ఆంధ్ర మెడికల్ కాలేజీ‌కి వందేళ్లు: వైద్యరంగంలో కాకలు తీరిన డాక్టర్లు చదివింది విశాఖపట్నంలోని ఈ కాలేజ్‌లోనే

ఆంధ్ర మెడికల్ కాలేజి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

తెలుగు ప్రజల కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఒక వైద్య కళాశాల ఏర్పాటైంది. అదే ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ).

ఈ కళాశాలకు 2023తో వందేళ్లు పూర్తవుతున్నాయి.

ఆంధ్ర మెడికల్ కళాశాలలో చదువుకుని ప్రపంచం నలుమూలలా సేవలందిస్తున్న పూర్వ విద్యార్థులు, తమ కళాశాలకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఒక బహుమతి ఇవ్వబోతున్నారు.

దేశంలోనే పురాతన వైద్య కళాశాలల్లో ఒకటైన ఏఎంసీ చరిత్ర తెలుసుకోవాలంటే 120 ఏళ్లు వెనక్కి వెళ్లాలి.

ఆంధ్ర మెడికల్ కాలేజి

ఫొటో సోర్స్, Dr. R. Ahi Krishna

‘తెలుగు వారి కోసం ఏర్పాటైన వైద్య కళాశాల’

వందేళ్ల కిందట తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఒక వైద్య కళాశాల ఉండాలంటూ అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు చేసిన విన్నపాలతో 1920లో తెలుగువారి కోసం మెడికల్ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

అంతకు ముందు వరకు తెలుగు ప్రాంతాల్లో మద్రాస్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ అనుబంధంగా లైసెన్సీయేట్ మెడికల్ సర్టిఫికేట్ అనే కోర్సులు మాత్రమే ఉండేవి. వాటిని మెడికల్ స్కూల్స్ అనేవారు.

“1902లో విశాఖలో మద్రాసు ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ స్కూల్ కు కొంత కాలం తర్వాత గోడె సంస్థాన జమీందార్లు సొంత భవనం నిర్మించి ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని కారణాలు వల్ల ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడంతో దానిని...దానిని తాత్కాలిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. కొంత కాలానికి కొత్త సివిల్ హాస్పిటల్ భవనం నిర్మాణం కావడంతో, ఈ తాత్కాలిక ఆరోగ్య కేంద్ర భవనంలోనే 32 మంది విద్యార్థులతో 1923 జూలై 19న మెడికల్ కళాశాలను అప్పటి మద్రాసు స్థానిక సంస్థల మంత్రి పానుగంటి రామఅయ్యంగర్ ప్రారంభించారు. ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ గా లెప్టినెంట్ కర్నల్ ఫెడ్రిక్ జాస్పర్ అండ్రూసన్ పని చేశారు” అని విశాఖకు చెందిన చరిత్రకారులు ఎడ్వర్డ్ విజ్జేశ్వరం పాల్ చెప్పారు.

మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా పని చేసిన ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగపటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు. అప్పట్లో విశాఖపట్నాన్ని ఆంగ్లేయులు వైజాగపటం అని పిలిచేవారు.

1926లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాలగా మారింది.

ఆ సమయంలో వైస్ ఛాన్సలర్ గా ఉన్న సీఆర్ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్ ప్రభుత్వాన్ని కోరడంతో, 1940లో పేరు మారుస్తూ గెజిట్ విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్ కాలేజ్‌గానే ప్రసిద్ధి చెందింది.

32 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ మెడికల్ కళాశాల... ప్రస్తుతం ఏటా 250 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి చేరిందని ఏఎంసీ పూర్వ విద్యార్థి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ అన్నారు.

ఆంధ్ర మెడికల్ కాలేజి

‘మహిళల దరఖాస్తులు తిరస్కరించేవారు’

అనాటమీ, ఫిజియాలజీ, బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాలతో ప్రారంభమైన ఈ కళాశాలలో తొలి సంవత్సరం 50 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తే...32 మందే ప్రవేశాలు పొందారు. ఇందులో తెలుగు జిల్లాలకు చెందిన విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రవేశాలు పొందిన వారిలో తొలి ఏడాది 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏఎంసీ రికార్డులు చెప్తున్నాయి.

