మంగళగిరి ఎయిమ్స్: ఇక్కడ 10 రూపాయలకే వైద్యం, రెండున్నర లక్షల కిడ్నీ ఆపరేషన్ 60 వేలకే...

ఫొటో సోర్స్, AIIMS Mangalagiri
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఒక చిప్స్ ప్యాకెట్ ఖరీదుతో ఆసుపత్రికి వెళ్లి డాక్టర్కు చూపించుకోవచ్చని తెలుసా?
మీరు చదివింది, నిజమే! మంగళగిరిలోని ఎయిమ్స్లో డాక్టర్ ఫీజు కేవలం పది రూపాయలు మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి అనుగుణంగా మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఏర్పాటైంది. 2018లో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కేంద్రంగా తాత్కాలికంగా ఎయిమ్స్ సేవలు ప్రారంభమయ్యాయి. 2019 మార్చి 12 నుంచి మంగళగిరిలోని శాశ్వత భవనంలో ఓపీడీ సేవలు మొదలయ్యాయి.
అడ్మిషన్ చార్జీ 25 రూపాయలు
కరోనాకు కొద్దిరోజుల ముందే ఎయిమ్స్ మంగళగిరిలో అవుట్ పేషెంట్ సేవలు మొదలయ్యాయి. పది రూపాయలకే డాక్టర్ అందుబాటులో ఉండడం, అనేక పరీక్షలకు కూడా ఖర్చు తక్కువే కావడంతో దూరప్రాంతాల నుంచి కూడా రోగులు రావడం మొదలయ్యింది.
ఇక కరోనా సమయంలో ఎయిమ్స్ మంగళగిరి ప్రాంగణంలోనే సేవలందించారు. ఓపీతో పాటుగా ఇన్ పేషెంట్స్ సేవలు కూడా మొదలయ్యాయి.
తొలుత 50 పడకల ఆస్పత్రిగా ప్రారంభించి, క్రమంగా విస్తరిస్తున్నారు. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఇన్ పేషెంట్ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అడ్మిషన్ చార్జీ కింద రూ.25 వసూలు చేస్తున్నారు. రోగి కోసం ఒక్కో పడకకు రోజుకు రూ.30 చార్జిగా నిర్ణయించారు.
ఇవికాక, నర్సింగ్ చార్జీలు, ఇతర ఫీజులేమీ ఉండవు. వైద్య పరీక్షలు, మందులకు అతి తక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రోగులకు అవసరమైన మందుల కోసం అమృత్ ఫార్మసీ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్తో పాటుగా ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శ్రీని కూడా అనుమతిస్తున్నారు.

ఫొటో సోర్స్, AIIMS Mangalagiri
స్వల్ప ఖర్చుతోనే...
ఇన్ పేషెంట్ సేవలతో పాటుగా అవుట్ పేషెంట్ సేవలకు కూడా తక్కువ మొత్తంలోనే ఫీజులు వసూలు చేస్తారు. క్యాన్సర్, మూత్రపిండాలు, ఉదర కోశ సంబంధిత సర్జరీలు స్వల్ప ఖర్చుతోనే చేస్తున్నారు.
మంగళగిరి ఎయిమ్స్లో టెలీ మెడిసిన్ సేవలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు:
కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్
ఈఎన్టీ
ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిటేషన్
జనరల్ మెడిసిన్
జనరల్ సర్జరీ
ఆర్ధోపెడిక్స్
సైకియాట్రి
ఆప్తమాలజీ
డెర్మటాలజీ
పీడియాట్రిక్స్
ఓబీజీ
డెంటిస్ట్రీ
రేడియాలజీ
అనస్థీయాలజీ
పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సిన సేవలు:
కార్డియాలజీ
న్యూరాలజీ
నెఫ్రాలజీ
యూరాలజీ
ఏ డిపార్ట్ మెంట్ వైద్యులను కలిసేందుకైనా ఒకటే ఫీజు.

