Cambodia Stolen Idols: దేవాలయాల నుంచి దొంగతనానికి గురైన పురాతన విగ్రహాలను ఈ దేశం బ్రిటన్‌లో ఎందుకు వెదుకుతోంది?

10వ శతాబ్దానికి చెందిన శివ, స్కంద విగ్రహాలు

ఫొటో సోర్స్, Bhopa Phorn/BBC

ఫొటో క్యాప్షన్, 10వ శతాబ్దానికి చెందిన శివ, స్కంద విగ్రహాలు. ఇటీవలే ఇవి తిరిగి కంబోడియాకు చేరుకున్నాయి

కంబోడియా నుంచి దొంగిలించిన విలువైన పురాతన విగ్రహాలు, కళాకృతులు బ్రిటన్‌లో ఉన్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు బ్రిటిషన్ మ్యూజియమ్స్‌ను కంబోడియా అధికారుల కోసం తెరుస్తున్నారు.

శుక్రవారం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియమ్‌ను కంబోడియా అధికారులు సందర్శిస్తారు. ఆ తరువాత బ్రిటిష్ మ్యూజియ్‌కు వెళ్తారు.

అంతర్గత సంక్షోభం సమయంలో తమ దేశంలోని దేవాలయాల నుంచి దొంగతనానికి గురైన పురాతన వస్తువులను కనుగొనేందుకు సాయం చేయాల్సిందిగా బ్రిటన్‌ను కంబోడియా కోరుతోంది.

తమ వద్ద ఉన్న వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎటువంటి దాపరికం లేకుండా వెల్లడిస్తామని రెండు బ్రిటిష్ మ్యూజియాలు చెబుతున్నాయి.

దశాబ్దాల పాటు సాగిన దోపిడి వల్ల అనేక కాంబోడియా దేవాలయాలు శిథిలమై పోయాయి

ఫొటో సోర్స్, Nick Woolley/BBC

ఫొటో క్యాప్షన్, దశాబ్దాల పాటు సాగిన దోపిడి వల్ల అనేక కంబోడియా దేవాలయాలు శిథిలమై పోయాయి

1990లలో తమ దేవాలయాల నుంచి ఎన్నో విలువైన విగ్రహాలు, వస్తువులను అక్రమంగా బయటకు తరలించారని... వాటిని బ్రిటిష్ మ్యూజియం సొంతం చేసుకుందని కంబోడియా భావిస్తోంది.

తమ దేశంలోని పవిత్రమైన దేవాలయాల నుంచి సాంస్కృతిక సంపద అక్రమంగా లండన్‌లోని మ్యూజియమ్స్‌కు చేరిందని కంబోడియా సాంస్కృతిక శాఖ మంత్రి అన్నారు. వాటిని తిరిగి దక్కించుకునేందుకు బ్రిటన్‌ను సాయం చేయాల్సిందిగా ఈ ఏడాది మొదట్లో కోరారు.

పురాతన విగ్రహాల్లో తమ పూర్వీకుల ఆత్మలు ఉంటాయని కంబోడియన్ ప్రజలు భావిస్తారు.

ఒకనాడు పురాతన వస్తువులు దొంగిలించే వృత్తిలో ఉన్న వారితో కంబోడియా అధికారులు మాట్లాడారు. కంబోడియా నుంచి వాటిని ఎలా తరలించారో, వాటిని ఎవరికి అమ్మారో పరిశోధించారు.

తమ దేశం నుంచి దొంగతనానికి గురైన పురాతన వస్తువుల్లో చాలా వరకు బ్రిటిష్ రోగ్ డీలర్ డగ్లస్ లాచ్‌ఫర్డ్ ద్వారా బ్రిటిష్ మ్యూజియమ్స్‌కు చేరాయని కంబోడియా నమ్ముతోంది. 2020లో డగ్లస్ చనిపోయాడు.

దొంగతనానికి గురి కాక ముందు కొహ్ కేర్ ప్రాంతంలోని కళాకృతులు
ఫొటో క్యాప్షన్, దొంగతనానికి గురి కాక ముందు కొహ్ కేర్ ప్రాంతంలోని కళాకృతులు

బ్రిటిష్ మ్యూజియంలో సుమారు 100 కంబోడియా వస్తువులు ఉన్నట్లు అంచనా.

కంబోడియా లో సుమారు మూడు దశాబ్దాల పాటు అంతర్యుద్ధం, ఘర్షణ చెలరేగాయి. 1975-79 మధ్య అధికారాన్ని కైవసం చేసుకున్న ఖమేర్ రూజ్ రక్తసిక్త పాలనలో సుమారు 20 లక్షల మంది కంబోడియన్ ప్రజలు చనిపోయారు. 1990ల చివరి వరకు ఖమేర్ రూజ్ గ్రూపు చేతిలోనే అధికారం ఉండి పోయింది.

ఈ కాలంలో ఆ దేశానికి చెందిన ఎన్నో విలువైన పురాతన వస్తువులు సరిహద్దులు దాటాయి. చాలా వరకు వస్తువులు పశ్చిమ దేశాల మ్యూజియాలకు చేరాయి. మరికొన్నింటిని ప్రైవేటు వ్యక్తులు కొనుకున్నారు.

ఇటీవల అమెరికా నుంచి కొన్ని పురాతన వస్తువులను కంబోడియా వెనక్కి తీసుకురాగలిగింది.

వీడియో క్యాప్షన్, ఇనుప చువ్వలు, సూదులు గుచ్చుకుంటే వీరికి నొప్పి కలగదా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)