ముంబయి: నికరాగ్వా వెళ్లాల్సిన A340 విమానం ఫ్రాన్స్ నుంచి భారత్‌‌కు రాక

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మంగళవారం ముంబయికి వచ్చిన విమానంలోని ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో కూర్చున్న ఫొటోలు బయటకు వచ్చాయి

మానవ అక్రమ రవాణా జరుగుతుందనే అనుమానంతో ఫ్రాన్స్‌లో కొన్ని రోజులపాటు నిలిపివేసిన విమానం చివరకు భారత్‌కు చేరుకుంది. ఇందులో వందలమంది భారతీయులు ఉన్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి నికరాగ్వాకు ప్రయాణిస్తోన్న ఎయిర్‌బస్ ఏ340 విమానం ఇంధనం నింపుకోవడం కోసం కిందకు దిగినప్పుడు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానాలు వ్యక్తమయ్యాయి.

276 మంది ప్రయాణికులతో ఆ విమానం ముంబయి వచ్చింది. ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకున్న విమానంలోని ఇద్దరు మైనర్లతో సహా 25 మంది ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు.

ట్రాఫికర్లుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా తదుపరి విచారణ కోసం ఫ్రాన్స్‌లోనే ఉన్నారు.

తర్వాత, వీరిద్దరినీ కోర్టు విడుదల చేసింది.

మంగళవారం ఉదయం ఈ విమానం ముంబయిలో దిగింది.

ప్రయాణికుల్లోని కొందరు ‘‘మానవ అక్రమ రవాణా బాధితులు’’ కావొచ్చంటూ అధికారులకు అనధికారిక సమాచారం అందిన తర్వాత గురువారం ఫ్రాన్స్‌లోని వాట్రి ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానాన్ని నిలిపేసినట్లు ఫ్రాన్స్ ప్రాసిక్యూటర్లు చెప్పారు.

విమానంలో ఉన్నవారిలో ఎక్కువమంది యూఏఈలో పనిచేస్తోన్న భారతీయ పౌరులుగా భావిస్తున్నారు .

ప్రయాణికుల్లో మూడోవంతు మంది గుజరాత్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.

విమానంలోని కొందరు వ్యక్తులు అమెరికా లేదా కెనడాలో ప్రవేశించడం కోసం నికరాగ్వాకు ప్రయాణిస్తూ ఉండొచ్చని కూడా ఫ్రెంచ్ అధికారులు అనుమానించారు.

ఫ్రాన్స్ నుంచి విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతించేముందు, మానవ అక్రమ రవాణా అనుమానాలు రుజువయ్యాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

గమ్యస్థానమైన నికరాగ్వాకు వెళ్లకుండా విమానం ముంబయికి ఎందుకు తెచ్చారు అన్న విషయం కూడా అస్పష్టంగానే ఉంది.

A340 విమానం, లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. ఇది ఒక రొమేనియన్ చార్టర్ ఎయిర్‌లైన్ అని ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకర్ ‘ఫ్లైట్‌రాడార్’ పేర్కొంది.

ఎ340 విమానం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ట్రాఫికింగ్ అనుమానాలతో ఫ్రాన్స్‌లో విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు

అసలేం జరిగింది?

303 మంది భారత ప్రయాణికులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బయలుదేరిన విమానాన్ని శుక్రవారం ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్నారు.

దుబాయి నుంచి నికరాగ్వా రాజధాని మనాగ్వాకు విమానం వెళ్లాల్సి ఉంది.

అయితే, ఈ ఎయిర్‌బస్ A340 విమానాన్ని మానవ అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నట్లు ఫ్రెంచ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

విమానం గురించి రహస్య సమాచారం అందడంతో వాట్రి విమానాశ్రయంలో (పారిస్‌కు 150 కిలోమీటర్ల దూరంలో) నిలిపివేసినట్లు ఫ్రాన్స్‌ అధికారులు తెలిపారు.

విమానం నిలిపివేసిన తర్వాత అందులో కొంతమందిని భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత విమానాశ్రయాన్ని సీల్ చేశారు. విమానాన్ని నికరాగువాకు ఎందుకు తీసుకెళుతున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఘటనను ధ్రువీకరించింది, ఫ్రెంచ్ అధికారులు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఒక ప్రకటనలో చెప్పింది.

"భారత సంతతికి చెందిన కొందరు పౌరులతో దుబయి నుంచి నికరాగువా వెళుతున్న విమానం ఫ్రాన్స్‌లోని విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఎంబసీ బృందం అక్కడికి చేరుకుంది, వారికి కాన్సులర్ యాక్సెస్ కూడా లభించింది. ఎంబసీ దీనిపై దర్యాప్తు చేస్తోంది" అని రాయబార కార్యాలయం తెలిపింది.

లెజెండ్ ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, లెజెండ్ ఎయిర్‌లైన్స్ గురువారం నుంచి ఫ్రాన్స్‌లో నిలిచిపోయింది

మానవ అక్రమ రవాణాకు ఉపయోగించారా?

రొమేనియన్ చార్టర్ కంపెనీ అయిన లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానమది.

ఫ్రెంచ్ అధికారుల విచారణకు సహకరించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని ఎయిర్ లైన్స్ లాయర్ లిలియానా బాకయోకో ఫ్రెంచ్ మీడియాకు తెలిపారు.

మరికొద్ది రోజుల్లో మళ్లీ ఇక్కడి నుంచి విమానం టేకాఫ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫ్రాన్స్‌లోని నేషనల్ ఆర్గనైజేషన్ ఎగైనెస్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ అయిన జునాల్కో ఈ కేసు దర్యాప్తును చేపట్టిందని ఫ్రెంచ్ వార్తాపత్రిక 'లా మోండే' తెలిపింది.

విమానంలో ఉన్న అందరినీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

కఠినంగా ఇమిగ్రేషన్ విధానాలు

ఇటీవలి కాలంలో యూరప్, అమెరికాలు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశాయి.

యుక్రెయిన్‌పై రష్యా దాడి, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం, అనేక ఆఫ్రికా దేశాలలో అంతర్యుద్ధం కారణంగా అమెరికా, యూరప్‌లకు అక్రమంగా వెళ్లే వారి సంఖ్య పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో మానవ స్మగ్లర్ల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఈ రాకెట్లను నడుపుతున్న వ్యక్తులు అక్రమంగా అమెరికా, యూరప్ దేశాలకు ప్రజలను తీసుకెళ్తున్నారు.

అయితే, ఈ దేశాల్లో బయటి నుంచి వచ్చే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌కు కుటుంబాలను తీసుకురావాలనుకునే వ్యక్తులకు ఏటా కనీసం రూ.40 లక్షల (38,700 పౌండ్లు) సంపాదన ఉండాలని బ్రిటన్ తెలిపింది.

ఈ చట్టం 2025 ప్రారంభంలో అమల్లోకి వస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఏటా రూ.19 లక్షలు (£18,600) సంపాదిస్తున్న వ్యక్తి కుటుంబాన్ని తీసుకురావచ్చు.

కొద్ది రోజుల క్రితం బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ఐదు అంశాల ప్రణాళికను ప్రకటించారు.

గతేడాది మూడు లక్షల మంది బ్రిటన్‌కు రావడానికి అర్హత సాధించారని తెలిపారు. అయితే రాబోయే కొన్నేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు బ్రిటన్‌కు రాలేరు.

2022లో 7,45,000 మంది వలసదారులు బ్రిటన్‌కు వచ్చారు. దీనిపై చాకచక్యంగా మాట్లాడితే చాలు. ఇమ్మిగ్రేషన్ విధానం న్యాయంగా, పారదర్శకంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)