ఫొటో సోర్స్, AIIMS Mangalagiri
ఓపీ వేళలు:
ఉదయం: 8:00 గంటల నుంచి మధ్యాహ్నం: 01:00 గంట వరకు (సోమవారం-శుక్రవారం) ఓపీ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకుని టోకెన్ తీసుకున్న రోగులు సాయంకాలం నాలుగు గంటల లోపు వైద్య సేవలను పొందవచ్చు.
శనివారం: మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే ఓపీ ఉంటుంది.
ఆదివారం ఓపీ విభాగాన్ని మూసివేస్తారు.
టెలీమెడిసిన్:
ఉదయం 8:30 నుంచి 11 గంటల మధ్య 85230 07940 లేదా 94930 65718 నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్న పేషెంట్లకు ఉదయం 11 గంటల నుంచి వైద్యులే ఫోన్ చేసి సలహాలు అందిస్తారు. ఇది పూర్తిగా ఉచితం.

ఫొటో సోర్స్, AIIMS Mangalagiri
మహిళల కోసం ప్రత్యేకం..
మహిళల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ విభాగం ఉంది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 02:00 గంటల నుంచి 04:00 గంటల వరకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు ఫీజు రూ.10 మాత్రమే. మామోగ్రఫీ అవసరమైనవారికి తక్కువ ఫీజుతో అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మంగళగిరి ఎయిమ్స్ తెలిపిన వివరాల ప్రకారం, వివిధ పరీక్షల కోసం ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు ఇలా ఉన్నాయి:
- కంప్లీట్ బ్లడ్ పిక్చర్: రూ. 135
- ఫాస్టింగ్ అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్: రూ. 24+24
- లివర్ ఫంక్షనింగ్ టెస్ట్: రూ. 225
- కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్: రూ. 225
- లిపిడ్ ప్రొఫైల్: రూ. 200
- థైరాయిడ్ ప్రొఫైల్: రూ. 200
- ఈసీజీ: రూ. 50
- ఛాతి ఎక్స్రే: రూ. 60
- మామోగ్రఫీ: రూ. 630
- అల్ట్రాసోనోగ్రఫీ: రూ. 323
- యూరిన్ ఎనాలిసిస్: రూ. 35
- హెచ్ఐవీ రాపిడ్ టెస్ట్: రూ. 150
- హెచ్బియస్ ఏజీ రాపిడ్ టెస్ట్: రూ. 28

ఫొటో సోర్స్, AIIMS Mangalagiri
పది లక్షల మందికి సేవలు
2019 నుంచి తొలి ఐదేళ్ళలోనే 10 లక్షల మందికి సేవలు అందించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మంగళగిరి ఎయిమ్స్లో తమకు తక్కువ ఖర్చులోనే వైద్య సేవలు అందుతున్నాయని రోగులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే తక్కువ ధరకే ఆపరేషన్ చేసినట్లు విజయవాడ కృష్ణలంకకు చెందిన ధనుంజయ్ తెలిపారు.
"మెకానిక్గా పని చేస్తున్నా. రెండేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే వైద్యం ఖర్చులు, ఆపరేషన్ కోసం రూ. 2.50 లక్షలు అవుతుందని అన్నారు. అంత డబ్బు లేకపోవడంతో ఆరోగ్య శ్రీ కోసం ప్రయత్నించాం. అయితే, నాకున్న కిడ్నీ సమస్యకు ఆరోగ్య శ్రీ వర్తించదని చెప్పారు. దీంతో ఎయిమ్స్ మంగళగిరి గురించి తెలిసి వెళ్లగా మందులు ఖర్చులు కాకుండా రూ. 60 వేలకు ఆపరేషన్ అయిపోయింది’’ అని ధనుంజయ్ అన్నారు.

