శ్రీలంక: తమిళులను చూసి తెలుగు ప్రజలు ఎందుకు దాక్కుంటున్నారు?

- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ కోసం
శ్రీలంకలో భిన్న సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తారు. అయితే, కొంతమందిపై ఇప్పటికీ నిర్లక్ష్యం కనబడుతోంది. వారు ఎలా జీవిస్తున్నారో ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియడం లేదు.
భారత్లోని భిన్న రాష్ట్రాలకు చెందిన ప్రజలు శ్రీలంకలో జీవిస్తున్నారు. కళలు, సంస్కృతి, వారతస్వ సంపద, భాషలపై వారి చెరగని ముద్ర కనిపిస్తుంది.
అలా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన ప్రజలు శ్రీలంకలో ఎలా జీవిస్తున్నారో బీబీసీ పరిశీలించింది.
తూర్పు శ్రీలంకలోని అంపారా జిల్లాలోని ప్రాంతాలను బీబీసీ సందర్శించింది. ఇక్కడి అలైయడివెంబు డివిజినల్ సెక్రటేరియట్లోని అలిక్కంబాయి ప్రాంతంలో తెలుగు ప్రజలు జీవిస్తున్నారు.
అలైయడివెంబుకు 15 కి.మీ. దూరంలోని అటవీ ప్రాంతంలో వారు జీవిస్తున్నారు.

యాచనే జీవనాధారం
ఇక్కడి తెలుగు ప్రజలు రోజువారీ జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరు ప్రధానంగా యాచనపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
రాజు రాజసింహ-2 భారత్ నుంచి శ్రీలంకకు వలస వెళ్లినప్పుడు ఆయన వెంటే ఈ ప్రజలు కూడా వెళ్లినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వీరు నేరుగా ఇక్కడికి వచ్చినట్లు వివరిస్తున్నారు. వీరు జంతువులను వేటాడే గిరిజనులు. ప్రధానంగా మురుగన్ను ఆరాధిస్తుండేవారు.
మొదట్లో వీరు హిందువులు అయినప్పటికీ, ప్రస్తుతం చాలా మంది క్రైస్తవంలోకి మారారు. 410 కుటుంబాలకు చెందిన దాదాపు 2,000 మంది ఇక్కడ జీవిస్తున్నారు.

ఆటవిక జీవనం
విద్య, మంచినీరు, ఇళ్లు, రవాణా లాంటి ప్రాథమిక వసతులు లేకుండానే ఇక్కడి ప్రజలు వందల ఏళ్ల నుంచి జీవిస్తున్నారు.
ఇక్కడికి మొదట వచ్చిన ప్రజల నాలుగో జనరేషన్ ఈస్టర్న్ ప్రావిన్స్లోని భిన్న ప్రాంతాలకు వలసవెళ్లింది. వీరిలో కొందరు కొన్ని ఏళ్ల నుంచీ అలిక్కంబాయి అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారు.
ఇక్కడి ప్రజల్లో చాలా మంది తమిళ్ లేదా సింహళ భాష మాట్లాడగలరు. అయితే, వీరి మాతృభాష తెలుగు. శ్రీలంకలో చాలా మంది తెలుగు ప్రజలు తమ మాతృభాషను మరచిపోయినప్పటికీ, వీరు మాత్రం ఇప్పటికీ చక్కగా తెలుగులో మాట్లాడగలుగుతున్నారు.
తమకు యాచనే జీవనాధారమని ఇక్కడ జీవించే కందసామి బీబీసీతో చెప్పారు.

కురవన్, కురథి
''మేం శ్రీలంకలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. మాకు భూమి లేదు. ఎలాంటి సాయమూ అందడం లేదు. క్రైస్తవ మతాధికారులే మాకు సాయం చేస్తుంటారు. మాకు ఒక వృత్తి అంటూ ఏదీ లేదు. గ్రామాలకు వెళ్లి మేం భిక్షాటన చేస్తాం. కొన్నిసార్లు రోజు కూలీగా పనులు చేస్తుంటాం. మాకు సరైన మంచినీటి సదుపాయం లేదా ఇల్లు లేవు. స్నానం చేయాలన్నా మేం రెండు నుంచి మూడు మైళ్లు నడవాల్సి ఉంటుంది. కొన్ని నెలల్లో యాచన మాత్రమే మాకు జీవనాధారం అవుతుంది. అదిలేకపోతే మేం ఆకలితో జీవించడమే''అని కందసామి చెప్పారు.
''తమిళ ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు.. మీరు తక్కువ కులమైన కురవార్ ప్రజలని అంటారు. మాపై వివక్ష చూపిస్తారు. అందుకే ఎవరైనా కనిపిస్తే, వెంటనే మేం దాక్కుంటాం''అని ఆయన వివరించారు.
''నీరు కూడా పట్టుకోనివ్వరు''
''మేం 1990ల్లో అలిక్కంబాయికి వచ్చాం. అడవుల్లో జీవిస్తుంటాం. ఎవరైనా వీధుల్లో కనిపించిన వెంటనే, మేం దాక్కుంటాం. ఎందుకంటే మాకు నాగరిక ప్రజలతో సంబంధాలు చాలా తక్కువ. మేం తమిళ్ మాట్లాడం. మాకు తెలుగు మాత్రమే వచ్చు. ఇక్కడ మా కోసం ఒక క్రైస్తవ మతాధికారి ఒక ఇల్లు, చర్చి కట్టించారు. నేను ఐదో తరగతి వరకు చదువుకున్నాను. 1990ల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మేం తిరుక్కోవిల్గా పిలిచే ప్రాంతానికి వెళ్లాం. అక్కడ కూడా మాకు వివక్షే ఎదురైంది. కనీసం మంచినీళ్లు కూడా మేం తీసుకోవడానికి వీలుండేది కాదు''అని కందసామి వివరించారు.
''మాకు తగడానికి నీళ్లు కూడా ఉండవు. అందుకే మేం రహస్యంగా నీళ్లు పట్టుకుంటాం. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మా కోసం ఒక పాఠశాల కూడా కట్టారు. అయితే, ఏనుగుల భయం వల్ల టీచర్లు ఇక్కడికి రావడం లేదు. నేను ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాను. మాపై తమిళ ప్రజలు వివక్ష చూపిస్తారు. మేం కురవ కులానికి చెందిన వారమని అంటారు. వారు మాత్రం ఉన్నత కులానికి చెందినవారని చెబుతారు. కానీ, కొందరు మా ఇళ్లలో భోజనం చేస్తారు''అని ఒక తెలుగు మహిళ చెప్పారు.
''కురవ పిల్లలని పిలుస్తారు''
చాలా కష్టాల తర్వాత ఇక్కడుండే తెలుగు అమ్మాయి నల్లనన్ సుగన్య.. యూనివర్సిటీ డిగ్రీని పూర్తిచేశారు. తన అనుభవాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.
''మమ్మల్ని స్కూళ్లలో, కాలేజీల్లో ఏడిపిస్తుంటారు. కురువ, కురాథి అని పిలుస్తారు. మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ మాపై వివక్ష చూపిస్తుంటారు. మేం బాగా చదువుకొని, సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నాం. నేను ఇక్కడే చదువుకున్నాను. ఎలాంటి ఆందోళనా పడొద్దని మా సర్ నాకు చెప్పారు. మేం చోళుల వారసులమని ఆయన చెబుతుంటారు''అని ఆమె వివరించారు.
తనను యాచకురాలంటూ ఎగతాళి చేసిన వారే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రావడంతో తనతో మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సైరస్ మిస్త్రీ మరణానికి బాధ్యులెవరు?
- కాలా నమక్: ఈ బియ్యం నుంచి వచ్చే సువాసనకు బుద్ధుడితో సంబంధం ఏమిటి?
- ప్రేమిస్తే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి చెప్పాలి, పెళ్లికి 6 నెలలు ఆగాలి.. పెళ్లయ్యాక 27 నెలలు అక్కడే గడపాలి..
- తెలంగాణలో వాటర్ స్పౌట్: సింగూరు ప్రాజెక్టు నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?
- ‘హిందువులు, సిక్కులను మిషనరీలు క్రైస్తవులుగా మారుస్తున్నాయ్’ అంటూ పంజాబ్లో వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














