టీ20 ప్రపంచకప్ INDvsSCO: గ్రూప్‌2లో మెరుగైన నెట్‌రన్‌రేట్ సాధించిన భారత్.. 6.3 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో అడుగు ముందుకేసింది. దుబయ్ వేదికగా శుక్రవారం జరిగిన గ్రూప్ 2 మ్యాచ్‌లో భారత్ ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం సాధించింది.

ఈ విజయంతో భారత్ నెట్ రన్ రేట్ 0.073 నుంచి 1.619కు దూసుకెళ్లింది. ఇప్పటివరకు 4 మ్యచ్‌లాడిన టీమిండియా 4 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. భారత్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొంది, మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.

ఈ మ్యాచ్‌లో 86 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ 6.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 89 పరుగులు చేసింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేశాడు. 18 బంతుల్లోనే రాహుల్ అర్ధసెంచరీని అందుకున్నాడు. గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై కూడా రాహుల్ 69 పరుగులతో ఆకట్టుకున్నాడు.

రాహుల్ ప్రదర్శనపై మాజీ ఐపీఎల్ ప్లేయర్ అభిషేక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'రాహుల్‌కు ఈ తరహా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యమున్నప్పుడు తరచుగా ఇలా ఎందుకు ఆడడు. ఇదే భారత అభిమానులకు కోపం తెప్పిస్తుంది' అని వ్యాఖ్యానించాడు.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు.

'ఫామ్‌లో ఉన్నప్పుడు రోహిత్, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌గా అనిపిస్తాడు' అని అభిషేక్ అన్నారు.

రాహుల్, రోహిత్ తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వీరిద్దరూ అవుటయ్యాక విరాట్ కోహ్లి (2 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.

ఈ మ్యాచ్‌లో తాము పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించామని, ఇలాంటి ఆటతీరు కోసమే ఎదురుచూస్తున్నామని మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు.

'టీ20 ఫార్మాట్‌లో టాస్, వాతావరణ పరిస్థితులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ మ్యాచ్‌లో మా వ్యూహానికి తగినట్లుగా ఆడాం. వారిని 100 నుంచి 120 లోపు కట్టడి చేయాలనుకున్నాం. తర్వాత మ్యాచ్‌ను 8 నుంచి 10 ఓవర్ల మధ్యలో ముగించాలనుకున్నాం. అనుకున్నట్లే చేశాం.'

'' ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో కూడా మా ప్లేయర్లు ఇదే విధంగా దూకుడుగా ఆడారు. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఈ తరహాలో కనీసం ఒకట్రెండు ఓవర్లు ఆడినా మరోలా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా మా వాళ్లు బ్యాట్ ఝళిపిస్తున్నారు'' అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

స్కాట్లాండ్ 85 ఆలౌట్

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత పేసర్ మొహమ్మద్ షమీ కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన షమీ స్కాట్లాండ్ 85 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఒకటి మెయిడెన్ ఓవర్ కావడం విశేషం. టీ20 ఫార్మాట్‌లో గతంలో షమీ 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు ఇదే అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

షమీతో పాటు రవీంద్ర జడేజా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌటైంది.

జడేజా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

స్కాట్లాండ్ తరఫున ఓపెనర్ జార్జ్ మున్సే (19 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ లీస్క్ (12 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) పరవాలేదనిపించారు.

మ్యాచ్ ఆరంభం నుంచే తడబడిన స్కాట్లాండ్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది.

ఏడో ఓవర్‌లో బౌలింగ్ చేసిన జడేజా, ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి స్కాట్లాండ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. దీంతో పది ఓవర్లకు జట్టు స్కోరు 44/4.

షమీ వేసిన 11వ ఓవర్‌లో లీస్క్ వరుసగా 6, 4తో ఆకట్టుకున్నాడు. కానీ మరుసటి ఓవర్‌లోనే అతను ఎల్బీగా వెనుదిరిగాడు.

తర్వాత కూడా స్కాట్లాండ్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

చివరకు 17వ ఓవర్ తొలి మూడు బంతుల్ని యార్కర్లుగా సందించిన షమీ... తొలి బంతికి క్యాలమ్ మెక్ లాయిడ్ (16)ను అవుట్ చేశాడు. రెండో బంతికి షరీఫ్ (0) రనౌట్ కాగా... మూడో బంతికి ఇవాన్స్ (0)ను పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ ముగిసేందుకు మరెంతో సమయం పట్టలేదు.

భారత బౌలర్లలో బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)