కరోనావైరస్ లాక్‌డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'

పార్కింగ్‌లో విమానాలు

ఫొటో సోర్స్, twitter/DelhiAirport

    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మళ్లీ ఇవి ఎప్పుడు రాకపోకల్ని ప్రారంభిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బీబీసీ ఎయిర్ పోర్ట్స్ అథార్టీ, విమానాశ్రయ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించింది. తమ పేర్లు వెల్లడించకూడదన్న షరతుతో కొందరు సమాచారం ఇచ్చారు.

వారు వెల్లడించిన వివరాల ప్రకారం, మే నెలలోనే విమానాలు, రైల్వేల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాలను మే నెల రెండో వారంలో ప్రారంభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైళ్లను కూడా రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ ప్రారంభించే అవకాశాలున్నాయి.

అయితే, వీటిలో ప్రయాణాలు మాత్రం ఇదివరకు ఉన్నట్లు ఉండవు. అవి పూర్తిగా మార్పు చెందుతాయని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

ఎయిర్ పోర్ట్స్ అథార్టీ ఎస్ఓపీ

విమాన ప్రయాణాలు ఇలా...

లాక్ డౌన్ తర్వాత విమానాలను ఎలా నడపాలి అన్న అంశంపై ఎయిర్‌పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్-ఎస్ఓపీ) రూపొందించింది. ఈ ఏడు పేజీల నివేదికను బీబీసీ పరిశీలించింది.

దాని ప్రకారం, విమానాల రాకపోకలు తొలుత దేశ రాజధాని నగరం దిల్లీ సహా అన్ని మెట్రో సిటీలు, ఆయా రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాన నగరాలు/పట్టణాలకు నడుస్తాయి.

ప్రతి విమానయాన సంస్థ లాక్ డౌన్‌కు ముందు నడుపుతున్న సర్వీసుల్లో 30 శాతం సర్వీసులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయానికి వచ్చే, విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి విమానానికీ మధ్య కనీసం 3 గంటల సమయం పాటించే అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయంలో ఎన్ని టెర్మినళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఒక టెర్మినల్ నుంచి మాత్రమే విమానాలు నడుస్తాయి.

సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలను పాటించడం... అంటే మాస్కులు ధరించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్లు వాడటం అటు ప్రయాణీకులకు, ఇటు సిబ్బందికి తప్పనిసరి.

ప్రతి విమానయాన సంస్థ తాము ఎన్ని విమానాలను నడపాలనుకుంటున్నదీ, ఏఏ మార్గాల్లో నడపాలనుకుంటున్నదీ ముందుగానే డీజీసీఏకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా నగరాల్లో లాక్ డౌన్ ఎత్తేయడం, లేదా నిబంధనలు సడలిస్తేనే ప్రయాణాలు జరుగుతాయి. అలాగే, ఆయా విమానాశ్రయాల్లో రద్దీ ఏర్పడకుండా ముందుగానే డీజీసీఏ ఒక షెడ్యూల్ ప్రకారం విమానాల రాకపోకలకు అనుమతులు జారీ చేస్తుంది.

విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు తగినన్ని శానిటైజర్లను అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి విమానాశ్రయాల్లో జీఎంఆర్ సంస్థ ఆటోమేటిక్‌ హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేస్తోంది. లగేజీ బ్యాగులను కూడా క్రిమి రహితం చేసేలా ఆటోమేటిక్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే, ఇప్పటికే దాదాపు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకులు కూర్చునే సదుపాయాల్లో మార్పులు చేశారు. సామాజిక దూరం ప్రమాణాలను పాటించేలా కుర్చీకి కుర్చీకి మధ్య రెండు కుర్చీల దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైన చోట్ల కుర్చీల వరుసలను తొలగిస్తున్నారు.

హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు సామాజిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు

ఫొటో సోర్స్, RGIAHyd

హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు సామాజిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు

ఫొటో సోర్స్, RGIAHyd

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు సామాజిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు సామాజిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు

ఫొటో సోర్స్, RGIAHyd

విమానాశ్రయాల్లో మొదటి దశలో టీ, కాఫీ మాత్రమే లభిస్తాయి. రెస్టారెంట్లు, బార్లు, ఇతర షాపింగ్ దుకాణాలను మూసివేస్తారు. అయితే, ఆహారాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాతి దశలో సామాజిక దూరం పాటిస్తూ అక్కడే కూర్చుని తినే వెసులుబాటు కల్పిస్తారు. ఆల్కహాల్ అమ్మకాలు మాత్రం స్థానిక ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మొదలవుతాయి. స్పాలు, మసాజ్ కేంద్రాలను తదుపరి ఆదేశాల వరకూ తెరిచేందుకు అవకాశం లేదు.

విమానాశ్రయాల్లో ఎక్కడా రద్దీ అనేది ఏర్పడకుండా తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచాలి. విమానాశ్రయాల్లో చెకిన్ కూడా నిర్ణీత గడువు కంటే ముందే ప్రారంభం అవుతుంది. దీనికి తగిన ఏర్పాట్లు ముందుగానే చేయాల్సి ఉంటుంది. ప్రయాణీకులు కూడా గతంలో కంటే ముందుగానే విమానాశ్రయాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో ప్రతి చోటా సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ మేరకు అవసరమైన సంకేతాలను ఇప్పటికే కొన్ని విమానాశ్రయాల్లో ఏర్పాటు చేశారు.

విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులను పరీక్షించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. వారు పరీక్షించిన తర్వాతే ప్రయాణీకులను లోనికి అనుమతిస్తారు. ఒకవేల ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేకంగా ఉంచేందుకు కూడా తగినంత మంది వైద్యులు, సిబ్బంది, ప్రత్యేక ప్రదేశాన్ని ముందుగానే సిద్ధం చేస్తారు.

ప్రతి ప్రయాణీకుడూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనలో ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేవని ప్రమాణ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. తన వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు తగినన్ని ప్రమాణ పత్రాలను, ప్రయాణీకులు వాటిని నింపేందుకు తగినన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

విమానాశ్రయాల లోపల కానీ, బయట కానీ ఎక్కడా రద్దీ పెరగకుండా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయాల్లో చెత్తను, కరోనావైరస్ నుంచి రక్షణ కోసం ధరించే మాస్కులు, గౌన్లు ఇతరత్రా వాడిపారేసిన వ్యర్థాలను తగిన రీతిలో ప్రమాణాల ప్రకారం మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.

లిఫ్ట్‌లో సామాజిక దూరం పాటించాలని వేసిన గుర్తులు

ఫొటో సోర్స్, twitter/DelhiAirport

ఫొటో క్యాప్షన్, లిఫ్ట్‌లో సామాజిక దూరం పాటించాలని వేసిన గుర్తులు
ఎయిర్ ఇండియా విమానం వద్ద సిబ్బంది

ఫొటో సోర్స్, twitter/RGIAHyd

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?

''ఒక్క ఇండిగో తప్ప మిగతా అన్ని విమానయాన సంస్థలూ ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి. రాకపోకల్ని ఆపేసి ఐదు వారాలవుతోంది. మరో నెల రోజులు కనుక పరిస్థితులు ఇలాగే కొనసాగితే చాలా విమానయాన సంస్థలు తిరిగి కోలుకోలేనంతగా నష్టాల్లో కూరుకుపోతాయి. కాబట్టే కేంద్ర ప్రభుత్వం విమానాల రాకపోకల్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది'' అని విమాన ప్రయాణాలను పునరుద్ధరించే వ్యవహారాల్లో భాగమైన ఒక అధికారి బీబీసీతో చెప్పారు.

''మాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మే 15వ తేదీ నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. జూన్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కావొచ్చు'' అని ఆ అధికారి తెలిపారు.

