గుజరాత్: భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?

గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నియామకం ఖరారైంది.
గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకొంది.
ఈ సమావేశానికి పరిశీలకుడిగా హాజరైన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ పేరును ప్రకటించారు.
ఎవరీ భూపేంద్ర పటేల్?
భూపేంద్ర పటేల్ మొదటిసారి ఎమ్మెల్యేగా అహ్మదాబాద్లోని ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
భూపేంద్ర సింగ్ పటీదార్ సామాజికవర్గానికి చెందిన నాయకులు.
ఐదేళ్ల తర్వాత బీజేపీ మళ్లీ పటీదార్ను ముఖ్యమంత్రిని చేసింది.
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్కు భూపేంద్ర సింగ్ నమ్మకస్తుడిగా పేరొందారు. ఆమె గవర్నర్గా నియమితులు కావడంతో ఖాళీ అయిన ఘట్లోడియా నియోజకవర్గం నుంచే భూపేంద్ర పటేల్ పోటీ చేసి, గెలుపొందారు.
వాస్తవానికి 2017లో ఈ స్థానం నుంచి ఆనందీబెన్ పటేల్ కుమార్తె అనర్బహెన్ పోటీ చేస్తుందని భావించినప్పటికీ.. ఆ స్థానం భూపేంద్ర పటేల్కు దక్కింది.
భూపేంద్ర పటేల్ గతంలో ఘట్లోడియా మున్సిపాలిటీ ఛైర్మన్గా పనిచేశారు. అహ్మదాబాద్ అభివృద్ధి అథార్టీ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి స్థానానికి భూపేంద్ర పటేల్ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీయే ప్రతిపాదించారు.
గుజరాత్ రాష్ట్రంలో 182 నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో 71 నియోజకవర్గాల్లో పటీదార్లే కీలకం. రాష్ట్ర జనాభాలో పటీదార్లు 15 శాతం ఉన్నారు. ఈ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే భూపేంద్ర పటేల్ను కొత్త సీఎంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
2022 డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రిజర్వేషన్ల కోసం పటీదార్ల నిరసనల నడుమ ఆనందీ బెన్ పటేల్ను సీఎం పదవి నుంచి తప్పించినప్పుడు.. తర్వాత సీఎం ఎవరనే విషయంలో చాలాపేర్లు వినిపించాయి. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడైన రూపానీకి ఆ పదవి దక్కింది.
2022లో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా, గుజరాత్లో సీఎంను మారుస్తారని చాలా రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. అవి ఇప్పుడు నిజమయ్యాయి.
మధ్యాహ్నం సమావేశం
విజయ్ రూపానీ తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టేది ఎవరో తేల్చేందుకు బీజేపీ అధిష్టానం ఆదివారం మధ్యాహ్నం సమావేశం కాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఆదివారం జరగబోతోందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
మరోవైపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కూడా గాంధీనగర్ చేరుకున్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నివాసంలో వీరు చర్చలు జరుపుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, facebook/vijayrupanibjp
విజయ్ రూపానీ రాజీనామా
శనివారం రూపానీ రాజ్భవన్కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో బాధ్యతలు సమయానుకూలంగా మారుతుంటాయని అన్నారు.
‘‘ఒక సాధారణ కార్యకర్త అయిన నాకు ముఖ్యమంత్రి బాధ్యత ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటాను’’ అని రూపానీ అన్నారు.
తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ప్రత్యేక మార్గనిర్దేశనం లభించేదని చెప్పారు.
‘‘గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి చేసేందుకు అవకాశం కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు’’ అని రూపానీ అన్నారు.
‘‘కొత్త నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గనిర్దేశనంలో, సరికొత్త ఉత్సాహంతో గుజరాత్ అభివృద్ధి ప్రయాణం కొనసాగాలి. ఈ ఉద్దేశ్యంతోనే నేను రాజీనామా చేశాను’’ అని వెల్లడించారు.
