మరణాల సంఖ్యకు, శ్మశానాల్లో జరుగుతున్న అంత్యక్రియల సంఖ్యకు పొంతన ఉండటం లేదని విమర్శలు వచ్చాయి.

ఆసుపత్రి విడుదల చేసిన గణాంకాలు, ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో తేడాలున్న విషయమై ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దిల్లీ ఆరోగ్య మంత్రికి సవాలు ఎదురైంది. ఆసుపత్రి తమకు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లే అలా జరిగిందని ఆయన బదులు ఇచ్చారు.

మరణాల సంఖ్యలో తేడాల అంశం ఇదివరకు కూడా చాలా సార్లు తెరపైకి వచ్చింది. 2005లో భారత్‌లో ప్రభుత్వం చెప్పిన హెచ్ఐవీ మరణాల సంఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మరణాల సంఖ్య కన్నా చాలా తక్కువగా ఉంది. మరోవైపు మలేరియా విషయంలో ఈ సంఖ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఉంది.

ప్రభుత్వంతో సమాచారం పంచుకునేందుకు ప్రైవేట్ రంగం జవాబుదారీతనంతో లేదని, ‘చెడ్డ పేరు’ వస్తుందన్న భయంతో గణాంకాలను దాచిపెడుతుంటారని డాక్టర్ సిల్వియా అభిప్రాయపడ్డారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
‘పాశ్చాత్య దేశాలతో పోల్చితే వృద్ధులను బాగా చూసుకునే సంస్కృతి కూడా భారత్‌లో ఉంది’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘పాశ్చాత్య దేశాలతో పోల్చితే వృద్ధులను బాగా చూసుకునే సంస్కృతి కూడా భారత్‌లో ఉంది’

కరోనావైరస్‌కు సంబంధించి పరీక్షల నిర్వహణలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ చాలా వెనుకబడి ఉందని కూడా నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వ్యాధి వ్యాప్తిపై కచ్చితమైన అంచనాలు వేయడం కూడా కష్టమేనని చెబుతున్నారు.

అయితే, దేశంలో మరణాల సంఖ్య తక్కువ ఉండటాన్ని మరో కోణంలోనూ చూడవచ్చని కోచిలో ఉండే నిపుణుడు కేఆర్ ఆంటోని అన్నారు.

‘‘ఇటలీ, అమెరికాలతో పోల్చితే భారత్‌లో యువకుల సంఖ్య ఎక్కువ. అందుకే మరణాల సంఖ్య తక్కువ. పాశ్చాత్య దేశాలతో పోల్చితే వృద్ధులను బాగా చూసుకునే సంస్కృతి కూడా భారత్‌లో ఉంది. దాని వల్ల కూడా ప్రయోజనం కలుగుతోంది’’ అని ఆంటోని అన్నారు.

తప్పుడు సమయంలో లాక్‌డౌన్ విధించడం, ఆ తర్వాత వలసదారుల కదలికల వల్ల నష్టం కలిగిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ కొత్త తరహా వ్యాధి అని, భారత్‌తో పాటు ప్రపంచమంతా దీని ప్రభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న విషయం గమనించాలని నిపుణులు అంటున్నారు.

ఇటీవల చైనా కరోనావైరస్ మరణాల సంఖ్యను సవరించింది. అంతకుముందు కన్నా మరణాల సంఖ్యను దాదాపు 50 శాతం ఎక్కువగా చూపింది.

అలాగే న్యూయార్క్ నగరంలోనూ మరణాల సంఖ్యకు అదనంగా మరో 3,700 మరణాలను జోడించారు. కరోనావైరస్ కారణంగా మరణించి ఉండొచ్చని భావించినప్పటికీ, పరీక్షలు నిర్వహించలేకపోయినవారి మరణాలవి.

కరోనావైరస్

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఎవరికైనా జ్వరం, గొంతు నొప్పి, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కోవిడ్-19 బాధితులు అయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో కరోనావైరస్ సోకిన ప్రాంతంలో పర్యటించినా, కరోనావైరస్ సోకినవారిని కలిసినా, వారిని అనుమానితులుగా చూడొచ్చు.

లక్షణాలు ఉన్నవారికి కరోనావైరస్ ఉందో లేదో నిర్ధారించుకునేందుకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయాలి.

ఒకవేళ పరీక్ష ఫలితాలు రాకముందే, ఆ వ్యక్తి మరణిస్తే... ఆ మరణాన్ని కోవిడ్-19 మరణాల జాబితాలోనే చేర్చాలి. మరణ ధ్రువీకరణ పత్రంలోనూ దీన్ని వెల్లడించాలి. ఇందుకోసం అంతర్జాతీయ కోడ్ కూడా జారీ చేశారు.

ఒకవేళ రోగికి అంతకుముందు నుంచే వేరే వ్యాధి కూడా ఉంటే, దాన్ని కూడా పేర్కొనాలి.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)