ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై దాడి.. ‘భారీ మూల్యం చెల్లిస్తారు’ - ఇరాన్‌కు డోనల్డ్ ట్రంప్ హెచ్చరిక

ఇరాక్ ఎంబసీపై దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఇరాక్‌లో ఉన్న అమెరికా ఎంబసీపై జరిగిన దాడికి ఇరానే కారణం అని ఆరోపించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

ట్రంప్ తన ట్విటర్ అకౌంట్‌లో "ఇరాక్‌లోని అమెరికా ఎంబసీ భద్రతను కొన్ని గంటల్లో పునరుద్ధరించాం. సాహసికులైన మా సైనికులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో అక్కడికి చేరుకున్నారు. దీనికి ఇరాక్ అధ్యక్షుడు, ప్రధానమంత్రులకు ధన్యవాదాలు. వారు మేం కోరగానే చాలా వేగంగా స్పందించారు" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"మా ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగినా, ప్రాణనష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత ఇరాన్‌దే అవుతుంది. అది దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఇది హెచ్చరిక కాదు. బెదిరింపు. నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడి ఈ సీరియస్ ట్వీట్ తర్వాత అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ పశ్చిమాసియాకు వెంటనే 750 మంది సైనికులను పంపిస్తున్నట్లు ప్రకటించారు.

ట్రంప్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా ఎంబసీ మూసేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు

ట్రంప్ బెదిరింపు ఎందుకు?

ఇరాక్‌లో ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై అమెరికా ఇటీవల వైమానిక దాడులు చేసింది.

ఈ దాడులకు నిరసనగా ఇరాక్ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ పరిసరాల్లో దాడులు జరిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అమెరికా సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.

ఆందోళనకారులు ఎంబసీ ప్రహరీ గోడ దూకి లోపలకి చొచ్చుకొచ్చారు. బయట ఒక సెక్యూరిటీ పోస్టుకు నిప్పు పెట్టారు.

ఈ దాడి వెనుక ఇరాన్ ఉందని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. దాడికి పూర్తి బాధ్యత ఇరాన్‌దే అన్నారు.

ట్రంప్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా ఎంబసీలో భద్రతా దళాలు

పశ్చిమ ఇరాక్, తూర్పు సిరియాలో ఉన్న కతాయిబ్ హిజ్బుల్లాహ్ మిలిటెంట్ సంస్థ స్థావరాలపై అమెరికా వైమానిక దళం ఆదివారం బాంబులు వేసింది. ఈ దాడుల్లో సుమారు 25 మంది మిలిటెంట్లు చనిపోయారు.

ఇరాక్‌లోని కిర్కుక్‌లో తమ సైనిక స్థావరాలపై శుక్రవారం జరిగిన దాడికి సమాధానంగా ఈ దాడులు జరిపినట్లు అమెరికా చెప్పింది.

అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఒక అమెరికా కాంట్రాక్టర్ మృతిచెందాడు.

అమెరికా వైమానిక దాడులు తమ సౌర్వభౌమాధికారన్ని ఉల్లంఘించినట్లేనని ఇరాక్ ప్రధాని అదేల్ అబ్దుల్ మహదీ అన్నారు.

మరోవైపు ఈ దాడులకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కతాయిబ్ హిజ్బుల్లాహ్ నేత అబూ మహదీ అల్-ముహాదిస్ అమెరికాను హెచ్చరించారు.

ట్రంప్ హెచ్చరిక

ఫొటో సోర్స్, EPA

బగ్దాద్‌లో ఏం జరిగింది?

అమెరికా దాడుల్లో మృతిచెందిన మిలిటెంట్ల అత్యక్రియల తర్వాత ఆగ్రహించిన ప్రజలు మంగళవారం రోడ్లమీదకు వచ్చారు. వేల సంఖ్యలో బగ్దాద్ గ్రీన్ జోన్ ప్రాంతం వైపు కదిలారు.

వీరిలో అబూ మహదీ అల్-ముహాదిస్‌తో పాటు హిజ్బుల్లాహ్‌కు చెందిన ఎంతోమంది సీనియర్ సైనికాధికారులు ఉన్నారు. బగ్దాద్ గ్రీన్ జోన్ ప్రాంతంలో ఇరాక్‌కు చెందిన కీలక ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యాలాలు ఉన్నాయి.

ఇరాక్ భద్రతా దళాలు ఆందోళనకారులను గ్రీన్ జోన్‌లోకి రావడానికి అనుమతించాయి. దాంతో, కాసేపట్లోనే ఆందోళనకారులు అమెరికా రాయబార కార్యాలయం ముందు గుమిగూడారు.

"ఇరాక్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఈ ఎంబసీ నిరూపించింది. ఈ ఎంబసీ ఇరాక్‌పై గూఢచర్యం చేస్తోంది. ఇక్కడ విధ్వంసాలను ప్రోత్సహిస్తోంది" అని అసాయిబ్ అల్-హక్ గ్రూప్ చీఫ్ కాయిస్ అల్-ఖజాలీ అన్నారు.

