COP26: ‘వాతావరణ మార్పులపై చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యత, చర్యలకు ఇవ్వట్లేదు’ - మోదీ

భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు వాతావరణ మార్పు అనేది చాలా పెద్ద సవాలుతో కూడిన అంశం అని కాప్‌26 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన ప్రసంగంలో భాగంగా ఆయన మూడు సూచనలు చేశారు.

లైవ్ కవరేజీ

  1. ప్రధాని మోదీ: ‘వాతావరణ మార్పు గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ చర్యలు తీసుకోవట్లేదు’

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, కాప్26 సదస్సులో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

    భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు వాతావరణ మార్పు అనేది చాలా పెద్ద సవాలుతో కూడిన అంశం అని కాప్‌26 సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    ‘‘ప్రపంచవ్యాప్తంగా, వాతావరణ మార్పుల గురించి చర్చలకు లభిస్తోన్న ప్రాధాన్యత, తగిన చర్యలు తీసుకోవడానికి లభించట్లేదు. దీనివల్ల అభివృద్ధి చెందుతోన్న దేశాలకు అన్యాయం జరుగుతోంది. ఈ దేశాలే వాతావరణ మార్పుల వల్ల అధికంగా ప్రభావితం అవుతున్నాయి.’’

    ‘‘ భారత్‌తో సహా అభివృద్ధి చెందుతోన్న అన్ని దేశాలకు ఇది పెద్ద సవాలుగా నిలిచింది. పంటల సాగు ప్రణాళిక మారుతోంది. అకాలవర్షాలు, వరదలు వెల్లువెత్తుతున్నాయి.’’

    ‘‘ఈ విషయంలో నేను మూడు సూచనలు చేయాలనుకుంటున్నా. మన అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టుల్లో వాతావరణ మార్పు కట్టడి కార్యక్రమాలను అంతర్భాగంగా చేసుకోవాలి.’’

    ‘‘నల్ సే జల్, స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల లాంటి పథకాలు భారతదేశంలోని పేద పౌరులకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడ్డాయి.’’

    ‘‘చాలా సంప్రదాయ సమాజాలకు ప్రకృతితో మమేకమై జీవించే జ్ఞానం ఉంది. వాతావరణ మార్పుల కట్టడికి ఈ సమాజాలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి. పాఠ్యాంశాల్లో కూడా వీటిని చేర్చాలి.

    స్థానికంగా లేదా వెనుకబడిన దేశాల్లో మేలైన అనుసరణీయ విధానాలు ఉంటే, వాటికి ప్రపంచ వ్యాప్తంగా సహకారం లభించాలి.’’

    ‘‘భారత్, డిజాస్టర్ రెసిస్టెన్స్ ఇన్‌ఫాస్ట్రక్చర్ కూటమిని ప్రారంభించింది. ఇందులో అన్ని దేశాలు భాగస్వాములు కావాలని కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ ప్రసంగించారు.

  2. కాప్‌26 సదస్సులో వినిపిస్తోన్న 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కథ ఏంటి?

    భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసింది మన చర్యలే అనే సంగతి అందరికీ తెలిసిందే.

    పారిశ్రామిక అభివృద్ధి కారణంగా విపరీతంగా విడుదలైన కార్బన్ డయాక్సైడ్, ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైంది.

    పారిశ్రామిక ప్రగతి సాధించకముందు నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే... ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు కట్టడి చేసినట్లయితే విపరీత వాతావరణ మార్పుల నుంచి తప్పించుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    కానీ మనం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను అందుకున్నాం. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

    2015లో జరిగిన పారిస్ ఒప్పందంలో ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు కట్టడి చేయాలని ప్రపంచ నేతలంతా తీర్మానించారు. కానీ దాన్ని మరింత తక్కువగా 1.5 డిగ్రీలకే కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

    కానీ ఆ ఒప్పందం ప్రకారం అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదు. కొన్ని దశాబ్దాల కాలంలోనే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీలను దాటుతుందని, శతాబ్ధం ముగిసే నాటికి అది 2.7-3 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుతుందని తాజా అంచనా.

    ఉష్ణోగ్రతలు పెరిగే రేటు
  3. సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

  4. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జీవితం ఎలా ఉంటుందంటే..