రెండో ఏడాది ఒక మహిళ దరఖాస్తు చేసుకున్నారు. కానీ విమెన్ కోసం ప్రత్యేక గదులు, బాత్రూం వంటి సదుపాయాలు లేకపోవడంతో ఆమె దరఖాస్తును తిరస్కరించారు.

ఆ తర్వాత కూడా సౌకర్యాల లేమి కారణంగా ఇక్కడ మహిళలకు ప్రవేశాలు కల్పించేవారు కాదని పూర్వ విద్యార్థిని డాక్టర్ రాధ కుమారి తెలిపారు.

1942లో 175 మందికి సరిపడే విధంగా విద్యార్థినుల కోసం విమెన్ హాస్టల్‌ని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఏటా ప్రవేశాలు పొందుతున్న వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా ఉంటారని ఏఎంసీ పూర్వ విద్యార్థిని, అనాటమీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ సురేఖ తెలిపారు. 202 మందికి సరిపోయే విధంగా మెన్స్ హాస్టల్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

“నేను కళాశాలలో చదువుకున్న విద్యార్థినినే. నాలాగే ఇక్కడ చాలా మంది పూర్వ విద్యార్థులే ఉద్యోగులుగా కూడా ఉన్నాం. వందేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ కళాశాలలో వైద్యరంగంలో ఎంతో పేరు పొందిన కాకర్ల సుబ్బారావు, ఉలిమిరి రామలింగస్వామి, శ్రీపాద పినాకపాణి, డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు, డాక్టర్ బ్రహ్మయ్యశాస్త్రి, డాక్టర్ రాజారామ్మెహనరెడ్డి, డాక్టర్ రామలింగస్వామి వంటి వైద్యులు చదువుకున్న చోటే మేం చదువుకోవడం...ఇక్కడే ఉద్యోగాలు పొందడం, ఇప్పుడు వందేళ్ల సంబరాల్లో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని సురేఖ చెప్పారు.

పినాకపాణి వంటి వారు వైద్యంలోనే కాకుండా సంగీతంలో కూడా నిష్ణాతులుగా పేరు పొందారు.

అనటమీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ...ఇలా 34 విభాగాల్లో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రస్తుతం వైద్య విద్యను అందిస్తోంది.

ఆంధ్ర మెడికల్ కాలేజి

‘ఏఎంసీలో సీటు వస్తే గర్వపడతారు’

దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలలో ఏఎంసీ ఒకటి. అలాగే దీనికి ఉన్న చరిత్ర, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచం నలుమూలలా వైద్యరంగంలో ఎంతో కీర్తిప్రతిష్టలు పొందడం వంటి అంశాలు వైద్య విద్యని అభ్యసించాలనుకునే వారిని ఆకర్షిస్తుంటాయి. దాంతో వారంతా ఇక్కడే సీటు పొందాలని కోరుకుంటారు. ఇక్కడ సీటు పొందింతే అది చాలా గర్వంగా చెప్పుకుంటారు అని ప్రస్తుతం ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థినిగా ఉన్న జనిషా అన్నారు.

“నాకు ఆంధ్ర మెడికల్ కళాశాలలో సీటు రావడంతో మా కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని అందరికి గర్వంగా చెప్పుకున్నారు. మేం చదువుకునే రోజుల్లోనే ఏఎంసీలోనే చదవాలనే అనుకునేవాళ్లం. వందేళ్ల చరిత్ర ఉన్న కళాశాలలో మేం చదువుకున్నమంటే అదొక గొప్ప విషయంగా అనిపిస్తుంది.” అని జనిషా చెప్పారు.

ఆంధ్ర మెడికల్ కాలేజ్ కు దేశ వ్యాప్తంగా మంచి పేరుందని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు చెప్పారు. అందుకే దేశంలోని అని రాష్ట్రాల నుంచి ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందాలని తాపత్రయపడతారని తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా అందరూ విద్యార్థులు ఇక్కడే చదవాలని పోటి పడుతుండటమే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశిష్టతను చెప్తుందన్నారు.