ట్రంప్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Reuters

ఆందోళనకారులు కతాయిబ్ హిజ్బుల్లా, మిగతా గ్రూపుల జెండాలు ఎగరేస్తూ, అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. అమెరికా ఎంబసీ చుట్టుపక్కల ప్రధాన ప్రవేశ మార్గాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సెక్యూరిటీ కెమెరాలు విరగ్గొట్టారు. ఖాళీగా ఉన్న సెక్యూరిటీ పోస్టులకు నిప్పుపెట్టారు. నిరసనకారులు ప్రహరీ గోడ దూకి లోపలికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి.

"ఒక గేటును విరగ్గొట్టి చాలా మంది ఆవరణ లోపలికి వచ్చారని. వాళ్లంతా ఎంబసీ ప్రధాన భవనంవైపు వెళ్లారని,. ఆ తర్వాత అమెరికా సైన్యం ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించిందని వార్తా ఏజెన్సీ ఎపి చెప్పింది, రాయిటర్స్ ఆందోళనకారులు గ్రెనేడ్లు కూడా విసిరినట్లు చెప్పింది.

తర్వాత ఇరాక్ సైన్యం, భద్రతా బలగాలు అక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న షియా సైనిక గ్రూప్ పాపులర్ మొబిలైజేషన్ ప్రకారం, ఈ ఘటనలో 20 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. దాడి జరుగుతున్నప్పుడు రాయబార కార్యాలయంలో స్టాఫ్ ఉన్నారా, లేదా అనేదానిలో ఇంకా స్పష్టత రాలేదు.

భద్రతాదళాలు అమెరికా రాయబారి మాథ్యూ ట్యూలర్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లాయి అని స్థానిక మీడియా చెప్పింది . ఎంబసీకి చెందిన సన్నిహిత వర్గాలు బీబీసీతో "మాథ్యూ ఆదివారం అమెరికా బాంబింగ్ చేయడానికి ముందే క్రిస్‌మస్ సెలవుల కోసం అమెరికా వెళ్లారని" చెప్పారు.

ట్రంప్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Reuters

ఎవరు ఏం చెబుతున్నారు?

వ్యతిరేక ప్రదర్శనలు మొదలైన కొన్ని గంటల తర్వాత ఇరాక్ ప్రధానమంత్రి అబ్దుల్ మహదీ ఆందోళనకారులతో "అమెరికా ఎంబసీ పరిసరాల నుంచి వెళ్లిపోవాలి… ఇది హెచ్చరిక. ఎంబసీపై ఎలాంటి దాడి జరిగినా, విదేశీ ప్రతినిధులకు ఏనష్టం జరిగినా, దానికి కారణైనవారిని చట్టపరంగా శిక్షిస్తాం" అన్నారు.

అధ్యక్షుడు ట్రంప్ తన ట్వీట్‌లో "ఇరాన్ ఒక అమెరికా కాంట్రాక్టర్‌ను హత్య చేసింది. చాలా మంది గాయపడ్డారు. మేం సమర్థంగా ఎదురుదాడులు చేశాం. ఎప్పుడూ చేస్తాం. ఇప్పుడు ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ ప్లాన్ ప్రకారం దాడి చేయించింది. దీనికి వాళ్లు పూర్తి బాధ్యులు. ఎంబసీ రక్షణ కోసం ఇరాక్ తన బలం ప్రదర్శిస్తుందని మాకు నమ్మకం ఉంది" అన్నారు.

ఇరాన్ వైపు నుంచి దీనిపై తక్షణ స్పందన రాలేదు. "అమెరికా తన రాయబారిని తొలగించేవరకూ ఆ ఎంబసీ ముందు ఆందోళనలు నిర్వహిస్తామని కతాయిబ్ హిజ్లుల్లా ప్రకటించినట్లు" న్యూజ్ వెబ్‌సైట్ అల్-సుమారియా చెప్పింది.

ట్రంప్ హెచ్చరిక

ఫొటో సోర్స్, US CENTRAL COMMAND

అమెరికా టార్గెట్లో కతాయిబ్ హిజ్బుల్లా

ఇరాక్‌లోని తమ సైనిక స్థావరాలపై హిజ్బుల్లా వరుస దాడులు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

అమెరికా నేతృత్వంలో సంకీర్ణ దళాలు ఇరాక్‌లో ఇప్పటికీ ఇస్లామిక్ స్టేట్‌తో పోరాడుతున్నాయి. హిజ్బుల్లా దాడులకు ప్రతిదాడులుగా ఆదివారం అమెరికా దాని స్థావరాలపై బాంబులు వేసింది.

అమెరికా 2009 నుంచి కతాయిబ్ హిజ్బుల్లాను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. దానితోపాటు అబూ మహదీ అల్-ముహాదిస్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా కూడా ప్రకటించింది. ఈ సంస్థ ఇరాక్‌ స్థిరత్వం, శాంతికి ప్రమాదం అని చెబుతోంది.

కతాయిబ్ హిజ్బుల్లాకు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కోర్ అంటే ఐఆర్‌జీసీ గ్లోబల్ ఆపరేషన్ ఆర్మ్ కుర్ద్స్ ఫోర్స్‌తో సంబంధం ఉందని అమెరికా డిఫెన్స్ డిపార్టుమెంట్ చెబుతోంది. ఇరాన్ నుంచి దీనికి చాలా రకాల సాయం అందుతోందంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)