  5. COP26: వాతావరణ లక్ష్యాలకు భారత్ ఎంత దూరంలో ఉంది

  6. ప్రిన్స్ చార్లెస్: ‘కర్బన ఉద్గారాలను అత్యవసరంగా తగ్గించాలి’

    ప్రిన్స్ చార్లెస్

    ఫొటో సోర్స్, Reuters

    సరిహద్దు సంక్షోభాలు ఎంత విధ్వంసకరంగా ఉంటాయో కరోనా మహమ్మారి కారణంగా అందరికీ తెలిసి వచ్చిందని ప్రిన్స్ చార్లెస్ వ్యాఖ్యానించారు.

    ‘‘ఇప్పటికే సమయం మించిపోయింది. ఇప్పుడు మనం కచ్చితంగా చేయాల్సిన పనులేంటో మనకు తెలుసు.’’

    ‘‘కర్బన ఉద్గారాలను అత్యవసరంగా తగ్గించాలి. పర్యావరణంలో ఇప్పటికే వ్యాపించిన కార్బన్‌ను తగ్గించే చర్యలు చేపట్టాలి.’’

    ‘‘ గ్లోబల్ ప్రైవేట్ సెక్టార్‌ను పటిష్టం చేయడానికి విస్తృతమైన ఆర్మీ తరహా ప్రచారం అవసరం.’’

    ‘‘సమస్యను నివారించడానికి అయ్యే ఖర్చు కంటే, నియంత్రించడానికి అయ్యే వ్యయం చాలా ఎక్కువ’’ అని ప్రిన్స్ చార్లెస్ చెప్పుకొచ్చారు.

  7. ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెరస్: ‘మన సమాధులను మనమే తవ్వుకుంటున్నాం’

    గుటెరస్

    ఫొటో సోర్స్, Reuters

    గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను నియంత్రించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పునరుద్ఘాటించారు.

    ‘‘శిలాజ ఇంధనాల వాడకం అనే వ్యసనం, మానవాళిని అంతం దిశగా తీసుకెళ్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  8. కాప్‌26: ‘భూమి మనల్ని హెచ్చరిస్తోంది... మన దగ్గర సమయం లేదు’

    టైయ్ సురుయి

    బోరిస్ జాన్సన్ తర్వాత ఆమెజాన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త, 24 ఏళ్ల టైయ్ సురుయి సదస్సులో మాట్లాడారు.

    ‘‘6000 ఏళ్ల నాటి నుంచి మా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. నక్షత్రాలు, చంద్రుడు, జంతువులు, వృక్షాలు తమ భావాలను ప్రకటిస్తాయని మా నాన్న నాతో చెప్పేవారు.’’

    ‘‘ఇప్పుడు వాతావరణం వేడెక్కుతోంది. జంతుజాతులు అదృశ్యం అవుతున్నాయి. మొక్కలు, పువ్వులు ముందులా లేవు.’’

    ‘‘భూమి మనతో మాట్లాడుతోంది. మన దగ్గర తగినంత సమయం లేదని మనల్ని హెచ్చరిస్తోంది.’’

    ‘‘వాతావరణ మార్పు ప్రభావాలను ఇప్పుడే మనం చూస్తున్నాం. వాటికోసం 2030, 2050 వరకు ఆగాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులంతా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అడవిని రక్షించినందుకుగానూ నా ఫ్రెండ్ హత్యకు గురయ్యారు’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

  9. బోరిస్ జాన్సన్: ‘సమయం దగ్గర పడుతోంది, అభివృద్ధి చెందిన దేశాలపై ప్రత్యేక బాధ్యత ఉంది’

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Reuters

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, గ్లాస్గోకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

    ‘‘జేమ్స్ బాండ్ చిత్రాల్లో ప్రపంచం అంతం కాకుండా ఆయన కాపాడతాడు. కానీ దురదృష్టవశాత్తు ఇది సినిమా కాదు.’’

    ‘ఉష్ణోగ్రతలు ఇంకా 2 డిగ్రీలు పెరిగితే ఆహార సరఫరాకు హాని కలుగుతుంది. 3 డిగ్రీలు పెరిగితే మరిన్నికార్చిర్చులు, తుపాన్లు చూడాల్సి వస్తుంది. ఇక 4 డిగ్రీలు పెరిగినట్లయితే, నగరాలన్నీ తుడిచిపెట్టకుపోతాయి.’’

    ‘‘మనం ఆలస్యం చేసినకొద్దీ పరిస్థితులు మరింత దిగజారతాయి. తీరా పరిస్థితి అదుపు దాటాక చర్యలకు పూనుకుంటే మనం మరింత ఎక్కువ కోల్పోవాల్సి వస్తుంది.’’

    ‘‘అందుకే ఈ సదస్సును వాతావరణ మార్పుల కట్టడికి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.

