టీ20 వరల్డ్ కప్: టీమిండియా సెమీఫైనల్‌కు చేరాలంటే అఫ్గానిస్తాన్‌పై ఆధారపడాల్సిందేనా?

ఆదివారం మ్యాచ్‌లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఆదివారం మ్యాచ్‌లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది

టీ20 ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో టీం ఇండియా కష్టాల్లో చిక్కుకుంది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

గత వారం, ఈ టోర్నమెంట్‌లోని తన తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.

వరుసగా రెండో ఓటమి తరువాత భారత్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది.

ఇక టీం ఇండియా సెమీ ఫైనల్ ఆశలన్నీ అఫ్గానిస్తాన్ మీదే ఉన్నాయి.

ప్రస్తుత సమీకరణాల బట్టి, అఫ్గానిస్తాన్, న్యూజీలాండ్‌పై గెలిస్తే భారత్ సెమీ ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది.

దాంతో పాటు, తరువాతి మూడు మ్యాచుల్లో ఇండియా.. అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్‌లపై కచ్చితంగా గెలవాలి.

నవంబర్ 3న అబుదాబిలో జరగనున్న తదుపతి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నట్టే.

నవంబర్ 7న అఫ్గానిస్తాన్, న్యూజీలాండ్ తలపడనున్నాయి. అందులో అఫ్గానిస్తాన్ గెలిస్తే భారత్‌కు అవకాశాలుంటాయి.

సెమీస్‌కు చేరాలంటే తదుపరి మూడు మ్యాచుల్లో భారత్ కచ్చితంగా గెలవాలి

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, సెమీస్‌కు చేరాలంటే తదుపరి మూడు మ్యాచుల్లో భారత్ కచ్చితంగా గెలవాలి

వరుసగా రెండో ఓటమి

ఆదివారం దుబియి‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ భారత్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని న్యూజీలాండ్ 15వ ఓవర్లో కేవలం రెండు వికెట్లు నష్టంతో సాధించింది.

టాస్ గెలుచుకోవడంలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరోసారి దురదృష్టం వెంటాడింది.

టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ కివీస్ టీం మొదటి నుంచి మ్యాచ్‌పై పట్టు కనబరచింది.

మూడవ ఓవర్లో 11 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్ ఇషాన్ కిషన్(4) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్‌లో డెరిల్ మిషెల్‌కు దొరికిపోయాడు.

తరువాత వచ్చిన రోహిత్ శర్మ ఆడిన మొదటి బంతికే అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. ఆడమ్ మిల్నే ఫైన్ లెగ్ వద్ద క్యాచ్ మిస్ అవడంతో బతికిపోయాడు. దాంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

కానీ, వచ్చిన అవకాశాన్ని రోహిత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 14 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అంతకు ముందే ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ 18 పరుగుల వద్ద పెవిలియన్ దారి పట్టాడు.

దాంతో, భారత్‌పై ఒత్తిడి పెరగడం ఆరంభమైంది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

11 ఓవర్లో 9 పరుగులకే విరాట్ కోహ్లీ వెనుదిరగడంతో భారత్ కేవలం 40 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

15వ ఓవర్లో రిషబ్ పంత్ కూడా అవుటవడంతో భారత్ వంద పరుగులు కూడా చేయడం కష్టం అనిపించింది.

తరువాత వచ్చిన హార్దిక్ పాండ్య 23 పరుగులు, రవీంద్ర జడేజా 26 పరుగుల (నాట్ అవుట్)తో 20 ఓవర్లో భారత స్కోరును అతి కష్టం మీద 110కి తీసుకురాగలిగారు.

న్యూజీలాండ్‌కు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కాలేదు.

అయితే, జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో మార్టిన్ గప్తిల్(20) అవుట్ అవ్వడంతో 24 పరుగుల వద్ద న్యూజీలాండ్ తొలి వికెట్ కోల్పోయింది.

తర్వాత మరో ఓపెనర్ డెరిల్ మిషెల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం అందించారు.

దాంతో, న్యూజీలాండ్ మ్యాచ్ గెలుపు దాదాపు ఖాయమైది. 15 ఓవర్లలో 111 పరుగులు పూర్తి చేసి విజయం సాధించింది.

కెప్టెన్ విలియమ్సన్ 33 పరుగులు చేసి జట్టును విజయ ద్వారం వైపు నడిపించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)