ఈజిప్ట్ సమాధిలో హిందూ దేవతల విగ్రహాలు దొరికాయా - BBC Fact Check

ఫొటో సోర్స్, Reuters
4,400 సంవత్సరాలుగా ప్రపంచానికి తెలియని ఓ అరుదైన భారీ సమాధిని ఈజిప్టులో పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, అక్కడ హిందూ దేవుళ్లు, దేవతలకు చెందిన విగ్రహాలు బయట పడ్డాయంటూ ఓ ఫొటోను హిందూవాద సోషల్ మీడియా పేజీలు కొన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
ఆ ఫొటోతో పాటు ‘ముస్లిం దేశమైన ఈజిప్టులోని ఓ సమాధిలో హిందూ దేవాలయం బయటపడింది’ అనే సందేశాన్నీ పంచుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ అలాంటి తవ్వకాలు జరిపినా హిందూ దేవతల విగ్రహాలు బయటపడతాయని, ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హిందూమతం విస్తరించి ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని కూడా ఆ పోస్టును పెట్టిన వారు అంటున్నారు.
ఆ ఫొటో చూడ్డానికి నిజంగా తవ్వకాలు జరిపిన ప్రాంతానికి చెందిన దానిలానే ఉంది. అక్కడో మనిషి కూర్చొని ఉన్నాడు. వెనక ఏవో విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA/VIRAL POST
గూగుల్లో రివర్స్ ఇమేజ్ పద్ధతిలో వెతికితే ఆ ఫొటో నిజమైనదే అని అర్థమవుతోంది. కానీ, ఆ ఫొటోలో ప్రస్తావించిన విషయం మాత్రం పూర్తిగా కల్పితం. ఓ నకిలీ వార్తను ప్రచారం చేసేందుకు ఆ ఫొటోతో పాటు విగ్రహాలకు సంబంధించిన సందేశాన్నీ రాస్తున్నారు. ఆ ఫొటోలో చూపించిన ప్రాంతం నిజంగానే ఈజిప్ట్లో తవ్వకాలు జరిగిన ప్రాంతానిదేనని మా పరిశోదనలో తేలింది.
కానీ, అక్కడ హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు బయటపడ్డాయని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు. క్రీస్తు పూర్వం 2,500-2,350 మధ్య ఈజిప్ట్ను పాలించిన ఐదో సామ్రాజ్యానికి చెందిన కళాకృతులు అక్కడ కనిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సమాధి ప్రత్యేకత ఏంటి?
ఈజిప్ట్లోని పురాతత్వ శాస్త్రవేత్తలు గత వారం ఓ అరుదైన సమాధిని తమ తవ్వకాల్లో గుర్తించారు. గత 4,400 ఏళ్లలో మనిషి కంటపడని భారీ సమాధి అది.
‘గత దశాబ్దకాలంలో బయటపడ్డ అత్యద్భుత నిర్మాణం అదే’ అని ఈజిప్ట్కు చెందిన సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ కార్యదర్శి మొస్తఫా వజీరీ అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే.

ఫొటో సోర్స్, Reuters
కైరోకి దగ్గర్లోని సఖారా పిరమిడ్ల సముదాయంలో ఆ సమాధి బయటపడింది. అందులో రంగురంగుల చిత్ర లిపితో పాటు ఫరావోల విగ్రహాలు కనిపించాయి. (ఫరావోలను సగం మనిషి, సగం దేవుడిగా ఈజిప్ట్ వాసులు నమ్మేవారు. వాళ్లు దేవాలయాలకు పెద్దలుగా (హై ప్రీస్ట్) ఉండేవారు)

ఫొటో సోర్స్, Reuters
ఆ సమాధి విశేషాలను బీబీసీ, సీఎన్ఎన్ లాంటి అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించాయి. భారత్లో నకిలీ వార్త ప్రచారం కోసం ఉపయోగించిన ఫొటోను అనేక మీడియా సంస్థలు ఉపయోగించాయి.

ఫొటో సోర్స్, Reuters
ఓ పర్వత శ్రేణి అంచులో ఈ సమాధి కనిపించింది. అందుకే ఇది దొంగల కంట పడలేదని భావిస్తున్నారు. సమాధుల్లో ఎక్కువగా పరావోల విగ్రహాలు కనిపించడాన్ని చూస్తే, ఈజిప్ట్లో గతంలో వారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో తెలుస్తోంది.
గతంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి ఆందోళన జరిగినప్పుడు కూడా కొన్ని నకిలీ ఫొటోలను హిందూ అతివాత పేజీలు ప్రచారం చేశాయి. ఆ ఫొటోకు సంబంధించిన వివరాలను కూడా బీబీసీ ప్రచురించింది.
ఇవి కూడా చదవండి
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- మూక దాడుల్లో చిక్కుకున్నప్పుడు తప్పించుకునే మార్గాలు
- రాయలసీమకు ఆ పేరు ఎలా.. ఎప్పుడు వచ్చింది? ఎవరు పెట్టారు?
- వంట చేశాడు... ఇళ్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- సూర్యకాంతం: ఇప్పుడు గుండమ్మను ఎక్కడి నుంచి తేవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