    వాతావరణ మార్పులను ఉన్నపళంగా కట్టడి చేయలేం. దశల వారీగా ప్రయత్నించాలి. అందుకే ప్రతీ ఒక్కరు హరిత ఆర్థిక వ్యవస్థలను ఏర్పాటు చేసేలా సహాయపడటం అభివృద్ధి చెందిన దేశాల ప్రత్యేక బాధ్యతగా గుర్తించాలి.’’

    ‘‘మన దగ్గర సాంకేతికత ఉంది. ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. కానీ మనలో సాధించే సంకల్పం ఉందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.’’

    ‘‘2050, 2060లలో ఏం చేయబోతున్నారో అనే దాని గురించి రాజకీయనాయకులు మాట్లాడుతున్నారు. కానీ కాప్‌లో పాల్గొనే నేతల సగటు వయస్సు 60కి పైనే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలను జడ్జ్ చేసే పిల్లలు ఇంకా పుట్టలేదు.’’

    ‘‘ఇప్పుడు మనం విఫలమైతే, వారు మనల్ని క్షమించరు. చరిత్ర తిరగబడిన సమయంలో గ్లాస్గో సదస్సు చరిత్రాత్మకమైన మలుపు అని వారికి తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి. వాతావరణ మార్పుల కట్టడికి కాప్‌26‌తోనే ముగింపు కార్డు పడకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    అధిక కర్బన ఉద్గారాలను వెలువరించిన దేశాల క్రమం
  10. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా

  11. మొదలైన కాప్26 సదస్సు

    వాతావరణ మార్పు నేపథ్యంలో ఏర్పాటు చేసిన కాప్26 సదస్సు గ్లాస్గోలో ప్రారంభమైంది. సంగీత వాయిద్యాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది.

    బోరిస్ జాన్సన్ ప్రసంగానికి ముందు... సంగీత కళాకారిణి, 22 ఏళ్ల బ్రిగ్డే చైంబెల్ సంప్రదాయ మెలోడీ పాటలతో ప్రదర్శన ఇచ్చారు.

    బ్రిగ్డే చైంబెల్
  12. 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్‌లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?

  13. కాప్26: ‘మాటలొద్దు, పని చేద్దాం’- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Stefan Rousseau/PA Wire

    వాతావరణ సదస్సు కాప్ 26 జరిగే వేదిక వద్దకు ప్రపంచ నేతలంతా చేరుకుంటున్నారు.

    కానీ, ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రాకపోవడం పట్ల కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనాదే అగ్రస్థానం.

    వాతారణ మార్పుల వల్ల కలిగే ప్రమాదాల నుంచి బయటపడటానికి ఈ సదస్సే చివరి అవకాశం అని అందరూ భావిస్తున్నారు.

    పర్యావరణ సంక్షోభంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి.

    అందుకే, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో వాతావరణ మార్పు రేటు తగ్గాలని ఆకాంక్షించడమే కాకుండా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    స్లోవేకియా అధ్యక్షురాలు జుజానా కపుటోవా సదస్సు కోసం గ్లాస్గో చేరుకున్నారు.

    ఫొటో సోర్స్, PA Media

    ఫొటో క్యాప్షన్, స్లోవేకియా అధ్యక్షురాలు జుజానా కపుటోవా సదస్సు కోసం గ్లాస్గో చేరుకున్నారు
    గ్లాస్గో సదస్సు వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతిస్తారని వందలాది మంది ప్రజలు ఓపికగా వేచి చూస్తున్నారు.
    ఫొటో క్యాప్షన్, గ్లాస్గో సదస్సు వేదిక వద్దకు వెళ్లేందుకు వందలాది మంది ఓపికగా వేచి చూస్తున్నారు.
  14. ప్రపంచానికి తెలియని ఇంద్రధనుస్సు దీవి, తినగలిగే పర్వతం

  15. కాప్26: విమానాల వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందా?

    కాప్26 సదస్సు కోసం ప్రపంచ నేతలంతా గ్లాస్గోకు ఆకాశమార్గాన వెళ్లడాన్ని యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ సమర్థించారు. కానీ పర్యావరణ విషయానికొస్తే, విమానాల్లో ప్రయాణం ఎంత వరకు సమంజసం?

    ఇది పర్యావరణానికి చాలా నష్టం కలిగించే అంశం.

    అందుకే 2019లో న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ వాతావరణ సదస్సు కోసం పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్, విమానం ద్వారా కాకుండా ఓడలో అక్కడికి వెళ్లారు.