ఫొటో సోర్స్, AIIMS Mangalagiri
‘త్వరలోనే మరిన్ని సేవలు’
మెడికల్ కాలేజీ భవనాలు, హాస్పిటల్, హాస్టళ్లు, నర్సింగ్ కాలేజ్ కూడా అందుబాటులోకి రావడంతో మంగళగిరి ఎయిమ్స్ వైద్య విద్యార్థులకు అనువైన శిక్షణ కేంద్రంగా మారడంతో పాటు రోగులకు వివిధ రకాల సేవలు అందించగలుగుతోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే 98 శాతం పనులు పూర్తి కావడంతో మరింత మెరుగైన సేవలు అందించే ప్రయత్నంలో ఉన్నామని ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్ డాక్టర్ మాధవనంద కర్ తెలిపారు.
"ఆధునిక సదుపాయాలున్నాయి. తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తున్నాం. రోగులకు అందిస్తున్న సేవల్లో మెరుగైన పురోగతి సాధించాం. రాబోయే కాలంలో మరింత మెరుగైన సేవలు అందుతాయి. ఇది 960 పడకల ఆస్పత్రి. ఇప్పటికే, 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. కార్డియాలజీ వంటి కీలక సేవలు కూడా త్వరలోనే మొదలుపెడతాం" అని మాధవనంద కర్ బీబీసీకి వివరించారు.
మరో 17 ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేయాల్సి ఉండగా, స్వల్పకాలంలోనే 10 లక్షల మందికి సేవలందించిన మంగళగిరి ఎయిమ్స్ బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గత నెలలో ఆయన ఈ సంస్థను జాతికి అంకితం చేశారు.
మంగళగిరి ఎయిమ్స్లో ప్రొఫెసర్లు, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాల్లో పనిచేస్తున్న వైద్యులు 180 మంది వరకూ ఉన్నారు. ఇతర సిబ్బంది మరో 400 మంది ఉంటారు.

ఫొటో సోర్స్, AIIMS Mangalagiri
వైద్యుల కొరత..
ఓపీ సేవలందించడానికి సరిపడా వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర కాలయాపన అవుతోందని రోగులు అంటున్నారు.
"కాలినొప్పితో ఓపీ కోసం వచ్చాను. నూజివీడు నుంచి బయలుదేరి ఉదయం పది గంటలకు ఆస్పత్రికి వచ్చాను. ఓపీ రిజిస్ట్రేషన్కే గంటన్నర పట్టింది. పదకొండున్నరకి ఆర్ధోపెడిక్ ఓపీ దగ్గరకి వెళితే అక్కడ మళ్లీ క్యూ ఉంది. మధ్యాహ్నం 2 వరకూ వేచి చూసిన తర్వాత డాక్టర్ లంచ్కి వెళ్లారని చెప్పారు. ఆ తర్వాత 2.30కి ఆయన వచ్చిన తర్వాత నాకు చూపించుకోవడానికి 3.30 దాటింది. అర్ధోపెడిక్ వంటి విభాగాల్లో తీవ్ర రద్దీ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఎక్కువ మంది డాక్టర్లు కావాలి’’ అని పి.రాజబాబు అనే పేషెంట్ అన్నారు.
ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఆయనకు వైద్యుడి సూచన మేరకు రేడియాలజీలో పరీక్షలు చేయాల్సి ఉండగా, వాటి కోసం మరోరోజు రమ్మని చెప్పడంతో నిరాశ కలిగిందని బీబీసీకి తెలిపారు.
ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్పప్పటికీ త్వరలోనే అన్నింటినీ పరిష్కరించి రోగులకు అత్యున్నత సేవలు అందించే ప్రయత్నంలో ఉన్నామని ఎయిమ్స్ మంగళగిరి కమ్యూనికేషన్ విభాగాధిపతి శంకరన్ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
- కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన సీబీఐ, దిల్లీ మద్యం పాలసీ కేసు ఎలా మొదలైంది?
- గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- నితీష్ కుమార్ రెడ్డి: ఈ తెలుగు ‘హిట్మ్యాన్’కు టీమీండియాలో ఛాన్స్ వస్తుందా?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














