కరోనావైరస్ వ్యాక్సీన్‌: భారత్‌లో జనవరి నుంచి వ్యాక్సినేషన్‌

దేశంలో 50 ఏళ్లు దాటిన వారి వివరాలు సేకరిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దేశంలో 50 ఏళ్లు దాటిన వారి వివరాలు సేకరిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు

2021 జనవరి నుంచి భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు బీబీసీకి తెలిపారు.

రాబోయే వారాల్లో కొందరు వైరస్‌ బాధితులకు అత్యవసర టీకా వినియోగానికి అనుమతులు వచ్చే అవకాశం ఉందని పేరు బైట పెట్టడానికి ఇష్టపడని ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే రెండు డ్రగ్‌ కంపెనీలు వ్యాక్సినేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయని, మరో ఆరు సంస్థల క్లినికల్ ట్రయల్స్‌ వివిధ దశల్లో ఉన్నాయని వారు బీబీసీకి చెప్పారు.

వచ్చేయేడాది ఆగస్టు నాటికి 30కోట్లమందికి టీకా ఇవ్వాలన్నది ఈ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం లక్ష్యం.

భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు కోటిమందికి కరోనా వైరస్‌ సోకగా, 144,000వేలమంది చనిపోయారు. వైరస్‌ తీవ్రత తగ్గుతున్నా టీకా కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

భారత ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ ప్రయోగాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ ప్రయోగాలు

ఏయే వ్యాక్సీన్‌లు పరిశీలనలో ఉన్నాయి?

పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రా-జెనెకా సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సీన్‌, భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాక్సిన్‌, ఈ రెండు వ్యాక్సీన్‌లు అనుమతి కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)కు దరఖాస్తు చేసుకున్నాయి.

ఇక వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సీన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌-క్యాడిలా సంస్థ తయారు చేస్తున్న జైకోవ్-డి
  • మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో కలిసి హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్‌-ఇ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సీన్‌
  • పుణెకు చెందిన జినోవా సంస్థ తయారీ హెచ్‌జిసి19. ఈ వ్యాక్సీన్‌ను తొలి mRNA వ్యాక్సీన్‌గా చెబుతున్నారు. అమెరికాలోని సియాటెల్‌కు చెందిన హెచ్‌డిటి బయోటెక్‌ సంస్థతో కలిసి తయారు చేస్తున్న ఈ వ్యాక్సీన్‌ను రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు కారణమయ్యే జెనెటిక్‌ కోడ్‌ ఆధారంగా రూపొందిస్తున్నారు.
  • ముక్కు ద్వారా తీసుకుకునే ఓ వ్యాక్సీన్‌ను భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తోంది.
  • రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ సెంటర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ సంయుక్తంగా ఉత్పత్తి చేయబోయే స్పుత్నిక్‌-వి వ్యాక్సీన్‌
  • అమెరికాకు చెందిన నోవాక్స్‌ డ్రగ్‌ సంస్థతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న మరో వ్యాక్సీన్‌

ఈ ఆరు వ్యాక్సీన్‌లలో నాలుగు దేశీయంగానే రూపొందుతున్నాయని అధికారులు వెల్లడించారు.

అయితే ఇండియా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలుసంస్థల నుంచి వ్యాక్సీన్‌ను ఆర్డర్‌ చేసిందన్న మీడియా వార్తలను అధికారులు తోసిపుచ్చారు. ఆ అవసరంలేదని, సరిపడా స్టాక్‌ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.

దేశవిదేశాలకు చెందిన వ్యాక్సీన్‌ తయారీ కంపెనీలతో ప్రభుత్వం నిత్యం సంప్రదిస్తోందని, భారత్‌ అవసరాలు, వారి సామర్ధ్యాల గురించి చర్చిస్తోందని అధికారులు వెల్లడించారు.

సీరం ఇనిస్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు నెలకు 6.5కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను తయారు చేసే సామర్ధ్యం ఉందని అధికారులు వెల్లడించారు.

భారతేదశంలో ఎనిమిది వ్యాక్సీన్‌లు పరిశీలనలో ఉన్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారతేదశంలో ఎనిమిది వ్యాక్సీన్‌లు పరిశీలనలో ఉన్నాయి

వ్యాక్సీనేషన్‌ను ఎలా సాగుతుంది?

తొలిదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 3కోట్లమందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. మొదట కోటిమంది వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రాధాన్యతా క్రమంలో పోలీసులు, సైనికులు, మున్సిపల్‌ కార్మికులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు టీకా ఇస్తారు.

ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన, అందులోనూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యంగా వ్యాక్సీన్‌ ఇస్తారని అధికారులు వెల్లడించారు.

భారత్‌లో 12రకాల వ్యాధులకు సంబంధించి ప్రతియేటా దాదాపు 4కోట్లమంది చిన్నారులు, గర్భిణులకు టీకాలు ఇస్తుంటారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ ఇప్పటికే ఉంది.

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

వందకోట్లమందికి టీకా ఇచ్చేదెలా?

దేశవ్యాప్తంగా 2,23,000మంది నర్సులు అందుబాటులో ఉండగా, 1,54,000మందితో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నర్సింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వారిని, వలంటీర్లను కూడా ఆహ్వానించనుంది.

ఇప్పటికే 29,000 కోల్డ్‌ స్టోరేజ్‌లు సిద్దంగా ఉన్నాయి. దాదాపు అన్ని వ్యాక్సీన్‌లను 2-8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాల్సి ఉంది.

హరియాణా, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలోని పశుసంవర్ధకశాఖ పరిశోధనా కేంద్రాలలో -80డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ చేయగల సౌకర్యాలున్నాయి.

సీరం ఇనిస్టిట్యూట్‌ ట్రయల్స్‌ సందర్భంగా కొందరు అస్వస్థతకు గురైనట్లు వివాదం చెలరేగడంతో, మాస్‌ వ్యాక్సీనేషన్‌ సందర్భంగా ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం వాటిని ఎలా ఎదుర్కొంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.

“మేం పారదర్శకంగా ఉంటాం. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలి అన్న అంశంపై మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి’’ అన్నారు వైద్యాశాఖాధికారులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌ , ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)