రెజ్లర్ల నిరసన: ‘ప్రధానికే చెబుతావా? ఎంత ధైర్యం? పెద్ద ప్లేయర్ అయిపోయానని అనుకుంటున్నావా? అంటూ బెదిరించారు’

ఫొటో సోర్స్, Getty Images
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలంటూ ప్రముఖ రెజ్లర్లు చేపడుతున్న నిరసన నానాటికీ తీవ్రం అవుతోంది.
అసలు ఈ నిరసన ఎప్పుడు మొదలైంది? రెజ్లర్లు ఏం డిమాండ్ చేస్తున్నారు? బ్రిజ్ భూషణ్పై వస్తున్న ఆరోపణలు ఏమిటి? వీటిపై ఆయన ఏం అంటున్నారు? లాంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, @BAJRANGPUNIA
నిరసన ఎప్పుడు మొదలైంది?
జనవరి 18: దిల్లీలోని జంతర్మంతర్ వేదికగా జనవరి 18న ప్రముఖ రెజ్లర్లు నిరసనకు కూర్చున్నారు. డబ్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై వీరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నిరసనకు కూర్చున్న ప్రముఖ రెజ్లర్లలో రెండు ప్రపంచ చాంపియన్షిప్ పతకాల విజేత వినేశ్ ఫోగాట్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా తదితరులు ఉన్నారు.
ఏళ్ల నుంచి బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెజ్లర్లు ఆరోపించారు. మరోవైపు బ్రిజ్ భూషణ్కు సన్నిహితులైన కొందరు అధికారులు తనను చంపేస్తానని కూడా బెదిరించినట్లు వినేశ్ ఫోగాట్ చెప్పారు. తాము నిత్యం ‘‘భయం, ఆందోళన’’తోకూడిన వాతావరణంలో గడుపుతున్నామని చెప్పారు. కొందరు జాతీయ కోచ్లు కూడా బ్రిజ్ భూషణ్వైపే ఉన్నట్లు తెలిపారు.
తన పదవికి బ్రిజ్ భూషన్ రాజీనామా చేయాలని, డబ్ల్యూఎఫ్ఐను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
జనవరి 18: ఈ విషయంలో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి క్రీడల మంత్రిత్వ శాఖ నోటీసులు పంపించింది. ఆరోపణలు రుజువైతే జాతీయ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది.
జనవరి 19: నిరసన చేపడుతున్నవారిని మాజీ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ కలిశారు. ప్రభుత్వంతో తాను మాట్లాడతానని ఆమె చెప్పారు. అయితే, అదే రోజు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవీ దహియా, వరల్డ్ చాంపియన్షిప్ పతక విజేత దీపక్ పునియా కూడా నిరసన చేపడుతున్న వారితో కలిశారు.
అదే రోజు రెజ్లర్లు కేంద్ర స్పోర్ట్స్ శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశం దాదాపు ఐదు గంటలు గడిచింది. కానీ, ఎలాంటి పరిష్కారమూ లభించలేదు.

ఫొటో సోర్స్, @SAKSHIMALIK
దర్యాప్తు కమిటీలో ఎవరు ఉన్నారు?
జనవరి 20: ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉషకు లేఖ రాశారు. బ్రిజ్ భూషణ్ రాజీనామా చేసేలా చూడాలని లేఖలో వారు డిమాండ్ చేశారు. ఆరోపణలపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాచేయాలని కోరారు. డబ్ల్యూఎఫ్ఐను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై విచారణకు ఒలిపింక్ పతక విజేత ఎంసీ మేరీ కోమ్ నేతృత్వంలో ఒక కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసింది.
జనవరి 21: రెజ్లర్లు మళ్లీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ను కలిశారు. ఆరోపణలపై విచారణకు ఒక ‘‘ఓవర్సైట్ కమిటీ’’ ఏర్పాటుచేస్తామని, ఆ విచారణ పూర్తయ్యేవరకు బాధ్యతల నుంచి సింగ్ తప్పుకుంటారని హామీ ఇవ్వడంతో ఆ రోజు రాత్రి నిరసనలను విరిమించుకుంటున్నట్లు రెజ్లర్లు ప్రకటించారు.
అయితే, అదే రోజు కేంద్ర స్పోర్ట్స్ శాఖకు డబ్ల్యూఎఫ్ఐ తమ స్పందనను పంపింది. బ్రిజ్ భూషణ్ లేదా కోచ్లు ఎవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెబుతూ, రెజ్లర్ల ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ ఖండించింది.
ఆ తర్వాత ర్యాంకింగ్ టోర్నమెంటుతోపాటు డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని స్పోర్ట్స్ శాఖ ఆదేశాలు జారీచేసింది. డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను కూడా విధుల నుంచి తప్పించింది.

