సైదాబాద్‌ అత్యాచారం కేసు: నిందితుడిని పట్టిస్తే ₹ 10 లక్షల రివార్డ్, ఆనవాళ్లు ఇవే – ప్రెస్‌రివ్యూ

పల్లంకొండ రాజు

ఫొటో సోర్స్, Telangana police

ఫొటో క్యాప్షన్, ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్లంకొండ రాజు

సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచరం, హత్య ఘటనలో నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని ప్రకటించారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖలాలు లేవు.

ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయినా, నిందితుడు రాజు ఆచూకీ తెలియలేదు.

ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు.

పోలీసులు తెలిపిన నిందితుడి ఆనవాళ్లివే...

  • నిందితుడి పేరు: పల్లకొండ రాజు, వయస్సు 30 సంవత్సరాలు
  • 5.9 అడుగుల ఎత్తు
  • టోపీ పెట్టుకొని ఎర్ర చేతిరుమాల ముఖానికి పెట్టుకున్నాడు.
  • రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫ్యాంట్‌, షర్ట్‌ ధరించి ఉన్నాడు.

అతడికి మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు’’అని ఈనాడు కథనంలో పేర్కొన్నారు.

మెట్రో రైలు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ మెట్రోను ఆదుకుంటాం : సీఎం కేసీఆర్‌

కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడంతో హైదరాబాద్‌ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో.. ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని నమస్తే తెలంగాణ తెలిపింది.

‘‘ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్అండ్‌టీ కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో.. కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకారం అందిస్తామని కంపెనీ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రో ఉన్నతాధికారులు ఆర్థిక నష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

భేటీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాధరణ పొందిందన్నారు. కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోనూ ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్‌లో మెట్రో మరింత విస్తరించాల్సి ఉందన్నారు.

అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను గాడిలో పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తుందన్నారు. ఎలాంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషించనున్నట్లు పేర్కొన్నారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానం ఎత్తివేయాలి

‘‘తెలంగాణలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎత్తివేసి, వర్క్‌‌ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని తిరిగి స్టార్ట్ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు’’అని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘ఐటీ కంపెనీలను ఆధారంగా చేసుకుని బతుకుతున్న లక్షల మంది చిరు వ్యాపారుల గురించి ఐటీ యాజమాన్యాలు ఆలోచించాలని శ్రీనివాసరావు కోరారు.

వారంతా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని డీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోఠిలోని తన ఆఫీసులో మీడియా సమావేశంలో డీహెచ్ మాట్లాడారు.

వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం స్టార్ట్ చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా గాడినపడే అవకాశం ఉందన్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఐటీ ఎంప్లాయీస్ అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పారు.

అవసరమైతే ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌కు తాము నివేదిక కూడా ఇచ్చామన్నారు’’అని నమస్తే వెలుగు తెలిపింది.

ఏపీ సినీ టికెట్ల అమ్మకం

ఫొటో సోర్స్, fb/Andhra Pradesh CM

హెల్త్‌ హబ్స్‌లో ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50% బెడ్లు ఆరోగ్య శ్రీకే

జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయబోయే హెల్త్‌ హబ్స్‌లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘హెల్త్‌ హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ రోగులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు విధివిధానాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలు అందజేశారు. ఏ తరహా వైద్యం కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనే వివరాలనూ అందజేశారు.

వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

హెల్త్‌ హబ్స్‌ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటారని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి, మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం హెల్త్‌ హబ్స్‌ ద్వారా నెరవేరుతుందని పేర్కొన్నారు.

డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కావాలని స్పష్టం చేశారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్‌ హబ్స్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు’’అని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)