కంబోడియా: ఇరవై లక్షల మందిని చంపేసిన ప్రభుత్వం నుంచి తప్పించుకుని వందేళ్ల వయసులో కలుసుకున్న అక్కాచెల్లెళ్లు

ఫొటో సోర్స్, ccf
వారిద్దరూ అక్కచెల్లెళ్లు.. అక్క వయసు 101, చెల్లెలు వయసు 98 ఏళ్లు. చనిపోయారనుకున్న వారిద్దరూ 47 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.
కంబోడియాలో 1970ల నాటి ఖెమెర్ రూజ్(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కంపూచియా ప్రభుత్వం) అరాచక పాలనా కాలంలో చనిపోయిన సుమారు 20 లక్షల మందిలో తన సోదరి కూడా ఉండిఉండొచ్చని ఇద్దరూ ఎవరికి వారు అనుకుని ఆశలు వదులుకున్నారు.
ఖెమెర్ రూజ్ పాలనకు నేతృత్వం వహించిన పోల్ పాట్ 1975లో అధికారం చేజిక్కించుకోవడానికి రెండేళ్ల ముందు 1973లో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చివరిసారి కలుసుకున్నారు.
కాగా అక్కచెల్లెళ్లలో ఒకరైన బున్ సెన్(98) ఇప్పుడు తమ సోదరుడిని(92) కూడా కలుసుకోగలిగారు.



ఫొటో సోర్స్, Getty Images
20 లక్షల మంది మరణం
ఖెమెర్ రూజ్ పాలనాకాలంలో సుమారు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో వేలాది కుటుంబాలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యాయి. వేలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు.
పోల్ పాట్ అధికారంలో ఉన్నప్పుడు బున్ సెన్ తన భర్తను కోల్పోయారు. ఆ తరువాత రాజధాని ఫ్నామ్ పెన్ లోని స్టంగ్ మీంచె మున్సిపల్ డంప్యార్డ్ ప్రాంతంలో ఆమె స్థిరపడ్డారు.
అక్కడే చెత్తలో రీసైకిలబుల్ వస్తువులు సేకరించి అమ్ముకుంటూ.. సమీపంలోని కాలనీల్లో పిల్లలను ఆడించే పనిచేస్తూ జీవించారు.
ఆమె ఎప్పుడూ అక్కడికి 130 కిలోమీటర్ల దూరంలోని కాంపాంగ్ చాంప్ ప్రావిన్స్లోని తన సొంత ఇంటికి తిరిగి వెళ్లడం గురించి మాట్లాడుతుండేవారు.
కానీ, ఆమె వయసు, నడిచే శక్తి లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఆమె మళ్లీ తన సొంతింటికి తిరిగి వెళ్లలేకపోయారు.

ఫొటో సోర్స్, ccf
13 మంది బంధువులను చంపేశారు
కంబోడియన్ చిల్డ్రన్స్ ఫండ్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి 2004 నుంచి బున్ సెన్ పోషణ బాధ్యత చూడడం ప్రారంభించింది. ఆ సంస్థ ఆమెను తన సొంతింటికి తీసుకెళ్లాలని తలపోసింది.
ఆ ప్రయత్నాల్లో భాగంగా అక్కడ సొంతూరిలో బున్ సెన్ అక్క, తమ్ముడు ఉన్నట్లు గుర్తించింది.
ఆ తరువాత బున్సెన్ను అక్కడికి తీసుకెళ్లడంతో 47 ఏళ్ల తరువాత ఆమె తన అక్కను, తమ్ముడిని కలుసుకోగలిగారు.

ఫొటో సోర్స్, ccf
''ఎన్నో ఏళ్ల కిందట నేను ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తరువాత మళ్లీ తిరిగి రాలేకపోయాను. అక్క, తమ్ముడు చనిపోయి ఉంటారని అనుకున్నాను'' అన్నారామె.
''నా అక్కను హత్తుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.. తమ్ముడి చేయి తగలగానే ఏడుపొచ్చేసింది'' అంటూ భావోద్వేగానికి గురయ్యారామె.
ఇక బున్ సెన్ అక్క 102 ఏళ్ల బున్ చియా కూడా తన చెల్లెలు చనిపోయి ఉంటుందనే ఇంతకాలం అనుకున్నారు.
బున్ చియా భర్తను పోల్ పాట్ ప్రభుత్వం చంపేయడంతో 12 మంది పిల్లలతో ఆమె ఒంటరిగా బతుకు సాగించారు.

ఫొటో సోర్స్, ccf
''పోల్ పాట్ మా బంధువుల్లో 13 మందిని చంపేశాడు. చెల్లెలు కూడా ఆ సమయంలోనే చనిపోయి ఉంటుందనుకున్నాం'' అన్నారు బున్ చియా.
ఇంతకాలం అనుభవించిన ఎడబాటును వారిప్పుడు భర్తీ చేసుకుంటున్నారు. అక్కచెల్లెళ్లిద్దరూ కలిసి ఇటీవలే రాజధాని ఫ్నామ్ పెన్ పర్యటనకు వెళ్లారు.

ఫొటో సోర్స్, Bettmann/gettyimages
ఇంతకీ ఖెమెర్ రూజ్ పాలకులు అంటే ఎవరు?
* కంబోడియాలో 1975-79 మధ్య ఖెమెర్ రూజ్ క్రూర పాలన సాగింది. ఆ సమయంలో సుమారు 20 లక్షల మందిని హతమార్చారు.
* పోల్ పాట్ పాలనలో కంబోడియాను మధ్య యుగాల కాలానికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి. నగరాలు, పట్టణాల్లోని లక్షలాది మందిని బలవంతంగా పల్లెటూర్లకు తరలించి అక్కడి పొలాల్లో పనిచేయించారు.
* ఖెమెర్ రూజ్ కాలం నాటి నాయకుల్లో ప్రస్తుతం జీవించి ఉన్నవారిని విచారించడానికి 2009లో ఐరాస ఒక ట్రైబ్యునల్ ఏర్పాటుకు సహకరించింది.
* ఖెమెర్ రూజ్ పాలకుల్లో ముగ్గురికి మాత్రమే శిక్ష పడింది. ఆ కాలంలో అరాచకాలకు నిలయమైన త్యుయోల్ స్లెంగ్ జైలు బాధ్యతలు చూసిన కైంగ్ గ్యుయెక్ ఈవ్, ఖెమెర్ రూజ్ పాలనలో అధ్యక్షుడిగా ఉన్న ఖియూ సంఫాన్, అప్పటి ప్రధాని పోల్ పాట్కు డిప్యూటీగా పనిచేసిన న్యూయాన్ చియాలను జైలుకు పంపించారు.

ఇవి కూడా చదవండి:
- ట్రంప్కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...
- భారతీయ ప్రాచీన చిత్రకారుల అద్భుత కృషి 'కంపెనీ పెయింటింగ్స్' పేరుతో ఎందుకు మరుగున పడింది?
- ‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం
- డోనల్డ్ ట్రంప్ భారత పర్యటన: మోదీతో భేటీలో 'మత స్వేచ్ఛ'పై చర్చించనున్న అమెరికా అధ్యక్షుడు
- ‘‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటూ బాధపడ్డ బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం
- కశ్మీర్, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...
- కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య
- ఛత్తీస్గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?
- విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