ఆంధ్ర మెడికల్ కాలేజి

ఫొటో సోర్స్, Dr. R. Ahi Krishna

‘ప్రారంభంలో 32, 2017 నాటికి 250’

ప్రారంభంలో మెడికల్ స్కూల్ భవనంలో ప్రారంభమైన వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధన ఆసుపత్రులు వచ్చాయి. తొలి రోజుల్లో ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)గా మారింది. 132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్ ప్రస్తుతం 1600 పడకల ఆసుపత్రి స్థాయికి ఎదిగింది. అలాగే విశాఖలో ఉన్న విక్టోరియా ఆసుపత్రి, మానసిక ఆరోగ్య వైద్యశాల, ఛాతి అంటువ్యాధుల ఆసుపత్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ఈఎన్టీ ఆసుపత్రి వంటివి ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధ బోధనాసుపత్రులుగా వచ్చాయి. వీటన్నింటిలో 2500 వరకు పడకలు ఉన్నాయి.

1923లో 32 మంది విద్యార్థులతో ప్రారంభమైన వైద్య కళాశాల, 1990 సమయానికి 150 మందికి, 2017 నాటికి 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి పెరిగింది. ఇక్కడ అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, వంటి విభాగాల్లో పురాతన మ్యూజియాలు ఉన్నాయి. అవయవదానం చేయాలంటూ ఏఎంసీ చాలా కాలంగా ప్రజల్లో అవగాహన తెచ్చే కార్యక్రమాలు విస్తృతంగా చేస్తోంది.

పూర్వ విద్యార్థులు నిర్మిస్తున్న భవనం
ఫొటో క్యాప్షన్, ఆంధ్ర మెడికల్ కాలేజి

పూర్వ విద్యార్థుల ‘వందేళ్ల’ కానుక

తొలి రోజుల్లో పెద్ద సౌకర్యాలు కూడా ఉండేవి కాదని పూర్వ విద్యార్థులు తెలిపారు. 1938 సమయంలో రూ. 3 రూపాయలు హాస్టల్ అద్దె ఉండేదని, అలాగే మెస్ ఛార్జీలు నెలకు రూ. 18 ఉండేవని తమకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు చెప్పేవారని డాక్టర్ రవిరాజ్ అన్నారు. తాము చదువుకునే సమయానికి హాస్టల్ వసతి వంటివి ఏర్పాడ్డాయని, ఇక్కడ చదువుకుని వైద్యరంగంలో ఎదిగిన తాము చదువుకున్న కళాశాలకు వందేళ్లు నిండుతున్న సందర్భంగా ఒక భవనాన్ని నిర్మించి ఆంధ్ర మెడికల్ కాలేజికు బహుమతిగా అందించబోతున్నామని ఆయన చెప్పారు.

“1.2 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక భవనాన్ని నిర్మించి అందులో స్టూడెంట్ సెంటర్, లెక్చర్ హాల్, లెబ్రరీ, రీడింగ్ రూం, రీక్రియేషన్ రూం, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ. 45 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలుగా వేసుకుని నిర్మిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ పూర్వ విద్యార్థులు తమ కళాశాలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో వందేళ్ల సందర్భంగా ఈ భవనాన్ని నిర్మించి, కళాశాలకు అందిస్తాం. అలాగే దీని మెయింటెనెన్స్ ఖర్చులను పూర్వ విద్యార్థుల సంఘమే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం” అని డాక్టర్ రవిరాజ్ చెప్పారు.

ఆంధ్ర వైద్య కళాశాల గొప్పదనాన్ని చాటి చెప్పేలా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థిని, గైనకాలజిస్ట్ డాక్టర్ రాధ కుమారి చెప్పారు. పూర్వ విద్యార్థులు నిర్మించే భవనంలో ఏడాది పొడవునా విద్యా, వైజ్ఞానిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్ర మెడికల్ కాలేజీ‌కి వందేళ్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)