    మరోవైపు, కాప్26 కోసం రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ప్రైవేట్ జెట్స్ వినియోగించడం ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటోంది.

    ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ప్రకారం, ప్రపంచ కర్బన ఉద్గారాలకు, ఏవియేషన్ 2 శాతం కారణమవుతోంది.

    రహదారి ట్రాన్స్‌పోర్ట్ (12 శాతం)తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, విమాన మార్గాలు ద్వారా ఉత్పత్తయ్యే ‘నాన్ కార్బన్ ఎమిషన్స్’ వాతావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

    2037 నాటికి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 820 కోట్లకు చేరుతుందని కరోనాకు ముందు ఐఏటీఏ అంచనా వేసింది.

    వివిధ రవాణా మార్గాల ద్వారా విడుదలయ్యే ఉద్గారాల శాతం
  16. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ లేకపోవడం సదస్సుపై ప్రభావం చూపుతుందా?

    వరదలు

    ఫొటో సోర్స్, Reuters

    ప్రపంచంలోనే అధికంగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తోన్న దేశాల గురించి బీబీసీ ‘రేడియో 4’ ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చైనాతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

    వాతావరణ సంక్షోభంపై జరుగుతోన్న కాప్26 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు.

    ‘‘చైనాను తక్కువగా చూపే సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనేందుకు జిన్‌పింగ్ సుముఖంగా లేరని’’ ఎస్ఓఏఎస్ చైనా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ప్రొఫెసర్ స్టీవ్ సంగ్ అన్నారు.

    ‘‘కరోనా ప్రబలినప్పటి నుంచి ఆయన ప్రయాణాలు చేయట్లేదు. అందుకే ఈ సమావేశంలో వ్యక్తిగతంగా పాల్గొనకపోవడం ఆశ్చర్యం కలిగించట్లేదు. కానీ వర్చువల్‌గా ఇందులో భాగం అవుతారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను పంపుతున్నారు. అంటే ఆయన తన వైఖరిని వ్యక్తం చేస్తున్నట్లే.’’

    వాతావరణ మార్పు పట్ల చైనా కూడా ఆందోళనకరంగానే ఉందని ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.

    కర్భన ఉద్గారాలు వెలువరింటే టాప్-5 దేశాలు
    ఫొటో క్యాప్షన్, కర్భన ఉద్గారాలు వెలువరింటే టాప్-5 దేశాలు
  17. వాతావరణ మార్పుల ప్రభావం విశాఖపట్నంపైన, బీచ్‌పైన ఎలా ఉంది?

    విశాఖపట్నం నుంచి ప్రసారం..

  18. ఉత్తరాఖండ్‌లో ఒకటి తర్వాత మరొకటిగా గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?

  19. ప్రిన్స్ చార్లెస్: యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి

    ప్రిన్సెస్ చార్లెస్

    ఫొటో సోర్స్, REUTERS

    వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన అవసరముందని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ భావిస్తున్నారు.

    గ్లాస్గోలో కాప్26 వాతావరణ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన... గ్లోబల్ ప్రైవేట్ సెక్టార్ వనరులను నిర్వహించడానికి ‘విస్తృతమైన ఆర్మీ తరహా’ కార్యక్రమం అవసరమని పిలుపునిచ్చారు.

    వైద్యుల సూచన మేరకు క్వీన్ ఎలిజబెత్ ఈ కార్యక్రమానికి దూరం కావడంతో, ప్రిన్స్ చార్లెస్ రాజవంశం తరఫున సీనియర్ రాయల్‌గా ఈ సదస్సులో పాల్గొన్నారు.

    ఆయన కాప్26 సదస్సును ‘‘మనకున్న చివరి అవకాశం’’ అని వర్ణించారు.

    ఆయన ఆదివారం రోమ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. నాయకులంతా మాటలను, చేతలుగా మార్చాలని పిలుపునిచ్చారు.

    ‘‘మన మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరమైన దిశలో ఉంచడం ద్వారా మన గ్రహాన్ని రక్షించేందుకు అవసరమైన పర్యావరణాన్ని కాపాడేందుకు ఇదే సరైన సమయమని అందరూ భావించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

  20. కాప్-26 వాతావరణ సదస్సుపై ప్రపంచం పెట్టుకున్న ఆశలు ఏమిటి?

    స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరిగే కాప్-26 వాతావరణ సదస్సుపై ప్రపంచం పెట్టుకున్న ఆశలు ఏమిటి? ఇంతకూ కాప్-26 అంటే ఏమిటి?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది