తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత... జూలై 1 నుంచి అన్ని విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభం - Newsreel

కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

మరోవైపు అన్ని విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్ధతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.

చార్మినార్ హైదరాబాద్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ప్రజా జీవనం, సామాన్యుల బతుకు తెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది.

లాక్‌డౌన్ ఎత్తివేసినా, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర విధానాలను విధిగా పాటించాలని స్పష్టం చేసింది.

લાઇન

మియన్మార్ సైన్యానికి ఆయుధాలు అమ్మవద్దని తీర్మానించిన ఐక్యరాజ్యసమితి

మియన్మార్ సైన్యం 860 మందికి పైగా హతమార్చి, దాదాపు 5 వేల మందిని నిర్బంధంలోకి తీసుకుందని పర్యవేక్షణ సంస్థలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మియన్మార్ సైన్యం 860 మందికి పైగా హతమార్చి, దాదాపు 5 వేల మందిని నిర్బంధంలోకి తీసుకుందని పర్యవేక్షణ సంస్థలు చెబుతున్నాయి.

మియన్మార్‌లో హింసాత్మక సైనిక కుట్రకు నిరసనగా మియన్మార్‌కు ఆయుధాల అమ్మకాలు నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, మియన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం చేసిన తిరుగుబాటును ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ అరుదైన నిర్ణయం తీసుకుంది.

ప్రజాస్వామికంగా ఎన్నికైన దేశాధినేత ఆంగ్ సాన్ సూచీ సహా నిర్బంధంలోకి తీసుకున్న రాజకీయ నాయకులందరినీ విడుదల చేయాలని, శాంతియుతంగా నిరసనలు జరుపుతున్న పౌరులపై హింసాత్మక దాడులను ఆపివేయాలని ఐరాస పిలుపునిచ్చింది.

ఈ నిర్ణయానికి చట్టబద్ధమైన కట్టుబడి లేకపోయినా రాజకీయంగా కీలకమైంది.

"భారీ అంతర్యుద్ధం రాగల ప్రమాదం పొంచి ఉందన్నది నిజం. సమయం మించిపోతోంది. మిలటరీ తిరుగుబాటును వెనక్కి తీసుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి" అని యూఎన్‌లో మియన్మార్ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టిన్ ష్రానర్ బుర్గేనర్ జనరల్ అసెంబ్లికి తెలిపారు.

మియన్మార్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై హింసాత్మక దాడులకు పాల్పడవద్దని కూడా తీర్మానంలో పేర్కొన్నారు

ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని 119 దేశాలు ఆమోదించాయి. బెలారస్ మాత్రమే వ్యతిరేకించింది.

మియన్మార్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేసే రష్యా, చైనా సహా మరో 36 దేశాలు ఈ తీర్మానంపై మౌనం వహించాయి.

వీరిలో కొంతమంది ఇది ఆ దేశం అంతర్గత సంక్షోభం అంటూ కారణాలు చెప్పారు.

నాలుగేళ్ల క్రితం రొహింజ్యా ముస్లింలపై మిలటరీ చేసిన ఘోరమైన దాడుల గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించలేదని మరి కొందరు ఎత్తి చూపారు.

"ఈ తీర్మానం మిలటరీ కుట్రను, తమ సొంత పౌరులపై జరుపుతున్న దాడులను ఖండిస్తుంది. ప్రపంచం దృష్టిలో మియన్మార్ మిలటరీని ఒంటరి చేయడమే ఈ తీర్మానం లక్ష్యం" అని యూరోపియన్ యూనియన్ ఐరాసా రాయబారి ఒలోఫ్ స్కూగ్ అన్నారు.

అయితే, ఇలాంటి తీర్మానాన్ని ప్రకటించడానికి ఐక్యరాజ్యసమితికి ఎందుకింత సమయం పట్టిందంటూ మియన్మార్ యూఎన్ రాయబారి క్యావ్ మో తున్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఇప్పుడు పెద్ద ప్రయోజనం ఉండబోదని ఆయన నిరాశ వ్యక్తం చేశారు.

మిలటరీ తిరుగుబాటు చేసిన దగ్గర నుంచీ ఆంగ్ సాన్ సూచీ సైనిక నిర్బంధంలో ఉన్నారు. కోర్టుకు వచ్చినప్పుడు తప్ప అంతకు ముందుగానీ, ఆ తరువాతగానీ ఆమె కనిపించలేదు, వినిపించలేదు.

ఎన్నికల్లో కుట్ర జరిగిందంటూ ఫిబ్రవరిలో మియన్మార్ సైన్యం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పలువురు రాజకీయ నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది.

అప్పటి నుంచి, మిలటరీ కుట్రను ఖండిస్తూ ఆ దేశ పౌరులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

నిరసనలు తెలుపున్న పౌరులలో 860 కన్నా ఎక్కువమంది భద్రతా దళాల చేతిలో ప్రాణాలు కోల్పోయారని, సుమారు 5,000 మందిని నిర్బంధించారని మానిటరింగ్ గ్రూప్ 'అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్' (ఏఏపీపీ) తెలిపింది.

గత నెల, మియన్మార్ మిలటరీకి ఆయుధాల సరఫరాపై ఆంక్షలు విధించమని హ్యూమన్ రైట్స్ వాచ్ ఐరాసాను కోరింది.

"మియన్మార్ మిలటరీకి విక్రయించిన ఆయుధాలను వారు పౌరులపై దుర్వినియోగం చేయగలరని ప్రభుత్వాలు గుర్తించాలి. ఆయుధాల అమ్మకంపై వేటు ఇలాంటి నేరాలను ఆపుతుంది" అని ఆ సంస్థ అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)