2022 డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఎవరి నాయకత్వంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అడగ్గా రూపానీ స్పందిస్తూ.. ప్రతి రాష్ట్రంలోనూ తాము నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని, రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీజేపీ మోదీ నాయకత్వంలోనే వెళ్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ, అమిత్ షాల ప్లాన్ ఏంటి?
బీబీసీ గుజరాతీ ఎడిటర్ అంకుర్ జైన్ విశ్లేషణ
పటీదార్ రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో గుజరాత్ రాజకీయాలకు అనుగుణంగా.. తనకు ఎంతో నమ్మకస్తురాలైన ఆనందిబెన్ పటేల్ను తప్పించిన నరేంద్ర మోదీ.. ఆమె స్థానాన్ని విజయ్ రూపానీతో భర్తీ చేశారు.
అప్పట్లో బీజేపీ.. పటేల్ సామాజిక వర్గానికి చెందని, బలమైన కులానికి చెందని వ్యక్తిని సీఎంను చేసి, అందరినీ సంతోష పెట్టేందుకు గాను ‘జైన్-బనియా’ను ఎంచుకుంది.
కానీ, విజయ్ రూపానీ సీఎంగా ఉన్నప్పటికీ.. పెత్తనమంతా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలదే అన్నట్లుగా నడిచింది.
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? అంటే ఇక్కడి నాయకులకు కానీ, అధికారులకు కానీ సమాధానం స్పష్టంగా తెలుసు.
రాజకీయ నాయకులు, అందునా ఒక స్థాయిలో ఉన్న నాయకులు చాలా అరుదుగా మాత్రమే తమ వ్యక్తిగత సిబ్బందిని ఇతరులకు కేటాయిస్తుంటారు. అలా, అమిత్ షా దిల్లీలో బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన పీఏ శైలేశ్ మండాలియా రూపానీకి వ్యక్తిగత సహాయకుడిగా మారారు.
వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న గుజరాత్లో రూపానీ మార్పు.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణానికి సంకేతం.
దీనికి కారణం.. రూపానీ తనకంటే ముందు పనిచేసిన ముఖ్యమంత్రుల్లాగా మాస్ లీడర్ కాదు.
2017లో రూపానీని ముఖ్యమంత్రిగా చూపించి బీజేపీ ఎన్నికలకు వెళితే.. సీట్ల సంఖ్య 99కి పడిపోయింది. 182 స్థానాలున్న గుజరాత్లో 2012లో బీజేపీ 115 గెల్చుకుంది.
నిజం చెప్పాలంటే 2024 వరకు దేశంలో జరిగే ప్రతి ఎన్నికా మోదీ, షాలకు ఒక పరీక్ష. అలాంటిది సొంత రాష్ట్రంలోనే విజయం సాధించకపోతే, వాళ్లకు జరిగే నష్టం గుజరాత్కే పరిమితం కాదు.

ఫొటో సోర్స్, TWITTER
ఐదు నెలల్లో ఐదుగురు సీఎంలను మార్చిన బీజేపీ
గత కొద్దికాలంగా బీజేపీ చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మారుస్తోంది. గత ఐదు నెలల్లో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత రాజీనామా చేయించింది.
కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప, ఉత్తరాఖండ్లో తీరథ్ సింగ్ రావత్, త్రివేంద్ సింగ్ రావత్లు రాజీనామా చేయగా, అసోంలో శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఉత్తరాఖండ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన తర్వాత పుష్కర్ సింగ్ ధామీ సీఎం పదవిని చేపట్టారు.
కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప స్థానాన్ని బసవరాజ్ బొమ్మై భర్తీ చేశారు.
అసోంలో ఎన్నికల అనంతరం.. సీఎంగా శర్బానంద సోనోవాల్ను తప్పించి, అతని స్థానంలో హిమంత బిశ్వ శర్మకు అవకాశం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీర్థ్ సింగ్ రావత్ ఎంపిక... త్రివేంద్ర సింగ్ ఆకస్మిక రాజీనామాకు కారణాలు ఏమిటి?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?
- అఫ్గానిస్తాన్: పంజ్షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)