''విమానాల్లో కూడా సామాజిక దూరం పాటించాలన్న అంశంపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. కచ్చితంగా పాటించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొన్ని సీట్లను ఖాళీగా వదిలేస్తే తమపై పడే భారాన్ని విమానయాన సంస్థలు కొంత ప్రయాణీకుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొచ్చు. మరికొంత ప్రభుత్వమే చెల్లించాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి. వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు'' అని సంబంధిత అధికారి వివరించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
లింగంపల్లి నుంచి ఝార్ఖండ్‌లోని హటియాకు వలస కూలీలను తీసుకెళ్తున్న రైలు
ఫొటో క్యాప్షన్, మే 1 తెల్లవారుజామున లింగంపల్లి నుంచి ఝార్ఖండ్‌లోని హటియాకు వలస కూలీలను తీసుకెళ్తున్న రైలు. లాక్‌డౌన్ సమయంలో ప్రయాణీకులను తీసుకెళ్లిన తొలి రైలు ఇదేనని రైల్వే అధికారులు తెలిపారు
తుని రైల్వే స్టేషన్లో సామాజిక దూరం ఏర్పాట్లు చేసి, వాటిని ప్రభుత్వ, పోలీసు అధికారుల సమక్షంలో రైల్వే అధికారులు పరిశీలించారు

ఫొటో సోర్స్, V Sankar/BBC

ఫొటో క్యాప్షన్, తుని రైల్వే స్టేషన్లో సామాజిక దూరం ఏర్పాట్లు చేసి, వాటిని ప్రభుత్వ, పోలీసు అధికారుల సమక్షంలో రైల్వే అధికారులు పరిశీలించారు
తుని రైల్వే స్టేషన్లో సామాజిక దూరం ఏర్పాట్లు చేసి, వాటిని ప్రభుత్వ, పోలీసు అధికారుల సమక్షంలో రైల్వే అధికారులు పరిశీలించారు

ఫొటో సోర్స్, V Sankar/BBC

రైల్వే ప్రయాణాలు ఇలా..

గత కొన్ని రోజులుగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆయా రైల్వే జోన్ల మేనేజర్లతోను, ఉన్నతాధికారులతోనూ వీడియో కాన్ఫరెన్సులు జరుపుతున్నారు.

''ఎప్పట్నుంచి ప్రారంభించమన్నా ప్రారంభించేందుకు మేం అన్ని రకాల ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం'' అని ఒక రైల్వే అధికారి తెలిపారు.

విమానాశ్రయాల్లో పాటిస్తున్న నిబంధనల తరహాలోనే రైల్వే స్టేషన్లలో కూడా సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలను పాటించనున్నారు. ఇప్పటికే దేశంలోని చాలా రైల్వే స్టేషన్లలో సామాజిక దూరానికి సంబంధించిన సంకేతాలను (మార్కింగ్) సిద్ధం చేశారు. ప్రతి ప్రయాణీకుడూ సంబంధిత గుర్తులో మాత్రమే నిలబడాల్సి ఉంటుంది.

''ఎన్ని రైళ్లు నడపాలి? ఒక్కో కంపార్ట్‌ మెంట్‌లో ఎంతమంది ప్రయాణీకులను ఎక్కించాలి? అందుకు వారి దగ్గర్నుంచి ఎంత ధర వసూలు చేయాలి? అన్న వాటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు'' అని ఈ పరిణామాల్లో భాగమైన ఒక అధికారి చెప్పారు.

కేవలం స్లీపర్ కోచ్‌లను మాత్రమే నడపాలని, ఏసీ కోచ్‌లను నడపకూడదని ఆలోచిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో సాధారణంగా ఎనిమిది మంది ప్రయాణీకులు ఉంటారని, ఇప్పుడు వారి సంఖ్యను మూడు లేదా ఐదుకు పరిమితం చేయాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే, బెర్తుల సంఖ్యను కూడా కుదించాలని, మధ్యలో ఉండే బెర్తును ఉపయోగించరాదని కూడా ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

ప్రస్తుతానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ప్రతి రైల్వే జోన్‌ ఇందుకు ఏర్పాట్లు చేసిందని అధికారులు వెల్లడించారు. దీనికి అయ్యే ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలన్న షరతుపై ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అదనపు సమాచారం: వి. శంకర్, బీబీసీ కోసం

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)