ఫొటో సోర్స్, @SAKSHIMALIK
జనవరి 23: ఐదుగురు సభ్యుల ఓవర్సైట్ కమిటీ బాధ్యతలను కూడా మేరీ కోమ్కు అప్పగించారు. ఒలింపిక్ పతక విజేతలు యోగేశ్వర్ దత్, తృప్తి ముర్గుండే, రాజగోపాలం, రాధికా శ్రీమాన్లు ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. నాలుగు వారాల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని కమిటీకి సూచించారు. అదే సమయంలో డబ్ల్యూఎఫ్ఐ బాధ్యతలను కూడా ఈ కమిటీకే అప్పగించారు.
జనవరి 31: అయితే, కమిటీలో సభ్యులను నియమించేటప్పుడు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని రెజ్లర్లు చెప్పారు. ఆ తర్వాత బబితా ఫోగాట్ను కమిటీలో ఆరో సభ్యురాలిగా చేర్చారు.
ఫిబ్రవరి 23: ఓవర్సైట్ కమిటీ గడువును మరో రెండు వారాలు పొడిగించారు.
ఏప్రిల్ 16: ఓవర్సైట్ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం మే 7న డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు స్పోర్ట్స్ శాఖ ప్రకటించింది. అయితే, ఆ నివేదికలో ఏముందో స్పోర్ట్స్ శాఖ వెల్లడించలేదు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయబోవడంలేదని బ్రిజ్ భూషణ్ మీడియాతో చెప్పారు.

ఫొటో సోర్స్, @SAKSHIMALIK
మళ్లీ నిరసన ఎప్పుడు మొదలైంది?
ఏప్రిల్ 23: దిల్లీలోని సీపీ పోలీస్ స్టేషన్లో బ్రిజ్ భూషణ్పై ఒక మైనర్ సహా ఏడుగురు రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, కానీ, పోలీసులు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేయడంలేదని చెబుతూ దిల్లీలో మళ్లీ రెజ్లర్లు నిరసనకు కూర్చున్నారు.
తమ ఫిర్యాదు ఆధారంగా బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని, ఓవర్సైట్ కమిటీ నివేదికనూ బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 24: డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియలను స్పోర్ట్స్ శాఖ రద్దు చేసింది. ఆ తర్వాత ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషకు మంత్రిత్వ శాఖ ఒక లేఖ రాసింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల కోసం ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటుచేయాలని, అప్పటివరకు డబ్ల్యూఎఫ్ఐ బాధ్యతలను తామే చూసుకోవాలని సూచించింది.
ఏప్రిల్ 25: బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బ్రిజ్ భూషణ్పై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, దీనిపై స్పందించాలని దిల్లీ పోలీసులకు కోర్టు సూచించింది.
ఏప్రిల్ 27: ‘‘రెజ్లరు క్రమశిక్షణతో వ్యవహరించుండాల్సింది. వీధుల్లో నిరసన చేపట్టకుండా ఐవోఏను వారు ఆశ్రయించుండాల్సింది’’ అని మీడియాతో పీటీ ఉష వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 28: బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సుప్రీం కోర్టులో దిల్లీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు రెజర్లకు పొంచివున్న ముప్పులను అంచనా వేయాలని, వారికి తగిన భద్రత కల్పించాలని కూడా కోర్టు సూచించింది.

