థాయ్‌లాండ్ నిరసనలు: ఎమర్జెన్సీ విధించిన ప్రధాని... భారీ ప్రదర్శనలపై నిషేధం

ప్రజాస్వామ్యం కోసం పోరాటం

ఫొటో సోర్స్, Reuters

బ్యాంకాక్‌లో ప్రజా నిరసనలను అడ్డుకోవడమే లక్ష్యంగా థాయ్‌లాండ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సామూహికంగా ప్రజలు గుమిగూడటంపైనా నిషేధం విధించింది. చాలా వరకు శాంతియుతంగా సాగుతున్న ఈ ప్రజాస్వామ్య అనుకూల నిరసన ప్రదర్శనలు థాయి రాచరిక వ్యవస్థను కూడా వ్యతిరేకిస్తున్నాయి.

శాంతి భద్రతల పరిక్షణకు ఈ చర్యలు తప్పనిసరని చెబుతూ ఈ అంశంపై టీవీలో పోలీసులు ప్రకటన చేశారు.

గురువారం నిరసనలకు నేతృత్వం వహించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు బీబీసీకి సమాచారం అందింది.

థాయ్ రాజు అధికారాలకు కళ్లెం వేయాలని, ప్రధాన మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు విద్యార్థులు నేతృత్వం వహిస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం నాలుగు గంటల నుంచి ఇక్కడ అత్యయిక స్థితి అమలులోకి వచ్చింది.

పనుసయా

ఫొటో సోర్స్, LILLIAN SUWANRUMPHA/AFP

ఫొటో క్యాప్షన్, పనుసయా

నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నాయకులు - మానవ హక్కుల ఉద్యమకారుడు, న్యాయవాది అయిన 36ఏళ్ల అనోన్ నంప, పెంగ్విన్‌గా సుపరిచితుడైన విద్యార్థి నాయకుడు పారిట్ చివారక్, పనుసయా సిథిజిరావతనకుల్‌లను అరెస్టు చేసినట్లు బీబీసీకి సమాచారం అందింది. అయితే, వీరి పేర్లను పోలీసులు ధ్రువీకరించలేదు.

ఆగస్టులో సంస్కరణలే లక్ష్యంగా రాచరికానికి వ్యతిరేకంగా గళమెత్తిన తొలి ఉద్యమకారుడు అనోన్. నెల రోజుల తర్వాత సంస్కరణలపై పది పాయింట్ల మేనిఫెస్టోను పనుసయా విడుదల చేశారు. నిరసనలకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తున్న చిత్రాల్లో ఆమె ఫోటో ఒకటి.

జులైలో చెలరేగిన ఈ విద్యార్థుల నిరసనలకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు అనోన్, పారిట్ అరెస్టయ్యారు. కానీ 21ఏళ్ల పనుసయా అరెస్టు కావడం ఇదే తొలిసారి.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఆంక్షల్లో ఏమున్నాయి?

ఆంక్షలకు సంబంధించిన పోలీసుల ప్రకటన మొదట ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో ప్రసారమైంది. ''బ్యాంకాక్‌లో అక్రమంగా నిరసనలు చేపట్టేలా చాలా బృందాలు రెచ్చగొడుతున్నాయి. ముఖ్యంగా నిరసనకారులు ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు''అని ప్రకటనలో పేర్కొన్నారు.

థాయ్ రాజు వాహన శ్రేణితో నిరసనకారుల ఘర్షణ కూడా అత్యయిక పరిస్థితిని విధించడానికి కారణమని వివరించారు.

బ్యాంకాక్‌లో రాణి ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులను తోసుకుంటూ నిరసనకారులు భారీగా గుమిగూడి మూడు వేళ్లతో సెల్యూట్ చేశారు. ఇక్కడ నిరసనలు మొదలైనప్పటి నుంచి ఆందోళనకారులు మూడు వేళ్లతో సెల్యూట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

అత్యవసర పరిస్థితి విధించిన కొద్దిసేపటికే.. ప్రధాన మంత్రి కార్యాలయం వెలుపల నిరసనకారులను పోలీసులు చెదరొట్టారు. కొందరు బారికెడ్ల లాంటి నిర్మాణాలతో అడ్డుకునేందుకు ప్రయత్నించారని, కానీ పోలీసులు వారిని వెనక్కి తగ్గేలా చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

నిరసనకారులను చెదరగొట్టిన తర్వాత వీధుల్లో వందల సంఖ్యలో పోలీసులు కనిపించారు.

అత్యవసర పరిస్థితిలో భాగంగా నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు జాతీయ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో భ్రమలు, భయాలు కలిగించే వార్తలకు సంబంధించి మీడియాపైనా ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు.

మరోవైపు తాము నిర్దేశించిన ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా ఆంక్షలు వీలుకల్పిస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Reuters

ఎందుకు నిరసన చేపడుతున్నారు?

క్రమంగా తీవ్రమవుతున్న విద్యార్థుల నిరసనలు థాయ్ అధికారులకు సవాల్‌గా మారుతున్నాయి.

దేశంలో ఇలాంటి రాజకీయ కల్లోల పరిస్థితులు కొత్తేమీ కాదు. అయితే ఫిబ్రవరిలో ఓ ప్రజాస్వామ్య అనుకూల పార్టీపై ఓ కోర్టు నిషేధం విధించడంతో మళ్లీ కొత్తగా నిరసనలు మొదలయ్యాయి.

ద ఫ్యూచర్ ఫార్వర్డ్ పార్టీ (ఎఫ్‌ఎఫ్‌పీ)కి యువతలో మంచి ఆదరణ ఉండేది. గతేడాది మార్చిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా ఇది అవతరించింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రస్తుత సైనిక అధినాయకత్వమే విజయం సాధించింది.

2014లో సైనిక తిరుగుబాటు అనంతరం కంబోడియాలో తలదాచుకుంటున్న ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుడు వాంచెలామ్ సత్సాకిట్ గత జూన్‌లో కనిపించకుండా పోయారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా నిరసనలు ఊపందుకున్నాయి.

వాంచెలామ్ ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. అయితే ఆయన్ను థాయ్ ప్రభుత్వమే కిడ్నాప్‌ చేసిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను థాయ్ ప్రభుత్వం తిరస్కరిస్తోంది.

జులై నుంచీ ఇక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల్లో చూడనంత భారీ నిరసనలు గత వారాంతంలో చోటుచేసుకున్నాయి. ఆంక్షలను తోసిరాజంటూ మార్పు కోసం వేల మంది గళమెత్తారు.

తిరుగుబాటు సాయంతో అధికారంలోకి వచ్చిన మాజీ సైన్యాధిపతి, ప్రస్తుత ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్-వోచా రాజీనామా చేయాలని, రాజ్యాంగంలో మార్పులు చేయాలని, విమర్శకులను వేధించడం ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక్కడ రాచరికాన్ని విమర్శిస్తే సుదీర్ఘ కాలం జైలు శిక్షలు తప్పనిసరి. అయితే, ఇలాంటి నిబంధనల్లో మార్పు రావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)