ఫొటో సోర్స్, ANI
బ్రిజ్ భూషణ్ ఏం అంటున్నారు?
మే 2: ఈ ఆరోపణలపై బీబీసీ ప్రతినిధి అనంత్ ఝణానేతో బ్రిజ్ భూషణ్ మాట్లాడారు. ‘‘ఆ ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశాలతో చేసినవి. వాటిలో ఎలాంటి నిజమూ లేదు’’ అని బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించారు.
తన పదవికి రాజీనామా చేయబోనని కూడా బ్రిజ్ భూషణ్ చెప్పారు.
‘‘నాకు సుప్రీం కోర్టు, దిల్లీ పోలీసులపై పూర్తి విశ్వాసముంది. నేను ఏ తప్పూ చేయలేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
వినేశ్ ఫోగాట్ ఏం చెప్పారు?
మే 3: ధర్నాకు కూర్చున్న ప్రముఖ రెజ్లర్లలో ఒకరైన వినేశ్ ఫోగాట్ కూడా బీబీసీతో మాట్లాడారు.
‘‘టోక్యో ఒలింపిక్స్ తర్వాత నేను ప్రధాన మంత్రిని కలిశాను. కొన్ని విషయాలను ఆయనకు చెప్పాను. ఆ సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారని అన్నాను. కానీ లైంగిక వేధింపుల గురించి ప్రధానితో నేను ఓపెన్గా చెప్పలేదు. ఆ తర్వాత వారు నన్ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారు. మానసికంగా వేధింపులకు గురి చేశారు’’ అని వినేశ్ చెప్పారు.
‘‘ నేను ఫిర్యాదు చేసిన తర్వాత బ్రిజ్ భూషణ్ను ప్రధాని మందలించి ఉంటారు. అప్పటి నుంచి బ్రిజ్ భూషణ్ మనుషులు ఫోన్లో మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు. ప్రధానికే చెబుతావా? ఎంత ధైర్యం? పెద్ద ప్లేయర్ అయిపోయానని అనుకుంటున్నావా? నీకు గుణపాఠం చెబుతాం అంటూ బెదిరించారు. ఆ తర్వాత 24 గంటల్లోపే మాకు క్రీడా మంత్రి నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి కలవాలని మాకు చెప్పారు. ఈ సమస్య ఏంటో చూడాలని క్రీడా మంత్రికి కచ్చితంగా ప్రధాని చెప్పి ఉంటారు. నేను వెళ్లి క్రీడా మంత్రిని కలిశాను. అన్ని విషయాలను సమగ్రంగా వివరించాను. ప్రధానికి చెప్పని విషయాలనూ క్రీడామంత్రికి చెప్పాను. కానీ, ఈ విషయాలన్ని మంత్రి నుంచి బయటికి వచ్చాయి. ఆ సమయంలో చాలా షాక్కు గురయ్యా. ఎవర్ని నమ్మకూడదని భావించా’’ అని వినేశ్ ఫోగట్ చెప్పారు.
కొత్త పార్లమెంటు ప్రారంభం రోజు ఏం జరిగింది?
మే 28: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో బ్రిజ్ భూషణ్ కూడా పాల్గొనడంతో కొత్త భవనం ముందు మహా పంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు భావించారు.
అయితే, వారిని పార్లమెంటు భవనం వైపు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. రెజ్లర్లను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. అప్పుడు తీసిన దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
మరోవైపు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న రెజ్లర్ల శిబిరాలను, ఇతర సామగ్రిని అక్కడి నుంచి తొలగించారు.
అయితే, తమ నిరసన ముగిసిపోలేదని, మళ్లీ ఆందోళనకు దిగుతామని రెజ్లర్ సాక్షి మలిక్ మీడియాతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మనిషిని చంపేసి ఇంటర్నెట్లో ఏం వెతుకుతున్నారు? శవాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారు?
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- ఆంధ్రప్రదేశ్: భూముల రీసర్వేలో అన్యాయం చేశారంటున్న గిరిజనులు, కోర్టులో తేల్చుకోమంటున్న అధికారులు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















